Friday, December 20, 2013

సిధ్ధార్థ

                                                                                     

           సిధ్ధార్థ అందగాడే కాదు, గుణవంతుడు కూడా, పసి తనములో తల్లి దండ్రులను కోల్పోయినాడు. కానీ అనాథ గా మాత్రము లేడు. ఊళ్ళో అందరికి సాయము చేస్తూ, వారి అండతో, వారిలో ఒకరిగా పెరిగినాడు. తను ఎవ్వరి మాటను కాదనడు. అందుకని పెద్ద వాళ్ళ ప్రేమకు పాత్రుడయినాడు. బాగా మృదు స్వభావి, అందరితో ప్రేమగా మాట్లాడుతాడు. అది కూడా అవసరముంటేనే. స్త్రీలతో కూడా లల్పించుకొని మాట్లాడే వాడు కాదు. అందుకని, వారు కూడా సిధ్ధార్థ మీద ప్రేమాభిమానాలు చూపేవారు.
           వయస్సు పెరిగే కొద్దీ, ఆకర్షణ పెరుగుతున్నది. కానీ, మాట తీరు, స్వభావములో మార్పు రాలేదు.
అందుకని, ఆ వూళ్ళో, చాలా మంది చిన్నప్పటి నుండి తమ మధ్య పెరిగిన సిధ్ధార్థను అల్లుడిగా చేసుకోవాలని భావిస్తున్నారు. తల్లి దండ్రుల మాటలను విన్న అమ్మాయిలు కూడా సిధ్ధార్థ చేత ఆకర్షితులయినారు, కానీ సాంప్రదాయము కట్టుబాటు వలన వారు బయట పడ లేదు.
            ఊరంతా కోలాహలముగా ఉన్నది, జనమంతా చాల సంబరముగా యున్నారు. దీపంకర బుధ్ధుడు ఊరికి వచ్చి యున్నాడు. కొంతమంది ఆయన మీద ప్రేమతో అభిమానముతో వస్తే, మరి కొందరు ఆయన ప్రవచనము వినాలని వచ్చినారు. కొందరు ఆయన సాన్నిహిత్యము కొఱకు వచ్చినారు. ఎక్కువ మంది మాత్రము వాళ్ళ కష్టాలను ఆయనకు విన్నవించుకొనుటకు అవకాశము వస్తుందని, లేదా ఆయన దర్శనముతోనే తమ కష్టాలన్నీ తీరి పోతాయనీ వచ్చినారు. ఆయన కొఱకు ఒక వేదిక నిర్మించ బడినది. వేలాది మంది జనము ఆయన దివ్య దర్శనము కొఱకు వేచి చూస్తున్నారు.
            సిధ్ధార్థకు దీపంకర బుధ్ధుడిని దర్శనము చేసుకోవాలని యున్నది. కానీ, పెద్ద వారి దగ్గిఱకు వట్టి చేతులతో వెళ్ళ గూడదనే నియమాన్ని పాటిస్తున్నాడు. ఆ నాడు తన దగ్గిఱ ఏ మాత్రము డబ్బు లేదు. ఎవరినీ అడుగ లేక పోయినాడు. నెమ్మదిగా సమావేశ స్థలానికి నడుస్తున్నాడు. దారిలో ఒక అమ్మాయి తామర పూల కట్ట తో సమావేశము వైపు వెళ్ళుతున్నది.
            సిధ్ధార్థ ఆ అమ్మాయిని ఒక తామర పూవును ఇమ్మని అడిగితే బాగుంటుందని అనుకున్నాడు. దగ్గిఱకు వెళ్ళి, లౌక్యము తెలియని రీతిలో,
             " అన్ని పూవులు తీసుకొని వెళ్ళుతున్నావు. ఒకటి నాకు ఇవ్వ వచ్చు కదా" అని అడిగాడు.
             "బాగుంది, నేను నీకు ఎందుకు ఇవ్వాలి?"
             "బుధ్ధుడికి సమర్పణ చేసుకుందామని."
            "అలాగా! అయితే నాకేమిటి లాభము?"                       
            "ఇంతకూ, నీకు ఏమి కావాలి?"
            "ఏమి అడిగినా ఇస్తావా? అయితే, నన్ను పెళ్లి చేసుకో"              
          ఆ అమ్మాయి అడిగినది. తను కూడా ఒక పేద అమ్మాయి అయినప్పటికి సిధ్ధార్థ ఆకర్షణ లో ఉన్నది.
తనది అత్యాశ అనిపించినా అతడిని పెళ్ళి చేసుకొని జీవితము పంచుకోవాలన్న కోరిక ఎంతో లోతుగా యున్నది.
ఆ అమ్మాయికి ఇంకో విషయము తెలుసు, సిధ్ధార్థ మాటకు కట్టుబడే వ్యక్తి అని.
            "అలాగే " ,అంటూ ఒక పూవును తనే లాగేసుకున్నాడు. ఆమె చెప్పిన దానికి ఒప్పుకున్నాడు, కాబట్టి, అలా చేయడము తప్పని అతడికి అనిపించ లేదు.
            సమావేశము దగ్గిఱకు వెళ్ళినాడు. వేలాది మంది, వేర్వేరు ఉన్నతమైన స్థితులలో యున్న వారు
ముందు వరుసలలో యున్నారు. వారి దృష్టి అంతా బుధ్ధుడిమీదే యున్నది. సిధ్ధార్థకు ముందుకు వెళ్ళాలని అనిపించినది. కానీ, అలా వెళితే, చాలా మంది భాధ పడుతారని అనిపించినది. అందుకే ఏమి చేయ వలనో తెలియ లేదు. పుష్పాన్ని తన చేతులతో ఈయ వలెనన్న కోరిక ఎంత కష్టమో తెలిసినది.
            తన బలమంతా ఉపయోగించి ఆ తామర పూవును బుధ్ధుడి మీదకు విసరి వేచినాడు. అప్పుడే ఒక విచిత్రము జరిగినది. మామూలుగా అయితే పది అడుగులు కూడా ముందుకు వెళ్ళని తామర పూవు నేరుగా ముందుకు వెళ్ళినది. దీపంకర బుధ్ధుడి తల పైన అలంకారము వలె గాలిలో నిల బడినది. అందరూ అది చూచి ఆశ్ఛర్య పోయినారు.
            అపుడు బుధ్ధుడు ఆ యువకుడిని తన శిష్యుడికి చూపించి దగ్గిఱకు పిలువమని ఆదేశించినాడు.
అన్ని వేల మందిలో అతడిని చూపించినాడు.
                సిధ్ధార్థ కు ఒక అద్భుతమైన అవకాశము వచ్చినది. బుధ్ధుడికి దగ్గిఱగా నిలబడినాడు. బుధ్ధుడు అతడిని ఆశీర్వదించినాడు, ఏవో చెప్పినాడు. తనున్న తన్మయ స్థితిలో బుధ్ధుడు చెప్పినవేవీ సిధ్ధార్థకు అర్థము కాలేదు. బుధ్ధుడు ఇక వెళ్ళి రమ్మన్నాడు. సిధ్ధార్థ ఒక మైకములో యున్నాడు. అక్కడ జరుగుతున్న విషయాలేవీ అతడికి తెలియుట లేదు. అదే మైకముతో తనున్న గదికి వచ్చినాడు.  లోపలికి వెళ్ళి పద్మాసనములో కూర్చున్నాడు.
            ఆ స్థితిలోనే ధ్యానములోనికి వెళ్ళినాడు. తన జీవితమంతా ఒక నాటకము వలె కనబడినది. తనకు తెలియని ఎన్నో లోకాలు కనబడినవి. అక్కడంతా తన ఉనికి కనబడినది. చివరలో దీపంకర బుధ్ధుడు దర్శనము ఇచ్చినాడు. ఆయన మాటలు ఇప్పుడు స్పష్టముగా వినబడుతున్నవి.
            "సిద్ధార్థా! నీవు ఉన్నతమైన పరిణామ స్థితిలో యున్నావు. నా తరువాత ఈ బుధ్ధత్వము అందుకొనే వాడవు నీవే. ఎంతో మందిని ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి లోనికి తీసుకొని వెళ్ళుతావు.
            ఇంత వఱకు నీ సాధనలో ఇతరులతొ ఉన్న కర్మ బంధాలను అన్నీ ఛేదించుకున్నావు. ఆ విధముగా నీవు ముక్తుడివే. కానీ, ఇంకా కొన్ని జీవితానుభవాలకోసము నీ కింకా వైవాహిక జీవితము అవసరము. నీవు  ఎవరి దగ్గిఱ అయితే మాట ఇచ్చి పుష్పాన్ని తీసుకున్నావో, ఆ అమ్మాయితో నీకు కర్మ బంధము ఏఱ్పడినది. అది నీ పొరపాటు వలన కాకుండ మా సంకల్పము వలన జరిగినది. ఇంక నీవు బుధ్ధత్వము అందుకొనే జన్మ వఱకూ తనే నీకు భార్యగా యుంటుంది. ఆమె కూడా ఉత్తమురాలు. నీవడిగినపుడు ఆ పుష్పము నాకు సమర్పణ కోసమని ఎంతో సంతోష పడినది. అందు వలన ఇద్దరి మధ్య యున్న బంధము పైకి లౌకికముగా కనిపించినా అది ఆధ్యాత్మికముగానే యుండి ఇద్దరి యున్నతికి తోడ్పడుతుంది. మీకు నా ఆశిస్సులు."
                        సిధ్ధార్థ మత్తులోనుండి బయట పడినాడు. దైవ సంకల్పము వలన ఏమో ఆ పూలు అమ్ముకొనే అమ్మాయి మీద ఆకర్షణ ఏర్పడినది. కానీ, తటస్థముగా యుండి పోయినాడు.
            ఉదయాన్నే సాధనను పూర్తి చేసుకున్నాడు. బయటకు వెళ్ళ పోతుంటే ఒకరు వచ్చి, ఇలా చెప్పినాడు.         
"నాయనా! సిధ్ధార్థా!  ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. నేను చాలా పేద వాడిని. నిన్న బుధ్ధుడు నన్ను పిలిచి చెప్పినాడు. మా అమ్మాయి యశొధరను నీకు ఇచ్చి పెళ్ళి చేయాలని అది ఆయన సంకల్పమని."
            ఆ రకముగా సిధ్ధార్థుడికి ఆ పూలు అమ్ముకొనే అమ్మాయికి పెళ్ళి జరిగినది. అది జన్మ జన్మల బంధముగా నడచినది.
                         ************************
(ఇది లలిత విస్తారము అంబడు బౌధ్ధ పురాణము లో నున్న గౌతమ బుధ్ధుడి పూర్వ జన్మ  కథ.. శ్రీ ఎక్కిరాల వేదవ్యాస గారి రచన నుండి స్వీకరించ బడినది. ఆ జన్మ లో వారి పేర్లు మాత్రము గౌతమ బుధ్ధుడి జన్మ లో పేర్లతో వ్రాయ బడినది.
          అజంతా చిత్రాలలో బుధ్ధుడికి పైన ఒక తామర పూవు గాలిలో నిలబడి యుంటుంది. అది ఈ కథకు సంబంధించిందే          అజంతా చిత్రాలలో బుధ్ధుడికి పైన ఒక తామర పూవు గాలిలో నిలబడి యుంటుంది. అది ఈ కథకు సంబంధించిందే)
                   

Wednesday, December 18, 2013

ఓంకారము

          
ఏదీ ఆ ఓంకార ప్రణవ నాదం
ఏదీ ఆ దివ్య అరుణ రాగం?
మానవులందరి ఎదలో మెదలే
ఆనంద రాగం ఏదీ? ఏదీ?

సుషుప్తి నుండి మేలుకొలిపే
గుడి గంటలు ఏవీ? ఏవీ?
మంచిని కోరీ ఆచరించే
మానవతా  మూర్తులు ఏరీ?

ఆశా మోహం రాగం ద్వేషం
అలుము కొన్నవా నాల్గు మూలలా
అనురాగ భావనల దివ్య దీధితులు
చెదిరి పోయెనా ఈ నాడు?

మనిషిని మనిషి ద్వేషించేనా
దేశపు ప్రగతి నిలిచేను
దేశము దేశము ద్వేషించేనా
మారణ కాండ సాగేను
ప్రేమభావనలు వెల్లి విరిసినా
వెదజల్లే ప్రకృతి నవ్వులు
హరిత రాగము అంతట నిలబడి
అందించేను చేతులు
ఈ భావనలంతా వెద జల్లే
మహా పురుషులకు జోతలు.


Monday, December 16, 2013

ఆ రోజుల్లో

                                                 

మా ఊరు పేరు పైనాంపురం. ఈ సంఘటన సుమారుగా  యాభయి సంవత్సరాల నాటిది. మా అక్కయ్య  గూడూరులో యున్నది. నెల్లూరు వెళ్లి అక్కడనుండి గూడూరు వెళ్ళాలి.  మాకు నెల్లూరు వెళ్ళడము కూడా కష్టమే.
ఎందుకంటే బస్సు సౌకర్యాలు సరిగా లేవు. మా ఊరికి నేరుగా బస్సు లేదు.  మా అమ్మ, నేను, మా రెండవ అక్కయ్య ఎడ్ల బండి మీద బయలు దేరినాము. మా మొదటి మజిలీ వరకవిపూడి. గంట సేపు ఎదురు చూసినా బస్సు  రాలేదు. ఇంక బస్సు రాదన్నారు. తిరిగి బండి ఎక్కి ఈదూరు వెళ్లినాము. అక్కడ ఒక గంట ఎదురు చూచినా బస్సు రాలేదు. అక్కడ కూడా ఇంక బస్సు రాదేమో యన్నారు.
          మళ్ళీ మామూలే. బండి ఎక్కి తరువాత మజిలీ తోటపల్లి గూడూరు చేరినాము.  అక్కడ నుండి వరిగొండ మీదుగా నెల్లూరుకు బస్సుయున్నది. సరిగ్గా అప్పుడు మిట్ట మధ్యాహ్నము అయినది. అది భోజనము సమయము.
          ఎదురుగా ఒక ఇల్లు యున్నది. వాళ్ళు సుమారుగా గంట నుండి మమ్ములను గమనిన్చినట్లున్నారు. వచ్చి, మమ్ములను భోజనానికి రమ్మన్నారు. మాకేమో కాస్త మొహమాటము గా యున్నది. అసలు వాళ్ళెవరో తెలియదు. అందుకే మేము అందుకు సిద్ధముగా లేము.
          కాని వాళ్ళు,మీరు గంట నుండి ఇక్కడ యున్నారు. భోజనము చేసినట్లు లేదు. ఎదురుగా భోజనము లేకుండా మిమ్ములను పెట్టుకొని మేమెలా భోజనము చేయ గలము? అన్నారు.
          ఇవీ ఒకప్పటి పల్లెటూర్లు. ఆ విలువలు, ఆప్యాయతలు ఇంకాఉన్నాయంటారా? ఏమో? మాకు అక్కడ భోజనము చేయక తప్ప లేదు.
          ఇవీ ఒకప్పటి  పల్లెటూర్లు.






అల్ప జీవి

                                                            

తాము తప్పు చేసి దానికి ఎదుటి వారిని నిందించడము ఇప్పటి ఆధునిక సమాజములో రివాజు అయి పోయినది. ఎవరో లూయీస్ పాశ్చర్ అట. ప్రతి వ్యాధికి సూక్ష్మ క్రిములే కారణమని చెప్పినాదుట. అదే సమయములో బె చాంప్ అనే శాస్త్రజ్ఞుడు వ్యాధులకు సూక్ష్మ క్రిములు కారణము  కావని చెప్పినాడు. అయినా  ఆయన మాటను ఎవరూ ట్టించుకోలేదు.  ఈ యొక్క దురభిప్రాయము భూమిని విష పురితము చేసినది.
ఒక సారి ఒక ఆయుర్వేద వైద్యుడిని అడిగాను.మీ వైద్యములో ఎక్కడైనా వ్యాధికి కారణమయిన సూక్ష్మ క్రిముల ప్రస్తావన ఉన్నదాఅని. ఆయన ఒక మాట అన్నారు. వాత పిత్త కఫములనబడు మూడు తుల్య స్థితిలో  నుండుట పూర్ణ ఆరోగ్య స్థితి అనిరోగిలో ఆ స్థితిని తీసుకొని రావడమే వైద్యుడు చేసే పని అని. అంటే సూక్ష్మ జీవుల యునికి రోగానికి ఏ విధమయిన సంబంధాన్ని కలిగి యుండదు. ప్రకృతి వైద్యములో కఠినమయిన ఆహార నియమాల ద్వారా ఆరోగ్యాన్ని పునరుద్దరిస్తారు. హోమియోపతి లో సోరా, సిఫిలిస్ మరియు సైకోసిస్ అనే మూడు తత్వములను వాటిని సరి చేయడము ద్వారా రోగ నివారణ చేస్తారు. పదార్థములు రెండు రకములుగా తీసుకొంటారు. దేహానికి పుష్టిని ఇచ్చేవి ఆహార పదార్థములు. మిగిలినవి విష పదార్థములు. ప్రతి విష పదార్థము సూక్ష్మీకరణము ద్వారా మందుగా పని చేస్తుంది. అంటే ఆల్కహాల్ లేదా పంచదార లో ఈ పదార్థము యొక్క యునికిని తగ్గించుకుంటూ వస్తారు. ఈ విధముగా  సూక్ష్మీకరణము చేసే  కొద్దీ మందు మరింత  లోతుగా పని చేస్తుంది.
ఈ విధానములో విషయమేమిటంటే వ్యాధులు ఎన్నో లేవు. ఒకే దోషము ఒక్కొక్క దేహ భాగములో పని చేస్తే ఒక్కొక్క వ్యాధిగా కన బడుతుంది. ఈ విధముగా కనిపించే వ్యాధులు అన్నీ ఒకే దోషము భౌతికముగా ప్రకటించుకొనే మార్గాలే.
ఈ సిద్దాంతాల ప్రకారము సూక్ష్మ క్రిములు లేదా వైరస్ లు ప్రకృతిని శుభ్ర పరచేపరికరాలే. వ్యాధి వచ్చిన చోట అవి ఉన్నాయంటే వాటి వలన వ్యాధి వచ్చినదని అర్థము చేసుకొన కూడదు. పెంట యున్న చోట పందులున్నాయంటే, ఆ పెంటను తినడానికి వచ్చాయని అర్థముచేసుకోవాలి. అంతే కాని, ఆ పెంట అంతా అవి వేశాయని అర్థముచేసుకొన కూడదు. మన దేహములో ఏర్పడిన దోషము వలన వ్యాధి ఏర్పడుతుంది. మురికి లేదా చెత్త చేత ఈగలు ఆకర్షింప బదినట్లే, దేహములోని వ్యాధి చేత సూక్ష్మ క్రిములు ఆకర్షింప బడుతాయి. అంతే గాని సూక్ష్మ క్రిముల వలన వ్యాధి రాదు.
ఎందుకంటే ఇవి ప్రకృతిని శుభ్రము చేసే పరికరాలు. ౧౯ వ శతాబ్దములో పాశ్చర్ సమ కాలీనుడు అయిన పియరీ జాక్వెస్ ఆంటోయిన్ బేచాంప్ తన పరిశోధనల ద్వారా దీనినే స్పష్టము చేసినాడు. ఈ సూక్ష్మ క్రిములను బేచాంప్ చిన్న దేహికులు లేదా మైక్రోజైమ్స్ అని పిలిచినారు. కాని ఆయనను ఎవరూ పట్టించు కోలేదు. తరువాత కాలములో పియర్సన్ అనే శాస్త్రజ్ఞుడు మనుషులలో జంతువులలో యున్న సూక్ష్మ జీవులు వ్యాధులకు కారణము కావని స్పష్టము చేసినారు. శామ్యూల్ హనెమాన్ తన క్రానిక్ డిసీజస్ లో ఇదే విషయాన్ని స్పష్టము చేసినాడు.  దీర్ఘ కాల వ్యాధులున్న వారిలో వ్యాధిని పట్టించు కోకుండా సూక్ష్మ క్రిములను నిర్మూలిస్తే రోగి మామూలు జీవన ప్రమాణాని కంటే ముందే మరణిస్తాడని సిద్దాంతీకరించినాడు.
          యూరప్ లోఏ కొత్త వైద్య వ్యవస్థ వచ్చినా ఆధునిక వైద్యుల సంఘాల ద్వారా దాడులకు గురి అయినది. మెస్మరిజం, హోమియోపతి ఈ విధముగా దాడులకు గురి అయినవి. ప్రముఖ భౌతిక శాస్త్ర వేత్త  ఫ్రిజాఫ్  కాప్రా   చెబుతారు, మనిషి దేహము లోని రోగాలను రసాయనాల ద్వారాతగ్గించుట మాని వేసి, మానవుడి దేహములోని చైతన్యము యొక్క ఉనికిని  గుర్తించే వరకు  మానవ జాతికి రోగముల బెడద వదలదని, దీనికి మన దృష్టి ప్రాచ్య విజ్ఞానము వైపు మరల్చాలి అని తన టర్నింగ్ పాయింట్ అనే పుస్తకములో వ్రాసినాడు.

          ఇంకా చెప్పాలని యున్నది, కాని మేము చెబితే ఎవరికీ ఎక్కుతుంది? మేము కూడా మీలాంటి జీవులమే. మానవ జాతిని నాశనము చేయాలన్న పెద్ద కోరికలు మాకు లేవు.  ప్రకృతి సహజమైన విధానాలకు దూరమయిన తరువాత దేహములో వచ్చిన మార్పులే వ్యాధులు.  ఆ సమయములో మేము దేహములో యున్నంత మాత్రాన మా వలన వ్యాధులు వచ్చినాయని సిద్ధాంతము చేయడము అన్యాయము. బె చాంప్ మరియు హనెమాన్ ఉద్దేశ్యములో మేము పాకీ పని వారము మాత్రమె. కానీ, మా నిర్మూలన కొఱకు రోజు కొక విష పదార్థము తయారు చేసి, వాటిని నేరుగా దేహములో వాడుట ద్వారా మానవుడి లోని కణజాలాన్ని నిర్వీర్యము చేస్తున్నారు. అందుకే మనుషులలో రోగ నిరోధక శక్తి తగ్గినది. ఈ విధముగా పాశ్చర్ విధానము వచ్చిన తరువాత రోగాల సంఖ్య పెరిగినది. ఇందు కొఱకు ఏర్పడిన రసాయనిక కర్మాగారాలు తము తయారు చేసిన పదార్థాలతో నేలను విష పూరితము చేస్తున్నాయి.
          ఒక్క సారి ప్రాచ్య విజ్ఞానము వైపు చూడండి. వారి యొక్క ఆయుర్వేద విజ్ఞానములో రోగము కంటే ముందు స్వస్థత గురించి మాట్లాడుతారు.  స్వస్థత అంటే తను తానుగా యుండుట. లేదా తనలో తను యుండుట.  అటువంటి శాస్త్రాలు ఆధునిక వైద్యము యొక్క తాకిడికి కూలి పోయి మళ్ళీ లేస్తున్నవి.  నూటికి తొంబది మంది  చెప్పిన విషయాన్ని సత్యముగా భావించ వలసిన అవసరము లేదు. ఈ విషయము ప్రతి యొక్కరికి తెలుసు. ఇపుడిపుడే చైనా లో ఆకుపంచర్, మన దేశము లో ఆయుర్వేద, ముద్రా విజ్ఞానము, ప్రకృతి వైద్యము లాంటివి ఆధునిక వైద్యము నయము చేయ లేని ఎన్నో రోగాలను నయము చేస్తున్నది. ఈ వైద్య విధానాలలో ఎక్కడా మా ప్రస్తావన ఎక్కడా లేదు. అయినా  మా  మీద దాడులు ఆగటము లేదు.

          అందరూ ఒక్క సారి ఆలోచించండి. మేరు వేసే నిందలను భరించాల్సిందేనా?

Wednesday, October 30, 2013

ముళ్ళ మొక్క

                                                        ముళ్ళ మొక్క


                              ఓహో! గులాబి బాలా! అందాల ప్రేమ మాలా!
ఎంత బాగుందీ పాట. ఈ పాటను ఇప్పటికీ ఎవరూ మరిచి పోరు. ఆ పూల రెక్కలరంగు కళ్ళ ముందు కనిపిస్తుంటే, ఆత్మ హత్య చేసు కావాలన్న వారికి కూడా మరి కొన్నాళ్ళు బ్రదుకాలని అనిపిస్తుంది. అందుకనే నైరాశ్యము తో గూడిన వాతావరణానికి విరుగుడు గులాబి  రంగు అని నవ యుగ బోధకులు చెబుతారు.
          చూచారుకదా! మా వృక్ష జాతి మీ ఆలోచనలనే మార్చి వేయ కలదు. అయితే, అంత అందమయిన గులాబీ క్రిందనే సూటిగా గ్రుచ్చుకొనే ముళ్ళున్నాయి. అదే  మీ ఆరోపణ, అదే మా బలహీనత కూడా.
          మరి మీరు మీ ఇంట్లో చొరబడే వారిని చీల్చి చెండాడడానికి వేట కుక్కలను కాపలా పెట్టు కోవడము లేదా?
          మీకు తెలుసా? జాతుల పేరుతొ మనుషులు కొట్టుకుంటున్న రోజులలో,  షిరిడీ లో బాబా గారు ప్రాధాన్యతతో పెంచినది గులాబీ మొక్కలనేయని.ఎందుకో తెలుసా? ప్రేమను పెంచడానికి, మరియు పంచడానికి.
          మరి ఈ ముళ్ళ సంగతి ఏమిటి? మమ్ములను కారణము లేకుండానే కోసి చిదిపి వేసే వారి నుండి మాకున్న రక్షణే ఈ ముళ్ళు. నీళ్ళు తక్కువగా యుండేఎడారి ప్రాంతాలలో నాగ జెముడు, ముళ్ళ జెముడు లాంటిమొక్కలుంటాయి. వీటి గుజ్జు చాలా రుచిగా యుంటుంది. ఆ ముళ్ళే లేక పొతే ఆ జంతువులు వాటిని నమిలి పారేస్తాయి. మేకలకు తుమ్మ ఆకులూ అంటే చాలా ఇష్టము. వాటి నుండి రక్షించుకోవడానికి వాటికి ముళ్ళు ఏర్పడినాయి. ఈ ముళ్ళతో కూడా మాకు
పూర్తి రక్షణ లేదు. అయినా మాకు నింద తప్పుట లేదు.
          బిల్వము లేదా మారేడు దళాలంటే శివుడికి అత్యంత ప్రీతి. అంతే కాదు, రాజస్థాన్ లాంటి మండే ఎండల ప్రాంతాల్లో విపరీతమయిన వేడిని తగ్గించుటకై మారేడు కాయ లోని గుజ్జుతో రసము తీసి త్రాగుతారు. అయితే మీరేమి చేస్తున్నారు?  ఒక్క మారేడు చెట్టును పెంచడానికి మీకు ఓపిక లేదు. కానీ, కార్తీక మాసములో పూజలకని ఒక్క ఆకు కుడా మిగులకుండా త్రుంచి వేస్తున్నారు. అందుకే మారేడు చెట్లకు విపరీతముగా  ముళ్ళు ఉన్నవి. ఒక  సూక్తి ఉన్నది. ప్రాణాలు  పోయ గలిగిన వాళ్ళకే ప్రాణాలు తీసే  అధికార మున్నది. అలాగే మొక్కలను పెంచే  వారికే తుంచే అధికారము ఉండాలి..
          ఇంతకు ముందు మనిషి ఆలోచనలకు సమాజము లేదా లోకము కేంద్రముగా ఉండేది. కానీ ఇప్పుడు మీకు జీవితములో వేగము పెరిగినది. ఇప్పుడు మీ ప్రతి ఆలోచనకు మీరే కేంద్రమయినారు.  అందుకే ప్రక్కనున్న జీవిని గురించే కాదు, ప్రక్క వారిని గురించి కూడా ఆలోచించడము మాని వేసినారు.  మీ ప్రాచీన గ్రంథాలను కూడా మీరు చదవడము మాని వేసినారు. వైద్యుడు ఏదయినా మూలికను భూమినుండి పెళ్ళగించే ముందు, ఆ మూలిక ముందు నిలబడి, ప్రార్థన చేసి, ఇది ఒక రోగి యొక్క సహాయానికి అని చెప్పి, అనుమతి తీసుకొని, అప్పుడు ఆ మూలికను పెళ్లగించాలిట. ఇది ఆయుర్వేద వైద్యుల పధ్ధతి. ఈ మాట చెబితే కాకమ్మ కబుర్లు చెప్పకండి. అంటారు ఆధునిక వాదులు.
          వృక్షాలు మన ఆలోచనలకు స్పందిస్తాయని మన ప్రాచీన ఋషులకు తెలుసు. అందుకు మన పురాణాలలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆధునిక యంత్రాల ద్వారా చెట్లకు చైతన్యమున్నదని ఋజువు చేసిన జగదీశ్ చంద్ర బోస్ ఆ ఋషి సంప్రదాయానికి  చెందిన వాడే. ప్రాచీన ఋషి పరంపరకు చెందిన ఒక సజీవ సమకాలీన సైబీరియన్ యువతి,
అనస్తాసియా గూర్చి చదవండి.  ప్రకృతి మానవుల యొక్క ప్రేమకు ఎంతగా చలిస్తుందో తెలుస్తుంది. చెట్లకు, మనుషులకు మధ్య అనుబంధాన్ని ఎలా పెంచుకోవాలో ఆమె వివరిస్తుంది. ఇది అందరూ ఖచ్చితముగా చదువ వలసిన విషయము. వ్లాడిమిర్ మేగర్ వ్రాసిన ఈ పుస్తకము సరి కొత్త ఆలోచనలను  రేకెత్తిస్తుంది.
         
          ఆధునిక కాలములో ఇటువంటి ప్రయోగాలు చేసిన వారిలో లూథర్ బర్బాంక్ ప్రముఖుడు.  ఆయన చేసిన ప్రయోగాలు ఎంతో మందికి కను విప్పు కలిగిస్తాయి.  నీవు భయ పడ వలసిన అవసరము లేదు. నీకు నేను రక్షణ గా యున్నాను. నీకు ముళ్ళ అవసరము లేదు. అని ఆయన ముళ్ళ జెముడు మొక్కకు పలు మార్లు చెప్పిన తరువాత, ఆ మొక్క ముళ్ళు లేకుండా ఎదిగింది.  ప్రేమ, రక్షణ మరియు సహ జీవనము మొక్కలను మనుషులకు చాలా దగ్గరకు తీసుకొని వస్తుంది. ఈ విధముగా బర్బాంక్ మొక్కలలో ఎన్నో కొత్త మార్పులను తీసుకొని వచ్చినాడు.  వాల్నట్ మొక్కలలో పన్నెండు సంవత్సరాలలో వంద సంవత్సరాల ఎదుగుదలను, పంటను తీసుకొని వచ్చినాడు. ఆయన వాడిన దొకటే సూత్రము ప్రేమ.
          అలబామా కు చెందిన జార్జ్  వాషింగ్టన్ కార్వర్ మొక్కలతో సంభాషించి బఠానీ మొక్కల యొక్క ఉపయోగాలను వాటి ద్వారానే తెలుసుకున్నాడు. మొక్కల రహస్య జీవనము అనే పుస్తకములో పీటర్ టామ్ప్కిన్స్ మరియు బర్డ్ కొన్ని ప్రయోగాలను వివరించారు. ముళ్ళ జెముడు చెట్లు ఒంటరిగా యున్నపుడు ఈల పాటలు పాడుకున్తాయిట. వాటిని యంత్రముల ద్వారా కూడా విన్నారు. స్క్వాష్ అనే తీగ కు శాస్త్రీయ సంగీతమంటే ఎంతో ఇష్టమట.  అది ఎప్పుడు సంగీతము వచ్చే దిశ వైపే ప్రాకు తుందట. పాట వచ్చే పరికరాన్ని చుట్టేసుకున్తుందట.  అదే రాక్ సంగీతానికి దూరముగా వెళ్లి పోతుందట.
          ప్రకృతికి మీరు దూరముగా వెళ్లి పోతున్నారు, కాదు, వెళ్లి పోయారు. అందుకే మేము మీకు అర్థము కావటము లేదు. ఒక్క సారి మీ జాన పద కథల లోనికి వెళ్ళండి. అందుకు మీకు సమయమున్నదా? మరి కంప్యూటర్ ఆటలు ఆడుకోవాలి కదా! తనను ప్రేమగా పెంచిన యువకుడు దూర దేశాలలో జబ్బు పడితే, పెంచ బడిన మొక్క కూడా జబ్బు పడడము ఉన్నది కదా! ఇది మాకు మామూలే.
          మేము కూడా మీలాంటి వాళ్ళమే, మమ్ము హింసించకండి. మేము కూడా మీ వాళ్ళమే, మమ్ము నరకకండి. మమ్ములను మంచి చేసుకొని లాభాలను పొందడము షామన్లకు తెలిసినంత మీకెవరికీ తెలియదు.
          ఈ ప్రకృతికి, జీవ రాశికి మూలమయిన శక్తి యొక్కటే, అదే  ప్రేమ.

          చెట్లపై యున్న ముళ్ళు వాటి పొరుగు వారి క్రూరత్వాన్ని సూచిస్తాయి. అంతే గాని, వాటికున్నది ప్రేమ మాత్రమె.

Monday, April 8, 2013

వెలుతురులో వెతుక్కో



ఒక ముసలి అవ్వ తన గుడిసె బయట వెతుకుతున్నదట. ఆ దోవన పోతున్న కుర్రాడు అవ్వా! ఏమి వెతుకుతున్నావు? అని అడిగినాడు.
 నా సూది పోయింది నాయనా! వెతుక్కుంటున్నాను అన్నది.
ఎక్కడ పోయింది అవ్వా! ఆ కుర్రాడు అడిగినాడు.
గుడిసె లోపల పడిపోయింది నాయనా! జవాబిచ్చింది.
మరి ఇక్కడ వెతుకుతున్నవేమిటి?
లోపల చీకటి కదా. కనిపించదు.
మరి ఇక్కడ పడ లేదన్నావు కదా! ఆ కుర్రాడు అడిగినాడు.
ఏదయినా వెలుతురులో వెతుక్కోమన్నారు బాబూ! మా పెద్ద వాళ్ళు వెంటనే జవాబు ఇచ్చింది.
ఇంకా ఆ కుర్రాడికి ఏమి చెప్పాలో తెలియ లేదు.
ఇలానే ఉంటాయి మన నాయకుల పనులు.
ఒక project  కు ఎవరూ అనుమత కాకుండానే వేల కోట్లు పెట్టి కాలువలు తవ్విన్చేసినారు. అయిదేళ్ళు దాటింది. ఇంకా దానికి అనుమతి రాలేదు.


ఒత్తిడి




"రమేశ్‌ వచ్చాడా?"
"ఇంకా రాలేదు. వారము రోజుల పాటు సెలవు పెట్టి వచ్చిన వాడు, తిరిగి బెంగుళూరు వెళ్ళినాడు."
"ఏమయింది?"
"ఏముందీ, వచ్చిన మర్నాడే వాళ్ళ కంపెనీ నుండి ఫోను వచ్చింది. ఎవరో బిజినెస్‌ గూర్చి
మాట్లాడుటకు ఫారన్‌ నుండి వచ్చాడట. ఈ సమయములో ప్రాజెక్ట్‌ హెడ్‌ అవసరమెంతయినా ఉన్నదట.
వెంటనే రమ్మని వరుసగా ఫోనులు."
"మరి నాలుగు రోజుల్లో పెళ్ళి పెట్టుకుని, ఇదేమిటి?"
"నెలకు అంతా కలిపి లక్ష వఱకు ఇస్తున్నారుగా! ఇంక తన పని అంటూ ఏమీ యుండదు. అంతా కంపెనీ కోసమే"
ఇంట్లో అందరూ ఈ విషయమే మాట్లాడు కుంటున్నారు.
--------------------------------------------
            రామ గోపాల్‌, రాజ గోపాల్‌ అన్నదమ్ములు. అన్న పైనాంపురములో వ్యవసాయపు పొలాలు  చూచు కుంటున్నాడు.  ఆయనకు ఇద్దరు పిల్లలు. కొడుకు పేరు శ్రీనివాస మూర్తి, కూతురు లక్ష్మి. ఆయన భార్య  పేరు సీతా మహ లక్ష్మి.  సాంప్రదాయకమైన పద్ధతిలో ఇల్లును చక్క పెట్టుకుంటూ, ఊళ్ళో అందరి అవసరాలకు సహాయ పడుతూ, సంసారాన్ని గడుపుకుంటున్నది.
            రాజ గోపాల్‌ లేదా రాజు చిన్నప్పటి నుండి చదువులో ప్రథమ స్థానములోనే యున్నందు వలన పోస్టు గ్రాడ్యుయేషన్‌ వఱకు చదివినాడు. మొదట నెల్లూరులో ఒక ప్రముఖ విద్యా సంస్థలో అధ్యాపకుడి గా పని చేసినాడు. ఆ తరువాత ఆర్థికముగా బలముగా ఉండాలనే యుద్దేశ్యము ఒక వైపు, భార్య లహరి యొక్క ఒత్తిడి మరో వైపు, వీటితో విజయ వాడలో నొక వ్యాపార పరమైన విద్యా సంస్థలోకి మారినాడు.  బాగా పేరు వచ్చినందు వలన, అతడిని తమ సంస్థలో తీసుకొనుటకు వేర్వేరు విద్యా సంస్థలు వరుసలో యున్నారు. అయినప్పటికీ, మరీ ఆశ పడితే ఇబ్బందులు వస్తాయని ఒక సంస్థకే కట్టుపడి పనిచేస్తున్నాడు.
            రమేశ్‌ ఒక్కడే కొడుకు. వారి ఆశలన్నీ వాడిని పై స్థాయిలో చూడాలన్నదే. అందు కొఱకు ఎంతయినా
సంపాదించాలన్నది, ప్రధానముగా భార్య లహరి యుద్దేశ్యము.  అందుకే చిన్నప్పటినుండి క్షణము తీరిక లేకుండా చదివించేది. మరీ అంత అతి వద్దని రాజు చెప్పినాలహరి వినేది కాదు. అందుకే రమేశ్‌ ఎప్పుడూ నాన్న వైపే మొగ్గు చూపే వాడు.  కానీ రాజుకు ఎక్కువ గంటలు పని చేయ వలసి వస్తున్నందు వలన కొడుకు కొఱకు ఎక్కువ సమయం ఈయ గలిగే వాడు కాదు.
            శ్రీనివాసు రమేశ్‌ కంటే రెండేళ్ళు పెద్ద. పైనాంపురములో కాలేజి వసతులు లేనందు వలన రామ గోపాల్‌ శ్రీనివాసును తమ్ముడి దగ్గిరే ఉంచినాడు. శ్రీనివాసును  పినతల్లి లహరి ప్రేమగా చూచుకొనేది. అయితే ఇంట్లో ఏ పని అవసరమైనా ఎక్కువగా శ్రీనివాసునే ఉపయోగించుకొనేది. ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ ఇలాటి ఆశలు ఎక్కువ లేనందు వలన శ్రీనివాసు ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి బి.యస్సి. చేరినాదు. శ్రీనివాసుకు గణిత భౌతిక శాస్త్రాలంటే ఆసక్తి ఎక్కువ. వాటిలో ఎప్పుడూ ప్రథమ స్ఠానములో యుండే వాడు.
            ఇందువలన రమేశ్‌ చదువు విషయములో కూడా శ్రీనివాసుకు భాధ్యత ఏర్పడినది. నాన్న ఎప్పుడూ
అందు బాటులో యుండడు కాబట్టి ఏ అనుమానము వచ్చినా రమేశ్‌ శ్రీనివాసు దగ్గిరకే వచ్చే వాడు. శ్రీనివాసు
బాగా శ్రద్ధ తీసుకొని తమ్ముడికి అన్నీ చెప్పేవాడు. ఈ విధముగా లహరికి కూడా శ్రీనివాసంటే చాలా ఇష్టమేర్పడింది. శ్రీనివాసు అవసరాలన్ని జాగ్రత్తగా చూచుకొనేది.
            ఇంతేగాక శ్రీనివాసు స్నేహితులు చాలా మంది వచ్చి చెప్పించుకొనే వారు. ఎవరికీ కాదనకుండా చెప్పి, తను రాత్రి కాస్త ఎక్కువ మేలుకొని చదువుకొనే వాడు.
            రమేశ్‌ స్కూలు చదువు పూర్తయే వరకు అన్నదమ్ములిద్దరు సరదాగా కబుర్లు చెప్పుకొనే వారు. ఎప్పుడు సైన్సు విషయాలే మాట్లాడుకొనే వారు. అందు వలన ఇద్దరి మధ్య మంచి అనుబంధమెర్పడినది.
            పాఠ శాల చదువు పూర్తి కాగానే రమేశ్‌ కష్టాలు మొదలయినాయి. లహరికి అన్నీటికి కంగారే. సెలవులలోనే ఇంటర్మీడియట్‌ పరిచయము పై (బ్రిడ్జి) కోర్సు చేయించమని చాలా కాలేజీల వాళ్ళు ఇంటికి వచ్చినారు. రాజు మాత్రము ఈ సెలవులను హాయిగా గడపనీయనీ అంటూ చెప్పినా, లహరి ఒప్పుకోలేదు. లహరికి రమేశ్‌ ఏ కొద్ది సమయము కూడా వృధా చేయకూడదు. రాజు ఇంక మాట్లాడ లేక పోయినాడు.
            శ్రీనివాసు సెలవులకు పైనాంపురము వెళ్ళిపోయినాడు. ఇంక రమేశ్‌ ఉదయాన్నే కాలేజికి  వెళ్ళి, సాయంత్రానికి రావడము, ఇంటికి రాగానే కాలేజిలో ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వ్రయడము, మరో పని చేయడానికి కూడా వీలు లేదు.ఏదో తెలియని మార్పు కనిపిస్తున్నది. తనతో మాట్లాడడానికి శ్రీనివాసు లేడు. నాన్న అందుబాటులో యుండడు. అమ్మకు తన చదువు తప్ప మరే విషయమూ అర్థము కాదు. అప్పుడప్పుడు చిరాకు కలుగుతున్నది.
            ఫలితాలు రాగానే చాలా కాలేజి యాజమాన్యాలు తనకు ఉచిత విద్య అందించుటకై, తనను వారి సంస్థలోనే చేర్చమని అడుగుతూ ఇంటికి వచ్చినారు. రమేశ్‌ ప్రతిభావంతుడి గా గుర్తింపు పొందాడు  కాబట్టి , తన కోసము అన్ని రకాల వసతులు ఇచ్చుటకు సిద్ధ పడినారు. అంతా సమాచారము సేకరించి తను ఏ సంస్థలో చేరాలనేది లహరే నిర్ణయించినది.
            సెలవులు కాగానే శ్రీనివాసు వచ్చినాడు, కానీ, రమేశ్‌ కు ఇంతకుముందున్నట్లు ఖాళీ లేదు. కాలేజి నుండి ఇంటికి వచ్చిన తరువాత రాత్రి 11 గంటల పని యుండేది. తనకు వచ్చినా రాక పోయినా అన్ని ప్రశ్నలకు  జవాబులు వ్రాయ వలసి వచ్చేది. ఇందులో తెలివి తేటలకు అవసరముండేది కాదు. అందువలన నైరాశ్యము పెరిగేది.
            నాన్నతో కబుర్లు ఎప్పుడు తక్కువే, కానీ, అన్నయ్యతో కబుర్లు కూడా తగ్గిపోయినవి.             ఒకటి రెండు సార్లు తనకు పరీక్షలలో ప్రథమ స్థానము రాలేదు. లహరి వచ్చి కాలేజిలో విచారించినది. వారు రమేశ్‌ ను కాలేజ్‌ హాస్టల్లో చేర్చమని సలహా ఇచ్చినారు.
            హాస్టల్లో చేర్పించుటకు రాజు ససేమిరా ఒప్పుకోలేదు. కానీ, లహరి మాటే పై చేయి అయినది,రమేశ్‌ జీవితములో మరో మార్పు మొదలయినది.
            ఇంక ఉదయాన లేచినప్పటినుండి, రాత్రి పండుకొనే వరకు చదువు, రాంకులు, పుస్తకాలు, మరేమీ లేవు. ఆది వారము పూట రాజు, లహరి వచ్చే వారు. శ్రీనివాసుతో మాట్లాడటమే అరుదై పోయినది.
            రాంకు పడిపోతే అమ్మ ఆ ఆదివారము తనకు భాధ్యతలను గుర్తు చేసేది. ఇంక  తనకు మనసులో వేరే ఆలోచనలు రావడము ఆగి పోయినవి.
            స్కూల్‌ లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు బొమ్మలు గీచే వాడు, పాటలు వ్రాసే వాడు, ఇప్పుడవేమీ లేవు. చదువుకోమంటే, నాకు వచ్చు, కావాలంటే మొత్తము చెబుతాను, లేదా వ్రాసి చూపిస్తాను అంటె సరే నీ ఇష్టమనే వారు. ఇప్పుడవేమీ కుదరదు.  పూర్తిగా వచ్చినా, రాని వాళ్ళతో కూర్చొని చదువుతూ ఉండ వలసినదే.

            స్కూల్‌  రోజుల్లో ఖాళీ గా యున్నప్పుడు సైన్సు మాడల్సు చేసే వాడు, లేదా మాజిక్‌ చేసే వాడు. ముఖ్యముగా శ్రీనివాసు విజయవాడలో కాలేజిలో చేరిన తరువాత తను ఎంతో నేర్చుకున్నాడు, స్వంతముగా  ఆలోచించే వాడు.
ఇప్పుడు అలా చేయాలంటే, ముందు బుర్ర పని చేయడము లేదు. ఎప్పుడయినా పని చేసినా కాలాన్ని వృధా చేస్తున్నావని బెదిరింపులు, చివరకు అటువంటివన్నీ ఆగిపోయినవి. కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగ్గి పోయినది.

            ఇంటర్మీడియట్‌ అయిపోయినది, ఎంసెట్‌ లొ మంచి రాంక్‌ వచ్చినది. ఒక ప్రభుత్వ కళాశాలలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ లో చదువుటకు బి టెక్‌ చేరినాడు. ఆ రోజుల్లో పాశ్ఛాత్య దేశాల్లో ఆర్థిక మాంద్యము వలన కంప్యూటర్‌ సైన్స్‌ కు కాస్త గిరాకీ తగ్గినది. అందు వలననే ఆ కోర్సు లో చేర లేదు.
            మొదటి రెండు సంవత్సరాల్లో వేసవి సెలవుల్లో  గట్టిగా పట్టుబట్టి పైనాంపురము వెళ్ళినాడు. అక్కద ఊరు, ఉప్పు కాలువ, సముద్ర తీరము అన్నీ చూస్తూ ఆనందించినాడు. పోటీలు పెట్టుకొని తాటి ముంజలు, ముంత మామిడి (జీడి మామిడి) పళ్ళు తిన్నాడు. ఆ సముద్రపు గాలిలో, ఇసుక దిబ్బల మీద మరో లోకములో ఉన్నట్లు అనిపించినది. తిరిగి రాగానే మళ్ళీ మామూలు హడావుడే.  మూడోసంవత్సరపు సెలవుల్లో పారిశ్రామిక శిక్షణకు వెళ్ళ వలసి యున్నందు వలన పైనాంపురము వెళ్ళుట కుదర లేదు.
            నాల్గవ ఏట కాంపస్‌ లో ఇంటర్వ్యూలు మొదలయినవి. తనపు పి జి  చేసి ఆధ్యాపక వృత్తి చేయాలని చాలా కోరిక గా యుండేది. గేట్‌ పరీక్షల్లో మంచి రాంక్‌ కూడా వచ్చినది. కాంపస్‌ ఎన్నికలలో ఒక పెద్ద సాఫ్ట్‌ వేర్‌ కంపెనీ తనను తీసుకొనుటకు సిద్ధ పడినది.
            ఈ లోపలే అమ్మ (లహరి) అందరి దగ్గిర సమాచార సేకరణ చేసినది. తనను తీసుకున్న కంపెనీ లో తెలిసిన కుఱ్ఱాడికి నెలకు లక్ష రూపాయల వరకు వస్తున్నదట. ఎంత పిజి చేసినా రిసెర్చ్‌ చెసినా అధ్యాపక వృత్తిలో యున్న వారికి నెలకు లక్ష రూపాయలు కళ్ళ చూడటము జరుగదు. అందుకని పట్టుబట్టి తను అందులో చేరుటకు ఒప్పించినది.
            అక్కడ చేరిన తరువాత కూడా ఎప్పుడూ పోటీయే. ఫలితాలు త్వరగా చూపించాలి, లేక పోతే వెనుకకు పడి పోతాడు. రోజుకు 12 నుండి 15 గంటల వరకు పని.  ప్రాజెక్టు పూర్తి అయే రోజుల్లో ఒక్కొక్క సారి రాత్రిళ్ళు కూడా కంపెనీ లోనే ఉండ వలసి వస్తున్నది.
            శ్రీనివాసు అన్నయ్య మీద ఏ ఒత్తిడీ లేదు. ఫిజిక్సు లో పి జి చేసి రిసెర్చి చేసినాడు.  శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయములో అధ్యాపకుడిగా చేరినాడు. తను ఎంత పని చేసినా తన పని తనదిగానే యుంటుంది, ప్రశాంతమైన జీవితమున్నది.
                    -------
            లహరి ఆలోచిస్తున్నది.
            రమేశ్‌ తెలివి గల వాడే. బాగా సంపాదించుకుంటున్నాడు. ఎప్పుడు ఇంటికి వచ్చినా ఎప్పుడూ లోపల గదిలో కూర్చుంటాడు. బయట గదిలో యున్నా, ఎవరయినా వచ్చినా వారిని ఆహ్వానించి, కూర్చోమని మర్యాద చేయడము కూడా తెలియదు. ఎందుకిలా తయారయినాడు?
            బావగారు తనతో చాలా సార్లు అన్నారు, "లహరీ! నీ దగ్గిర శ్రీనివాసు బాగా తయారయినాడమ్మా!. మంచి మర్యాద నేర్చుకోవలసిన సమయములో నీ దగ్గిరే యున్నాడు, మా కంటే బాగా చూచుకున్నావమ్మా!" మరి తన దగ్గిర శ్రీనివాసుకు ఇంత మంచి ప్రవర్తన వచ్చిందే, మరి రమేశ్‌ కెందుకు రాలేదు?.
                            -----------------------------------
            రాజు లేదా రాజ గోపాల్‌ ఆలోచిస్తున్నాడు.
            తను రమేశ్‌ కు అన్నీ ఇచ్చాననుకున్నాడు, కానీ, వాడికి స్వతంత్రాన్ని, వ్యక్తిత్వము పెంచుకునే అవకాశాన్ని ఈయ లేదు. ఎప్పుడూ కాలముతో పరుగులు తీసేటట్లు చేసినాడు. ఇప్పుడు రమేశ్‌ కు తను, తన కంపెనీ తప్ప తన వాళ్ళను గురించి ఆలోచించే మానసిక స్థితి కూడా లేదు.
            ఒక సారి తనతో అన్నాడు, "ఈ ఒత్తిడి నేను భరించ లేక పోతున్నాను నాన్నా!", అని. కాని తనకు ఆ ఒత్తిడితోనే బ్రదుక వలసి వచ్చింది.
                                       -----------------------   
ఇంతలో శ్రీనివాసు భార్య  శారదతో వచ్చాడు. రాగానే,"ఏమిటి చిన్నాన్నా! అలా యున్నారు?", పలకరించినాడు.
"పిన్నీ! నాకు ఒక్క ఫోను చేస్తే వెంటనే వచ్చే వాడిని కదా!  అమ్మ, నాన్న రేపే వస్తున్నారు. ఈ లోపల ఏ ఇబ్బంది లేకుండా నన్ను చూచుకోమన్నారు. శారద నీతో బాటే యుంటుంది. "  
విషయము తెలిసిన తరువాత అన్నాడు." పిన్నీ! నీవేమీ కంగారు పడ వద్దు. నేనిప్పుడే బెంగుళూరు వెళ్ళి రమేశ్‌ ను తీసుకొని వస్తాను. పెళ్ళినాటికి కాదు. రెండు రోజులు ముందు గానే. సరేనా?" అంటూ బయటికి వెళ్ళీనాడు.
                           --------------------------
   

Friday, March 22, 2013

హంపి


భారత మాత పుష్ప మాల ఈ హంపీ నగరమూ
హరియించును ప్రతి మదినీ ఈ పంపా శిధిలము
హిందూ జన నవోన్మేష శిల్ప కళా ప్రతిఫలం
విద్యారణ్యుల దీక్షకు బదులు నిల్చు కృషి ఫలం.
ప్రాచీన ఆంధ్ర జనత ప్రాతిపదిక ఈ స్థలం.

భువనానికి వన్నె తెచ్చు భువన విజయమిందు కలదు
పాపాల నశింప చేయు పంపేశ్వరుడిందు కలడు.
స్పర్శ తోనె సరి గమల సరి లయల పాడ చేయు
నిర్మాణము కలయట్టి విథలాలయమిందు కలదు.
వీధులలో వజ్రములను వేల బోసినదీనగరము.
సర్వతోముఖాభి వృ వృధ్ది కాన్చినట్టిదీ నగరము
భరత జాతి మాత తలలో మేలి వజ్రమీనగరము.
(ఇది నా ఫిఫ్త్ ఫారం లో వ్రాసినది)



Thursday, February 28, 2013

ఎవరు భాధ్యులు


                                          

                                            

            దేవ లోకములో అత్యవసర సమావేశము జరుగుతున్నది.  ఇంద్రుడితో అష్ట దిక్పాలకులు
ఇతర అధిస్థాన దేవతలు అందరూ సమావేశమైనారు. భూమి యొక్క అధిస్థాన దేవత అయిన
భూ దేవి నుండి సమర్పించ బడిన ఒక వినతి పత్రము మీద చర్చ జరుగుతున్నది. అందులో సమస్య ఒక్కటే,
"భూమి  మీద వర్షాలు సరిగా అడుట లేదు, కరవు కాటకాలతో భూమి మీద జనము అల్లాడి పోతున్నారు."
            ఇంద్రుడు వరుణ దేవుడి వైపు చ్చినాడు," ఎవరూ వర్షము కావాలని అడుగుట లేదు ప్రభూ!",
వరుణుడి నుండి జవాబు వచ్చింది.
            "మరి, ఈ వినతి పత్రమేమిటి?", భూ దేవి వైపు చూచినాడు.
            "వర్షాలు  పడితే గాని, భూమి మీద పరిస్థితులు చక్క బడవు.", చెప్పింది  భూదేవి.
            రెండు వ్యతిరేకమైన జవాబులతో ఇంద్రుడు ఒక నిర్ణయానికి వచ్చి ఇలా అన్నాడు.
            "భూమి మీద జనులు వర్షము  కావాలని కోరుకోవడము లేదు. ఈ మాట నిజమే, కానీ, వారికి
వర్షముతో అవసరము ఉన్నదన్న మాట కూడా నిజమే."
            దేవతలకు అర్థము కాలేదు, వారు ఆ మాటే అన్నారు.
            ఇంద్రుడు వివరించి చెప్పినాడు.
            "భూమి  మీద వర్షము లేదా నీటి మీద ఆధార పడి బ్రతికేది,  ప్రధానముగా రైతులు. వారికి కూడా
నదులకు ఆనకట్టలు కట్టి ప్రభుత్వములు నీరందిస్తున్నవి. అందు వలన వారికి వర్షాలు రాలేదన్న భావన కంటే  కాలువలలో నీరు వదల లేదన్న భావన ఎక్కువ యున్నది. అందు వలన వారు కూడా వర్షము రావాలని
కోరుకోవటము లేదు. నగరాలలో వర్షాలు పడితే కార్యాలయాలకు వెళ్ళే వారికి ఇబ్బంది. సాయంత్రమయితే
వినోదాలకు, విహారాలకు వెళ్ళే వారికి ఇబ్బంది. కానీ జల సరఫరాలో లోపమొస్తే మాత్రము నగరాధికారుల
మీద, ప్రభుత్వము మీద గొడవ చేస్తారు. మన దేవతలకు కూడా వారితో తిరిగి తిరిగి వారి ఆలోచనలకు
అనుగుణముగా చేయడము బాగా అలవాటయింది. ఇంక అధిక సంఖ్యాకులు నగరాలలో నుండి, పల్లెటూర్లలో
జనము తగ్గి పోతున్నారు. ఈ రకముగా దేవతలు కూడా అధిక సంఖ్యాకుల అభిప్రాయాన్నే  అనుసరిస్తున్నారు."
            "ఈ సమస్య ఎలా పోతుంది?", అందరూ అడిగినారు.
            "ఏ సమస్యా లేకుండా,  అలవాటు తప్పి పోకుండా, వర్షాలు ఎక్కువగా సముద్రములోనే కురుస్తున్నవి. అందుకే వరుణ దేవుడు వాయు దేవుడిని తోడు తీసుకొని సముద్రములో కంటే, నేల మీద ఎక్కువ వర్షాలు పడేటట్లు చూడ వలసినదిగా నిర్ణయము చేయడము అయినది.", అంటూ ఇంద్రుడు సభ చాలించినాడు.
            మేఘాలను అనుకున్న చోటికి నడిపించే భాధ్యత వాయుదేవుడిది. వర్షము కురిపించేది వరుణ దేవుడిదే. ఇద్దరూ ప్రపంచము అంతా తిరగడము మొదలు పెట్టినారు.
            ఒక చోట పొలాలు బాగా ఎండి పోతున్నవి. కాలువల్లో నీరు లేదు. పక్క వాడితో యజమాని
అంటున్నాడు. "ఈ ప్రభుత్వము ఇంకా కాలువల్లో నీరు వదలనంటున్నది. ఈ సంవత్సరము ఎలా గడుస్తుందో?"
అని. చుట్టూ అలాగే చాలా పొలాలున్నవి. వాళ్ళ మాటలను దేవతలు విన్నారు. ఒక మేఘము అలా వచ్చింది.
అక్కడ బ్రహ్మాండముగా వర్షము పడింది. ఆ రైతులు చాలా సంతొష పడి యుంటారని వారు అనుకున్నారు.
కానీ, వారి మాటలు వేరుగా యున్నవి.,"ఈ పాడు వాన ఇప్పుడే రావాలా? లక్ష రూపాయల బట్టీ ఇటుకలు
ఎందుకూ పనికి రాకుండా పోయినవి.", దేవతలు నివ్వెర పోయినారు.  
            మరొక చోట ఊళ్ళో నీళ్ళ చెరువు ఎండి పోయింది. నీళ్ళూ ఎలా అందించాలా అని నగర పాలక
వర్గము నాల్గు రోజుల నుండి చర్చిస్తున్నది. ఇక్కడ ఖఛ్ఛితముగా వర్షము కురిపించాలనుకున్నారు.దగ్గిరలో ఒక పాథశాల. పిల్లలు ఆట స్థలములో వరుసల్లో నిల బడి యున్నారు. వారిని చూస్తే దేవతలకు చాలా ముచ్చట వేసింది. ఇంతలో మేఘాలు బాగా కమ్ముకున్నాయి. ఇప్పుడిక్కడ వర్షము పడితే, పిల్లలు
            వానా వానా వల్లప్పా
            చేతులు చాచూ చెల్లప్పా
            తిరుగూ తిరుగూ తిమ్మప్పా
            తిరగా లేనూ నరసప్పా
అని హాయిగా నాట్యము చేస్తారనీ, చూడ వచ్చని, దేవతలు అనుకున్నారు. కమ్ముకున్న మబ్బులను
చూచి పిల్లలు
            రైన్‌ రైన్‌ గో అవే
            కం అగైన్‌ అనదర్‌ డే
            లిటిల్‌ జానీ వాంట్స్‌ టు ప్లే.
            దేవతల ఉత్సాహము చల్లారి పోయింది. అంటే వీళ్ళకు కూడా వాన ఇష్టము లేదన్న మాట.
           
            మరి కాస్త దూరము వెళ్ళినారు. పెద్ద పెద్ద చెరువులు కనిపిస్తున్నవి. " ఈ ప్రాంతములో నీటి
కరవే లేదన్న మాట. ఏమన్నా కురిస్తే ఇక్కడే కురవాలి, ఇంకా కాస్త నీళ్ళు నిలువ వుంటాయి.", అనుకున్నారు.
దగ్గిఱకు వెళ్ళితే భయంకరమైన వాసన,వాసనలను మోసుకు వెళ్ళే వాయు దేవుడు కూడా ఆ వాసన
భరించ లేక తన ప్రభావము తగ్గించి వేసినాడు. ఇంకో వైపు చూచినారు. అప్పుడే రెండు లారీలు అక్కడ ఆగినవి. అందులోనుండీ కుళ్ళీన మాంసపు ముక్కలు, నత్తలౌ, చెత్త అంతా ఆ నీటిలో పోస్తున్నారు."అంటే ఇది
చెత్త కుండీ అన్న మాట", దేవతలు అనుకున్నారు. ప్రక్కనే గుడిసెలున్నాయి. "అయ్యో పాపము వీళ్ళు ఈ నీరే త్రాగాలేమో? ఈ వాసన అంతా వీళ్ళే భరించాలేమో?" ఇలా అనుకుంటేనే దేవతలకు వాంతి వచ్చినట్లయినది. మంచి వర్షము పడితే ఈ వాసన తగ్గి కాస్త మంచి జరుగుతుందనుకున్నారు. అంతే అక్కడ భయంకరమైన
వర్షము పడింది.
            మరుసటి రోజు పత్రికలలో ప్రధాన సంచికలో మొదటి పుటలో వచ్చింది,పెద్ద వర్షము వచ్చి
చేపల చెరువులకు చేపలు చని పోయి రెండు కోట్లు నష్టము వచ్చిందని. అంతే కాదు, ఇరవై వేల ఎకరాల
పంట పొలాలునీటిలో మునిగి పోయాయని జిల్లా ప్రతిలో ఎక్కడో చిన్న అక్షరాలలో వేసినారు. ఇది తెలిసి దేవతలకు ఆశ్ఛర్యమేసినది.కొంత ఆలోచించి నదీ జన్మ స్థానాలలో వర్షము కురిపించుదామని అనుకున్నారు.  కొండల మీద మంచి వర్షము పడింది. ఆ వడికి రాళ్ళు, బండలు క్రిందికి కొట్టుకు పోయి వచ్చినవి. అంతే గాక అంతకు మునుపే కట్టిన కొన్ని ఆన కట్టలు కొట్టుకొని పోయినవి. కానీ, చివరకు వచ్చేసరికి, రైతుల పొలాలకు మాత్రము నీళ్ళు ఎక్క లేదు. నీరంతా సముద్రము లోకే పోయినది.
          కొండల మీద అడవులు నరకి వేయ బడినందున మట్టికి బలము లేక బండలు రాళ్ళు,క్రిందికి దిగి వచ్చినాయని కొందరు శాస్త్ర వేత్తలు నిర్ధారించినారు, పత్రికల్లో వార్తా చానళ్ళలో వివరించినారు, అందుకే ఆన కట్టలు కూలి పోయినాయి అని అన్నారు. అడవులు నాశనం అయినందు వలన ఇది జరిగినదని ప్రచారము అయితే తమ క్రిందికి నీళ్ళూ వస్తాయని భయ పడిన నాయకులు వెంటనే ఒక తమపై విశ్వాసమున్న శాస్త్ర వేత్తల బృందాన్ని నిజ నిర్ధారణ కమిటీ గా వేసి ఆ కొండలూ, రాళ్ళూ, ఎందుకు విరిగి పడినాయో  నివేదీకలో సమర్పించాలని ఆదేశించినారు.
            "అయ్యో, వరదల్లో మా ఊరు కూడా మునిగి పోయిందా?",అని కలల అప్పా రావు కంగారు పడుతూ లేచినాడు.
            "అమ్మయ్య,  ఇదంతా కలేనన్న మాట", అని తేరుకున్నాడు.
            కానీ, వర్షము పడ కూడదు, నీరు కావాలి, అన్నీ ప్రభుత్వమే చూడాలి, మాకేమీ భాధ్యతలు  లేవనుకొనే మనో ప్రవృత్తి లేదా భావ కాలుష్యము వాతావరణ కాలుష్యము కంటే తీవ్రమనుకుంటూ   స్నానపు గది లోనికి వెళ్ళినాడు. కుళాయి తిప్పితే చుక్క నీరు కూడా పడ  లేదు.
                            ********************************