Saturday, March 25, 2017

రెండు చిలుకలు 3



 “ఏమండీ! మన వాళ్ళలో ఇలా ఎవరూ నిర్ణయము తీసు కోలేదు. నేను ఏదో తొందర పడినానేమో  యని అనిపించింది. ఈ అమ్మాయి మనలో ఇమడ గలదా? ఇదే నాకు భయముగా ఉంది.” శ్యామలమ్మ నెమ్మదిగా అన్నది.
“మొదట్లో నీ అనుమానము నాకూ అనిపించినది. నేను విడిగా అమ్మాయితో మాట్లాడినాను. అమ్మాయి చాలా మంచిది. ఇలా నిర్ణయము తీసుకోడానికి అమ్మాయికి ఏవో కారణాలు ఉంటాయి. మరొక మాట కూడా చెబుతాను. నీవు  ఏమీ కంగారు పడ వలసిన అవసరము లేదు. ఈ సంబంధము శివయ్య నిర్ణయించినది. ఆ అమ్మాయి మన ఇంటికి వెలుగు తెస్తుంది.” లింగయ్య గారు చెప్పినారు.
ఇంక తరువాత అన్నీ పద్ధతిలో నడిచినాయి. లింగయ్య గారికి , శ్యామలమ్మకు అమ్మాయి నచ్చింది.
తరువాత అన్నీ వరుసగా శుభాలే జరిగినవి. అమ్మాయి నచ్చింది రాముకే కాదు, అమ్మా నాన్నలకు కూడా నచ్చింది. మే  నెలలో  తన పరీక్షలు కాగానే సరోజ తల్లి తండ్రులు పైనాంపురము వచ్చినారు. ఇరువురు దంపతులు కబుర్లు చెప్పుకున్నారు. వివాహాన్ని నిశ్చయము  చేసుకున్నారు. మరో నెలలో రాముకు సరోజకు పెళ్లయింది. అప్పుడే రాముకు తెలిసింది, సరోజకు ఒక అన్నయ్య కూడా ఉన్నాడని. డిల్లీ లో ఒక ప్రైవేట్  కంపెనీ లో పని చేస్తున్నాడు. పెళ్లి కూడా అయింది. భార్య డిల్లీకి సంబంధించిన అమ్మాయే. పేరు నందినీ చతుర్వేది. హిందీ తప్ప తెలుగు రాదు. పెళ్ళయిన తరువాత తనను నందిని అనే పిలుస్తున్నారు.
పెళ్లి తరువాత సరోజ పైనాంపురము వచ్చేసింది. తన నాన్నగారు” సరోజ ఇటువంటి ఊర్లో ఎలా ఉంటుంది, నెల్లూరు లో ఇల్లు తీసుకుని కాపురము పెట్ట వచ్చును కదా” అని  యనుకున్నాడు. ఆ మాటకు భార్య ద్వారా చెప్పించాలని అనుకున్నాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు.  వారి విషయములో వేలు పెట్టడము తప్పని చెప్పింది. ఇంకా కోడలు నందిని ద్వారా చెప్పించినాడు. ఆ సలహాకు సరోజకు చాలా కోపము వచ్చింది. కోపమును అణచుకొని  నెమ్మదిగానే “ మా ఆయన పని చేయాలంటే ఆయన  తల్లిదండ్రులు ఎప్పుడూ సంతోషముగా ఉండాలి. వారికి కష్టము కలిగించే పని ఏదీ  నేను చేయను.” అని చెప్పింది. ఇంకా వాళ్ళు మాట్లాడ లేదు.
అంతా వెళ్లి పోయినారు. ఇంకా ఇంట్లో నలుగురు మాత్రమే ఉన్నారు. ఇంక అత్తగారిని వంట చేయ నీయడము లేదు. కానీ చిన్న పనులు మాత్రము చేయ నిచ్చేది. ఎందుకంటే తనకు కూడా కాస్త  కాలక్షేపము కావాలి కదా. పని వాళ్ళను పిలిచి ఇంటి చుట్టూ కాస్త శుభ్రము చేయించి పూల మొక్కలు వేసింది. అవసరమయితే బయటనుండీ మొక్కలను తెప్పించింది. రోజూ వాటికి వీలయినంత వరకూ తనే నీళ్ళు పోయడానికి ప్రయత్నమూ చేసేది. కానీ రైతులు ఆ అవకాశము పూర్తిగా ఇచ్చే వారు కాదు.  ఇంకా కూర గాయాలు లాటివి కూడా వేయించింది.  అత్త గారూ మామగారూ ఆ పనిని చూచి మురిసి పోయినారు.
ఇంకా మామ గారికి పూజకు ఇతర కార్య క్రమాలకు అన్నీ అవసరాలకూ తనే చూచుకొనేది. ఒక రోజు అత్తగారికి చాలా కోపము వచ్చింది.” మా ఆయన పనులన్నా చూడక పొతే నాకేమి తోస్తుంది?” అని యన్నది.  ఆ మాట భర్త తో అంటే, “పోనీ  లేవే? మనకు కోడలు కానీ కూతురు గానీ ఆ పిల్లే కదా!” అని యన్నారు. ఈ తోట పనుల వలన తనకు ఊళ్ళో చాలా మంది పరిచయము అయినారు. అందరూ తోట చూడడానికి వచ్చి కాలక్షేపము చేయాలని చూచే వారు. కానీ తన పనికి ఎ అడ్డము లేకుండా చూచుకొనేది. ఊళ్ళో తన గౌరవము కూడా పెరిగింది.
సరోజ తెలుగు బాగా మాట్లాడుతుంది. కానీ తను డిల్లీ లో చదువుకున్నందు వలన చదవడము వ్రాయడము వచ్చేది కాదు. చాలా కష్టపడి అది కూడా నేర్చుకుంది.
ఒక రోజు లింగయ్య గారు,”అమ్మా౧ సరోజా! కాస్త భాగవతము పద్యాలు చదివి వినిపిస్తావా?” అని యడిగినారు. సరోజకు గుండెల్లో రాయి పడినట్లు అయింది.  ఏదీ తనకు చేత కాదు అనే అలవాటు తనకు లేదు. బిక్క ముఖముతో,”తప్పకుండా మామయ్యా గారూ! కొద్ది రోజులు సమయము ఇవ్వండి.” అన్నది. ఆయనకు అర్థమయింది. రాము సాయంత్రము నెల్లూరునుండి, ఊరికి వచ్చేస్తున్నాడు. తనముందు తను రోజూ పద్యాలు చదివి సరి చేయించు కొనేది. కొన్నాళ్ళ తరువాత తనే వెళ్లి కొన్ని పద్యాలు చదివి వినిపించినది. దీనితో తెలుగు సాహిత్యము మీద దృష్టి మళ్ళింది. ఇంట్లో ఉన్న గ్రంథాలన్నీ తిరగ వేసేది  అనుమానాలన్నీ మామయ్య గారి దగ్గిర తీర్చుకోనేది. ఈ విధముగా ఆయనకు మంచి కాలక్షేపము ఏర్పడింది.
ముందు సంవత్సరము రాముకు రెండవ స్థానము వచ్చినట్లే తనకు కూడా రెండవ స్థానము వచ్చింది. ఇద్దరూ కలిసి పతకము తీసుకొనుటకు తిరుపతి వెళ్ళినారు. మిత్ర బృందమును అందరినీ కలిసి వచ్చినారు.
    ----------------------------------------
ఎంత పని యున్నా సాయంత్రము రాము వస్తే చాలా హడావుడి పాడేది. ఇంకా  ఏమి చేయాలి అని ఆలోచించేది.
యమ్ యస్స్సి. లో తన మార్కు చూచి కొన్ని కాలేజీలలో తనను ఉపయోగించుకోవాలని నెల్లూరు నుండి వచ్చినారు. వాళ్లకు తన పని యంతా చూపించి ఇంక చేయ లేనని చెప్పింది. అత్తగారు అడిగితె,”మిమ్ములను చూచుకోవడము నా ప్రథమ భాద్యత. అంతకు మించి నాకు ఏమీ అక్ఖర లేదు. నేను సంపాదించ వలసిన అవసరము ఉందంటారా?” అని అడిగింది. అట్లా యని తన సబ్జెక్ట్ ను వదిలి పెట్ట లేదు మంచి ఫిజిక్స్ పుస్తకాలు దొరికితే పేజీలు  తిప్పేది. రోజూ అన్ని విషయాలతో బాటు రాముకు ఫిజిక్సు బోధనలో అనుభవాలన్నీ తెలుసుకొనేది. రాము తన ఫిజిక్స్ అనుభవాలన్నే చెప్పే వాడు. అటువంటి మనస్తత్వాన్ని తను ఎప్పుడూ తన నాన్న లో చూడ లేదు. అప్పుడప్పుడు తను ఎంతో అదృష్ట వంతురాలనని అనిపించేది. తన అదృష్టము మీద తనకే గర్వము వేసేది. తన ఇష్ట దైవమయిన కృష్ణుడికి తను  కృతజ్ఞతలు చెప్పుకొనేది.
సెలవులు వస్తే ఒక సారి కాటేపల్లి శివాలయానికి ఎడ్ల బండి కట్టించుకొని వెళ్ళినారు. అత్త గారిని, మామగారిని గుడిలో ఉంచేసి, సముద్రానికి వెళ్ళినారు. అప్పుడు సముద్రము ముందు ఎత్తయిన ఇసుక గుట్టలు ఉండేవి. పెద్ద వాళ్ళయితే కాస్త ఇబ్బంది పడ వలసి వస్తుంది. రాము తను చేతులు పట్టుకుని ఎక్కి దిగే వారు. అక్కడే రాము తనకు నక్కేరు పండ్లు కోసి ఇచ్చినాడు. తనకు అవి అసలు తెలియవు. అవి నోట్లో వేసుకుంటే చెక్కు అదే ఊది పోయి బంక లాగా నాలుకకు అతుక్కొని పోయేది.  కానీ చాలా తియ్యగా ఉండేది. అంతే గాక కలే  పండ్లు , గోలిజ పండ్లు  ఇటువంటివి అన్నీ తను తింటూ నా చేత గూడ తినిపించే వాడు. ముందుకు వెళ్లి సముద్రము ముందు కూర్చున్నాము. స్నానానికి ఏమీ తెచ్చుకోనందుకు నేను ప్రత్యేకముగా ఎంతో బాధ పడ్డాను. రాము, ”ఏముంది? స్నానానికి ఇంకో సారి వద్దాము అన్నారు.” సముద్రపు అలలను చూస్తుంటే అందులో ఎన్నో జన్మల చరిత్ర దాగి ఉందని అనిపించింది. ఒక్క గంట కూర్చున్న తరువాత “ ఇంకా ఆలస్యము చేస్తే అత్తయ్య గారు కంగారు పడతారు. లేవండీ” అని ఆయనను లెవ దీసినాను.  మళ్ళీ ఇసుక దిబ్బలు ఎక్కుతూ దిగుతూ  గుడికి వచ్చేసినాము. సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరినాము.
డిల్లీ లో ఎన్నో చోట్ల తిరిగినాను. కానీ ఈ విధముగా ప్రకృతికి దగ్గిరగా తిరిగిన ఆనందము నాకు ఇంత వరకు కలుగ లేదు. అదే మాట రాముకు చెప్పినాను.
మరో సారి నెల్లూరిలో వేణు గోపాల స్వామి, మూల స్తానేశ్వరుడు, రంగనాయకుల స్వామి దేవాలయాలకు వెళ్లి రావాలనుకున్నాము. రాము అమ్మా నాన్నలను కూడా పిలిచినాడు. అత్తయ్యగారు, ”రామూ! నెల్లూరు చుట్టుప్రక్కల అన్నీ చూచినాము. ఆ పిల్లకు నీవు అన్నీ దగ్గిర ఉండి చూపించు నాయనా!” అని ప్రేమగా చెప్పింది. అలా తిరుగుతున్నంత సేపూ చాలా హుషారుగా ఉండేది.
రంగ నాయకుల స్వామి ఆలయాన్ని చూచినాము. వెనుకనే  తిక్కన సోమయాజులు వ్యాస భారతములో పదిహేను పర్వాలను కమ్మని తెలుగులో వ్రాసినాడుట.  శివ కేశవులకు తేడా లేదన్నట్లుగా ప్రక్కనే ఉన్న వేణు గోపాల స్వామి ఆలయము, మూల స్థానేశ్వర ఆలయము, శివాలయానికి ఎదురుగా బ్రహ్మాండమయిన వినాయకుడి విగ్రహము, అక్కడ నుండీ కదలాలని అనిపించ లేదు.  నెల్లూరుకు పడమట వైపు పినాకిని ని దాటితే పరాశక్తి  జొన్న వాడలో కామాక్షమ్మగా వెలిసిన చోటు. గ్రహ బాధలు ఉన్న వారు అక్కడ నిద్ర చేస్తారుట. అక్కడ నిద్ర చేసిన గ్రహ ఆవేశము  ఉన్న వారు రాత్రి అయేసరికి,”అమ్మా! కామాక్షమ్మా! మమ్ము వదిలి పెట్టమ్మా! మేము వెళ్లి పోతామమ్మా!” అని కేకలు వేస్తారుట.  ఉదయానికి వారికి అంతా నయమై పోతుందట. ఏ ఆధునిక మనస్తత్వ  శాస్త్రజ్ఞుడికీ అర్థము కాని విషయమది. ఆ విగ్రహానికి యంత్ర ప్రతిష్టాపన ఆది శంకరాచార్యులు చేసినారుట.
నేనెంత అదృష్టవంతురాలిని? అన్నీ తీసుకొని వెళ్ళడమే కాదు. అన్నీ విశేషాలు  రాము వివరించి చెప్పే వారు.
అక్కడే ఒక సాధువు కనిపించి దగ్గిరకు పిలిచినాడు. దక్షణను ఇమ్మన్నాడు. తీసుకున్న తరువాత, “మీరు చాలా అదృష్ట వంతులమ్మా! ఇద్దరూ కలిసి చాలా మంచి పనులు చేస్తారు. అయితే.....” అని ఆపినాడు.
“చెప్పండి స్వామీ! ఏమవుతుంది?” సరోజ కంగారుగా అడిగింది.
“మధ్యలో మీకు తెలియని అర్థము కాని పరిస్థితుల వలన అబ్బాయికి దూరమవుతావు. నీ పరిస్థితి ఏమిటో నీకే అర్థము కాదు. శని చాలా క్రూరముగా చూస్తున్నాడు. అమ్మను నమ్ముకో. ఏ నాడూ ఆమెను మరవ  వద్దు. అంతా పోతుంది. ఆ తరువాత అంతా సంతోషమే.” అని నెత్తి మీద చేయి పెట్టినాడు. ”ఎవ్వరికీ చెప్ప వద్దు ఈ విషయాన్ని.” అని యన్నాడు. కళ్ళు మూసి తెరిచే లోగా ఆ సాధువు అక్కడ లేడు.  ఆత్రముగా గుడి అంతా తిరిగింది. ఏడుపు ముఖముతో అక్కడే నిలబడింది. “ ఎప్పుడూ వర్తమానములో ఉంటే అంతా మంచి జరుగుతుంది. కంగారు పడ వద్దు.” రాము చెప్పినాడు. తిరిగి వెనక్కు వచ్చినారు.
          ----------------------------------
శ్రీ శైలము వెళ్ళినారు. తల్లిని తండ్రిని వెంట తీసుకొని వెళ్ళినారు.  శ్రీ మల్లికార్జునుడు, భ్రమరాంబికల  వైభవము మనసులో నిలిచి పోయింది. ఇంటికి వచ్చిన తరువాత తను గర్భవతి యని తెలిసింది.  అత్తయ్య గారు తనను  విశ్రాంతి తీసుకోమంటారు. కానీ తను అందుకు అంగీకరించా లేదు. శివాజీ గర్భములో ఉన్నపుడు  తన కుమారుడు పరాక్రమ వంతుడు కావాలని  జిజియా బాయి కొండలను ఎక్కి దిగి ఎంత కష్ట పడేదో తను చెప్పేది. అప్పటికీ కొంత విశ్రాంతి తప్ప లేదు. మామయ్యా గారు రోజూ సరస్వతీ మంత్రముతో పవిత్రము చేయ బడిన తీర్థమును ఇచ్చే వారు. అంతే కాదు ఆరోజుల్లో రోజూ క్రమము తప్పకుండా పోతనామాత్యుని భాగవతమును చదివించే వారు.  ఇంకా రాము ఇంట్లో ఉన్నంత సేపూ తన చుట్టూ తిరుగుతూ ఉండే వాడు. సరోజ యొక్క తల్లి దండ్రులు అన్నయ్య వదినలు సీమంతానికి వచ్చి నారు. కాన్పుకు తనను డిల్లీ తీసుకొని వెళ్తానని అమ్మ అంటే తను ఒప్పుకోలేదు. అత్తయ్య గారు చెప్పినా ఒప్పుకోలేదు. ఇక్కడున్న పవిత్రమయిన వాతావరణాన్ని వదిలి పెట్టి వెళ్ళదానికి తను ఇష్ట పడ లేదు.
జొన్న వాడలో సాధువు చెప్పిన మాటలను అనుసరించి రోజూ లలితా అమ్మవారికి పూజ చేసుకొనేది.
మొదటి కాన్పులో ఆడ పిల్ల పుట్టింది. రాము, వాళ్ళ నాన్న గారు ఆ పిల్లకు చదువుల తల్లి పేరున “శ్రీ వాణి “ అని పేరు పెట్టినారు. దిల్లీ నుండీ అందరూ వచ్చి చూచి వెళ్ళినారు.
పాపకు రెండు సంవత్సరాలు రాగానే తిరిగి గర్భవతి అయ్యింది. ఈ సారి మామగారు గాయత్రి మరియు లలితా మంత్రాలతో మంత్రించిన జలాన్ని రోజూ ఇచ్చే వాడు. ఈ సారి పుట్టిన పిల్లకు “రాణి షంయుక్త “ అనే పేరు తనకు పెట్టాలని అనిపించింది. అలాగే పేరు పెట్టినారు.
ఇద్దరు పిల్లలతో కాస్త పని పెరిగింది.అత్తగారు లేక పొతే తను న్యాయము చేయ గలనా యన్న భావన వచ్చేది. అందుకే రోజూ అత్తా, మామలకు మనస్సులో నమస్కారము చేసుకొనేది. రాము కూడా వీలయినంత సాయము చేస్తుండే వాడు.
                        --------------------------------------
ఋతువులు మారుతున్నాయి. జీవితాలు మార్పుకు సిద్ధమవుతున్నాయి. ఆ రోజు ఆది వారము. ఉదయాన్నే లింగయ్య గారు లేచి కూర్చున్నారు.
“ అమ్మాయ్ వాణీ! అందరినీ ఒక సారి పిలవమ్మా!” ఉదయాన్నే ఆయన అలా అనేసరికి అందరికీ ఆశ్చర్యము వేసింది.
వాణి,  రాణి  లను  దగ్గిరకు పిల్చి నెట్టి మీద చేయి బెట్టి  ఆశీర్వదించినాడు. “ఎప్పుడూ అమ్మా, నాన్న  మాటలను వినాలమ్మా!” అని యన్నారు.
ఇంకా సరోజ రాములను దగ్గిరకు పిల్చి, తల మీద చేయి పెట్టి ఆశీర్వదించినాడు. సరోజ తో, “నిన్నొక సారి నీ నక్షత్రము గురించి అడిగినాను. నీది కన్యా రాసి. శని సింహ రాశిలో ప్రవేశించిన తరువాత నీకు విపరీతమయిన ఒత్తిడి వస్తుంది. అందరూ నిన్ను నిందిస్తారు. కానీ, నీ తత్త్వము నాకు తెలుసు తల్లీ! జగన్మాతను నమ్ముకో. అంతా చక్క బడుతుంది.” అని అన్నాడు.
రాముతో, “రామూ! సరోజ నిన్ను వదలకుండా పట్టు పట్టి పెళ్లి చేసుకుందని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకు. పైకి తెలియక పోయినా ఆమె అంతరాత్మకు తన భర్త ఎవరో తెలుసు.  ఆమెకు తెలియదు. నీ కోసము డిల్లీ నుండి, తిరుపతి వచ్చి, అక్కడి నుండి, ఈ చిన్న ఊరికి కూడా వచ్చింది. మొదట్లో తనను అనుమానించాను. ఆ రోజు రాత్రి ధ్యానములో అంతా తెలిసింది. నీకు మరో విషయము చెప్పాలి. తను కష్టాలలో ఉన్నపుడు ఎవరు తనను ఏమన్నా  నీవేమీ చేయ లేవు. అది కాల పురుషుడి తీవ్రత.” కోడలిని పట్టుకొని,” కానీ ఏ నాడూ ఈ నా తల్లిని అనుమానించకు, నిందించకు. ఆ తరువాత నీ జీవితములో తన సహాయము వలన చాలా మంచి పనులు చేయ గలుగుతావు. గుర్తుంచుకో  నాన్నా!” అని యన్నాడు.
భార్యను పిలిచి,”శ్యామలా!  నాకు శివయ్యనుంది పిలుపు వచ్చింది. వెళ్లి పోతున్నాను. నీవు మరో మూడేళ్ళు ఉండాలి. పిల్లలను జాగ్రత్తగా చూచుకో.” అని యన్నాడు.
అందరికీ పరిస్థితి అర్థమయింది. అందరి కళ్ళల్లో నీళ్ళు కారి పోతున్నాయి. పిల్లలకు అర్థము కావటము లేదు. ఇంకా సరోజకు తన మామ గారు ఏ  స్థాయి వ్యక్తో తనను ఎంత ప్రేమించాడో తెలిసి తట్టుకోలేక పోయింది. ఆయన వళ్ళో తల పెట్టి వెక్కి వెక్కి ఏడ్చింది.
“అమ్మా! సరోజా! ఏడవకమ్మా! నిన్ను అలా చూడ లేక పోతున్నాను. నేను నీ కోసము మళ్ళీ వస్తానుగా. వాణీ, రాణీ లకు తమ్ముడిగా వస్తాను. నీ ప్రేమను అప్పటి వరకు కాస్త దాచుకో తల్లీ!”

అందరినీ నవ్వుతూ పలకరిస్తూనే తల వాల్చి వేసినాడు. అందరూ ఏడుపులో మునిగి పోయినారు. ఇంటికి ఒక వెలుగు ఆరి పోయింది.
(To be continued)

ప్రస్థానము 1

                                                               

     అప్పటి వఱకు దైవికమయిన అనుభవములో నున్న కాంతి కిరణము అప్పుడే కళ్ళు తెఱచినది. ఎన్నో రకాల జీవ జాతులు, మనుషులు, దేవతలు కనిపిస్తున్నారు. వీరెవ్వరు? ఇంత వైవిధ్యత ఎందుకు ఉండాలి? అని ప్రశ్న వేసుకున్నది.
  వెంటనే జవాబు వచ్చినది,"అనుభవిస్తేనే తెస్తుంది."
  "ఎలా?", మరో ప్రశ్న వచ్చినది.
  "అనుభవానికి సిధ్ధమేనా?"
  "సిధ్ధమే."
  వెంటనే తను అక్కడినుండి మాయమయినది.
  తను ఒక రాతి బండలో జడత్వముతో ఉన్నది. కానీ,అంతా గమనిస్తూనే యున్నది. ఆ రాయి బ్రద్దలు గొట్ట బడినది. ఆ బాధను అనుభవించినది. తరువాత ఒక మాంస కృత్తువు యొక్క కేంద్రకములో చేరినది. దాని చుట్టూ మరికొన్నీ అణువులు చేరినవి.ఒక మొక్కలా ఎదిగినది. నీరు, గాలి, సూర్యుడి  కాంతి ఎంతో ఆనందాన్ని ఇస్తున్నవి. కానీ, ఇంతలో  తనను ఎవరో పీకి వేసినారు. మళ్ళీ, జడత్వము లోనికి పోయినది. ఆ అనుభవము తనలో కోపాన్ని పెంచినది.
      మళ్ళీ, ఇంకో రూపము వచ్చినది. అది యొక ముళ్ళ మొక్క. గత జన్మలో ద్వేషము తనకు ముళ్ళుగా రక్షణ నిచ్చినది. తనను స్థలాలకు హద్దుగా నున్న చోటుల్లో కంచె మీద వేసినారు. ఎవరో తనను దాటి వెళ్ళే వారు కాదు. ఎవరైనా వెళ్ళినా వారి ప్రయత్నములో ముళ్ళు గుచ్చుకొని భాధ పడితే తనకు సంతోషము కలిగేది. ఒక సారి మంట పెట్టి తనను తగుల పెట్టినారు. తనకు మనుషుల మీద ఇంకా కోపము పెరిగినది.
      తరువాత జన్మలో ఎన్నో ఊడలతో నున్న మొక్కగా పెరిగినది. ఏ జీవ రాశి దగ్గిఱకు వచ్చినా ఊడలు చుట్టుకొని రక్తాన్ని పీల్చి వేసేవి.గత జన్మలో తన ద్వేష ప్రవృత్తి ఇటువంటి జన్మకు కారణమయినది. అప్పుడు కూడా ఏదో ప్రేలుడులో తను చని పోయినది."ద్వేషము ఎటువంటి జన్మ కలిగిస్తున్నది?" అని ఆలోచించినది. కానీ ఆ అనుభవము తనలో జీర్ణము కాలేదు. కానీ ఆ భావన తనలో పరిణామ స్థాయిని పెంచినది. వృక్ష స్థాయినుండి జంతు స్థాయికి వచ్చినది. ఎన్నో జన్మలు గడచినవి.ఒక చిరుతగా పుట్టి, వేటాడి పొట్టను నింపుకున్నది.వయసులో ఉన్నపుడు తను రాజా లాగా బ్రదికినది.కానీ, వయస్సు రాగానే తన బలహీనత బయట పడినది. అందు వలన మనుషుల మధ్య బ్రదికితేనే తనకు రక్షణ   ఏర్పడుతుందని  అనిపించినది. విశ్వాసముతో బ్రదికే కుక్క లాగా పుట్టినది. కానీ, మనుషులు తనను వేటకు వాడుకున్నారు. ఇందువలన కొంత మార్పు వచ్చినా క్రూరత్వము తగ్గే అవకాశము పూర్తిగా రాలేదు. మళ్ళీ కొన్ని జన్మలు గడిచినవి.
     తనతో బాటు కొన్ని జీవులు త్వరగా మానవ జన్మ కావాలని కోరుకున్నవి.వాటికి ఆ స్వతంత్రము ఈయ బడినది. కానీ పరిపూర్ణత లేని సంస్కారాల వలన అవి దుర్మార్గాలు చేసి, తిరిగి జంతువుల స్థాయికి తిరిగి వచ్చినవి. అందుకని తను తొందర పడ లేదు.
     జన్మలు గడిచే కొద్దీ, కోపము పగ, ఆక్రోశము.. ఇవన్నీ అర్థము అయినట్లు అనిపించినది. కానీ అవి తనను వదిలి పెట్ట లేదు. చివరకు ఒక రోజు తనను పైవారే అడిగినారు, "మనిషిగా పుడతావా?"అని.

  మనిషి, మనిషి తరువాత దైవీ మానవుడు,.. ఇవి రావడానికి ఎన్ని జన్మలు పడుతందో? ఎన్ని జన్మల సాధన ముందున్నదో? యాత్ర మాత్రము ముందుకు సాగి పోతున్నది.
(To be continued)

Thursday, March 23, 2017

యంత్రాలు వస్తున్నాయి-తస్మాత్ జాగ్రత్త.


రాజాకు వళ్ళు బాగా బరువు ఎక్కి పోతున్నది. అంతే కాదు, తిండి కూడా ఇంతకూ ముందు తినే మాత్రము తినుట లేదు. అజీర్తి ఎక్కువయి పోయింది. అల్లోపతి వైద్యుడి దగ్గిరకు వెళితే ఏవో  మాత్రలు ఇచ్చినాడు. వాటి వలన ఆకలి పెరిగినట్లనిపించింది. కాస్త తిండి పెరిగింది. దానితో బరువు కూడా పెరిగింది. దానితో మోకాళ్ళ నొప్పులు మొదలయినాయి. మోకాళ్ళ నొప్పుల కోసము మందులు మొదలు పెట్టినాడు. ముందు కాస్త తగ్గినట్లు అనిపించింది. తరువాత మామూలే. తిరిగి మందుల మోతాదు పెంచ వలసి వచ్చింది. విపరీతముగా నొప్పులకు మాత్రలు వాడితే మూత్ర పిండాలు దెబ్బ తింటాయని స్నేహితులు  చెప్పినారు.  దీనితో ఏమి చేయాలో తెలియ లేదు.
సెలవు రోజుల్లో ఒక స్నేహితుడి పిలుపు పై శివాలయానికి వెళ్ళినాడు. దర్శనము అయిన తరువాత  అక్కడ గుడిలో ఉన్న ఒక స్వామిని దర్శించుకున్నారు. ఆయన పేరు స్వామి శివానంద. తన సుదీర్ఘ తీర్థ యాత్రలలో ఆ రోజు అక్కడ ఉన్నారు. ఇద్దరినీ కూర్చోబెట్టి కుశల ప్రశ్నలు వేసినారు. తన స్నేహితుడు మాట్లాడడము అయిన తరువాత  తను కూడా మాట్లాడదామనుకుంటూ తటపటాయించినాడు.  ఆయనే  “ఏమిటో అడగాలనుకుంటున్నట్లు ఉన్నావు. అడుగు బాబూ!” అన్నారు.
రాజు తన సమస్యను వివరించినాడు. “స్వామీజీ! ఇది మొదట నా తిండితో మొదలయిందని అనుకుంటున్నాను. పెద్ద సమస్య అయింది.”
“ఒక్క నిముషము బాబూ! నీకు వృకోదరుడు ఎవరో తెలుసా?”
“భీముడి పేరు కదా స్వామీ!”
“ఆ పేరుకు అర్థము తెలుసా?”
“వృకము అంటే తోడేలు కదా స్వామీ! అంటే తోడేలు పొట్ట లాంటి పొట్ట కలిగిన వాడు కదా.”
“ఎక్కడయినా ఎప్పుడయినా తోడేలు  పొట్టను చూసినావా?, తోడేలు బొమ్మలలో అయినా.”
“బాగా పొట్ట లోపలికి  ఉంటుంది కదా.”
“ అంతే కాదు. తోడేలు  బాగా తిండి పోతు. అయితే దానికి పొట్ట మాత్రము రాదు. నిజమేనా?”
“నిజమే స్వామీ!”
“ఎందుకో తెలుసా?”
“తెలియదు స్వామీ!”
“అది చాలా చలాకీగా ఉంటుంది. చాలా వేగముగా పరుగిస్తుంది. బాగా అలసి పొతే తప్ప విశ్రాంతి తీసుకోదు. అందు వలన తిన్నదంతా ఆరగి రక్తములో కలుస్తుంది. ఇక భీముడు కూడా పెద్ద తిండి పోతే. అయితే అందుకు తగ్గట్టుగా భౌతిక పరిశ్రమ చేస్తాడు. అందు వలననే భీముడికి కూడా పొట్ట ఉండదు. ఇక మన సినిమాల్లో భీముడిని పెద్ద పొట్టతో చూపిస్తున్నారంటే అది మన దర్శకుల అవివేకము.
“మనకు ఒక పరికరముంటే దానిని వాడవలసిన పద్ధతిలో లోపము ఉండకూడదు. భగవంతుడు ఇచ్చిన ఈ దేహము కూడా అటువంటిదే.”
“మొదట్లో ప్రతిదానిని కష్టపడి సంపాదించుకొనే వాడు ఎక్కువగా తిన్న ఆహార పదార్థములు జీర్ణమయి  శక్తిగా మారి,  వృధా  పదార్థములు స్వేదము, మలము రూపములో బయటికి వచ్చేవి. అందు వలన అనారోగ్యముండేది కాదు.”
“ఇంకా మనుషులకు ఆహారము అంటే భౌతిక పదార్థమే కాదు. ఆలోచనలు కూడా ఆహారమే. మన ఋషులు చెప్పిన విషయాలను పట్టించు కోవడము మనకు పూర్తిగా పోయింది. వ్యాధులు మన ఆలోచనల ద్వారా కూడా వస్తాయని లూయీస్  ఎల్ హి చెప్పేటంత వరకు ఈ ఆధునిక కాలములో  ఆలోచనల ప్రభావము అర్థము కాలేదు.”
“కొంత మంది ఉంటారు. ఎంత తిన్నా సన్నగా ఉంటారు. మరి కొంత మంది  చాలా కొద్ది తిండికే లావు ఎక్కి పోతూ ఉంటారు. అందరికీ ఇలా ఉండదు. అంటే తిన్న ఆహారానికి వాళ్ళ దేహ భారానికి అన్ని వేళలా సంబంధము ఉండదు.”
“నా సమస్య అదే స్వామీ!”, రాజు అన్నాడు.
“నీవు నీలో పెంచుకున్న ఆలోచనల భారాన్ని వదిలించుకో.  లేక పొతే అది కూడా నీ భారాన్ని పెంచుతుంది. కొంత మంది ఆలోచనలను వదిలించుకోవాలని ఎక్కువ తింటారు. వారికి రెండు బరువులు కలుస్తాయి. మరి కొంత మంది ఆహార నియంత్రణ అంటే డైటింగ్ చేస్తారు. అయినా వాళ్లకు కూడా బరువు పెరగ వచ్చును.”
“మరి డైటింగ్ వలన చాలా మందికి బరువు తగ్గుతుంది కదా.”
“అందరికీ అలా తగ్గినట్లు ఋజువులు లేవు. మనస్సు భారము లేని వాళ్లకు పని చేస్తుంది. కానీ డైటింగ్ ఒక్కటే సరి పోదు. భౌతిక సాధన తో బాటు ఆధ్యాత్మిక సాధన కూడా అవసరమే.”
“మరి ఈ నాటి జీవన విధానములో మేము ఏమి చేయాలో చెప్పండి స్వామీజీ!”
“మనిషి తోటి మనిషిని సరిగా గౌరవించడము నేర్చుకోవాలి. ఇంకా సమ సమాజమంటే సంపదను అందరికి సమానముగా పంచడము కాదు. అలా జరిగితే క్రమ క్రమముగా ఏమీ పని చేయని సోమరికి కూడా సంపద అందుతుంది. కష్ట పడుటకు ఇష్ట పడనీ వారు కూడా సోమరులై సిద్ధాంత కర్తలవుతారు.  సోవియట్  దేశాలు కూలి పోవడానికి ఇదే ప్రధాన కారణము.  సామర్థ్యమున్న ప్రతి వారికి సంపాదించు కొనే అవకాశము ఉండాలి. ప్రతి యొక్కరికీ వారి కున్న తత్వమును అనుసరించి వేరు వేరు వృత్తులలో శిక్షణను ఈయ వలసి ఉంటుంది.”
“మరొక్క విషయము సంస్కారము. ప్రతి వ్యక్తీ ఎల్లప్పుడూ సత్య మార్గములో నడవాలి. అంటే విశ్వసనీయుడుగా ఉండాలి. శీలవంతుడిగా ఉండాలి. స్తేయ బుద్ధి ఉండకూడదు. అంటే తనది కాని దానిని తను ఆశించకూడదు.”
“సంపాదన అంతా తమకే కావాలని పని చేసే వాళ్లకు, నాలుగు రూకలు పడేస్తే పని చేస్తారు అనుకొనే యజమానికి తేడా లేదు. అటువంటి యజమాని, యజమాని స్థితికి మించి జీతాలు కోరుతున్న ఉద్యోగి ఇద్దరూ దొంగలే. ఒకరి మీద ఒకరికి విశ్వాసము ఉండాలి. ఈ విశ్వాసము పోయినపుడు వచ్చే పరిణామాలు మొత్తము వ్యవస్థనే కూల్చి వేస్తాయి.”
“ఈ సమయములోనే సాంకేతికత లేదా టెక్నాలజీ కొత్త  దారులు పట్టినది. విద్యుత్తూ సరికొత్త ప్రకంపనాలను తీసుకొని వచ్చింది. నూనె దీపాలు వెలిగించ వలసిన అవసరము పోయింది. బటన్ నొక్కితే దీపము వెలుగుతుంది. బటన్ నొక్కితే గాలి వీస్తుంది. ఈ విధముగా ప్రకృతి నుండి వచ్చే వెలుతురుకు గాలికి దూరమయినాడు. పొలాలలో పని చేయుటకు మనుషులు దూరమయినారు. దుక్కి చేయుటకు ట్రాక్టర్లు రంగ ప్రవేశము చేసినవి. ఇప్పుడు పదిమంది చేసే పని ఒక్కడు చేస్తున్నాడు. ఇంట్లో పిండి రుబ్బ వలసిన అవసరము కూడా పోయినది. ఆ పనిని యంత్రము పది నిముషాలలో పూర్తీ చేస్తుంది.”
“ఇదంతా మనిషి సుఖ పడతానికే.అయితే మనిషికి ఇంతకు ముందు ఉన్న ఖాళీ సమయము కూడా లేకుండా పోయింది.”
“ఇంతకూ ముందు మంచి శ్లోకాలు, పాటలు , పద్యాలు పాడుకొనే ఖాళీ ఉండేది. మంచి గ్రంథాలు చదువు కొనే వాడు. కూలీ పని చేసే వాడు కూడా చక్కటి పద్యాలు చదవ గలిగే వాడు. తరచుగా దేవాలయాలకు వెళ్ళే వాడు. అక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో  తరచుగా పాల్గొనే వాడు. ఇప్పుడు అన్నీ పోయినాయి. ఉదయము నుండి మనిషికి కొద్ది ఖాళీ కూడా లేదు. అతని సమయాన్ని అంతా దూర దర్శినులు/విడియోలు ఆక్రమించి వేసినాయి. ఇపుడు ఇంట్లో పని తగ్గింది. కానీ, ఖాళీ లేదు.”
“ఇంతకూ ముందు విద్య అంటే సాధనతో కూడి ఉండేది. సత్యం వద. సత్యాన్నే పలకాలని చదివిన వారు ఎప్పుడూ సత్యాన్నే పలికే వారు. ఇప్పుడలా కాదు. చదువు వేరు, జీవితమూ వేరు. సత్యము చెప్పాలనేది చదువు లేదా ఉత్తీర్ణ పత్రము కొరకు, సత్యము చెప్పేది లేనిది జీవితమూ కొరకు. అందుకే మనిషి నటిస్తున్నాడు, జీవించుట లేదు. ఇంకా వ్యాపారములో అబద్ధాలు లేకుండా ఎలా కుదురుతుందనే వారు ఉన్నారు.”
“నిజమే స్వామీ! అబద్ధాలు చెప్పకుండా ఎలా వ్యాపారము చేయాలంటారు నా స్నేహితులు. లాభాలు రావాలంటే సరకు బాగా లేకున్నా అది అద్భుతముగా ఉందని అబద్ధాలు చెప్పాలి.”
“ఇది మనము కొత్తగా నేర్చుకున్నది. విశ్వాసము కావలసిన చోట సత్యముండాలి. సత్యమును ఎవరిని నొప్పించకుండా చెప్ప గలిగే నేర్పు కూడా ఉండాలి. సత్యమును చెబితే నష్ట పోతాయన్నది ఆధునిక సంస్కృతీ. ప్రాచీన కాలములో అబద్ధాలు చెప్పి ఎవరూ వ్యాపారము చేయ లేదు. ఇంకా సత్యానికి బద్ధులయిన వారు యుగ పురుషులు ఆదర్శ ప్రాయులయినారు.”
“ఇంక జీవితములో మరో కోణము ఉంది. సూర్యుడు ఎప్పుడయినా ఆలస్యముగా ఉదయించినాడా?”
“లేదు స్వామీ!”
“ఆయనను చూచి పనులు చేసే మనము ఉదయాన  ఎనిమిది లేక తొమ్మిది గంటలకు కూడా నిద్ర లేవడము లేదు.”
“మరి రాత్రి ఎక్కువ పని చేయ వలసి ఉంటున్నది”
“రాత్రి సమయానికి విశ్రమించి, ఆ పనిని ఉదయాన్నే చూచుకోవచ్చు కదా. అయినా త్వరగా లేస్తామో లేదో అన్న భయము మీలో ఉంది.”
“ఇంకొక విషయమున్నది. మన ప్రకృతి పంచ భూతాత్మకము. ఈ ప్రక్రుతి తో చేయ బడిన  మన దేహము కూడా పంచ భూతాత్మకము. అంటే పంచ భూతములతో చేయ బడినది.”
“భూతములంటే  ఏమిటి స్వామీ?”
“మన ఋషులు ఈ ప్రకృతి అయిదు స్థితులలో ఉన్నట్లు ఒక్కొక్క స్థితికి ఒక్కొక్క లక్షణము ఉన్నట్లు  గ్రహించినారు. మొదటిది పృధ్వీ స్థితి. ఘన రూపములో నిర్మాణము ఉపయోగ బడే స్థితి. రెండవది జల స్థితి, ద్రవము వలే నుండు పదార్థమునకు సంబంధించిన స్థితి. మూడవది అగ్ని. ఇది ప్రతి చర్యకు ప్రేరేపణ  కలిగించే స్థితి. నాల్గవది స్పర్శను కలిగించే వాయు స్థితి. ఇక అయిదవది మనలను విశ్వానికి అనుసంధానించే ఆకాశ స్థితి.”
“ఇక భూతము అంటే దయ్యము లాటిది అని కాదు. అతి ప్రాచీన కాలమునుండి మనిషి పరిణామానికి ఉపయోగ పడే మూల పదార్థము. అందుకే పరిణామము కావాలంటే దేవతలయినా ఈ మూల పదార్థములను ఉపయోగించి జీవించాల్సిందే. అంటే మానవులుగా పుట్ట వలసిందే.”
“ ఈ స్థితులను అనుసరించే మానవుడి దేహములో అయిదు తత్వాలు ఏర్పడినాయి.    పృధ్వీ స్థితి  నిలకడను ఇస్తుంది. ఇది సరిగా లేని వాడు ఎక్కడా స్థిర పడ లేడు. ఇది పెరగాలంటే  మనకు భూమితో స్పర్శ లేదా సంబంధము ఉండాలి. జల స్థితి లేని వారికి తక్కువ స్థాయి కళాత్మకమయిన పనులు చేయ లేరు. అగ్ని తత్త్వము లేని మనిషి క్షీణించి మరణిస్తాడు. సముద్రము, నదులు మరియు కొండలనుండి వీచే గాలులు వాయు స్థితిని పెంచి  ప్రేమానుభూతులను పెంచుతాయి. ( పైకి చూస్తూ) ఈ ఫాన్ల  గాలికి అంత శక్తి లేదు. ఇంకా ఆకాశ స్థితి ఉన్నతమయిన సృజనాత్మకతను పెంచుతుంది. ఉన్నతమయిన తలాల నుండి జ్ఞానమును అందుకోవాలంటే, ఆకాశ తత్త్వము పుష్టిగా ఉండాలి.  ఈ అయిదు తుల్య స్థితిలో ఉన్న వ్యక్తికీ ప్రకృతి గురుత్వము వహిస్తుంది. శిష్యుడుగా ఋజువు చేసుకున్న వాడు   దైవీ తలాలను దాట గలుగుతాడు.”
“అయితే స్వామీ! మనిషి ఎందుకు మరో రకముగా తయారు అవుతున్నాడు?”
“అదే సమస్య. ఇంతకూ ముందు తోటలలో, నదీ పరిసరాలలో మట్టి నేల మీద నడిచే వాడు. ఈ విధముగా భూమితో సంబంధము ఉండేది. ఇప్పుడు తిరిగే కొద్ది సేపు కూడా పాద రక్షలతో, బూట్లతో నడుస్తూ  పృథ్వి తో సంబంధాన్ని తెంపుకున్నాడు.
నెల, నెలా అమావాస్య , పూర్ణిమ లేదా పర్వ దినాలలో నది, లేక సముద్ర స్నానాలను చేసే వాడు. అది కూడా ప్రకృతి మీద  గౌరవముతో చేసే వాడు. ఇప్పుడు ఆ అలవాటు తగ్గి పోయింది. పొలాల మధ్య ఈ నాడు నడవాలంటే భయము. పొలాల్లో చల్లబడిన విష పదార్థాల దుర్వాసనను భరించ లేము. వేగముతో కూడిన జీవన విధానము వలన బయట ఆకాశము క్రింద ఆనందించే సమయము తగ్గిపోయింది. ఆకాశ తత్త్వము క్షీణించినది. భౌతిక సంపదను పెంచుతున్నాడే కాని, ఆధ్యాత్మిక పరిణతికి అవకాశము పోగొట్టుకున్నాడు. “
“జీవితమూ అంతా సంపదను పెంచుకోనుటే గాక మానవీయ లక్షణాలను పోగొట్టుకుంటున్నాడు. ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి అన్న యావతో తన్ను తాను మరచి పోయినాడు. తృప్తి లేక  శాంతి లేక మనిషి ఒక యంత్రముగా పని చేస్తున్నాడు. హృదయ  స్పందన లేని మనిషికి యంత్రానికి తేడా లేదు. రాబోయే రోజుల్లో యంత్రాలు పాలిస్తాయంటే, అవి రోబో లే కానక్ఖర లేదు. అటువంటి హృదయ స్పందన లేని మనిషి కూడా కావచ్చును. ఏమయినా యంత్రాలు తయారయినట్లు మనుషులు తయారు అవుట లేదు.”
“ప్రకృతి దీనిని ఎదుర్కొనుటకు ఏమి చూస్తుందో మనమే చూద్దాము.”
 ఓం  స్వస్తి.
  


రెండు చిలుకలు 2



          రాము   సరోజ ఇంక తనతో కలిసే అవకాశము లేదనుకున్నాడు. తనకు ప్రేమలు అంటే నమ్మకము లేదు. అందుకనే ప్రతి సంఘటనను తన ఆలోచనలనుండి తుడిచి వేసినాడు. అయినా అప్పుడప్పుడు అవన్నీ తన ఆలోచనల లోనికి జొర బడేవి.
తను నెల్లూరు లో ఒక కళా శాలలో ఉపన్యాసకుడుగా చేరినాడు. ఫిజిక్స్  పాఠాలు చెబుతూ వాలతో బాటు తను కూడా ఆనందించే వాడు. నెల్లూరు లో ఒక గదిని అద్దె కు తీసుకొని వారాంతములో పైనాంపురము వెళ్ళే వాడు.
డిశంబరు నెలలో ఒక ఆది వారము తను ఇంట్లో కూర్చొని పరీక్ష పేపర్లు  దిద్దుకుంటున్నాడు. వాకిట్లో ఏదో సందడి. ఊరిలో పిల్లల హడావుడి వినిపించినది. ”ఏమిటా?” అని తను బయటకు వచ్చినాడు. అప్పుడే బస్సు దిగిందేమో సరోజ తమ ఇంటి వైపే వస్తున్నది. చుట్టూ పిల్లలు “ఈ ఇల్లే అక్కా!” అని చూపిస్తున్నారు.
అమ్మ కూడా వాకిట్లోకి వచ్చింది. సరోజను చూచి, ”ఎవరమ్మా! ఏమి కావాలి?” అని మాట పూర్తి చేసిందో లేదో ముందుకు వంగి పాదాలు ముట్టుకొని మళ్ళీ లేచి ,”నమస్కారం ఆంటీ” అని పలకరించినది. ఇంకా అమ్మ ఆ మర్యాదను చూచి మురిసి పోయిందేమో, ”లోపలి రామ్మా”  అంటూ పిల్చుకొని వచ్చేసింది. తన గుండె బేజారు అయింది.
లోపలి వెళ్లి మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చి అమ్మ కుర్చీ చూపించింది. ”కూర్చో అమ్మా!” అని చెప్పింది.
“మీ అబ్బాయికి  యూనివర్సిటీ లో  రెండవ  రాంక్ వచ్చిందండీ. నాకు అక్కడ  తెలిసింది. ఇంకా మీకు వ్రాయ లేదు. ఇంతకూ నేనెవరో చెప్పా లేదు కదా. నా పేరు సరోజ. మీ అబ్బాయికి జూనియర్నండీ.”
రాము ఈ మాటలు విని స్టన్ అయినాడు. ఇప్పుడు ప్రకటించినారా? సరోజ అబద్ధాలు చెప్పడం కూడా మొదలు పెట్టిందా?
“చాలా మంచి మాట చెప్పావమ్మా!  ఉండు నీ నోరు తీపి చేస్తాను.”  ఇంట్లోకి వెళ్లి ఒక బెల్లము ముక్క తెచ్చి నోట్లో పెట్టింది. అది అమాయకపు తత్త్వము.
“ఇంత మంచి వార్త చెబితే కూడా  కదల్రేమిటి?”  రాము వైపు చూచి అడిగింది. “మీ అమ్మగారు నాకు ట్రీట్ ఇచ్చినారు.  మీ నుండి ఒక మాట కూడా రాలేదు.”
“ఆ అమ్మాయికి థాంక్స్ చెప్పరా.” వాళ్ళమ్మ గదమాయించింది.
“థాంక్స్”,చెప్పి “అక్కడ అయి పోయింది. ఇక్కడ కూడా  దొరికి పోయినానా?” రాము చిరాకు ముఖము పెట్టుకున్నాడు.
వాళ్ళమ్మ  శ్యామల అడిగింది. “ఇది చెప్పడానికి ఇంత దూరము వచ్చినావా?”
“లేదాంటీ!. నెల్లూరు మా తాతయ్య గారి ఊరు.  అక్కడ నుండి ఇది దగ్గిరే కదా.”
“నెల్లూరు లో నీ బంధువులు ఉన్నట్లు  ఎప్పుడూ చెప్ప లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చారా ఏమిటి? లేక పొతే నన్ను వదల కూడదని తిరుపతి నుండే వస్తున్నావా?” పైకి అన లేదు. కానీ,  లోపలనే గొణుక్కున్నాడు. “తను ఏమి మాట్లాడితే ఎటు వెళుతుందో” అని నోరెత్త లేదు.
“ఇంతకూ మీ తాత గారు ఎవరమ్మా?” శ్యామల అడిగింది.
“దీపాల  రామ శాస్త్రి గారండీ.  వాళ్ళ అబ్బాయి కృష్ణ  శాస్త్రి గారు  మా నాన్న గారు. డిల్లీ  లో పని చేస్తున్నారు. ఇంక మా అమ్మగారు ప్రస్తుతము నాతోనే ఉన్నారు.”
బ్రాహ్మణులీ అన్న మాట. శ్యామల సంతోష పడింది.
“సరే, ఉదయాన్నే బస్సు ప్రయాణము. వాళ్ళంతా దుమ్ము దుమ్ముగా ఉంటుంది. కాస్త స్నానము చేసి రామ్మా.  టిఫిన్ చేద్దువు గానీ.” తనే వెళ్లి స్నానపు గది చూపించింది.
తను స్నానము చేసి డ్రెస్ మార్చుకుంది. తిరిగి హాల్లోకి రాకుండా వంటింట్లోకి దూరింది.
“ఇంతకూ ఏమి చేస్తున్నారు అంటీ!”
“ఉప్పు పిండి చేస్తున్నానమ్మా!”
“ఆంటీ! మీరు కాస్త ప్రక్కకు జరిగి కాస్త కబుర్లు చెప్పండి. ఉప్మా నేను చేసేస్తాను” ఆ చొరవకు శ్యామల ఆశ్చర్య  పోయింది.
“వద్దమ్మా! ఎదో చూడడానికి వచ్చిన నీతో పనులు చేయిచ్చేదా? ఇలా వచ్చి ప్రక్కన కూర్చో.”
“ఒక సారి అవకాశము ఇవ్వండి ఆంటీ!”
ఇంక  మాట్లాడ లేక శ్యామలమ్మ ప్రక్కకు తొలగి చెక్క బల్ల మీద  కూర్చుంది.
తన పనిలో చాకచక్యము చూచి ఆశ్చర్య పోయింది. ఉప్మా అయి పోయింది.
“రామ్మా! నీవు కూడా మాతో తిందువు” అంటే, “లేదాంటీ. కాస్త ప్రార్థన చేసుకొని వస్తాను. “ అంటూ ప్రక్కనే దేవుడి పటాల దగ్గిరకు వెళ్ళింది.
“అమ్మా! ఆకలిగా ఉంది.” రాము కేక వేసినాడు.
ఉప్మా తిని ,”చాలా బాగుందమ్మా!” అని యన్నాడు.
“నేను చేయ లేదు నాన్నా! తిరుపతి నుండి వచ్చిన మీ జూనియర్ చేసింది”
ఆ మాట విన్న రాముకు పొల మారింది. ఈ సరోజ అప్పుడే అమ్మను పట్టేసిండా? ఆశ్చర్య పోయినాడు. ఇంతలో లింగయ్య గారు, రాము నాన్నగారు వస్తూ, “శ్యామలా! మనింటికి ఎవరు వచ్చినారు?” అడిగినారు.
“రాము జూనియర్ ట అండీ! ఇంకా తిరుపతిలో చదువుతున్నదట. అయినా అమ్మాయి మహా లక్ష్మి లాగుందండీ. ఎంత చొరవో.”
“ఇంతకూ ఆ అమ్మాయి ఎవరుట?” అడిగినారు.
“”వాళ్ళ తాతయ్య గారు  నేల్లూరేనటండి. దీపాల రామ శాస్త్రి గారుట. నాన్నగారు డిల్లీ లో పని చేస్తున్నారుట.”
ఈ లోపల సరోజ బయటకు వచ్చింది. “ఉదయాన్నే వచ్చినానండీ!” అంటూ ముందుకు వంగి పాదాలు ముట్టుకుంది.
“చాలా మంచిదమ్మా!” అన్నారు ఆయన.
“ఆంటీ! మీరు ఏమి చేయాలో చెబితే మధ్యాహ్నము వంట నేనే చేసేస్తాను.”
“వద్దమ్మా! నేనున్నాను కదా. నీవు వచ్చిన తరువాత అబ్బాయితో మాట్లాడ లేదు.”
“ఆయన అంతే ఆంటీ! అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడడు.” ఒక చురక వేసి రాము వైపు చూచింది.
“నేనొక మాట చెబుతాను ఏమనుకోవు కదా!”
“చెప్పండి ఆంటీ!”
“ఏమీ లేదు. మీకు ఆంటీ అనేది అలవాటు. నాకు అలా పిలిపించుకోవడము ఎందుకో బాగులేదు. అమ్మా అని లేదా అత్తయ్య గారూ! అనో పిలువా రాదూ?”
“అలాగే, అత్తయ్యగారూ! అంతకంటేనా?”
బిత్తర పోవడము రాము వంతయింది.
ఇంకా శ్యామలమ్మకు ఈ అమ్మాయి కోడలయితే ఎంత బాగుంటుందో అనిపించింది.
“అత్తయ్య గారూ! మీ వూళ్ళో గుడులను చూపించరా?” నెమ్మదిగా అడిగింది.
“అదేం భాగ్యమమ్మా!  మా రాము ఉన్నాడు కదా! అన్నీ చూపిస్తాడు.”
రాముకు తెలిసింది. తను ఎంత దూరముగా ఉండాలనుకుంటే తను అంత దగ్గిరగా అవడానికి ప్రయత్నము చేస్తున్నది.
“రామూ! సరోజకు రామాలయము, మహాలక్ష్మమ్మ గుడి చూపించి తీసుకొని రారా.” ఆర్డర్ పాస్ అయింది.
రాముకు తప్పించు కోవడానికి దారి లేదు. ఇద్దరూ బయలు దేరినారు. ముందు ఊరి చివరలో ఉన్న గ్రామ దేవత మహాలక్ష్మమ్మ గుడికి వెళ్ళినారు. గుడి ముందు ఒక చావడి కూడా ఉంది. వెళ్లి ఇద్దరూ అమ్మ వారికీ నమస్కారము చేసినారు. మరో వంద అడుగులలో రామాలయము ఉంది. ప్రాకారము లోపలి వెళ్ళినారు. వెళ్తుంటే దారిలో ఒకరి మాట వినిపించింది,”చూడ ముచ్చటగా ఉంది జంట” అని. దర్శనము కాగానే పూజారి తీర్థము ప్రసాదము ఇచ్చినారు. శఠ గోపము పెడుతూ, ”రామూ! అమ్మాయి ఎవరు?” అని యడిగినాడు.
“మా బంధువుల అమ్మాయి” అని చెప్పినాడు,  తను తెలివిగా సమాధానమిచ్చానని అనుకుంటూ.
“మీకు వరసైతే అమ్మాయి బాగుంది నాయనా!”
ఈ వరస ఏమిటో రాముకు అర్థము కాలేదు. సరోజ మాత్రము ముసి ముసిగా నవ్వుకుంది.
రాము గుడి బయటకు వచ్చేస్తుంటే చేయి పట్టుకొని ఆపి, ”మీకు ఆ మాత్రము తెలియదా?” అని అడిగింది.
“ఏమిటి?” కంగారుగా అడిగినాడు.
“గుడికి వచ్చినపుడు కాస్సేపు కూర్చొని వెళ్లాలని తెలియదా?” అన్నది.
“అవును కదూ.” అంటూ అక్కడే కూర్చున్నాడు. సరోజ పక్కనే కూర్చుంది. ఎటూ తమ మీద బయట మాట వచ్చేసింది. అందుకే ధైర్యము కూడా వచ్చేసింది.
“ఏమండీ!”
“ఆ  ఏమిటి చెప్పు.”
“అలా మాట్లాడటము ఏమిటి? సరోజా అని పిలవ వచ్చు కదా! ఎటూ మీ ఆమ్మ గారు అత్తయ్య గారు అయినారు. ఇంకా మీకు బెరుకు ఎందుకు?”
రాము కాస్త మెత్త బడినాడు.
“అది కాదు సరోజా! నీవు నెల్లూరికి వచ్చి ఇక్కడికి వచ్చినావా? లేక నా కోసమే నేరుగా వచ్చినావా?”
“ఎంత అమాయకులండీ మీరు? ఆ మాత్రము అర్థము చేసుకోలేరా? నెల్లూరులో నా బంధువులు ఎవరూ నాకు తెలియదు. ఇంకా తాతయ్య గారు ఎప్పుడో వెళ్లి పోయినారు. మిమ్ములను చూడాలి అనుకుంటూనే ఆరు నెలలు గడిపి వేసినాను. నాలుగు రోజులు సెలవులు వచ్చినాయి  ఇంక మీ అడ్రస్ నాన్న గారికి ఇచ్చినారు కదా! ఇంక ఉండ లేక పోయినాను. అమ్మను బంధువుల ఇంటికి పంపి నేను ఇటు వచ్చేసినాను.” మాట చాలా హుషారుగా ఉంది.
“ఒక్క దానివే ప్రయాణము చేసినావా? భయము వేయ లేదా?”
“భయమెందుకు?”
“నేనంటే నీకంత ఇష్టమా?”
“ఈ ప్రశ్నకు నేను జవాబు ఈయ లేను. అక్కడ చదువుతున్న వారిలో మీకున్న స్వచ్చత, సభ్యత  వేరే ఎవరిలో కనిపించ లేదు. అమ్మాయి కాస్త మాట్లాడితే చాలు  కబుర్లు చెప్పుదామా? అనే వారే అక్కడ ఎక్కువ. ఆ శ్రద్ధ వారికి చదువులో లేదు. ఇంకా మీ విషయములో మీకున్న క్రమ శిక్షణ, నిబద్ధత నాకు ఏంటో నచ్చింది.”
“మరి నీవు ఎప్పుడూ అలా కనిపించ లేదే?”
మీరు నాకు మాట్లాడటానికి అవకాశము ఎప్పుడిచ్చారు మహానుభావా! నేను నిన్ను ప్రేమిస్తున్నానని  నేను చెబితే, నీవు ఎక్కడ మాయలో పడతావో అని, నీ లక్ష్యము చెదిరి పోతుందేమో అని భయ పడినాను. అదే సమస్య నాకు కూడా రావచ్చును. మనకున్న ప్రధాన లక్ష్యము మనము ఏమి చేసినా చెక్కు చెదర కూడదు. కానీ నిన్ను వదులు కో కూడదు. అందుకే నీ చుట్టూ తిరుగుతూనే నీ లక్ష్యము చెదర కుండా నడుచు కోవాలని, అనుకున్నాను. మీరు మీ అమ్మా, నాన్నల మీద చూపించే ప్రేమ భాద్యతలను చూచి, మీరు మీ జీవిత భాగస్వామిని కూడా అలాగే చూస్తారని అనిపించినది. మీ దగ్గిర నేర్చుకున్నంత ఫిజిక్స్  క్లాసులో నేర్చుకోలేక పోయినాను. అదే నన్ను క్లాసులో అందరి కంటే ముందు నిలబడేటట్లు చేసింది. కొన్ని పరిమితులు పెట్టుకుంటేనే జీవితములో విజయాన్ని సాధించ గలము.  ఇంకా నేను చేసినదొకటే, మీలో ఎటువంటి కలతను రేపకుండా మిమ్ములను నా వాడిగా చేసుకోవాలనుకున్నాను.”
“మా అమ్మా నాన్నలను ఎలా ఒప్పించ గలనని అనుకున్నావు?”
“మిమ్ములను చూస్తె వాళ్ళు ఎంత మంచి వాళ్ళో తెలిసి పోతుంది. కానీ ఏదో మొండి ధైర్యము నన్ను ఇలా చేయించింది.”
తనకు తెలియకుండానే సరోజ చేతిని తన చేతిలోనికి తీసుకున్నాడు. సరోజ కు ఒక వైపు సంతోషము మరో వైపు సిగ్గు కలిగింది. రాము అన్నాడు.
“”ఏమో నాకూ అనిపించింది. నా మీద నాకు ఎంత నియంత్రణ ఉన్నా కాస్త పని తగ్గితే నీవే కళ్ళ ముందు కనిపించే దానివి. ఈ విషయములో నీకున్న ధైర్యము నాకు లేదు.”
“మీకు మరొక్క విషయము చెప్పాలి.”
సరోజ అన్నది, ”చలాకీ గా, ఆకర్షణీయముగా తిరిగే అబ్బాయిలంటే నాకు చాలా కోపము. నా డిల్లీ జీవితములో ఇటువంటి వారిని చాలా మందిని చూచినాను. ఎవరికీ జీవితముపై నిబద్ధత లేదు. అందుకే ఎటువంటి వాడయితే నాకు నచ్చుతాడో అని ఆలోచించే సమయములో తిరుపతికి వచ్చినాను. మీ కళ్ళలో ఖచ్చితమయిన లక్ష్యముండేది. నేను ఆశిస్తున్నది ఇటువంటి వ్యక్తినే అని నాకు అనిపించింది. మళ్ళీ మీరెక్కడ జారి పోతారో అన్న భయము. అందుకే మీ చుట్టూ తిరిగాను. ఇవి నా తెలివి తేటలు మాత్రము కాదు. తెలియని ఆరాటము. మీ గురించి నా అభిప్రాయము మా అమ్మకు చెప్పినాను. మా అమ్మకు కూడా నా ఆలోచన సరైనదే అని అనిపించింది. మా నాన్నగారు కూడా మీ గోత్ర వివరాలు అడిగింది ఈ ఉద్దేశ్యముతోనే. మీ గోత్రము ఏమవుతుందో అని చాలా కంగారు పడినాను.”
“ఎప్పుడూ నగరాలలో ఉండే పై పై మెరుగులు నాకు నచ్చ లేదు. కొంత మూర్ఖత్వము కనిపించినా పల్లెటూరి వాళ్ళలో ఉన్న ప్రేమ అక్కడ కనిపించదు. నాకు నిజానికి జీవితమంతా పచ్చని పొలాల మధ్య పల్లెటూర్లలో ఉండాలని ఉంది. మా నాన్న గారికి  పల్లెటూర్ల మీద సదభిప్రాయము లేదు. అందుకే పెద్ద వాళ్ళ ప్రమేయము లేకుండా నేనే ముందుకు దిగినాను. మీరు నెల్లూరు వెళ్లి ఆరు నెలలయింది. అందుకే మీరు ఎక్కడ జారి పోతారో అన్న భయము ఏర్పడింది. ఇంక ఉండబట్ట లేక వచ్చేశాను.”
“నీకు తెలుసు కదా మా అమ్మ ఎటువంటిదో?”
“”చూచినాను. మీ అమ్మలో అమాయకత్వమే కాదు, విపరీతమయిన ప్రేమ ఉంది. కానీ మీ నాన్నగారిని మీరేమి అర్థము చేసుకున్నారో నాకు తేలియదు. కాని,  నాకు ఆయన  ఒక జ్ఞాని లా కనిపించాడు.”
“అన్నట్లు మీ ఊర్లో ఇంకేమీ చూపించరా? ఇంతట దూరము వచ్చినాను కదా!”
“ఈ రోజంతా ఉండేటట్లయితే ఉప్పు కాలువ చూపిస్తాను . సముద్రము కూడా వెళ్ళ వచ్చును.”
“సముద్రానికి వెళ్దాము.”
“అయినా వద్దు. అందరి దృష్టిలో అపుడే పడటము మంచిది కాదు. అయినా రానూ పోనూ రెండు మైళ్ళు నడవాలి. ఇంతకూ ఈ రోజు ఉంటావా?”
“లేదు సాయంత్రం  నెల్లూరు వెళ్లి ఎదో ఒక బస్సు ఎక్కి ఉదయానికి తిరుపతి చేరుకోవాలి.  మీ లాగే నాకూ చాలా పని ఉంది.. అన్నట్లు మీకు తెలియకుండా ఒక దొంగ తనము చేసినాను.”
రాము కంగారు పడినాడు, ”ఏమి  చేపావు?”
మొదటి సంవత్సరము మీరున్నారు కాబట్టి అన్నీ మీరు చెప్పినారు. రెండవ సంవత్సరానికి ఎలా? మీ ఫైనల్ యియర్ నోట్సులను అడుగుదామని అనుకుంటే  మీరు సరిగా మాట్లాడ లేదు .నేరుగా అడగాలంటే భయము వేసింది. మీ ప్రాక్టికల్ పరీక్షలపుడు మీకు తెలియకుండా మీ నోట్సులను కాజేసి, అన్నీ జెరాక్స్   చేయించుకొని , గుట్టుగా మీ నోట్సులను మీ పుస్తకాల్లో సర్దేసాను.”
“పెద్ద దొంగ వయ్యావు.”
“మరి నా పరిస్థితి క్లాసు లో తగ్గ కూడదు కదా! ఏమో అప్పుడు నాకు ఆ హక్కు ఉందని అనిపించింది.”
“ఈ నీ మాటలు విన్న తరువాత నీ ప్రణాళిక, నీ పధ్ధతి నాకు చాలా నచ్చినాయి. అందుకే ఏమో ఈ రోజు నీవు చాలా అందముగా ఉన్నట్లు అనిపిస్తున్నావు. అయినా నాకు ఒక్క మాట ఇవ్వాలి. మా అమ్మ, నాన్నలను...”
“ఇంక ఆపండి, వారిని మా అమ్మ నాన్నలకంటే ఎక్కువగా చూచుకుంటాను. ఇది మీకు నేను ఇస్తున్న మాట.”
ఇద్దరూ పైకి లేచి నారు. ఇద్దరి మనసులు చాలా తేలిక పడినవి.

                 --------------------
మధ్యాహ్నము భోజనాల తరువాత లింగయ్య గారు కూడా సరోజ తో మాట్లాడినారు. వారి కుటుంబ వివరాలు అన్నీ కనుక్కున్నారు. సాయంత్రము బయలు దేరుతుంటే, రామును కూడా వెళ్లి నెల్లూరులో తిరుపతి బస్సు ఎక్కించ మన్నాడు.