Monday, February 23, 2015

ఉడత 4

ఒక రోజు వీలు చూచుకొని సీతమ్మ రామ తీర్థానికి వెళ్ళినది. అదే సమయానికి అన్ని  ఊళ్లు తిరుగుతూ స్వామీ శివానంద నీల కంఠ మహాదేవుడు గుడి లో విడిది చేసి వున్నాడు.  వెంటనే ఆయన దర్శనానికి వెళ్ళినది. పాదాలను తాకి నమస్కారము చేసుకున్న ది.
“ మీ భర్త, కుమారుడు బాగున్నారా? అమ్మా!”, ఆయన అడిగినాడు.
“మీ అనుగ్రహము వలన  అంతా కులాసాగానే ఉన్నారండి.  మా ఆయన ఆరోగ్యము కూడా కాస్త కుదుట పడినది. వ్యాపార విషయమై తిరుగుతూ డిల్లీ వెళ్లి యున్నారు. ఇంక మా అబ్బాయి ఎప్పుడు ఏ అవసరము వస్తుందో యన్న భయముతో లాబ్స్  లో ఉద్యోగమూ వదులుకొని, కావలి కాలేజి లో లెక్చరర్ గా స్థిర పడినాడు.”
“ఇంతకూ  మీ అబ్బాయి కి పెళ్లి ప్రయత్నాలు చేయటము లేదా?”
“నాకు బయట తిరిగి ప్రయత్నాలు చేసే వారు ఎవరూ లేరండి. మా ఆయనకూ అంత సామర్థ్యము లేదు. మీరే కాస్త సలహా ఇవ్వండి.” దీనముగా అడిగింది.
ఆయన కళ్ళు మూసుకొని కొద్ది సేపు ధ్యానము లోనికి వెళ్ళినాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచి, “ఏమీ ఫరవాలేదమ్మా! మీ కా బోయే కోడలు ను మీరు చూస్తూనే వున్నారు. వాళ్ళు అడగరు. మీరే ప్రయత్నమూ చెయ్యాలి.” 
  సీతమ్మ ఆశ్చర్య పడింది. అంటే తన కాబోయే కోడలు తనకు దగ్గర లోనే యున్నదా? తన దగ్గరకు వచ్చే ఆడ పిల్లలను అందరిని గుర్తు తెచ్చు కోవడానికి ప్రయత్నమూ చేసింది.
“అమ్మాయి పద్ధతి లోనే ఉంటుంది కదా. ఒక్కడే కొడుకు కదా. వాడితో సహనము తో ఉండ గలదా?”
“నీవు చాలా అదృష్ట వంతురాల వమ్మా!  ఆ అమ్మాయి కోడలు కావడమే మీ అదృష్టము. నీకే తెలుస్తుంది, ముందు ముందు.”
సీతమ్మ చాలా సంతోష పడింది. ఇప్పుడు సమస్య ఏమిటంటే , ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. అదే సంతోషముతో ఆయన దగ్గర సెలవు తీసుకొని పుట్టింటి నుండి తిరిగి కావలి వచ్చినది.
బాగా ఎండలు ముదిరినాయి.  దానితో జీవ రాశులకు ఆహారము సరి పోవటము లేదు. ఆదిత్యకు ఉడుతలకు ఏదో యొక ఆహారము పెడుతున్నాడు. ఆ రోజు ఆకాంక్ష ప్రక్క గదిలో ఏదో వ్రాసుకుంటూ మంచి నీళ్ళ కొరకు వంట ఇంటి లోకి  వచ్చినది. అప్పుడు అక్కడ ఒక ఉడుత టమాటో ల మీద నాజూకు గా నిలబడి నెమ్మదిగా వాటిని ఆరగిస్తున్న ది. అన్నీ కొరికి వేస్తుందన్న భయము తో దానిని నెమ్మదిగా అదిలించింది. అది ఒక్క సారి కంగారు పడి సందు వైపు వెళ్ళకుండా వాకిటి వైపు పరిగెత్తి ఆదిత్య ఇంట్లో దూరింది. దానిని తరుముతూ ఆకాంక్ష తలుపు వరకూ వెళ్ళింది. ఇంకా వెనుకకు వచ్చేద్దాము అనుకుంటే , “ఎవరూ?” , అంటూ  సీతమ్మ వా కిట్లో కి వచ్చింది.
వెనుకకు వెళుతున్న ఆకాంక్షను చూచి, “ ఇంటి వరకు వచ్చి వెళుతున్నా వు. లోపలి కి రావమ్మా.”, అంటూ పిలిచింది.  
ఇంక తనకు తప్పించు కొనే మార్గము లేదు. తప్పనట్లుగా లోపలి కి  వెళ్ళింది.
ఇటీవల సీతమ్మకు ఎవరిని చూచినా తన కోడలే గుర్తుకు వస్తున్నది.  స్వామి జి ని కలియక ముందు ఇటువంటి ఆలోచన వచ్చేది కాదు.
“నీవు ఇదే మొదటి సారి మా ఇంట్లో కి రావడము. ఇల్లంతా చూపిస్తాను పద. “,అంటూ గదులన్నీ చూపించింది. ఇంకా హాలు లో కూర్చో పెట్టింది.
ఇంతలో రామ తీర్థము నుండి ఫోను వచ్చింది.  అదీ వాళ్లమ్మ నుండి వచ్చింది. ఆమె చెప్పిన సమాచారము విన్న సీతమ్మకు చాలా ఆనందము వేసింది.
సీతమ్మ వాళ్ళ అమ్మ ఆ రోజు ఉదయమే స్వామి శివానంద ను కలిసిందట. గుడినుండి తిరిగి వెళ్లి బోతూ, ఆయనతో, “స్వామి జి! మా అమ్మాయి చాలా కష్టాలు పడింది. చివరకు మీ ఆశీస్సుల వలన కుటుంబము నిల బడింది. ఇంకా మాకున్న ఒకే కోరిక మా మనవడి పెళ్ళి గురించి” అన్నదట.  స్వామిజి ఒక్క క్షణము ఆలోచించి, ఎందుకమ్మా! కంగారు పడతావు? ఇప్పుడు మీ అమ్మాయి తన కా బోయే కోడలు తో కబుర్లు చెప్పు కుంటున్నది. అన్నీ శుభంగా నే జరుగు తాయి, పొమ్మన్నాడు . ఇంక ఆత్రము తట్టుకోలేక వెంటనే ఫోను చేసినదట.
ఈ ఫోను తరువాత ఆమెకు ఆకాంక్ష మీద ప్రేమ ఎన్నో రెట్లు పెరిగినది. కానీ, దానిని ఎలా ప్రకటించాలో తెలియ లేదు. తను తిరిగి వెళతా ను అన్నా బలవంతముగా కూర్చో పెట్టింది. ఇంట్లో  యున్న తీపి పదార్థాలను , పండ్ల ముక్కలను పళ్ళెము లో పెట్టి ముందు పెట్టినది. తినమని బలవంతము చేసినది.
తమ కుటుంబ సభ్యుల ఆల్బం లో ఫొటోలు అన్నీ చూపించింది. ఆకాంక్షకు ఇదంతా ఏమిటో, ఎందుకో అర్థము కాలేదు. తను ఏమని మాట్లాడితే తప్పుగా అనుకుంటుందే మో అని భయ పడింది.
“మొన్న మీరు ఊరు వెళ్లి వచ్చినారు కదా. ఏ ఊరు?”, అని అడిగింది.
“రామతీర్ధ మమ్మా! నేను పుట్టిన ఊరు. మా అమ్మా, నాన్న అక్కడే వున్నారు.”, అని చెప్పినది. అప్పుడు తనకు పుట్టి, పెరిగిన రోజులు గుర్తుకు వచ్చినా యి.  తను పడిన కష్టాలు అన్నీ ఆ క్షణమన పంచుకోవాలని అనిపించింది.
పినాకిని నది ఒడ్డున యున్న ఒక చిన్న పల్లెటూరి రామ తీర్థము. రాముడు ప్రతిష్ట చేసిన ఈ లింగమున్న ఊరు కు రామ తీర్థము  అని పేరు వచ్చినది. అందు శివుడి పేరు నీల కంఠ మహా దేవుడు. శివుడి ధనుస్సు పేరు పినాకిని. ఆ పేరు తో ఉన్న ఆ నదిని  పెన్నా అని కూడా అంటారు. అందులో సంవత్సరము పొడుగునా నీరు ఉండదు. నదిలో ఇసుక బంగారు వన్నె లో మెరుస్తూ ఉంటుంది.  ఆ ఇసుక లోనే సీతా మహా లక్ష్మి తన చిన్న తనాన ఆడుతూ పాడుతూ గడిపింది.
ఉదయాన్నే  స్నానము  చేసి పూలు కోసుకొని వచ్చి గుడిలో  ఇచ్చి వచ్చేది. ఏ కార్య క్రమము లేనపుడు  తన ఆట  పాటలు అన్నీ గుడిలోనే. అక్కడే  ప్రైమరీ మరి హై స్కూల్  చదువులు పూర్తి చేసినది. హై స్కూల్ పరీక్షలు పూర్తి  అయి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో అంతా హడావుడిగా ఉన్నది. తనకు ఏమీ అర్థము  కాలేదు.
నాన్న గారి స్నేహితుడి కొడుకట, ఇంజనీరింగ్  పాసయి నాడుట. స్నేహితుడి  భార్య సీతా మహా లక్ష్మిని గుడి లో  చూచి  కోడలు గా చేసుకోవాలని ముచ్చట పడిందట. నేరు గా ఇంటికి వచ్చి అడిగింది.
ఆ రోజుల్లో ఇంజినీరింగ్ అంటే చాలా పెద్ద చదువు.  అందు లోనూ ఇంటి దగ్గరకు వచ్చిన  సంబంధము. సీతా మహా లక్ష్మి తల్లి దండ్రులకు అందులో అనుమానించుటకు ఏమీ కనిపించ లేదు. ఇంక జాతకాలు కూడా చూచు కోలేదు. కట్న  కానుకలు  ఏమీ వద్దని అన్నారు.
ముహూర్తము  కూడా నిశ్చయించినారు.  ఇంకా వారము రోజుల్లో పెళ్లి అనగా వియ్యంకుడు వచ్చినాడు.  వాళ్ళ అబ్బాయికి అమెరికా లో ఉద్యోగ అవకాశము వచ్చిందట.  పెళ్లి అయిన వారము రోజుల్లో బయలుదేరాలి. 
“మరి అమ్మాయి సంగతి ఏమిటి?”.  అని అడిగితే, “ఏముందీ, కాస్త డబ్బు చేరగానే తనే వచ్చి  తీసుకొని వెళ్ళతాడు”, అని  అన్నాడు.
“ఎప్పటి లోపల?” , ఇటువంటి మాటలు రాలేదు.
నిశ్చయము చేసుకొనటంకు ముందు ఈ విషయము ప్రస్తావన  వస్తే, నిశ్చయాన్ని గురించి పది సార్లు ఆలోచించే వారు. ఇప్పుడు పెళ్లి పిలుపులు కూడా అన్ని పోయినా యి.
దీనితో బాటు చాటు మాటు గా ఇంకో బాంబ్ షెల్ పేలింది. వాడి అమెరికా ప్రయాణానికి ఖర్చులకు సాయము కావాలి. అదీ అర్జెంటు గా.
ఇంకా తండ్రి లక్ష్మీ నారాయణకు ఏమి చేయాలో తెలియ లేదు. ఒక ఎకరము పొలము బేరము పెట్టి ఆ డబ్బులు వియ్యంకుడి చేతిలో పోసినాడు. తను ఇవ్వాలనుకున్న కట్నము కంటే ఎక్కువే అయింది.
ఆయన దిగులంతా కూతురి పరిస్థితి గురించే. పరువు ప్రతిష్టల  మీద బ్రదికే వారికి తరువాత ఏమి చేయాలో అర్థము కాలేదు.
పెళ్లి అయిన వారము రోజుల్లోనే అమెరికా ప్రయాణము పెట్టుకున్న భర్తను చూచి  సీతకు ఏమి చేయాలో తెలియక కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. “ఏముంది? కాస్త వసతి ఏర్పడగానే నిన్ను విమానములో తీసుకొని వెళ్తాను. “, అని తాయిలం పెట్టినాడు.
కొన్నాళ్ళు అత్త గారింట్లో ఉంది. ఎప్పుడూ ఏదో నిరుత్సాహము గా ఉండేది. ఎప్పుడో ఒక సారి ఫోన్ వచ్చేది. అత్తా మామల తో మాట్లాడి తనతో రెండు నిముషాలు మాట్లాడి పెట్టేసే వాడు. దానితో రేపటి గురించి భయము ఏర్పడినది.
క్రమ క్రమముగా ఇంట్లో  పనులు అన్నీ తనకు అప్ప చెప్పడము మొదలు పెట్టినారు.  తన ఆడ పడుచు పనులతో బాటు ఇంట్లో ని అన్నీ పనులు తనే చూడ వలసి వచ్చేది. క్రమ క్రమము గా అత్త గారు సోఫా మీద కూర్చొని యజమాయిషి చేయడానికి పరిమితమయినారు.
ఈ సమయములో నాన్న గారు వచ్చి తనను ఇంటికి తీసుకొని వెళ్తానని అంటే అత్త గారు సులభము గా అంగీకరించ లేదు. అతి కష్టము మీద పంపించినారు.
అమ్మకు నాన్నకు పరిస్థితి అర్థము అయింది. అంటే గాక కొత్త విషయాలు తెలిసినాయి. తమ అల్లుడు కాలేజి లో జులాయిగా తిరిగే వాడని ప్రేమ వ్యవహారాల్లో దిగి తన్నులు కూడా తిన్నాడని తెలిసింది.
ఇప్పుడు కూడా అల్లుడు ఒక ఉత్తరము వ్రాస్తున్నాడనో , ఫోన్ చేసున్నాడనో సంతోషము కూడా లేదు. కూతురు కాపురము చక్కబడాలని వాళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేసినారు.
రెండు మూడు సార్లు వియ్యంకుడు ఉత్తరాలు వ్రాసినా తను అమ్మాయిని పంపించ లేదు. ఇంతలో సీత ఆడ బడుచు కు పెళ్లి సంబంధము కుదిరింది. ఇంకా పెళ్లి పనులు చూచుకోడానికి సీతను పంపించక తప్ప లేదు.
ఈ సమయములో కూడా పెళ్లి ఖర్చులకు డబ్బులు లాగాలని వియ్యంకుడు ప్రయత్నించినాడు. లక్ష్మి నారాయణ ఏమాత్రము లొంగ లేదు.
పెళ్ళికి వచ్చిన అల్లుడు , పెళ్లి అయిన తరువాత సీత తో నాలుగు ఊళ్ళు తిరిగినాడు. అమెరికా ఎప్పుడు తీసుకొని వెళ్తారంటే ఇంకా కొద్ది రోజుల్లో ఇల్లు కొంటున్నానని, ఆ తరువాత తీసుకొని వెళ్తానని చెప్పినాడు. తియ్యని కబుర్లు చెప్పి మళ్ళీ విమానము ఎక్కేసినాడు.
ఇంక సీతకు అక్కడ ఉండాలని అనిపించ లేదు. తనే ధైర్యము చేసి పుట్టింటికి వచ్చేసింది. తరువాత మరి కొన్ని విషయాలు తెలిసినాయి.  ఆనంద్ (అల్లుడు) ఎవరో అమ్మాయి తో తిరుగుతున్నాడని, పెళ్లి కూడా చేసుకోవచ్చని  సమాచారము తెలిసింది. ఇటువంటి విషయాల్లో న్యాయ పరముగా వెళ్ళాలన్న ఏమి చేయాలో లక్ష్మి నారాయణ కు తెలియ లేదు. మరో విషయము ఏమిటంటే సీత నెల తప్పింది. ఆయన కోపముతో వియ్యంకుడి దగ్గరకు వెళ్ళినాడు.
వియ్యంకుడు మర్యాదలు అన్నీ చేసి, అటువంటిది ఏమీ లేదని, అన్నీ చక్క బడతాయని చెప్పినాడు. వియ్యంకురాలు కోడలు ఇల్లు వదిలి పోయిందని నిష్టూరాలు ఆడింది.
ఇద్దరి దగ్గిర తన సమస్యకు సరి అయిన సమాధానము రా లేదు. నైరాశ్యము గా తిరిగి వచ్చినాడు. ఇంటికి వెళ్లాలని అనిపించా లేదు. వెళితే ఏమి చెప్పాలో తెలియ లేదు. మహా దేవ మందిరము లో శివుడికి ఎదురుగా పద్మాసనము వేసుకొని కూర్చున్నాడు. ఎంత సేపు కూర్చున్నాడో తెలియదు. ఏ మాత్రము కదల లేదు.
“నారాయణా! నారాయణా!”, గొంతు వినిపించింది. ముందు ఎవరో జపము చేసుకుంటున్నారో అని అనిపించింది. మళ్ళీ “నారాయణా!”, అని విన్పించడమే కాకుండా భుజము మీద చేయి పడింది. కళ్ళు తెరిచి చూసినాడు. ఎదురుగా ఒక సన్యాసి, లేదా స్వామిజి.
“నేనే నారాయణా! రా  అలా వెళ్లి కూర్చుండాము రా.”
తను ఏమీ జవాబు చెప్పా లేదు. ఇంకా ఎవర? అని చూస్తున్నాడు.
జాగ్రత్తగా చూచినాడు. తన చిన్నప్పటి స్నేహితుడు శివయ్య. విచిత్రమేమిటంటే, తను శివుడి ముందు కూర్చుంటే, తన స్నేహితుడు శివయ్య వచ్చినాడు. ఆయనే ఈయనను పంపించినాడేమో అనిపించింది.
లేచి నిలబడినాడు. ఇంతకూ ముందు లాగా “ఒరే, శివా!” అని పిలవ లేక పోయినాడు. కారణము ఒకటే. ఆయన ఇప్పుడు ఒక సన్యాసి.
శివయ్య వెంట నడిచినాడు. ఇద్దరూ గుడి మధ్యలో యున్న మంటపము లో కూర్చున్నారు.  
“ఎన్నాళ్ళయింది, నిన్ను చూచి?”, శివయ్య తో అన్నాడు.
“అయినా నారాయణా! నీలో ఏదో క్షోభ కొట్టొచ్చినట్టు కనబడుతున్నది. ఏమయింది?”, స్వామిజి అడిగినారు.
నారాయణ తన కూతురు పెళ్లి, తరువాత జరిగిన సంఘటనలు అన్నీ చెప్పుకున్నాడు. చెబు తుంటే ఆయన కళ్ళల్లో నీళ్ళు కనిపిస్తున్నాయి.
“నారాయణా! ఇంత పెద్ద మహా దేవుడిని ఎదురుగా పెట్టుకొని ఎందుకు ఏడుస్తావు? చెప్పు. ఆయనకు చెప్పా వలసిన దంతా పద్ధతిలో చెప్పు. ఇంక ఆయనే చూచుకుంటాడు. నీ కష్టాలన్నీ దూది పింజల వలె ఎగిరి పోతాయి.”, ధైర్యము చెప్పినాడు.
“నా కూతురు జీవితము బాగు పడుతుందని అంటావా?”
“లోకాలనే ఏలే రాజు తలచుకుంటే ఏది వీలు కాదు. ఇంకా దిగులును వదిలేసెయ్. ఈ రోజు సాయంత్రము నీవు, మీ అమ్మాయి సాయంత్రము ఏడు గంటలకు దేవుడి దర్శనానికి రండి.”, ధైర్యముగా చెప్పినాడు.
శివయ్య  సన్యాస దీక్ష తరువాత స్వామీ శివానంద గా మారినాడు. ఆయన అక్కడికి వచ్చినపుడు  గుడి లో ఒక గదిని ఆయనకు ఇచ్చినారు.
సాయంత్రము నారాయణ తో బాటు సీత వాళ్ళమ్మ వచ్చినారు. దర్శనము అయిన తరువాత అందరూ ఆ గదిలో కూర్చున్నారు.
“సీతా! కాస్త ముందుకు కూర్చో అమ్మా! మీ నాయన నాకు చిన్నప్పుడు చాలా ఆప్తుడు. అందు వలన నీవు ఆ దగ్గర భయ పద వలసిన అవసరము లేదు.”
“రోజూ సాయంత్రము పూట సంధ్యా కాలములో ముందు శివుడిని పూజ చేసుకో. అదీ నూనె దీపాన్ని వెలిగించి. ఆ తరువాత నీ భర్తతో నీ జీవితమూ ఎలా ఉండాలని కోరుకుంటున్నావో అలాగే ఉన్నట్లు ఉహించుకో. ఆ తరువాత అందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకో. అంతే కాదు, నీవు తల్లి వి కాబోతున్నావు. ఈ రోజుల్లో తన బిడ్డ సిరి సంపదలతో, పిల్లా పాపలతో వర్ధిల్లాలని, అందరూ కోరుకుంటారు. అందులో తప్పేమీ లేదు. కానీ, దానికి తోడు గా  వాడు నిరంతరము ధర్మ  మార్గములో నడవాలని ఆర్తులకు  బాసటగా నిలబడాలని , లోకానికి సేవకుడు కావాలన్న  తల్లులు కనిపించుట లేదు. నీవు నీ కొడుకు నిరంతరమూ ధర్మ మార్గములో నిలబడాలని కోరుకుంటే  మిగిలినవన్నీ ఆ మహా దేవుడే ఇస్తాడు.  ఈ విషయాన్ని చాలా మంది గమనించరు. అంతగా సన్యాసి అయి పోతాడన్న భయమేర్పడితే పిల్లాపాపలతో, సిరి సంపదలతో ఉండాలని కలుపుకో. అంటే గానీ ప్రధానమయిన కోరిక వాడు నిరంతరమూ ధర్మ మార్గములో నడుచుటే.  ఇవన్నీ అయిన తరువాత హారతి ఇచ్చేసేయ్. నీవు చేయ వలసినది ఇంతే. “
“ఇలా ఎన్నాళ్ళు చేయాలి స్వామీజీ!”, సీత అడిగింది.
“ఖచ్చితముగా నలభై రోజులు, లేదా మూడు నెలలు. ముందు  నీకు తెలిసేటట్లు మార్పులు మొదలవుతాయి. నీకు ఏమవుతుందో అన్న భయము వేస్తుంది. ఇదంతా ఆపి వేయాలని కూడా అనిపిస్తుంది. కానీ ఆపకూడదు.  షిరిడీ సాయి నాథుడు చెప్పినట్లు శ్రద్ధ, విశ్వాసము(సబూరి) రెండూ చాలా ముఖ్యమై నవే.”
“మరి ఏ సమయములో చేయాలి?”, సీత అడిగింది.
“వీలు కానప్పుడు ఏ సమయములో అయినా చేయ వచ్చును. కానీ , సూర్య అస్తమయ సమయము అంటే సంధ్యా కాలము చాలా మంచిది. ఆ సమయములో సాధన చేసినందు వలననే యశోదా నందులకు కృష్ణుడు కుమారుడు అయే అదృష్టము కలిగింది.”
“దీని వలన ఎటువంటి కోరికలు అయినా తీరుతాయా?”
“ధర్మ బద్ధమయిన జీవితాన్ని నడుపుతూ, ధర్మ బద్ధమయిన కోరిక ఏది కోరుకున్నా మహా దేవుడు అనుగ్రహిస్తాడు. నేను ఎవరినో ప్రేమించాను, ఆయనతో నే నా పెళ్లి కావాలి అని కోరుకుంటే, అందులో ఇంకా ఎన్ని కర్మ సంబంధమైన ముడులు ఉన్నాయో, ఎవరికీ తెలియదు. కానీ చిన్నప్పటి నుండి ధర్మ విహితమయిన  జీవితాన్ని నడుపుతున్నావు. నీకు సరి కాని వాడితో నీకు పెళ్లి అయింది. అది నీ కర్మ వలన జరిగింది. ఆ కర్మను క్షయము చేయడానికి చేసే ప్రయత్నమే ఈ సాధన. ఈ సాధన ఖచ్చితముగా ధర్మ విహితమే.”, స్వామీజీ చెప్పినాడు.
“ఇంకా దీపాన్ని ఎందుకు వెలిగించాలి?”
“నీవు ఒక కోరిక కోరుకున్నప్పుడు, పరిస్థితులు అందుకు అనుకూలముగా లేనప్పుడు సాధనలో అందుకు వ్యతిరేకమయిన దృశ్యాలు  ఏర్పడుతాయి. వాటిని కరిగించే శక్తి దీపానికే ఉంది. అందుకే రాత్రి దైవిక సాధనలో దీపానికి ప్రాధాన్యత ఎక్కువ. అందుకు వాడిన నూనెలలో అన్నిటి కంటే నువ్వుల నూనె ఎక్కువ తేజస్సు, లేదా శక్తి లేదా ఆరా ఇస్తుంది. దాని కంటే ఆవు నేయి ఎన్నో రెట్లు తేజస్సును ఇస్తుంది.  ఆ తేజస్సులో మీ సాధనలో ఏర్పడిన వ్యతిరేకమయిన ఛాయలను దహించి వేస్తాయి. ఇదంతా ఒక్క రోజులో జరగదు. అందుకే మన పెద్ద వారు దీపం జ్యోతి పర బ్రహ్మం అని అన్నారు.”
“నేను ప్రశ్నలను వేస్తున్నానని అనుకోకుండా ఉంటే, నాకో సందేహము.  ఇదంతా సంధ్యా కాలము లోనే ఎందుకు చేయాలి? చెబు తారా?”
“దీనికి కూడా కారణముంది. ఇది తెలుసు కోవాలంటే, తంత్ర శాస్త్రములో మరింత లోతుకు వెళ్ళాలి. మన శ్వాస ఎప్పుడూ ఒకే రకముగా ఉండదు. కొద్ది సేపు కుడి ముక్కు రంధ్రములో, మరి కొద్ది సేపు ఎడమ ముక్కు రంధ్రములో నడుస్తూ ఉంటుంది.  కుడి ముక్కు రంధ్రములో శ్వాస నడుస్తున్నప్పుడు తెలివి తేటలు, సంకల్ప శక్తి మున్నగునవి పని చేస్తాయి. అదే ఎడమ ముక్కులో శ్వాస నడుస్తున్నపుడు మీలో బావ పుష్టి, కళానివేశనము ఉంటుంది. కుడి నుండి ఎడమకు లేదా ఎడమ నుండి కుడికి మారేటప్పుడు కొద్ది సెకనులు రెండు ముక్కుల్లో శ్వాస నడుస్తుంది. ఆ సమయాన్ని సంధి లేదా గ్రహణ కాలమని అంటారు.  ఉదయ ము లేదా సాయంకాలము సంధ్యలో మన శ్వాస ఆ స్థితిలో ఉంటుంది.  ఈ సమయములో చేసే సాధన మనకు దైవీ శక్తులతో సంపర్కాన్ని పెంచుతుంది.  అంటే కాదు, ఈ సమయములో నిద్ర పోయే వారిని శాప గ్రస్తులుగా మనము భావించ వచ్చును. ఇందుకు సంబంధించి మన పురాణాల్లో ఎన్నో కథలున్నాయి. ఈ సమయములో చేసే సాధనకు ఎన్నో రెట్లు ఫలితము కనిపిస్తుంది.”
“ఈ విషయాలన్నీ ఎక్కడ దొరుకుతాయి, స్వామీజీ!”
“కొన్ని విషయాలు అనుభవమున్న యోగుల ద్వారా స్పష్టముగా తెలుస్తుంది. ఈ విషయాలన్నీ శివ స్వరోదయ మరియు స్వర చింతామణి లాంటి గ్రంథాలలో ఇచ్చినారు. దీనిని స్వర యోగము అని అంటారు.”
“మరొక ప్రశ్న స్వామీజీ! మీ సమయాన్ని ఎక్కువ తీసుకున్నందుకు నన్ను క్షమించండి. ఇటువంటి నియమాలు పాటించ నందు వలన నష్ట పోయిన వాళ్ళ గురించి చెబుతారా?”
“చేబుతానమ్మా! దేవతల తల్లి అదితి.  అదితి సంతానమును చూచిన చెల్లెలు దితికి తనకు పిల్లలు కావాలని అనిపించినది. భర్త కశ్యపుడి దగ్గరకు వెళ్లి తనకు శక్తిమంతుడు అయిన కొడుకు కావాలని అడిగింది. కశ్యపుడు చెప్పినాడు,” ఇది సంధ్యా సమయము. మహా దేవుడు సంచారము చేసే సమయము.  అందుకే కాస్త ఆగు.” దితి అందుకు అంగీకరించ లేదు. కశ్యపుడు మహా దేవుడికి క్షమాపణ చెప్పుకొని ఆమెకు సంతానమును అనుగ్రహించినాడు. ఆ సమయ దోషము వలన పుట్టిన వారే హిరణ్యాక్ష , హిరణ్య కశ్యపులు, లోక కంటకులు. ఇటువంటి కథలు పురాణాలలో కోకొల్లలు గా ఉన్నాయి.”
“మిమ్మల్ని మళ్ళీ కలియవచ్చునా స్వామీ జీ!”
“తప్పకుండా అమ్మా! అందులోనూ నీవు మా నారాయణ బిడ్డవు.  నీకు అంతా మంచే జరుగుతుంది. ఏ రోజు సాధనను మాన వద్దు. నీ బ్రతుకు ఏమవుతుందో అని భయము కలిగించేటట్లు కొన్ని సంఘటనలు జరగ వచ్చును. కానీ నీవు భయ పడ వలసిన అవసరము లేదు. అంతా మహా దేవుడే చూచు కుంటాడు. శుభం భూయాత్” 
ఆ రోజునుండి సీతా మహా లక్ష్మి క్రమము తప్పకుండా సాధనను కోన సాగించింది. అంటే గాక స్వామీ జీ చెప్పిన పురాణ గ్రంథాలను విమర్శనాత్మకముగా చదవడము మొదలు పెట్టింది. తండ్రి అడిగి నవన్నీ సమ కూర్చినాడు.
ముప్పయి రోజులు అయేసరికి వియ్యంకుడు వచ్చి హడావిడి చేసినాడు. అల్లుడు ఆనంద్ ఏదో క్రిమినల్ కేసు లో ఇరుక్కున్నాడుట. తను అమెరికా వెళ్ళాలిట. అందుకు డబ్బు కావాలని అన్నాడు.  నారాయణ ఏమాత్రము చలించ లేదు. ఒక్క క్షణం సీత కంగారు పడింది. కానీ స్వామీ జీ మాటల మీద నమ్మకము తో ధైర్యము నిల దొక్కుకుంది. అయినా స్వామీ జీ ని కలిసింది.
ఆయన, ఇవన్నీ మహా దేవుడి లీలలే, అన్నీ మంచికే, కంగారు పడ వద్దు.”, అని అన్నారు.
మళ్ళీ సాధనలో ఉండి పోయింది. ముప్పది తొమ్మిదవ రోజు అమెరికా నుండి ఫోన్ వచ్చింది.
“సీతా! నీకు చేసిన ద్రోహానికి అనుభవిస్తున్నాను. మా అమ్మ నాన్న వచ్చి, ఏమడిగినా ఈయ వద్దు.”, అని చెప్పి బాధ పడినాడు.” తన మీద హత్యారోపణ వచ్చిందని అందులో తన తప్పు ఏమీ లేదని చెప్పినాడు.”
“అంతా శివుడే చూచుకుంటాడు, ధైర్యముగా ఉండండి.”, అని చెప్పింది.
రెండు నెలల పైన పదిహేను రోజులు గడిచినాయి. మళ్ళీ ఫోన్ వచ్చింది.
“సీతా! నేను కేసు నుండి బయట పడినాను. ఈ పరిస్థితులలో నేను ఇక్కడ ఇమడ లేక పోతున్నాను. వచ్చేస్తునాను.” అని చెప్పినాడు.
మూడు నెలలకు పది రోజుల ముందే ఆనంద్ వచ్చేసినాడు. నారాయణ, తన తల్లి అల్లుడిని తీసుకొని రావడానికి మద్రాస్ వెళ్దామని అన్నారు. దీక్ష పూర్తి అయ్యే వరకు తను బయటకు రానన్నది.
ఆనంద్ నేరుగా అత్త గారింటికి వచ్చినాడు. సీత తన దీక్ష ఏ విధముగా సడలకుండా భర్తకు సేవలు చేసింది.
తనకు కలిగిన అఘాతము(షాక్) తో ఆనంద్ చాలా కాలము మానసికముగా బాధ పడినాడు. తరువాత శారీరక అనారోగ్యము వచ్చింది. చివరకు రక్తపు పోటు కూడా వచ్చింది.
మామ గారి సహకారము తో తనకున్న పరిజ్ఞానముతో ఒక చిన్న పరిశ్రమ , వ్యాపారము మొదలు పెట్టినాడు. దానికి కావలి కేంద్రముగా చేసుకున్నాడు. స్వామి శివానంద ఆశీస్సులతో కావలి చేరినారు. పుట్టిన కొడుకుకు ఆదిత్య అని పేరు పెట్టినారు. వాడి మీద తల్లి యొక్క సాధనల ప్రభావము, మరియు స్వామీ జీ ప్రభావము చాలా ఉంది.  ఇంకా తల్లి ఎంత చెబితే అంతే. బాధ్యత కలిగిన కొడుకు గా ఎదిగినాడు.

No comments:

Post a Comment