Tuesday, April 11, 2017

ఒక మాట

                           
          రెండు చిలుకలు మొదట ఒక మామూలు కథ గానే మొదలు పెట్టినాను. కానీ కథ మరో రకముగా మారి పోయింది. మనుషుల మధ్య బంధాలు ఎలా ఉంటాయో వ్రాసినాను. మొదట సరోజ పాత్ర మామూలు పాత్ర గానే అనుకున్నాను. కానీ అది నన్ను దాటి వెళ్లి పోయింది. ఇంకా ప్రస్థానము కొన్ని రోజులు సాగుతుంది. ఈ నాటి సామాజిక పరిస్థితుల మీద  మాయ అనే కథ మొదలు పెట్టినాను. కానీ ఇప్పుడే అది మీ ముందుకు రాదు అనుకుంటున్నాను.
నాను ఈ ప్రాచీన సంస్కృతీ చిన్నప్పటి నుండి ఏంటో ప్రభావితము చేసింది. నా తండ్రి నుండి నన్ను ప్రత్యక్షముగా పరోక్షముగా ప్రభావితము చేసిన వారు ఎందఱో. అందులో స్వామి వివేకానంద మొదలు శ్రీ నండూరు రాదా కృష్ణ  గారు, వారి ద్వారా నా జీవితమూ మీద ప్రభావము చూపిన శ్రీ కృష్ణమాచార్యులు గారు, శ్రీ సత్య సాయి బాబా గారు.. ఎందఱో ఉపాధ్యాయులు, పేరు పేరున చెప్పక పోయినా వారి అందరికి నా ప్రణామములు.
ఇవి చదువుతున్న వారు ఒక్క వాక్యము అయినా ఖర్చు చేసి మీ అభిప్రాయము వ్రాయండి.
మీ

సుబ్బ రామయ్య.

రెండు చిలుకలు 6


                                      
 ఆ రోజు ఆదివారము. రాము వాకిట్లో కూర్చొని యున్నాడు.  వాణి కూడా ఎంతో హడావుడిగా ఉంది.
వయస్సు పదమూడు  ఏళ్ళే అయినా నాన్నకు అన్ని పనులలో ఇంట్లో సాయము చేసేది. కూతురు హుషారు చూచి రాము కూడా అడ్డము చెప్ప లేదు. అమ్మ వస్తుందని నాన్న చెప్పినాడు. అమ్మకు రాగానే ఏమయినా చేసి పెట్టాలి. పక్క ఇంట్లో అత్తయ్య గారిని  వంట ఇంట్లో కూర్చో పెట్టుకొని తనే స్వీట్ ఏదో చేస్తున్నది. తను చేయ గలనన్న నమ్మకము ఇంకా ఏర్పడ లేదు.
          తొమ్మిది గంటల బస్సు వచ్చింది. పల్లెటూర్ల లో ఏ కొత్త వ్యక్తీ వచ్చినా వింతగా చూడటము రివాజే.
          “సరోజమ్మ వచ్సిందిరో” ఎవరో అంటున్నారు.
“అయ్య గార్ని వదిలేసిందనుకున్నాము కదా. మళ్ళీ వచ్చిందేమిటి?” మరొకరు అంటున్నారు.
“ఆయనను అంత కష్ట బెట్టి  ఏమి బావుకుంది?” మరొకరు.
ఈ మాటలు అన్నీ సరోజకు వినబడుతూనే ఉన్నాయి. చేతిలో చిన్న సంచితో నేరుగా ఇంటికి వచ్చింది.
ఈ హడావుడి చూచి అందరి కంటే ముందు వాణి పరుగెత్తుకొని వచ్చింది.
“అమ్మా! వచ్చేశావా?” అమ్మను కావిలించుకుంది.
రాము లేచి నిలబడినాడు.
సరోజకు కళ్ళల్లో  నీరు కారి పోతున్నాయి.
“ఇంకా రాము కు తన మీద కోపముగా ఉందా?”
“తను ఏమి చేసిందని తనకు చెప్పకుండా ఎటో వెళ్లి పోయినాడు?”
“ఒక్క సారి డిల్లీ వచ్చి ఉండ వచ్చును కదా.” ఎన్నో ప్రశ్నలు.
“రాణీ ఏదమ్మా!” వాణి  ప్రశ్న.
“బాగున్నావా?” రాము ప్రశ్న.
“చూస్తున్నారు కదా నేను ఎలా యున్నానో?”
“లోపలికి  రావచ్చునా?” ప్రశ్నించింది.
సరోజ కళ్ళలో శక్తి లేదు. కళ్ళు లోపలి పోయి యున్నాయి. ముఖములో కనిపించే నవ్వు కృత్రిమముగా ఉంది. ఇవన్నీ రాముకు అర్థమవుతున్నాయి. అందరూ లోపలిక్ వెళ్ళినారు.
అత్తగారి పటాన్ని చూచి “అత్తయ్యా!” అంటూ మోకాళ్ళ మీద కూల బడి పోయింది.” అవసరానికి లేని ఈ బ్రదుకు ఎందుకండీ?” అంటూ వెక్కివెక్కి ఏడవ సాగింది. తనతో బాటు వాణీ కూడా ఏడుస్తున్నది.
“సరోజా! ఏడవ వద్దు. ఒక్క సారి వాణి ముఖాన్ని చూడు. బిక్క చచ్చి పోయింది.”అంటూ భుజాలు పట్టుకొని లోపలి గది లోనికి తీసుకొని వెళ్ళినాడు.
“ఏమండీ! ఏమయిందండీ? మీరిన్నాళ్ళు ఏమయినారండీ?”
“ఇదంతా ఎలా జరిగిందండీ? ఎటు వంటి సమాచారము మీరు ఇవ్వ లేదు. ఒక్క టెలిగ్రామ్ ఈయ లేక పోయినారా?”
“సరోజా!నీకు రెండు టెలిగ్రాం లు ఇచ్చినాను రెండేసి సార్లు ట్రంక్ కాల్ లు చేసినాను. దేనికీ జవాబు లేదు. నీవు ఒక్క జాబు కూడా వ్రాయ లేదు. డిల్లీలో కాక మరెక్కడ యున్నావో అనుకున్నాను. అయినా ప్రయాణపు బడలిక మీద యున్నావు. ముందు ముఖము కడుక్కొని రా. నెమ్మదిగా మాట్లాడుకుందాము.” రాము నెమ్మదిగా యన్నాడు.
“వద్దండీ! ముందు నన్ను మాట్లాడనీ. నా గుండెల్లో బాధను ముందు దింపేసుకోనీ. అత్తయ్య గారు పోయిన సమాచారము నాకు అందనే లేదు. మీ నుండీ ఏ సమాచారమూ లేదు.” రాము ఎదో చెప్పా బోతుంటే,
“నన్ను మాట్లాడనీయండి. నేను ప్రతి నాల్గు రోజులకొక ఉత్తరము వ్రాసినాను. మీ నుండీ ఏ జవాబు రాలేదు. మీరు ఫోన్  చేసిన విషయము నాకు తెలియదు. అమ్మ చాలా బాధతో యుంది. ఒంట్లో బాగా లేదు. మీ సమాచారము ఏమీ తెలియ లేదు. నేను కారణము ఊహించ లేక పోయినాను. ఒక రోజు నందిని ముందు గది లోనుండి కొన్ని చిత్తూ కాగితాలు తీసుకొని వచ్చి నాకు చూపించింది.”
“అన్నీ ముక్కలుగా ఉన్నాయి. చాలా కష్ట పడి పేర్చుకొని చూస్తే అది మీ ఉత్తరమే. అందులో మీరు ఫోన్ చేసిన విషయము కూడా ఉంది. అంతే కాదు, నానుండి ఒక్క ఉత్తరము కూడా లేదని ఉంది. నేను ఖంగు తిన్నాను. నేను వ్రాసిన ప్రతి ఉత్తరము పోస్ట్ బాక్స్ లో వేయమని అన్నయ్యకు ఇచ్చే దాన్ని. నేను గొడవ పెడితే చెప్పినాడు వాటిని బాక్స్ లో వేయమని రాహుల్ కు ఇచ్చినాడుట. అంత వరకే నాకు తెలుసు. అప్పుడర్థమయింది. నా మీద కోపముతో రాహుల్ వాటిని చింపి వేసి ఉంటాడని. ఇంకా ఫోన్ విషయమై  అన్నయ్యను గదమాయించినాను. ఒక రోజు ఫోన్లు రెండు సార్లు వస్తే రాహుల్ “ఎవరూ లేరని” ఫోన్ పెట్టేసినాదుట. నేను, నందిని ఇంకా రాహుల్ ఇంట్లోకి రావడము కుదరదని గట్టిగా చెప్పినాము.”
“ఈ విషయము తెలిసి మీ దగ్గిరకు రావాలనుకుంటే వెంటనే రిజర్వేషన్  దొరక లేదు. రిజర్వేషన్ లేక పోయినా  బయలు దేరాలనుకుంటే మా అమ్మ ఒప్పుకోలేదు. రిజర్వేషన్ దొరికి  ఊరికి వస్తే ఇల్లు తాళము వేసి ఉంది. ఎవరిని అడిగినా సమాధానము చెప్పా లేదు. అంతే గాక నా మీద వ్యాఖ్యానాలు చేసినారు. అయినా అది కూడా వారి తప్పు కాదు. వారికి మీ మీద యున్న ప్రేమ గౌరవము వలననే అలా చేసినారు. నాకు ఏమి చేయాలో తెలియ లేదు., పూజారి ఇల్లు కూడా తాళము  వేసి యుంది. ఎవరింటికి వెళ్ళాలి తెలియ లేదు. నా స్నేహితులు కూడా నెల్లూరు లో ఎవరూ లేరు. చివరకు జనరల్ కంపార్టుమెంట్లో డిల్లీ చేరినాను. మీరు ఇంటికి వస్తే చూస్తారని పిచ్చి దానిలా ఉత్తరాలు వ్రాసినాను. వేటికీ జవాబు లేదు.”
“ నిజానికి నామీద కోపముతో రాహుల్ చేసిన వెధవ పనుల వలన  మన మధ్య సంబంధము పోయింది. ఆ పాపము తనకూ కొట్టింది. ఒక రోజు అన్నయ్య రాహుల్ స్కూటర్ మీద వెళుతుంటే ప్రమాదము జరిగి రాహుల్ కు రెండు కాళ్ళు తీసి వేసినారు. అన్నయ్యకు ఒక కాలు కుంటిదయింది. వారిద్దరి మధ్య స్నేహము చెడింది. అన్నయ్యకు ఉద్యోగము పోలేదు. కానీ చెడు సహవాసము పోయింది. అప్పటి నుండీ నేరుగా ఇంటికి వస్తున్నాడు. మా వదిన ముఖములో కాస్త సంతోషము విరిసింది.”
“”అమ్మకు మీరు ఎక్కడున్నారో తెలియక రోజూ బాధ పాడేది. ఈ పరిస్థితులలో రాణి కి కూడా చిరాకు ఎక్కువయింది. ప్రతి దానికీ ఇప్పటికీ రుస రుస లాడుతూనే ఉంటుంది.”
“అన్నయ్య వలన నేను నష్ట పోయినాను. అందుకే తనది ఒక్క పైసా కూడా ముట్టుకోవడము నాకు ఇష్టము లేదు. ఇక్కడకు వచ్చి ఉండాలని యుంది. కాని మీ సమాచారము లేదు. అందుకే ధైర్యము చేయ లేక పోయినాను. అందుకే ఒక కార్పోరేట్ విద్యా సంస్థ లో చేరినాను. నేను  రోజూ పోగొట్టుకుంటున్న ఆనందాన్ని ఆ పిల్లల మధ్య వెదుక్కున్నాను. వాళ్లకు ఫిజిక్సు పాఠాలు చెబుతున్నపుడు మీరు నా ముందున్నట్లే ఊహించుకొనే దాన్ని. ఒక్కొక్క సారి వాణిని చూడాలని తీవ్రముగా అనిపించేది. రాత్రి పొద్దు పోయిన తరువాత అత్తయ్యను, మిమ్ములను, వాణిని తలచుకొని ఏడ్చే దాన్ని.”
“ మా విద్యా సంస్థల వాళ్ళు ఒకరిని ఇక్కడికి పంపించాలని అనుకున్నారు. వెంటనే ఆ వూరు నాకు బాగా తెలుసు నేనే వెళ్తానని బ్రదిమాలుకున్నాను. నా అదృష్టము కొద్దీ వారు ఒప్పుకున్నారు. ఇక్కడికి వచ్చే వరకు నా మనస్సు మనస్సులో లేదు. కానీ ఏదో నమ్మకము, మీరే ఆ పని చేస్తున్నారని అనిపించినది.”
ఇంతలో వాణి తీపి పదార్ధమును చేతిలో పట్టుకొని, ”అమ్మా! నీ కోసము నేనే చేశాను. ఎలాగుందో చెప్పమ్మా!” అంటూ వచ్చింది.
దాన్ని తీసుకొని రాముకు, వాణికి పెట్టి తనూ తీసుకొని, ”చాలా బాగుందమ్మా!” అని చెప్పింది. తరువాత రాము జరిగిన విషయాలు తాము తిరిగిన ప్రదేశాలు అన్నీ వివరించి చెప్పినాడు. తిరిగి వచ్చిన తరువాత తను సరోజ డైరీ చూచి, ఆ ప్రేరణ తోనే ఈ పని మొదలు పెట్టినానని చెప్పినాడు.
కొంచము భావావేశాలు  తగ్గిన తరువాత “అన్నయ్య గారూ!”అంటూ లలితమ్మ వచ్చింది.”వదినమ్మా! స్నానాదులు పూర్తీ చేసుకోండి. ఈ పూట  మా ఇంట్లోనే మీ భోజనము.” అని అన్నది.
మధ్యాహ్నము భోజనాలయిన తరువాత  రాము అడిగినాడు,”మళ్ళీ డిల్లీ ప్రయాణము ఎప్పుడో?”
కొంచెము ముఖము తేట పడింది సరోజకు. వెంటనే అంది.” ఎక్కడికి వెళ్ళినా మీతోనే. నేను ఒంటరిగా వెళితే మీరు ఎక్కడ జారి పోతారో?”
రాము అన్నాడు, ”రాణి సంగతి?”
“ఇప్పుడు పరిస్థితి అర్థము కాక రాణిని తీసుకొని వచ్చే ధైర్యము చేయ లేక పోయినాను.  ఇద్దరమూ వెళ్లి రాణిని తీసుకొని వద్దాము.. ఇంకా నేను కూడా మిమ్ములను విడచి డిల్లీలో ఉండ లేను. వెళ్ళగానే రాజీనామా చేస్తాను. అయితే ఒక్క షరతు” ఆగింది.
“ఏమిటి?” అన్నాడు.
“”మా విద్యా సంస్థల వారు మనలను కలిపినారు. మీరు వారి కోసము కొన్ని ఉపన్యాసాలు ఇవ్వాలి.”
“అలాగే! రాణీ వారి ఆజ్ఞ”
    ---------------------------------------------
వాణీ తో కలిసి ఇద్దరూ వెళ్లి నాలుగు రోజులు అక్కడే యున్నారు. సరోజ అన్నయ్య ప్రవర్తన చాలా సౌమ్యముగా మారింది. దానితో ఇంట్లో నందినికి కూడా గౌరవము పెరిగింది.  సరోజ అమ్మగారు కూడా ఈ మార్పులతో చాలా సంతోషముగా యున్నారు. ఇంక నందిని ఆమె చేత చిన్న పని కూడా చేయించుట లేదు.
ఇంతకూ ముందు భర్త ప్రవర్తన వలన సరోజను తన పుట్టింటికి రమ్మని ఎప్పుడూ పిలవ లేదు. మారిన పరిస్థితులలో సరోజను, రామును తన నాన్న ఇంటికి పిలుచుకొని వెళ్ళింది. వృద్దులయిన ఆ తల్లి దండ్రులు ఎంతో సంతోష పడినారు. వారి ఆశీస్సులు తీసుకొని ఇంటికి వచ్చినారు. సరోజ అమ్మను తనతో రమ్మని పిలిచింది. ఆమె,”నందిని కాస్త సంతోషముగా ఉంది. దానికి తోడుగా ఉంటాను. అందరమూ ఒక సారి వస్తాము” అన్నది. తిరిగి, సరోజ తన అన్నయ్యను , నందినిని బాబు తో సహా పైనాం పురము రమ్మని ఆహ్వానించి బయలు దేరింది తమ వెంట వాణి, రాణిలతో.
                   ---------------------------
రాము వేసిన షెడ్ ఒక విద్యా సంస్థ గా మారింది. కొంత మందిని టీచర్లు గా తీసుకున్నా వారి కి శిక్షణ ఇచ్చినారు. విద్య వ్యాపారము కాకుండా భవనాలు, జీతాలకు సరి పోయేంత మాత్రమేమె పిల్లల వద్ద జీతాలుగా తీసుకున్నారు. బాగా పేద వారు, తెలివి, మంచి లక్షణాలు ఉన్న పిల్లలకు మొత్తము జీతము వెనక్కు ఇచ్చేసే వారు. తమ పొలము మీద వచ్చే దానితో మాత్రమె ఇంటిని నడుపుకొనే వారు. తను అనుకున్న విద్యా విధానము అమలు పరిచినందుకు సరోజకు చాలా సంతోషముగా ఉంది.  తాము నిజముగా నేర్చుకుంటున్నామన్న భావన పిల్లలో ఉంది.  

వాణి ఎప్పుడూ హుషారుగా ఉన్నది. రాణి  చాలా మారింది, కానీ అప్పుడప్పుడు తెలియకుండా చిరాకు వచ్చేది. ఇద్దరూ వాళ్ళు పెరిగిన వాతావరణమును అనుసరించి అలా తయారయినారు. మరో రెండేళ్లకు రాముకు ఒక కొడుకు  పుట్టినాడు. మామయ్యా గారే పుట్టినారని సరోజ సంతోష పడింది. ఇంకా వాణి, రాణి లు ఆ తాతయ్య అంటూ వాడిని వదలి పెట్టడము లేదు.
ఒక ప్రణాళిక భూమిపై విరిసింది. కాలము మాత్రము నడిచి పోతూనే ఉంది.
                                                 తథాస్తు.



Monday, April 10, 2017

ప్రస్థానము 3

                                            



గోపీ లేదా గోపాల కృష్ణ ఇండియా కు తిరిగి వచ్చినాడు, తన మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ కి  బిజినెస్స్ మేనేజ్మెంట్ ను జోడించుకొని.   శాస్త్ర  సాంకేతిక అవగాహన తో బాటు  సాంస్కృతిక అవగాహన పెంచుకున్నాడు.  రాగానే అంతర్జాలములో తన వివరాలను పెట్టినాడు. కొద్ది రోజులలోనే బెంగుళూర్  నగరములో నొక ప్రముఖ ఇంజనీరింగ్  సంస్థ లో  వ్యాపార సలహాదారు(బిజినెస్స్ కన్సల్టంట్) గా చేరినాడు.
ఒక సారి తిరుపతి లో తమ ఇంటిలో పాత పుస్తకాలన్నీ కలియ బెడుతుంటే అందు లో కొన్ని పాత దైనందినులు (డైరీలు) కనిపించినాయి. అన్నీ తన తాత  రాం గోపాల్ వ్రాసినవి. ఇప్పుడు ఆయన లేరు. కానీ ఆయన ఆలోచనల స్వరూపము తెలుసుకోవాలంటే ఇవి ఒక ఆధారము. వాటిలో ప్రతి చోటా మనుషుల  ఆలోచనలలో వస్తున్న మార్పులు, పెరుగుతున్న స్వార్థము, తను ఎదగాలన్న కోర్కెతో  సమాజానికి ఎంత హాని చేస్తున్నాడు, ఈ విషయాలే వివరణలతో ఉన్నవి. అది ఆయనకు సంబంధించిన దైనందిని లా కనిపించ లేదు. మనుషులలో ఆలోచనలను రేకెత్తించే వ్యాసాల సంపుటి వాలే కనిపించినది. వాటిని హడావిడిగా చదవ లేము. రోజూ కాస్త నెమ్మదిగా చదవాలి. తండ్రి అనుమతితో అన్నీ తన వెంట బెంగుళూర్ తీసుకొని వెళ్ళినాడు.
పారిశ్రామిక సంస్థలలో పని చేసే ఇంజనీర్లు అప్పుడపుడు తన దగ్గిరకు వచ్చే వారు. వారి సమస్యలను వివరముగా చర్చించే వారు.వారి అవసరాలను బట్టి తను సలహా ఇచ్చే వాడు. అందుకవసరమయిన సమాచారము అంతటినీ అందించే వాడు. ఇందుకు కొంత రుసుమును(కన్సల్టేషన్ ఫీజ్ )  తీసుకొనే వారు.  ఈ చర్చలలో వారి ఆలోచన స్థాయి,  సామాజిక విషయములలో వాలకున్న నైతిక విలువలు ఇటువంటివి అన్నీ స్పష్టము గా తెలిసేవి.
కొంత మంది వచ్చే వారు,వారికి కావలసినది, తాము తయారు చేసే వస్తువు మన్నిక కలిగి ఉండాలి,ఖర్చు చాలా తక్కువ ఉండాలి, అందుకు మూడు సరుకును మార్చ వలెనా? యంత్రము యొక్క సామర్థ్యము పెంచాలంటే ఇంకేమి జాగ్రత్తలు తీసుకోవాలి? తమ వస్తువులను కొనే వారి యొక్క సంతృప్తిని ఎలా పెంచాలి? ఇవన్నీ న్యాయ బద్ధమయిన ఆలోచనలు. ఈ విధముగా చర్చించుటలో తనకు ఏంతో సంతృప్తి, సంతోషము కలిగేది. అయితే  ఇటువంటి వారి సమాఖ్య చాలా తక్కువగా ఉండేది.
ఎక్కువ మంది దృష్టి  సంపాదించే లాభాల మీదనే ఉండేది.  ఇలా చేస్తే లాభాలు పెరుగుతాయి కదా అని అడిగే వారు. అది తన సలహా తీసుకొన్నట్లు కాకుండా తనకు సలహా ఇచ్చినట్లు ఉండేది. పరిశ్రమలలో వచ్చిన మురికిని ప్రక్కన కాలువలలో కలుప వచ్చును కదా  అని అడిగిన వారికి ఏమి జవాబు ఇవ్వాలో తెలిసేది కాదు. దానిని తిరిగి శుద్ధి చేయడము, ఎలా చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది, మొత్తము వివరాలను చెప్పే వాడు. కానీ, వారి మాటలలో తనకు తెలిసేది. బహుశా వారు ఖర్చులు తగ్గించుకొనుటకు లాభాలు పెంచుకోనుటకు ఆ పని చేయరని.
సిమెంటు పరిశ్రమలలో , థర్మల్  విద్యుత్ కేంద్రాలలో బూడిద  తో బాటు అతి సూక్ష్మ స్థాయి లో యున్న దుమ్ము కణాలు వస్తాయి. ఇవి మామూలు పద్ధతులలో బూడిద లోనికి వెళ్ళకుండా గాలిలో కలుస్తుంది. ఇది చుట్టు ప్రక్కల వారు పీల్చే గాలితో కలిసి, కొద్ది కాలములోనే చుట్టూ ప్రక్కల వారిలో ఊపిరి తిత్తుల వ్యాధికి కారణము అవుతుంది. ఈ కణాలను గాలికి వెళ్ళనీయకుండా ఎత్తైన గొట్టాల ద్వారా పైకి పంపిస్తూ స్థిర విద్యుదయస్కాంత శక్తి ద్వారా నెలలో కలిసి పోయేటట్లు చేయ వచ్చును. కానీ ఇందుకు పెట్టుబడి పెట్టాలి.
ప్రతి సమస్యకూ ఒక పరిష్కారము ఉంటుంది. కాని దానికి అయ్యే ఖర్చు లాభాలను బాగా తగ్గించి వేస్తుంది. ఈ విధముగా పరిశ్రమలనుంచి వచ్చే పర్యావరణ కాలుష్యాన్ని నివారించుట జరుగుట లేదు.
  అంతే కాదు, తమ తయారీ వస్తువు యొక్క సామర్థ్యము పెంచి అమ్మాలి అనే కంటే ఎదో విధముగా ప్రజలను మభ్య పెట్టి వారి చేత కొనిపించాలనేది లక్ష్యముగా ఉంది.
సోనీ కంపెనీ స్థాపకుడి ఆత్మ కథలో ఒక విషయముంది. తమ తయారీ లో ఒక్క పరికరములో దోషము కనిపించేసరికి, దానితో తయారయిన అన్ని పరికరాలన్నీ చెత్తలో వేయించేశారు. ఎందుకంటే సోనీ పరికరాలలో దోషము ఉండదనే నమ్మకము పోగూడదు.
మన దేశములో మొట్ట మొదట స్టీలు పరిశ్రమతో బాటు ఇతర పరిశ్రమలు స్థాపించిన వారు టాటాలు. జమ్షెడ్జీ టాటా వారిలో ప్రముఖుడు. వారి పరంపరలో ఒకడైన జే ఆర్ డి  టాటా ఒక ప్రముఖ విద్యా సంస్థలో ఉపన్యాసము ఇచ్చినపుడు, ఒక విద్యార్థి అడిగినాడు,” మన దేశములో మంచి క్వాలిటీ వస్తువులు ఎందుకు రావటము లేదు?” అని. అందుకు ఆయన ఇచ్చిన జవాబు,”నిర్మాణము పరిపూర్ణతను అందుకోనుటకు ఎవరికీ ఇష్టము లేదు. అది పని చేస్తుంది. అంతే చాలు.”(It is enough, it works, that’s all.. It is their motto)
వేయి సంవత్సరాల తరువాత కూడా తుప్పు పట్టని ఇనుమును  తయారు చేసిన భారతీయుల లోనా, ఇంత మార్పు. గోపీ లో ఆలోచనలు చేల రేగినాయి.
ఇంట్లో ఏదయినా పరికరము పాడయితే , దానిని సరి చేసుకొని వాడటమే తప్ప , తొందర పడి మరొకటి కొనే వారు కాదుట. నాన్న చెప్పే వారు. కానీ, విదేశీ మార్కెట్ల  ప్రభావము గ్లామర్/ఆకర్షణ  ఎంత వచ్చిందంటే , అవసరము లేకున్నా కొనే సంస్కృతి వచ్చి పర్యావరణానికి ముప్పు తెచ్చింది. డబ్బు చేతిలో ఉంటె ప్రతి యొక్క మాడల్ తప్పకుండా ఇంట్లోకి రావలసిందే.
 ఈ ఆలోచనల పరంపరలోనే రామ్ గోపాల్ తాత గారి దైనందినులను చదవడము మొదలు పెట్టినాడు. ఆయనకు చిన్నప్పుడు పైనాంపురము ఎలా ఉండేదో,  క్రమముగా ఎటువంటి మార్పులు వచ్చినాయో  అందులో వివరముగా ఉన్నాయి. ఆయన విశ్లేషణ కూడా అద్భుతముగా ఉంది.
అనంత పురము పైనాంపురము జంట గ్రామాలు. విశేషము ఏమిటంటే అనంతపురము తోటపల్లి గూడూరు మండలానికి పైనాంపురము ముత్తుకూరు మండలానికి సంబంధించినవి. ఈ ఊళ్లకు సముద్రము ఒక మైలు దూరములో
ఉంటుంది. అంటే సుమారుగా ౧.౬ కిలో మీటర్ దూరములో ఉంటుంది. అందుకే సముద్రము హోరు మీడున్నపుడు శబ్దము ఇక్కడికి వినిపిస్తుంది. ఈ  ఊర్లది పూర్తగా ఇసుక నేల. గాలి కొట్టిందంటే ఇసుక అంతా ఇంట్లోనే ఉంటుంది. అంతే కాదు, ఆ ఇసుక మీద పొరలినా ఏ మాత్రమూ అంటుకోదు. విదిలిస్తే పది పోతుంది.  అనంత పురము తరువాత  కుమ్మర పాలెము, ఆ పైన వరకవి పురము అనే గ్రామాలున్నవి. వరకవిపురములో వేయి యకరముల విస్తీర్ణము గల నీటి చెరువు ఉన్నది. చుట్టూ పక్కల గ్రామాల పంటలకు అదే ఆధారము. నెల్లూరు ప్రక్కన ప్రవహించే పినాకినీ నదికి శ్రీ రంగ నాయకుల గుడి సమీపములో ఒక అడ్డు కట్ట ఉంది.  దానిని ఎవరు నిర్మించినారో నెల్లూరు వారు మరిచి పోయినారు. నెల్లూరు కోవూరు ల మధ్య ఉన్న వంతెనను కాటన్ దొర కట్టించినారని ఉంది. గోదావరికి ధవళేశ్వరము వద్ద బారేజి కట్టించిన కాటన్ దొర బహుశా ఈ ఆనకట్టను(బారేజి)ను కూడా కట్టించి ఉండ వచ్చును. అక్కడనుండి నీరు వేరు వేరు చెరువులకు అందుతుంది. అందులో వరకవిపురము చెరువు కూడా ఒకటి.
          వరకవిపురము నుండి నీరు వచ్చే వాగుకు పంజల మడుగు అనే వారు. అది ఊరికి ఉత్తర దిశలో ప్రవహించి బకింగ్హాం కాలువలో కలుస్తుంది. కాకినాడ నుండి  చెన్న పట్నము(ఈ పేరు తరువాత మద్రాసు గాను తిరిగి చెన్నై గానూ మారింది.) వరకు వస్తువులను నీటి మార్గము ద్వారా తీసుకొని వచ్చుటకు తీరము వెంబడి సముద్రమునకు ఒక మైలు దూరములో  బకింగ్  హం అనబడే బ్రిటిషు అధికారి దీనిని తవ్వించినాడుట. అది ఊరికి తూర్పు వైపున ఉంది. ఈ కాలువను అక్కడక్కడ కాలువల ద్వారా సముద్రపు నీటితో  కలిపి సంవత్సరము పొడుగునా అందులో నీరు ఉండేట్లు చూచినారు. పెట్రోలు వాడకము తక్కువగా ఉన్న ఆ రోజులలో అక్కడ నుండి చెన్న పట్ణానికి ధాన్యము పడవల ద్వారా వెళ్ళేది. సమయము ఎక్కువయినా చాలా తక్కువ ఖర్చు అయేది. పర్యావరణ పరముగా కూడా అది సురక్షితము.
          బకింగ్ హాం కాలువ దాటితే వాగర్త గ్రామము వస్తుంది. పంజల మడుగు  బకింగ్ హాం కాలువల మధ్య అనంతపురము పైనాంపురము గ్రామాలు ఇమిడి ఉన్నవి. మధ్యలో కొన్ని పంట పొలాలు, పొలాలకు పడమరగా ఇసుక నేల ఇంకా పడమరగా ఇళ్ళు వస్తాయి.
          తాతగారికి ముందే అక్కడ వ్యావసాయిక వ్యవస్థ ఏర్పడి యున్నది. పొలాలలో వారి పంట వేసే వారు. ఆ రోజులలో ప్రకృతి లో ఆటు పోట్లను ఎదుర్కొన్న వారి వంగడాలు, తెల్ల కేసర్లు, ఎర్ర కేసర్లు, మరియు మొలగోలకులు అనే పంటలను వేసే వారు. కేసర్లు గింజ చాలా లావుగా ఉండేది. అందులో ఎర్ర కేసార్లు పంటను శ్రామికులు ఎక్కువగా తినే వారు. దాని రుచే వేరుగా ఉండేది. మధ్య రకం కుటుంబీకులు ఎక్కువగా తెల్ల కేసర్లు మొలగొలకులు తినేవారు. పై స్థాయి వారు మొలగొలకులు మాత్రమె తినే వారు. వీటి రుచి చాలా ప్రసిద్ధి గాంచినది. వీటిని రాజనాలు అని కూడా అనే వారు. వీటి వలననే నెల్లూరు జిల్లా బియ్యానికి పేరు వచ్చినది. ఇవి అన్నీ ప్రకృతి యొక్క పరిశోధనలో వచ్చిన పంటలు. అందుకే వాటి మీద పురుగుల దాడి కూడా ఉండేది కాదు. పురుగు మందుల అవసరము వచ్చేది కాదు.
          రైతులకు పొలాలు కాకుండా అవసరమయినవి పశు సంపద. ఆవులకు కోఠాలు ఉండేవి. పగలంతా అవి బయటికి మేతకు వెళ్ళేవి. రాత్రి వాటికి ఆ కొఠాలలో విశ్రాంతి. అక్కడే ఎందు గడ్డి పడేసే వారు. అవి తినగా నలిగినా మిగిలిన గడ్డి వాటి పేడ మూత్రముతో కలిసి ఎరువుగా తయారు అయేది అదే ఆ నాడు పొలాలకు ఎరువు.
          వాళ్లకు బాగా పండిన పొలాలలో వారి గింజలను బాగా ఎండ బెట్టి మూటలు కట్టి పెట్టె వారు. వాటినే తరువాత పంటకు ఎరువులుగా వాడే వారు. వారి ఇంకా పదిహేను రోజులలో కోతకు వస్తుందనగా పెసల మూటలు తడిపి మోము రాగానే  ఆ పొలాలలో చాల్లే వారు. వరి కోతలు అయిన తరువాత పెసలు పెరిగేది. కాయలు వచ్చి ఎండిన తరువాత కోసి నూర్చే వారు. ఇది అదనముగా వచ్చే లాభము. తిరిగి ఈ పెసలనే విత్తనాలుగా వాడే వారు. ఇందులో వచ్చిన చెత్త ఎద్దులకు  మేతగా ఉపయోగ పడేది. అంతే గాక ఎద్దులకు మాత్రమె పిల్లి పెసర (శతావరి) పంటను వేసే వారు. ఈ విధముగా తమ ఆహారముతో బాటు పశువులకు మంచి పోషణ ఇచ్చే ఆహారమును అందించే వారు.
          మెట్ట ప్రాంతములలో వంగ, మిరప, రామ మునగ(టమాటో) లాంటి పంటలు, కూర గాయాలు  వేసే వారు. ఆ రోజులలో మిరప తప్ప మిగిలిన కూర గాయలతో పెద్ద కుటుంబాల వారు వ్యాపారము చేసే వారు కాదు. ఎవరడిగినా కూర గాయలను ఊరికే ఇచ్చే వారు. ఇంకా ఆవు దూడలను ఎంత ప్రేమగా చూచే వారంటే, పేరుతొ పిలిస్తే అవి పరుగెత్తుకొని వచ్చేవి. అది ఆనాటి మనుషులకు పశువులకు ఉన్న అనుబంధము.
          అప్పుడప్పుడు నేలలో సత్తువ పెరగడానికి నీలి, జనుము, వెంపల వంటి విత్తనాలు చల్లి మొక్కలు ఎదిగిన తరువాత  వాటిని దున్నించే వారు. అవి మట్టితో కలిసి పోయేవి. ఈ రకముగా నేల సత్తువ పెంచి ఎక్కువ పంటలు పండించే వారు. అంతే గాని వారికి ఆనాడు రసాయనిక ఎరువుల అవసరము కనిపించేది కాదు.
తన దైనందినిలో ఒక చోట వ్రాసినారు.
          “ఇవన్నీ వ్రాయ వలసిన అవసరముందా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. కానీ, వస్తున్న మార్పులు, వాటి వలన వచ్చిన ఆలోచనలలో మార్పులు చూస్తుంటే, గతములో ఒకప్పుడు ఇలాగుండేది అని చెప్పే వారు కూడా ఉండరేమో అని అనిపిస్తుంది. ప్రకృతికి మనిషికి గతములో ఉండేది అనుబంధము, ఇప్పుడుండేది వ్యాపార బంధము. తిరిగి, తిరిగి, మనిషి ఎక్కడికి వేల్లుతున్నాడో తెలియటము లేదు. మనిషికి  నేలకు, మనిషికి పశువుకు  ఉన్న ప్రేమ  అనుబంధాలు కరిగి పోతున్నాయి.” ఈ విషయములో చిదానంద భారతి చెప్పిన విషయాలు గుర్తుకు వచ్చినాయి.
          సంక్రాంతికి ఇంటికి పంటలు ఇంటికి వచ్చేవి. అదే సమయాన కూర గాయాలు కూడా బాగా పండేవి. సూర్యుడు మకర రాశికి చేరే ఆ కాలములో ఎవ్వరూ నిరాహారముగా ఉండ కూడదు అన్న భావన కొన్ని అలవాట్లకు దారి తీసింది. సంక్రాంతికి ముందు రోజు పాత వస్తువులను తగల పెట్టే వారు. దీనినే భోగి అనే వారు. సంక్రాంతి నాడు పితృ దేవతలకు తర్పణాలతో బాటు ఇంట్లో పిండి వంటలు చేసే వారు. ఆ మరునాడు పశువులను అందముగా అలంకరించి వాటికి ప్రత్యేకముగా ఆహారము పెట్టె వారు. దీనిని పశువుల పండగ అనే వారు. ఈ మూడు రోజులు  వాకిట్లో బియ్యపు బస్తా పెట్టి, ఇంట్లో చిన్న పిల్లలకు ఒక బాధ్యతా అప్ప చెప్పే వారు. వచ్చిన ప్రతి యొక్కరికి ఒక చిన్న పాత్రతో బియ్యము పోయదము పిల్లల పని. రోజూ వందల మంది వచ్చే వారు. ఈ ఒక్క పని సమాజములో ఒక బాధ్యతను గుర్తు చేసేది. అంతే గాక చిన్న పిల్లలకు దానము చేసే అలవాటు వచ్చేది. ఈ విధముగా ఇంకో తరము తయారు అయేది.

          ఆ సమయములోనే ఊళ్ళో ఆసక్తి ఉన్న వాళ్ళు వీధి నాటకాలు వేసే వారు. అర్థ రాత్రికి ముందు మొదలయి సూర్యోదయము వరకు జరిగేవి. ఇటువంటి రోజులు చెదిరి పోతున్నాయి మళ్ళీ వస్తాయో లేదో? ఇదే పెద్ద ప్రశ్న.
(To be continued )

రెండు చిలుకలు 5


తిరిగి వచ్చిన తరువాత వారి వారి పనులలో నిమగ్నమయినారు. సరోజ పాత శాలలలో చదువు చెప్పే పధ్ధతి కొంచెము బాధను కలిగించింది. ఇందులో తను ఏమయినా చేయ గలనా అని ఆలోచించేది. తను చదువుకున్నపుడు కూడా ఇదే పరిస్థితి. చదువు అంతా యాంత్రికముగా నడిచింది.  ఇది మంచి, ఇది చెడు అని చెప్పే చదువులు కావు. అంతా పోటీ. అనుక్షణము ఎలా చదివితే ఎక్కువ మార్కులు వస్తాయి? ఎలా మొదటి స్థానములో ఉండాలి? ఇదే ప్రధానమయిన లక్ష్యము. అనుక్షణము మనస్సులో ఉండేదొకటే. పోటీ... పోటీ.... పోటీ.... “స్పర్థయా విందతే  విద్య” అని యన్నారు. అప్పుడు ఉద్దేశ్యము ఒకటయితే  ఇప్పుడది పూర్తిగా మారి పోయింది.  మామయ్యా గారి దగ్గర తెలుగు శతక వాఙ్మమయము గూర్చి తెలుసుకొంది. మనిషి ఎలా నడచుకోవాలన్నది సుమతి శతకము, కాస్త సామర్థ్యము ఉంటె భర్తృహరి  నీటి శతకము, లోక ప్రవృత్తికి భాస్కర శతకము, నృసింహ శతకము, ఇంత వైవిధ్యము తను హిందీ లో చదువుకున్నట్లు గుర్తు లేదు. అందుకు కారణము కూడా ఉంది. ఆ నాడు తనకు మార్కులు తెచ్చు కావాలన్న ధ్యాస తప్ప అతము చేసు కావాలన్న మానసిక స్థితి లేదు.
అంతే కాదు, ఛందస్సు తో కూడిన పద్యాలలో అంతరంగముగా సంగీతము వినిపించేది. ఇంకా పాట పాడుకోవడానికి , పద్యము చదువుకోవడానికి తేడా కనిపించేది కాదు. ఒక రిక్షా లాగే వ్యక్తీ నోట్లో కూడా  కృష్ణ రాయ భారము లేదా పోతన భాగవతము పద్యాలు వినిపించేవి. తను నెల్లూరు లో ఇవన్నీ గమనించినది.
వరి కోతలయిన తరువాత  దక్ష యజ్ఞము, భక్త ప్రహ్లాద నాటకాలను వేసే వారు. రాత్రంతా మేలుకొని జనము వీటిని చూచే వారు.
క్రమముగా  రాజకీయ నాయకుల వోట్ల వ్యాపారము  కొత్త పుంతలు దోక్కినది. తను అధికారములో ఉండాలంటే దేనినైనా అమ్ముకోవచ్చును, అనే ప్రవృత్తి విద్య విధానము మీద పడింది. ఒక నీతి కథ చెబితే మత ప్రచారము చేస్తున్నారనే ప్రబుద్ధులు తయారయినారు. ఇందులో భాగముగా ప్రైవేటు విద్య సంస్థలు పుట్టుకొని వచ్చినాయి. వాటికి పిల్లలకు చదువు చెప్పడము కంటే వారి తల్లి దండ్రులను ఆకట్టు కోవడము ఎక్కువయింది. నీతి, నడవడిక లను బోధించే పాఠ్యాంశాలు  క్రమముగా తగ్గి పోయినాయి.
తను చదువుకోక పోయినా వాణి చేత సుమతి శతక పద్యాలు చదివించేది. ఎప్పుడూ చిరాకు పడకుండా బుజ్జగించేది. ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క  నీతి కథ చెప్పేది. వాణి కథ కోసము పద్యమును కంఠస్ఠము చేసేది.
తను లలితా సహస్ర నామము చదువుతుంటే శ్రద్ధగా వినేది. ఎంత శ్రద్ధగా వినేదంటే తను ఎక్కడయినా తడబడితే అందించేది. ఊళ్ళో బడికి పంపిస్తున్నా ఇంట్లో తన శిక్షణ లోనే ఉండేది.
రామును అడిగేది, “మన విద్యా విధానములో మార్పులు ఎటు దారి తీస్తున్నాయి?” యని.
“మనమే ముందు వెళ్ళాలేమో యనేది. తను చదివిన పి జి ఫిజిక్స్ తనకు ఒక అవగాహనను కల్గించింది. ఆ శిక్షణతో ఏ పాఠ్యాంశమును అయినా అర్థము చేసుకోవచ్చును. క్రమ క్రమముగా తన పిల్లల కోసము తను ప్రణాలికలు వేయాలనుకుంది.  కానీ,,”ఎలా మొదలు పెట్టాలి?” అంతే కాదు తన పిల్లల కున్న అవకాశము చుట్టూ ప్రక్కల ఉన్న ప్రతి వారికి రావాలి. ఇదే ఆలోచన. అప్పుడప్పుడు రాముతో బాటు నెల్లూరు వెళ్లి పాత పుస్తకాల షాపులలో పాత పాఠ్య పుస్తకాలను చూచేది. అప్పుడు మరొక విషయము కొట్టొచ్చినట్లు కనిపించినది. ఇరువది ఏళ్ల క్రిందట పిల్లలకు ఎలా సులభముగా అర్థమవుతాయా అనే ఉద్దేశ్యముతో పుస్తకాలు వ్రాయ బడినాయి. ఇప్పుడు ఎంత మార్పు వచ్చిందంటే “ఎలా వ్రాస్తే , పరీక్షలలో ప్రశ్నలకు జవాబులు వ్రాస్తారు?”అనే ధోరణి వచ్చింది. రసము పోయింది, పిప్పి మిగిలింది.
రోజూ రామూ తో ఇవన్నీ చర్చించేది. విసుగు పడకుండా వినే వాడు. మెచ్చుకోలుగా చూచే వాడు. అంతకు మించి సూచనలు ఏమీ రాలేదు.
ఇలా కాదని తను ఒక ప్రణాలికను ఏర్పరచుకొని ఆ పద్ధతిలో వ్రాయడము మొదలు పెట్టింది. అప్పుడప్పుడు, రాము వాటిని చూచి,”మంచి పనిని చేస్తున్నావు.” అని యంటే  చాలా సంతోషము వేసేది. ఇంకా ముందుకు వెళ్ళాలి.
ఇద్దరు పిల్లలను గూర్చి తనే పట్టించుకోనేది. అత్తగారితో పగలు చాలా సమయము గడిపేది. పూల మొక్కలను వేసేది. తన లక్ష్యమంతా ఒక్కటే, అందరూ సంతోషముగా ఉండాలి. ప్రతి సెకనునును ఒడిసి పట్టుకోవాలి. అలసట తన దగ్గిరకు రాకుండా చూచుకొనేది.
        ----------------------------------------
అప్పుడప్పుడు తల్లినుండి ఉత్తరాలు వచ్చేవి. అందులోనే నందిని కూడా  తన పిల్లాడి కబుర్లు వ్రాసేది. నందిని ఎప్పుడూ హిందీ లోనే వ్రాసేది.
ఒక సారి నందిని”భాభీ!(వదినా) అత్తయ్య బాగా నీరస పడింది. నిన్నే అనుకుంటున్నాది. తను ప్రయాణము చేయ లేనంటున్నది. నీవు ఇక్కడికి రావడము మాత్రము ఇష్టము లేదు.” అంటూ పెద్ద ఉత్తరము వ్రాసింది.
తనకు అమ్మ మీద దిగులు  మొదలయింది. తన కోసము ఎంత కష్ట బడిందో? ఇప్పుడు ఎలాగుందో? మరొక వైపు అక్కడికి వెల్లడము ఇష్టము లేదు. అమ్మనే ఇక్కడికి తీసుక వస్తే బాగుంటందని అనిపించింది. ఒక సారి రాముతో ఇదే మాట యన్నది. “ అమ్మ కూడా సంతోష పడుతుంది. ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు.” అన్నాడు. నందినికి ఇదే మాట ఉత్తరములో వ్రాసింది. ఈ లోపలే  టెలిగ్రామ్  వచ్చింది.”మథర్ సీరియస్”.అని. ఇంకా సరోజ మనస్సు మనస్సు లో లేదు.
అప్పుడు శ్యామలమ్మకు కాస్త నలతగా ఉంది. అయినా సరోజను దింపి రమ్మని రాము కు చెప్పింది. రాము తనకు తిరిగి రాను రిజర్వేషన్ కూడా చేసుకున్నాడు. పక్క ఇంటి వారితో తల్లిని గమనిస్తూ ఉండమని చెప్పి ఇద్దరూ బయలు దేరినారు. సరోజను డిల్లీలో దింపి తను తిరిగి వచ్చేసినాడు. రాణి అమ్మ తోనే ఉంటానన్నది.  తిరిగి వచ్చేటప్పుడు వాణిని తనతోనే తీసుకొని వచ్చినాడు.
వారము రోజులయినా శ్యామలమ్మ్కు వంట్లో నలత తగ్గ లేదు. ఎంతో మంది వైద్యులకు చూపించినాడు. రోజు రోజుకు ఆమె ఆరోగ్యము క్షీణిస్తున్నది. కాలేజికి సెలవు పెట్టి ఇంట్లోనే యున్నాడు. వాణి వలన కొంత కాలక్షేపము అవుతున్నది. నిద్రను కూడా తగ్గించి తల్లి సేవ లోనే యున్నాడు. ఇప్పుడు సరోజ లేని లోటు కనిపిస్తున్నది. అంతా తన భుజాల మీదనే పెట్టుకొని ఎట్లో అన్నీ చూస్తున్నాడు.
తల్లి  మగత లోనికి వెళ్ళింది. ప్రక్క వాళ్ళను కాస్త గమనిస్తూ ఉండమని చెప్పి, నెల్లూరు వెళ్లి సరోజ ఇంటికి ట్రంక్ కాల్ చేసినాడు. గంట తరువాత ఫోన్ మోగింది. ఎవరో ఫోన్ ఎత్తి ఏమీ తెలియనట్లు మాట్లాడినాడు. మళ్ళీ ప్రయత్నమూ  చేసినాడు.”సరోజా,  ఆ పేరుతొ ఎవరూ లేరు” అని హిందీ లో చెప్పి పెట్టివేసినాడు. వెంటనే సరోజ పేరున ఉత్తరము వ్రాసి పోస్టులో వేసి, మళ్ళీ టెలిగ్రం ఇచ్చి ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చేసరికి తల్లి గతించింది. ఆఖరు క్షణాల్లో తను కూడా లేదు. రాముకు నిజముగా పిచ్చి ఎక్కినట్లయింది. కూతురు వాణికి పది ఏండ్లు. భార్య కూడా పక్కన లేదు. దగ్గిర బంధువులు ఎవరూ ఊళ్ళో లేరు. ఒక పూజారి కుటుంబము మాత్రము తనకు అండ గా ఉంది.
అత్తగారు పొతే కోడలు లేదని ఊళ్ళో అంతా నోరు నొక్కు కున్నారు. తనకు  దుఃఖము ఆగుట లేదు. వాణి ని పూజారింట్లో ఉంచి కర్మ కాండ పూర్తీ చేసినాడు . సరోజ రానే లేదు. తను తిరిగి వచ్చిన తరువాత ఒక్క ఉత్తరము కూడా లేదు.”సరోజకు ఏమయింది? ఇక్కడకు రావాలని అనిపించ లేదా?” బాధ పడినాడు. కార్యక్రమాలు అయిన తరువాత మళ్ళీ నెల్లూరు వెళ్లి ట్రంక్ కాల్ చేసినాడు. సమాధానము మళ్ళీ అదే. ఎవరో ఎత్తినారు. తనకు సంబంధము లేనట్లు ఏదో హిందీ లో చెప్పినాడు.
తనే డిల్లీ కి పోదామని అనుకున్నాడు. కానీ, వారి నుండీ ఎటువంటి సమాచారము లేకుండా, వారు రాకుండా తను వెళ్ళడము ఉచితము కాదని అనిపించినది. కూతురు కోసము కాలేజి ఉద్యోగమూ మాని వేసినాడు. చివరకు ఇంటికి తాళాలు వేసి, పక్క ఇంటి వారికి చెప్పి తను వాణి బయలు దేరినారు.
నేరుగా కన్యా కుమారి వెళ్ళినాడు. లోక కంటకుడయిన బాణుడిని చంపుటకు శాశ్వతముగా భర్తకు దూరమయిన తల్లి కన్యా కుమారి. ఆమెకు సంబంధించిన సుచీంద్రమును దర్శించినాడు. ప్రతి క్షణము ప్రతి విషయము వాణికి వివరించి చెప్పినాడు.  అక్కడ నుండి తిరువనంతపురము  వెళ్లి  మూడు గదులకు విస్తరించి యున్న అనంత పద్మ నాభ స్వామిని దర్శించుకున్నాడు. అక్కడ నుండి ఆయనకు లీలగా ఒక దృశ్యము కనిపిస్తున్నది. ఎక్కడికి వెళ్ళినా విపరీతమయిన వేదనతో సరోజ కనిపించేది. “సరోజకు ఏమయిందో?” అనిపించినది. కాని, నాన్న గారు చెప్పిన మాట జొన్న వాడలో ఒక సాధువు చెప్పిన మాట గుర్తుకు వచ్చినాయి. ఏదో ఒక తీవ్రమయిన కర్మ ఇది. అనుభవించక తప్పదు అనుకున్నాడు. చెంగన్నూర్ వెళ్లి జగన్మాత రాజ రాజేశ్వరిని  దర్శించుకున్నాడు. సరోజ రోజూ ఆరాధించే ఆమెకు మనస్సుతో నమస్కారము చేసుకున్నాడు. అక్కడ నుండి వెనక్కు తిరిగి రామేశ్వరము వచ్చినాడు. శ్రీ రామ చంద్రుడు  రావణ వధ తరువాత తిరిగి వచ్చిన చోటు. అక్కడ సముద్రము పై కట్టిన పంబన్ వంతెన అద్భుత మైనది.
సముద్రములో పడవ షికారు చేసినారు. లంగరు వేసిన పడవ ఊగుతుంటే  నిముషానికి ఎన్ని సార్లు ఊగుతుందో గమనించినాడు. అది నిముషానికి పదునారు సార్లు. మన శ్వాస కూడా నిముషానికి పదునారు సార్లు. దీనినే టెస్లా షూమను పౌనః పున్యమని అన్నారు.
అక్కడ నుండి మధుర చేరినారు. భర్తను విడి పోయిన పార్వతీ మాత పాండ్య రాజ కుమార్తె గా జన్మించి  శివుడిని వివాహమాడిన చోటు. శ్రీ మన్నారాయణుడు దగ్గిర ఉండి ఈ వివాహమును జరిపించినాడుట. ఆమె పాండ్య రాజుల ఆరాధ్య దైవము. వేగవతీ నది ఒడ్డున పాండ్య రాజులు కట్టించిన మీనాక్షి మందిరపు వైభవమునకు దేవతలే ఆశ్చర్య పోతారుట.
అక్కడనుండి  చోళ రాజుల రాజధాని తంజావూరు చేరినారు. అది శ్రీ రాజ రాజ చోళుడి యొక్క రాజ దాని. ఆయన నిర్మించిన బృహదీశ్వర ఆలయము గత వేయి సంవత్సరాలుగా చెక్కు చెదర కుండా ఉన్నది. ఆయన సోదరి రాజమహేంద్ర వరాన్ని పాలించిన రాజ రాజ నరేంద్రుడి తల్లి. ఆయన కుమార్తె రాజ రాజ నరేంద్రుడి ధర్మ పత్ని. మహా భారతపు తెలుగు అనువాదానికి విశేష ప్రేరణ ఇచ్చిన మహా మనీషి ఆవిడ.  ఇంకా రాజ రాజ నరేంద్రుడు నిర్మించిన బృహదీశ్వర ఆలయ శిఖరము ఒకే శిల మీద చెక్క బడినది. శిఖరము నీడ ఎక్కడా నేల మీద పడదు. ఈ ఆలయ నిర్మాణము ఒక గొప్ప నిర్మాణ విశేషముగా భావిస్తారు.
అక్కడ నుండి జంబుకేశ్వరము, శ్రీ రంగమును దర్శించినారు.పంచ భూత లింగాలలో జంబుకేశ్వరము ఒకటి. ఈ లింగము ఎప్పుడూ నీటితో తడిసి ఉంటుంది. ఇంకా శ్రీ రంగ నాథుడు రఘు వంశీకులకే కాకుండా విభీషణుడికి కూడా ఆరాధ్య దైవము. ఇంకా పంచ భూత లింగాలలో ఒకటైన ఆకాశ  లింగము చిదంబరములో ఉంది. మధ్యలో ఉన్న కుంభకోణము లో ఉన్న గుడులను చూచుటకు ఒక వారము కూడా సరి పోదు. అక్కడి నుండి తిరుపతి వచ్చినాడు. ఇంకా నెల్లూరు ఇతర ఆంద్ర ప్రాంతములను దాటి, భువనేశ్వరము,  ఉజ్జయిని, వారణాసి, అయోధ్య, హరి ద్వారము, గంగోత్రి, యమునోత్రి, ఋశీ కేశ్, కేదారనాథ్ క్షేత్రాలను చూచినారు. నివాసమునకు ఏదో ఒక ఆశ్రమము ను ఆశ్రయించి వీలయినన్ని రోజులు ఉండే వారు. కలకత్తా వెళ్లి అక్కడ దక్షిణేశ్వరములో  ఎక్కువ కాలమున్నాడు. ఈ విధముగా సుమారు రెండు సంవత్సరాలు తిరిగినారు. ఇంకా వాణి “నాన్నా! అమ్మ వస్తుందేమో? ఇంటికి పోదాము.” అనడము మొదలు పెట్టింది. “నాన్నా! అమ్మ ఇంక రాదా? “ అని రోజూ అడిగేది. ఆ ప్రశ్నకు తనకు జవాబు తెలియదు. తను ఇంటికి వెళితే అమ్మ, నాన్న గుర్తుకు వస్తారు.
రెండేళ్ళ యాత్రల తరువాత పైనాంపురము చేరినాడు. తాళాలు తీస్తే ఇల్లంతా దుమ్ముతో నిండి యుంది. రైతును పిలిపించి ఇల్లంతా శుభ్రము చేయించినాడు. సరోజ వేసిన పూల మొక్కలు పూర్తిగా ఎండి పోయినాయి. తనకు ఎవరి దగ్గిరకు వెళ్లాలని అనిపించ లేదు. పొరపాటున వెళ్ళినా అందరూ సరోజ మీద వ్యాఖ్యానాలు చేసినారు. ఇంక సరోజ గురించి ఆలోచించడము మాని వేసినాడు.
ఈ రెండు సంవత్సరాల పంటను రైతే అమ్మి వేసి తనకు డబ్బు తెచ్చి ఇచ్చినాడు. తిరిగి నెల్లూరిలో ఉద్యోగమూ కోసము ప్రయత్నమూ చేయాలని అనిపించ లేదు. పగలు వాణిని బడికి పంపించే వాడు. సాయంత్రము వాణిని వెంట పెట్టుకొని పొలాల గట్ల మీద నడక సాగించే వాడు. రెండు వారాలు గడచినా తరువాత ఇంట్లో పుస్తకాల దుమ్ము దులపడము మొదలు పెట్టినాడు. అప్పుడు సరోజ డైరీ బయట పడింది. అందులో సరోజ అభిప్రాయాలు, కలలు, ఇప్పటి విద్య విధానములో లోటు పాట్లు, ప్రాథమిక విద్య నుండి ఎటువంటి మార్పులు చేస్తే బాగుంటుంది, ఇలా ఎన్నెన్నో వ్రాసింది. ఇప్పుడు ఉద్యోగమూ కోసము పాఠాలు చెప్పే టీచరు, విసుగు పుట్టినా తప్పదన్నట్లు వినే విద్యార్థి, ఇటువంటి వ్యవస్థ మారాలని వ్రాసింది.
ప్రాథమిక స్థాయిలో ఎటువంటి  ఆటలు ఉంటే బాగుంటుందో వ్రాసింది. అంతే కాదు, కొంచెము నిలకడ రాగానే “ఒరిగామి” వంటికాగితాలతో బొమ్మలు చేయడము ఉండాలని వ్రాసింది. అప్పుడున్న పాఠ్య ప్రణాళికలో ప్రతి పాతానికి ఒక ప్రయోగాన్ని చేర్చింది. అది కూడా ఎలా చేస్తే పిల్లలు ఎగ బడటారో,ఎలా అయితే ఖర్చు లేకుండా ఇంట్లో వాళ్లకు చూపించ గలరో అటువంటి ప్రయోగాలను వ్రాసింది. ఇంకా నైతిక విలువలు ఒకరు చెబితే వచ్చేవి కావు, ఒకరిని అనుసరిస్తే వచ్చేవి అని వ్రాసింది. అందుకే పిల్లలకు పెద్దలు ఆదర్శముగా నిలబడాలి అని వ్రాసింది.
సరోజ తనతో ఎన్నో సార్లు ఈ విషయాలన్నీ చెప్పేది. తనే సరిగా పట్టించుకోలేదేమో. చాలా బాధ వేసింది.
“సరోజా! సరోజా! నీవెక్కడ ఉన్నావు?” ఇదే ప్రశ్న” తను డిల్లీ వెళ్ళకుండా పొరపాటు చేసినాడేమో?” ఇదొక బాధ. కొన్నాళ్ళు ఇలా బాధ పడినాడు. తరువాత ఒక నిర్ణయానికి వచ్చినాడు.
ఇంటి వెనుక ఇసుక దిబ్బల మీద ఒక రేకుల షెడ్ వేయించినాడు. అక్కడయితే సాయంత్రము పూట బాగా గాలి సోకుతుంది. అందులో కొన్ని బల్లలు కుర్చీలు వేయించినాడు. ఊళ్లోనే యున్న ప్రభుత్వ పాత శాల టీచర్ తో సంపర్కము పెట్టుకున్నాడు. రోజూ తను రెండు గంటలు పాఠాలు , ప్రయోగాలు మొదలు పెట్టినాడు. క్రమముగా అన్నీ షెడ్డు లోనికి మార్చినాడు. ఇందుకు పిల్లల తల్లి దండ్రులను కూడా ఒప్పించినాడు.
వాణి కూడా తనతో బాటు ఉండేది. అక్కడ పిల్లలతో కలిసి పోయి, వారితో బాటు పని చేయడమే గాక తను కూడా సాయము చేసేది. ఆ ఊళ్ళో  పిల్లలకు ఈ పాఠ శాల ఎంత అలవాటు అయిందంటే వాళ్ళు ఒక రోజు మానాలంటే గొడవ చేసే వారు. ఇంటికి వెళ్లి వాళ్ళు ప్రయోగాలకు వస్తువులు పాడు చేసినా వాళ్ళ తల్లి దండ్రులు సంతోషించే వారు. ఆరు నెలల్లో ఈ పాత శాల గురించి పక్క ఊళ్లకు కూడా తెలిసింది. వారు రామును తమ పాత శాలలకు రమ్మని ఆహ్వానించినారు.ఇంకా కార్పోరేట్ పాత శాలల యాజమాన్యాలు రాముకు ఎంత జీతమయినా ఇస్తామని కబురు పెట్టినారు. రాము వేటికీ అంగీకరించ లేదు. మరో రెండేళ్లలో ఉన్నత పాత శాల స్థాయికి దీనిని తీసుకొని వెళ్లాలని ఆశ పడ్డాడు.
ఇప్పుడు రాముకు క్షణము తీరిక లేదు. ఆర్థికముగా ఇబ్బంది ఎప్పుడూ లేదు. కానీ దర్జాగా బ్రదకాలంటే  కుదరదు. కానీ, అటువంటి జీవితమూ పైన తనకు ఏనాడూ  ఆసక్తి లేదు.
ఈ రకముగా మరో సంవత్సరము గడచింది. ఇక్కడ విద్య విధానము యొక్క సమాచారము డిల్లీ వరకు వెళ్ళింది. అక్కడ ఒక కార్పోరేట్ విద్య సంస్థ  తమ వ్యక్తిని పైనాం పురము పంపించాలని అనుకున్నది. ముందు ఉత్తరము  వ్రాసింది. తప్పకుండా చూడ వచ్చని రాము వ్రాసినాడు. ఒక తెలుగు వచ్చిన టీచర్ ను తమ ప్రతినిథిగా అక్కడ పరిశీలించుటకు పంపిస్తున్నామని వ్రాసినారు. ఆ ప్రతినిథి పేరు కూడా వ్రాసి పంపించినారు.
(To be continued)

        

Monday, April 3, 2017

పిచ్చి మొక్క



నా ఆత్మ కథను వింటారా? నా వ్యథ ను తీరుస్తారా? నేనొక  పిచ్చి మొక్కను. నా లాంటివి చాలా ఉన్నాయి. అన్నిటికి అదే బాధ.  మీకు మేము ఏమి అపకారము చేసినాము? మమ్ములను బ్రదుక నీయరా?
ఒకప్పుడు పొలాల గట్లపై ,కాలువ  గట్లపై, ఇళ్ళ  మధ్య ఖాళీ స్థలాలలో ఎక్కడ బడితే అక్కడ ఉండే వారము. అంతే కాక, మీకు వచ్చిన చిన్న వ్యాధుల నివాతనకు మా సహకారముఉండేది.
అడవులలో నివసించే వారు ఏ  చిన్న గాయమైనా ఎదో ఒక ఆకు పసరు రుద్దుకొని నయము చేసుకొనే వారు. అందుకే మా బ్రతుకుకు ఒక ప్రయోజనము ఉండేది. ప్రతి చెట్టుకు ఒక ప్రాధాన్యత ఉండేది. కొన్ని చెట్లు/మొక్కలు దైవములా పూజను అందుకోనేవి. ఆయుర్వేద వైద్యమునకు ఆదరణ ఉన్నంత కాలము మా పరిస్థితి బాగుగానే ఉండేది. ఉత్తరేణి ఆకులను ఉపయోగించి నాగు పాము విష ప్రభావము కూడా తగ్గించ గలిగిన  సత్తా ఉన్న వారు ఉండే వారు. సరస్వతి ఆకు ఇళ్ళ మధ్యనే ఉండేది. మేధస్సు పెరగడానికి సరస్వతీ ఆకులను తేనే లో నిల్వ ఉంచి దానిని తీసుకొనే వారు. ఏ  మాత్రము గాయము తగిలినా ఉత్తరేణి లేదా నేల పొగడ (దీనిని గాయపు ఆకు అని కూడా పిలుస్తారు) మన అవసరాలను తీర్చేది. ఈ రకముగా పల్లెటూళ్ళలో చాలా మందికి చాలా మొక్కలు  తెలిసి ఉండేవి. తులసి దేవతా మొక్కగా గుర్తింపు వలన  దానికి ప్రత్యెక రక్షణ ఉన్నది.
ఒక ప్రాచీన గురుకులములో గురువు శిష్యులను పిలిచి అడవి అంతా వెదికి ఎవరికీ పనికి రాని ఒక మొక్కను పట్టుకొని రమ్మన్నారట. ఒక్కరు తప్ప అందరూ తలా ఒక మొక్కను పట్టుకొని వచ్చినారుట. ఆ ఒక్కడు తనకు పనికి రాణి మొక్క ఏదీ కనిపించ లేదని చెప్పినాడట. ఆ గురువు అతడినే ఉత్తమ శిష్యుడిగా గుర్తించినారుట. అంతే కాక ప్రాచీన ఆయుర్వేద వైద్యులు  ఒక్కొక్క మొక్క దగ్గిర ధ్యానము చేసి  ఆ మొక్కల సముదాయానికి ప్రయోజనాన్ని ఆ మొక్క అధిదేవత ద్వారా తెలుసు కొనే వారుట. ఇది ఒకప్పటి ఆయుర్వేద వైద్యుల స్థితి.
ఈనాడు ఇళ్ళ  పెరళ్ళలో నున్న మొక్కలని పిచ్చి మొక్కలని  మమ్ములను తొలగించి వీధిలో పడేస్తున్నారు. ఇంటి ప్రాంగణమంతా సిమెంటు చేసి, మాకున్న కొద్ది స్థలాన్ని కూడా మాకు పనికి రాకుండా చేస్తున్నారు. రోడ్డుకు ఇరు వైపులా ఉన్న మొక్కలను  కూడా శుభ్రత పేరు తొ పీకి వేస్తున్నారు. ఇంత శుభ్రత కోరుకునే వారు కాలువల నీటిని అపార్టుమెంట్ల వ్యర్థాలతో మరియు పరిశ్రమల వ్యర్థాలతో నింపి పాడు చేస్తుంటే ఎవరూ అడగరేమి? ఇంకా వారి శుభ్రతకు మేమే అడ్డము వచ్చినామా? అలా అని మమ్ములను ఎవరయినా విడిగా పెంచుతున్నారా? కొన్ని మొక్కలను నిర్మూలించడానికి  ఒక్కొక్క సారి మా మొక్కలపై విష పదార్థాలను చల్లుతున్నారు.  మీరు ఒక విషయము గుర్తించు కోవాలి. సున్నితమయిన మొక్కలు వాటి వలన పోతున్నాయి. ఇంకా మిగిలిన మొక్కలు మీకు విషాన్నే అందిస్తాయి. (ఆలోచించండి)
ఒకప్పుడు రోడ్లకు ఇరు వైపులా బ్రహ్మాండమయిన చెట్లు ఉండేవి. వాటి వలన ప్రయాణీకులకు చల్లని గాలి తగిలేది. ఈ నాడు వాటిని పూర్తిగా నిర్మూలించి వేసినారు. ఈ నాడు ఆ రోడ్లలో ప్రయాణము ఎంత వేడిగా ఉంటుందో? మీలో స్వార్థము పెచ్చు పెరిగి పోయింది. అది మమ్ములను నిర్మూలించడమే కాదు, వృక్ష సంపదను నాశనము చేసి భూమిని  అగ్ని గుండము గా మార్చి వేస్తుంది. ఆలోచించండి, ఇదే పరిస్థితి కొన సాగితే  చివరకు మీరూ మిగలరు.
జెనెటిక్ ఇంజనీరింగ్
ఒక జెనెటిక్ ఇంజనీర్ హడావిడిగా వాళ్ళ బాస్ ను కలిసి, “సార్! గ్రాండ్ సక్సేస్. తియ్యటి నిమ్మకాయలను సృష్టి చేసినాను.’
అప్పుడు బాస్ యొక్క అతిథి ఆన్నాడు. ”దానికి ఇంత కష్ట పడడము ఎందుకు. నిమ్మ కాయకు బదులు కమలా కాయను తింటే సరి పోదా ఏమిటి?”  
జెనెటిక్ మ్యుటేషన్:
రాము: రావణాసురుడు గొప్ప జెనెటిక్ ఇంజనీర్ తెలుసా?
భీము:  నీకెలా తెలుసు?
రాము:  ఆశోక వనములో సీతమ్మ చుట్టూ కూర్చున్న  స్త్రీలు అంతా జెనెటిక్ ఇంజనీరింగ్ ఫెయిల్యూర్ లే కదా.
ఇంకొక ప్రశ్న. ఆధునిక కాలములో మొట్ట మొదటి గొప్ప జెనెటిక్ ఇంజనీర్ ఎవరో తెలుసా?
భీము: నీవు చెప్పకుండా నాకు ఎలా తెలుస్తుంది?
రాము:  థాలోమైడ్ రసాయనాన్ని తలనొప్పికి మందుగా ప్రయోగించిన వ్యక్తీ.
భీము: ఎందుకని?
రాము: అప్పుడే కదా, కొంత మందికి కాళ్ళు లేకుండా కొంత మందికి చేతులు లేకుండా పిల్లలు పుట్టినారు.

(రావణుడి లంకలో సీతమ్మ చుట్టూ ఉన్న స్త్రీలలో చాలా మందికి జన్యు  విపరిణామాలు ఉన్నాయి. చూడండి వాల్మీకి రామాయణము.)

ప్రస్థానము 2

                                             
           
            గోపీ, లేదా గోపాల కృష్ణ వరకవి పూడి బస్సు దిగినాడు. సుమారు ముప్పది ఏళ్ళ క్రిందట తూర్పుకు ఇంకా ముందుకు బస్సులు ఉండేవిట. అక్కడా తన తాత గారి ఊరు  ఉండేదట. పేరు పైనాంపురము. ఇప్పుడు అక్కడ పెద్దగా ఇళ్ళు ఏమీ లేవు. అప్పుడప్పుడు చేపలు పట్టుకొనడానికి వచ్చే పల్లె వాళ్ళు అక్కడ కనిపిస్తారు. మళ్ళీ వేరే చోటుకు మకాము మార్చేస్తారు. మళ్ళీ నిర్మానుష్యముగా కాంతి హీనముగా ఉంటుంది ఆ వూరు. నేలటూరు, కచ్చి వారి ఖండ్రిగ, వాగర్త,.. ఇవన్నీ ప్రక్కన ఉండే ఊర్లు. సుమారు అయిదు కిలోమీటర్ల దూరములోముత్తుకూరు, కృష్ణా పట్ణము మున్నగు ఊళ్ళు ఉన్నాయి.  అక్కడ జనాభా తగ్గి పోయినది.
            నెమ్మదిగా తూర్పు వైపుకు నడుస్తున్నాడు. మధ్యలో ఒక ఊరు రెండు మూడు పాకలతో కనిపించినది. ఆ ఊరు పేరు కుమ్మరి పాళెము. ఒకప్పుడు అక్కడా కుమ్మరి వారు చాలా మంది ఉండే వారుట, ఇప్పుడెవ్వరూ లేరు. పేరు మాత్రమున్నది. ఇంకా ముందుకు వెళ్ళినాడు.
            పైనాంపురము అనంతపురము జంట గ్రామాలు. నిజానికి వాటి సరిహద్దు మీద కూడా ఇళ్ళు ఉండేవి. కానీ రెండూ వేర్వేరు మండలాలకు సంబంధించినవి. అనంతపురము కూడా ఇంచు మించు ఖాళీ అయినాది. పాత కాలపు గుర్తులుగా అక్కడ గ్రామ దేవత గుడి మహలక్ష్మి ఆలయము, దగ్గిరలోనే సీతా రామాలయము ఉన్నవి. అక్కడ అయిదు లేక ఆరు ఇళ్ళు ఉన్నవి.
            ఎవరో అడిగినారు,"ఏమి కావాలి బాబూ!", అని.  ఆ ప్రశ్నలో ఇంకో ప్రశ్న ఉన్నది." ఇక్కడ ఏమున్నదని చూడటానికి వచ్చావు ", అని.
            "సముద్రానికి వెళ్ళాలని ఇలా వచ్చేను",  అన్నాడు. తన మాట నమ్మరని తెలుసు. ఎందుకంటే, సముద్రానికి వెళ్ళె వాళ్ళు మైపాడు కానీ, కోడూరు కానీ వెళ్తారు. ఈ మార్గానికి రారు.
            మహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళినాడు. తలుపు మూసేసి ఉన్నది. పూజారి కూడా ఊళ్ళో
ఉండరుట. రోజూ ఉదయాన్నే వచ్చి పూజ చేసి వెళ్ళుతాడుట. వాళ్ళ పూర్వీకులు ఆ గుడిలో పూజ చేసే వారుట.
ఆ అనుబంధము వదులు కోలేక ఇప్పటికీ రోజూ ఉదయన్నే వచ్చి పూజ చేసి వెళ్ళుతాడుట. ఆదరణ లేక గుడి వెల వెల బోతున్నది.
 తాతగారు వ్రాసిన దైనందినులలో కామయ్య అనే వారిని గురించి వ్రాసినాడు. ఆయన రోజు మండపము అనే గ్రామములో ఉండే వారు. ఒక రోజు సముద్ర స్నానానికి వెళ్ళి వస్తుంటే అక్కడ ఇసుక తిప్పలలో ఒక శివ లింగము కనిపించినది. ఆ స్థలాన్ని శుభ్రము చేసి రోజు వెళ్ళి పూజ, అభిషేకము చేసి వచ్చే వాడుట. కొన్నాళ్ళలో అక్కడ దేవాలయము వెలిసినది. అది కాటేపల్లి అనే ప్రాంతములో ఉన్నది. ఇది పైనాంపురానికి ఈశాన్య దిశలో సముద్ర తీరములో ఉంటుంది.
            . అటునుండి దక్షణముగా కొంత దూరము వెళ్ళినాడు. అక్కడ ఒకప్పుడు ఉన్న ఇళ్ళ ఆనవాలు కనిపిస్తున్నవి. ఒక చోట రోడ్డుకు తూర్పుకు తిరిగి వెళ్ళినాడు. అక్కడ ఒక రాళ్ళ గుట్ట కనిపిస్తున్నది. చాలాకాలము క్రింద అక్కడ ఒక ఇల్లు ఉన్నదనే విషయాన్ని గుర్తు చేస్తున్నది. అక్కడ తన మోకాళ్ళ మీద కూర్చున్నాడు.ఇది తన పూర్వీకుల వారసత్వము. ఒకప్పుడు  తాతగారు వాళ్ళు ఇక్కడే ఉండినారు.
ఒక్క సారి మనస్సు గతము లోనికి వెళ్ళినది.
            -----------------------------------------------------
            గోపి నాన్న గారి పేరు శ్రీనివాస మూర్తి. ఆయన తిరుపతి లోని శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయములో
భౌతిక శాఖాధిపతి. గోపి పై చదువుల కొఱకు అమెరికా వెళ్ళినాడు. నిజానికి ఈ నాడు ఈ నాడు అమెరికా వెళ్ళి నేర్చుకొన వలసిన అవసరము ఏ భారతీయుడికి లేదు. అయితే విదేశాలలో చదువుకొనుట ఒక ప్రతిస్థాత్మక విషయముగా మారినది.
            ప్రపంచమంతటా వ్యాపార ధోరణి నుండి నైతిక విలువల పునరుద్ధరణ వైపు మరలుట ఒక ప్రధాన చర్చనీయాంశముగా మారినది. కానీ, మార్పు అంటే మాత్రము అందరికీ భయము. అందుకే ప్రపంచ వ్యవహారమంతా ఒక త్రిశంకు స్వర్గముగా మారినది. సరిగ్గా ఇటువంటి పరిస్థితులలో గోపీ అమెరికా లో ఉన్నాడు. అక్కడ వారానికి ఐదు రోజులే సంస్థలన్నియు పని చేస్తున్నవి. దేశీయులందరు చేతిలో డబ్బు చేరిందంటే వారాంతానికి  శని, ఆది వారాలుఖఛ్ఛితముగా బయటికి వెళుతారు. కొంత కాలము డబ్బు లేక పోయినా ప్రభుత్వము కల్పించిన క్రెడిట్‌ కార్డులను బాగా వాడే వారు. కానీ దేశము ఆర్ధికముగా దెబ్బ తిన్నందు వలన, ఖర్చు తగ్గించుకొనుటకు, కొన్ని నియంత్రణలను పెట్టినది. అందువలన వారిని కట్టి పడేసినట్లు అయినది. అవసరాలకు  సర్దుకొనుటకు చాలా ఇబ్బంది పడే వారు.
ఇంక భారత్ , చైనా మరియు ఇజ్రాయెల్ దేశీయులు  శని, ఆది వారాలు కూడా బయటికి వెళ్లి ,ఖర్చు పెట్టారు. యూదులు స్వతహాగా పిసినారులు. డబ్బును పొదుపు చేయుటలో వారికి ఉండే ఆనందము ఖర్చు పెట్టుటలో ఉండదు. చైనా దేశీయులు కష్ట పడటములో ఎక్కువ ఆనందాన్ని పొందుతారు. భారతీయులకు ఆత్మ విశ్వాసము కాస్త ఎక్కువ. అందుకే చైనా వారి వలే కష్ట పడక పోయినా అవసరమయితే ఎంతయినా కష్ట పడతారు. అటువంటి పరిస్థితులలో తమకు సాంప్రదాయకముగా వచ్చిన అలవాట్లను కూడా మరచి పోతారు. వాటిని గుర్తు చేసుకోనుట కొరకేమో అప్పుడప్పుడు కొన్ని సాంస్కృతిక  సంఘాలు కలయిక సభలను జరిపేవి.
గోపీ  లేదా గోపాల కృష్ణ తనతో లుంగీలు, పైజమాలు తప్ప వేరే ఏవీ తీసుకొని రాలేదు. కానీ, తెలిసిన వారి ద్వారా ప్రయత్నము చేసి ఒక ధోవతిని సంపాదించినాడు. ఈ కలయిక సభకు ధోవతి, లాల్చీ  తో వెళితే  అక్కడున్న వారందరూ చాలా విచిత్రముగా చూచినారు. ఆసియా, ఆఫ్రికా మరియు కొన్ని యూరప్  దేశాలకు చెందిన యువకులు , యువతులు వారి వారి  సాంప్రదాయ వేష ధారణలో వచ్చి అందరికీ కను విందు చేసినారు.
ఒక్కొక్కరు తమను పరిచయము చేసుకుంటూ ఒక కవితను కానీ ప్రముఖ సూక్తాన్ని గానీ వారి వారి భాషలలో చెప్పి, ఆంగ్లములో వివరించి మెప్పించినారు. ఇంకా గోపీ కి అవకాశము వచ్చింది. వేదికను ఎక్కి శాంతి మంత్రాన్ని ఇలా
పఠించినాడు
                     సర్వేషు  సుఖినః సంతు
                      సర్వే సంతు నిరామయా
                      సర్వే భద్రాణి పశ్యంతు
                       మా కశ్చిత్  దుఃఖ  భాగినః|
ఇంకా అర్థాన్ని ఈ విధముగా వివరించినాడు.”అందరూ సుఖముగా ఉండ వలెను. అందరూ వ్యాధులు లేకుండా ఉండ వలెను. అందరూ సరి అయిన రక్షణ తో యుండ వలెను. ఎవ్వరికీ దుఃఖము ఉండ కూడదు.
          ఇంకా ఇలా చెప్పినాడు, ”ఋషులు ఇటువంటి సమాజాన్ని ఆశించినారు. ఈ భావన ప్రతి యొక్కరిలో నిరంతరమూ ఉండాలని మంత్రముగా చదివించినారు. ఈ భావన ప్రతి యొక్క రక్త కణములో నిలిచి పోవాలని కోరుకున్నారు.”
          ఈ భావన అందరికీ నచ్చింది. వెంటనే భారతీయులలో యున్న కులాలు, విభేదాలు ఇటువంటి వాటి మీద ఎన్నో ప్రశ్నలు వచ్చినవి. వీటన్నిటికీ నిజానికి గోపి సిద్ధముగా లేడు. అయినా జవాబు చెప్పడానికి ప్రయత్నమూ చేసినాడు.
          ఇంతలో ఒక విద్యార్థి తన కొక పరిచయ పత్రము(visiting card) ఇచ్చి ఈయన నిన్ను ఒక సారి చూడాలని అనుకుంటున్నాడు.  ఫలానా గదిలో ఉన్నాడు” అని చెప్పినాడు.
          విందు భోజనాలతో సభ ముగిసింది. తన దగ్గిర యున్న పరిచయ పత్రమును ఒక సారి చూచుకున్నాడు. పేరు చిదానంద భారతి. ఒక భారతీయ సన్యాసి పేరు వలే యున్నది. సభా వేదికకు దగ్గరలో యున్న హాస్టల్  గదులలో ఒకరి దగ్గరకు వచ్చి యున్నాడు. ఈ పరిచయము కొత్తగా చాలా వింతగా యున్నది.
          వెంటనే అక్కడికి వెళ్ళినాడు.స్వామీజీ గది మధ్యలో కూర్చొని యున్నాడు. చుట్టూ కొంత మంది విద్యార్థులు ఉన్నారు. దేహము, ముఖము చూస్తె భారతీయుడిగా లేదు. కానీ వేష భాషలు అన్నీ భారతీయ సన్యాసి వలే యున్నాయి. అందుకే ఆయనను చూడగానే “హలో” లేదా “గుడ్ ఈవినింగ్”  అని రాలేదు. రెండు చేతులు జోడించి నమస్కారము పెట్టినాడు.
          “hello, you are Gopala Krishna?”(హలో! గోపాల కృష్ణ వు నీవే కదా?)
          “Yes, Sir”(అవును.)
          “I see in you some light, some splendour in your face.Yes, yes, it appears, you are going to build up a model village, no, no  a town, in India. Yes, it is going to be true, I see it before my eyes.”
(నీ కళ్ళలో ఏదో వెలుగు, ఏదో తేజస్సు ను చూస్తున్నాను. నాకు కనిపిస్తున్నది.నీవు ఇండియా లో ఒక నమూనా గ్రామాన్ని, కాదు, కాదు ఒక నగరాన్ని  నిర్మించ బోతున్నావు. ఇది నిజమవుతుంది. అవును, నా కాళ్ళ ముందు  దానిని చూస్తున్నాను.)
          గోపీ కి ఒక్క సారి షాక్ తిన్నట్లు అయింది. తను ఏమిటి? ఒక నగరాన్ని నిర్మించుట ఏమిటి?
          “I don’t know how. I can not undestand anything.”(ఎలా? నాకేమీ అర్థము కావటము లేదు.)
          “Yes, yes, you are not ready to get it. come over here. please be seated.”(అవును. ఇప్పుడే నీకిది అర్థము కాదు. రా వచ్చి కూర్చో.)
          ఆయన తనను పరిచయము చేసుకున్నాడు.  తాను ఒకప్పుడు  ఈ విద్య సంస్థ లోనే విద్యార్థి గా ఉండే వాడు. తల్లి దండ్రులు జన్మతః  అమెరికా జాతీయులు. మొదట ఆర్థికముగా బాగుండేది. స్నేహితుల ప్రాపకము ఎక్కువయింది. తల్లి దండ్రులు తరువాత విడాకులు తీసుకున్నారు. తనను, తన ఆలోచనలను అర్థము చేసుకొనే వారు  కరువయినారు. తండ్రి మాత్రము తనకు ఖచ్చితముగా అవసరానికి మించి డబ్బు పంపించే వారు. అదే తనను పూర్తిగా పాడు చేసినది. చివరకు విద్యా సంస్థనుండి బహిష్కరింప బడినాడు.
          ఒక రోజు ఇదే సభా వేదికలో సంస్కృతీ సంగమము  క్రింద  వేదాంత శాఖ ఒక భారతీయ సన్యాసిని ఆహ్వానించినది. ఎదో ఆతృత కొద్దీ  ఆ ఉపన్యాసము వినుటకు తను కూడా వెళ్ళినాడు. ఆయన ఉపన్యాసములో ప్రధానముగా మానవ సంబంధాల గురించి ప్రస్తావించ బడినది.
          “ భారతీయ సాంప్రదాయము ప్రధానముగా కర్మ, పునర్జన్మల మీద ఆధార పడుతుంది. వాటి గురించి మీకు తెలుసు  అనుకుంటాను. ప్రతి వ్యక్తీ తను ఎందుకు వచ్చినాడో, ఎక్కడికి వెళ్ళాలో మరచి పోగూడదు. పుట్టినపుడు తన చుట్టూ యున్న పరిసరాలు అతడి సంస్కారాన్ని తాకి, ప్రభావితము చేయుటకు ప్రయత్నమును చేస్తాయి. కొన్ని జన్మలుగా అతడిలో విభిన్న సంస్కారాలు ప్రోగు చేసుకొని ఉంటాయి.  జన్మల వెంబడి అతడిలో ఆ  సంస్కారాల చరిత్ర పెరుగుతూ ఉంటుంది. అంటే అతడిలో అన్ని లక్షణాలూ అంతర్నిహితముగా పెరుగుతూ ఉంటాయి. ప్రతి లక్ష్యాన్ని అతడు పరీక్ష చేసుకోవాలి. ఫలితాన్ని బట్టి దానిని ఉంచు కోవడమో వదిలించు కోవడమో జరుగుతుంది. ఆ విజ్ఞత వచ్చే నాటికే  అతడిలో కర్మ పరమయిన బరువు పెరుగుతుంది. అతడిలో ఏ సంస్కారమయితే  ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుందో  అది తరువాత జన్మలో అవకాశాన్ని తీసుకుంటుంది.
          ఎదురుగా మధుర పదార్తములున్నవి. కడుపులో ఆకలిగా ఉంది. ఒకరికి ముందు తన ఆకలి గుర్తుకు వస్తుంది. రెండవ వాడికి ముందు రోజునుండి తిండి లేకుండా యున్న తన స్నేహితుడు గుర్తుకు వస్తాడు, తనకెంతో ఆకలిగా యున్నప్పటికీ. ఇదే సంస్కారాలలో పరిణత స్థితిని తెలియ చేస్తుంది.
          తిరిగి పుట్టినపుడు అక్కడ వాతావరణము తనలో  అత్యంత ప్రభావాన్ని చూపించే సంస్కారానికి  అనుగుణముగా ఉంటుంది. అయినప్పటికీ అక్కడ వాతావరణములో  మార్పు వచ్చి, వేరొక సంస్కారానికి అనుగుణముగా  మారినట్లు అయితే , ఆ సంస్కారము కూడా తనలో ఉన్నదయితే, అది శక్తిని పుంజుకొని పైకి లేస్తుంది. ఈ విధముగా మొదటి  సంస్కారముతో ప్రయోగము ఆగి పోతుంది. అందుకే ఒక ఆత్మలో ఎన్ని దుష్ట  సంస్కారాలు గత జన్మ నుండి వచ్చినప్పటికీ పరిసరాలు మంచి సంస్కారాలతో ప్రభావితము చేస్తే, ఆ సంస్కారాలు పైకి లేచి దుష్ట సంస్కారాలను బలహీన పరుస్తాయి. అది ఆ జీవి చేసిన సత్కర్మ మీద ఆధార పడుతుంది.”
తరువాత ఆయన పురుషార్థాలను గురించి మాట్లాడినాడు.
“ధర్మము, తను చేయుటకు నిర్దిష్టమయిన పని, అర్థము, దానికి కావలసిన ఉపకరణము, లేదా పరిసరాలు, కామము, తనలో ప్రభావాన్ని చూపుతున్న కోర్కెలు, అవి న్యాయమయినవి లేదా అన్యాయమయినవి, మోక్షము, మోహ క్షయమే మోక్షము. ఈ నాలుగు నడుస్తున్న దారిలో మానవ సంబంధాలను ప్రభావితము చేస్తాయి.....”ఈ పద్ధతిలో ఉపన్యాసము నడచింది. మన నడవడిక శ్రీ కృష్ణుడు చెప్పినట్లు “పరస్పరం భావయంతః “ అనే ధోరణిలో సాగాలని చెప్పినారు.
వింటున్న వారిలో అన్ని మతాల వారు యున్నారు. ఉపన్యాసము అయిన తరువాత విన్న వారికి ప్రశ్నించే  అవకాశము ఇచ్చినారు.
“మీరు అంటున్న ఇన్ని జన్మలు ఎక్కడివి? చని పోవడము తోనే అతడి యాత్ర ఆగి పోతుంది కదా.” ఒకరు ప్రశ్నించినాడు.
“ఇంతకూ మీరు ఏ మాట సాంప్రదాయమునకు చెందిన వారు?” ఉపన్యాసకుడు అడిగినాడు.
“క్రైస్తవము” జవాబు వచ్చింది.
“ఎలిజా నే జాన్ గా పుట్టిన విషయము బైబిల్ లో మీరు చదవ లేదా?’ జవాబు వచ్చింది.
మరొకరు అడిగినారు. “అర్థము అంటే ఉపకరణము అని అన్నారు. అర్థము అంటే ధనము కదా.”
“ ఇప్పటి వాతావరణము లో మీరు చెప్పినది సరి పోతుంది. కానీ ఋషులు అలా చెప్ప లేదు. వారు, ధనమగ్నిః, ధనం వాయుః, ధనం భూతాని పంచచ  అంటే మన చుట్తో యున్న పంచ భూతాలే ధనమని చెప్పినారు .దీన్ని బట్టి, మనము సృష్టించిన డబ్బును పెంచు కోవటానికి వాతావరణాన్ని కల్మషాలతో నింపుతున్న వారు, అర్థము లేదా ధనమును పెంచే వారు కాదు, వాటిని నాశనము చేసే వారు. ఈ విధముగా పరిసరాల రక్షణ జీవన విధానములో భాగముగా తీసుకోవాలి.”
ఇప్పుడు జార్జి అడిగినాడు, ”బిడ్డలకు డబ్బు ఇచ్చి భాద్యత తీరి పోయిందనుకొనే తల్లి దండ్రులను గూర్చి చెప్పండి.”
“డబ్బు ఉపకరణాలను ఇస్తుందే గానీ సంస్కారాలను పెంచదు. తల్లి దండ్రులు తమ పిల్లల మీద చూపించే ప్రేమ , ఎదిగిన పిల్లలు తమ కుటుంబీకుల మీద, తరువాత పరిణతి చెందే కొద్దీ , విశ్వమంతా తన కుటుంబమనే స్థాయికి ఎదిగి, ప్రతి జీవ రాసి మీద చూపిస్తాడు. మొదట్లోనే ఆ ప్రేమ కరువయితే ఆ జీవి పరిణామము ఎలా జరుగుతుంది?”
జార్జికి ఆ ఉపన్యాసము ఎంతగానో నచ్చింది. అంతే గాక తన జీవితములో జరిగిన పొరపాట్లు కొట్ట వచ్చినట్లు  కన్పించినాయి. ఆ వక్త వెళ్లిపోతుంటే వెంట బడి చిరునామా తీసుకున్నాడు. తన భావాలను, తన బాధలను ఆయనతో పంచుకున్నాడు. ఆయన పర్యవేక్షణలో ఎన్నో ఆధ్యాత్మిక సాధనాలను చేసినాడు. తను కోరుకున్న ఆనందము కొరకు వెదికి, వెదికి, చివరకు అందుకొని, తన గురువుద్వారా “చిదానంద భారతి” గా సన్యాస దీక్ష తీసుకున్నాడు.
ఆయనకు ఉన్నది ఒకటే కోరిక. తను బాధ పడినట్లు, విషమ పరిస్థితులలో ఉన్న వారికి మార్గ దర్శనము చేస్తాడు. దీనినే ఆంగ్లములో కౌన్సేల్లింగ్ అని అంటున్నారు. ఆ కారణము గానే ఆయన అక్కడికి వచ్చి యున్నారు.
స్వామీజీ తన కథనంతా చెప్పినాడు. తను ఎక్కువ రోజులు ఉండనని, తన గురువు దగ్గిరకు భారత దేశము వెల్లుతున్నానని చెప్పినాడు. గోపీ తో కొద్ది సమయము గడపాలని అనిపించింది అని చెప్పినాడు.
“నన్ను చూడగానే మీకు ఎందుకు అలా అనిపించింది?” గోపి అడిగినాడు.
“మా గురువు గారు నా చేత చేయించిన సాధనలు నన్ను ఒక స్థాయికి తీసుకొని పోయినవి. సంకల్పము చేసుకొని చూస్తె, దేహములో వర్ణముల కలయిక ఆ వ్యక్తీ యొక్క వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తుంది. దీనినే మనము ఆరా  అంటున్నాము. నీవు చదివిన శాంతి  శ్లోకము వినగానే ఆ భావము నిజముగా నీలో యున్నదా , లేక సమయానికది గుర్తుకు వచ్చి చదివినావా అని అనుమానము వచ్చినది. ఒక్క సారి ధ్యాన స్థితి లోనికి వెళ్లి  నిన్ను గమనించినాను. నీలో కొన్ని జన్మల ఉన్నత సంస్కారాలు నిద్రాణ స్థితి లో  ఉన్నాయి. సమాజానికి ఏదయినా చేయాలంన్ కోరిక నీలో గత జన్మ నుండీ ఉన్నది. అది కూడా నిద్రాణముగా ఉంది. వాటిని నీకు గుర్తు చేయ వలసిన అవసరము కనిపించి నిన్ను పిలిపించాను. ఈ పరిశీలనలో నీవు చేయ బోయే పనులు లీలా మాత్రముగా కనిపించినాయి. అవే నీకు నేను చెప్పినాను. ఈ సామర్థ్యము మా గురువు గారు ఎంతో ప్రేమతో నా చేత చేయించిన సాధనల వలన వచ్చింది” ఒక సారి తన గురువుకు నమస్కారము చేసుకున్నాడు.
“నేనెప్పుడూ ఈ విధముగా ఆలోచించ లేదు.” అన్నాడు గోపి.
“ నీ పేరేమిటి అన్నావు?”
“గోపాల కృష్ణ”
“గోపాల కృష్ణ. పేరు కూడా సరి పోయింది.”తనలో తను అనుకున్నాడు.
మళ్ళీ పైకి అన్నాడు.” గోపాల కృష్ణుడు ఎన్నో నగరాలను నిర్మించినాడు. అంటే కాదు. వ్యసన లోలురయిన  పాలకులను యుద్ధ రంగానికి రప్పించి, వధింప చేసి, ఒక విశాల సామ్రాజ్యాన్ని నిర్మించిన్నాడు. ఆయన అంతరంగము ఎవరికీ అంతు బట్టడు. ఇంతకూ కృష్ణుడిని గూర్చి చదివావా?”అన్నాడు.
ఔనన్నట్లు తల ఊపినాడు.
“తను  ఒకరికి సాయము చేయాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. తెలుసా?”
గోపీ యే కాదు అక్కడ యున్న అందరూ అనుమానముగా చూచినారు.
“సర్వ సత్తాక స్వతంత్రత. ఇది యొక స్థితి. తను ఎవరి మీద ఆధార పడని స్థితిలో నున్న వాడే ఎటువంటి పరిస్థితులలో నైనా , ఎవరి కైనా సహాయము అందించ గలడు. నిరంతరమూ ఆహారము సంపాదించుకొనుటకు అలమటించే వాడు అందరి ఆకలి తీర్చ లేడు.  అనారోగ్య వంతుడు మరొకరికి ఆరోగ్యము పెంపొందించే సలహా ఇవ్వ లేడు. ఎప్పుడూ అప్పులలో మునిగిన వాడు,  మరొకరికి ఆర్ధిక సహాయము చేయ లేడు.  తన అవసరాలను తగ్గించుకొని లోకానికి సాయము చేయ గలిగిన వాడు  ఆ స్థితిలో ఉంటాడు. భారతీయ ఋషులందరూ ఆ స్థాయి వారే.”
“అటువంటి వ్యవస్థ వీలవుతుందని నేనంటే మీరు నమ్మ లేరు. ఇప్పుడు కాదు, అయిదు వేల సంవత్సరాల క్రిందట  కృష్ణుడి కాలములోనే నమ్మ లేక పోయినారు. అందుకే గోకులములో తన చిన్న వయసులోనే గడపినాడు. వారికి కృష్ణుడు ప్రసాదించినది ఇటువంటి వ్యవస్థే.”
“అప్పటి సామాజిక పరిస్థితులను చూచి భయము వేస్తున్న వారికి ఈ మాటలు నమ్మ శక్యముగా ఉండవు.”
“మధుర మీద పదిహేడు సార్లు దండ యాత్ర జరిగితే కృష్ణుడు ఎదుర్కొన్నాడు. నిరంతర సంఘర్షణలో ఉన్న సమాజములో సృజనాత్మకత లోపిస్తుంది. భయము పెరుగుతుంది. దీని ప్రభావము పెద్ద వాళ్ళ కంటే  ఎదుగుతున్న పిల్లల మీద ఎక్కువ ఉంటుంది. అంటే ఒక తరము నాశనమై పోతుంది. అందుకే సముద్ర ములో ద్వారకా నగరాన్ని నిర్మించి  ఆ భయాన్ని తొలగించినాడు.”
“హస్తినాపురాన్ని పాలించే వాడంటే భూమిని పాలించే వాడితో సమానము. ద్రోణుడు, భీష్ముడు లాంటి శాస్త్ర వేత్తలు హస్తినాపురానికి పెట్టని కోట వంటి వారు. అక్కడ ధృత రాష్ట్రుడి లుబ్దత్వము, శకుని కుటిలత్వము, దుర్యోధనుడి అహంకారము, అసూయా ద్వేషాలు, నిండు సభలో ఇంటి కోడలినే అవమానించిన సంస్కార హీనత ,ఇటువంటి వాటిని చక్క దిద్ద గలిగిన శక్తి  సామర్థ్యాలు ఉండి కూడా భీష్ముడు పూనుకొన లేదు. తన ఇంటి కుల స్త్రీ కే రక్షణ ఈయ లేని వ్యవస్థ లో సమాజములో మిగిలిన స్త్రీలకూ ఎంత రక్షణ ఉందొ గమనించమన్నాడు వ్యాస మహర్షి. అందుకే అక్కడ కృష్ణుడి అవసరము ఏర్పడింది. ఇదే మహాభారత యుద్ధానికి దారి తీసింది. “
“ఇవి సామాజిక భద్రతకు సంబంధించిన వి. ఏ ఒక్కటి లోపించినా మనిషి అశాంతిలో నలిగి పోతాడు. అవసరాన్ని అనుసరించి మహాత్ములు ప్రపంచములో అన్ని చోట్లా జన్మించినారు. వారి జీవితాలను అర్థము చేసుకోండి. దేనికీ భయ పడకండి. మన పని మనము చేసుకుంటూ వెళ్ళడమే, తిరిగి చూడడముండదు.”
గోపీ కి అంటా విచిత్రముగా ఉంది.తను చిన్నప్పటినుండీ కృష్ణుడి గురించి ఎన్నో విన్నాడు. ఎన్నో మహిమలు విని మురిసి పోయినాడు. వీటన్నిటికి ఒక చక్కని ప్రణాళిక యున్నదని ఇప్పుడు తను వినే వరకు, ఆ భావన తనలో రాలేదు. ఒక విదేశీయ యువకుడు సన్యాసిగా మారి ఇంత పరి జ్ఞానాన్ని సంపాదించినాడంటే అతడిని తయారు చేసిన గురువు ఎంత గొప్ప వాడో? ఒక సారి మనస్సు లోనే నమస్కారము పెట్టుకున్నాడు.
స్వామీజీ మళ్ళీ ఉపన్యాసము కొనసాగించినాడు.
“ప్రపంచములో ప్రతి యుద్ధమూ భారత దేశము వైపు నడచింది. ప్రతి యొక్క విజ్ఞానము భారత దేశము నుండి అందినది. అందుకే ఈ నాడు ప్రపంచమంతా భారత దేశము వైపు ఆశగా చూస్తున్నది. ఇక్కడ మీరు నేర్చుకొనే సమాచార ప్రసార విజ్ఞానము మరియు మేనేజ్మెంట్ కోర్సులతో బాటు భారతీయ ప్రాచీన వ్యవస్థను గమనించి చదవండి. ఋషుల ప్రవచనాలలో మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి.”
ఇవి అన్నీ అయేసరికి రాత్రి పన్నెండు గంటలు అయింది. అందరూ లేచినారు. గోపీ కూడా వచ్చి గదిలో పండుకున్నాడు.  ఎంతకూ నిద్ర పట్ట లేదు. ఒకటే ఆలోచనలు. స్వామీజీ చెప్పిన మాటలే  గుర్తుకు వస్తున్నాయి.
మర్నాడు గ్రంథాలయానికి వెళ్ళినపుడు  భారతీయ పురాణ ఇతిహాస  రచనలను కూడా చదవాలని అనుకున్నాడు. ప్రతి గ్రంథము యొక్క ఆంగ్లానువాదములు గ్రంథాలయములో ఉన్నాయి.
ముందు మహాభారతము చదివినాడు.  ఒక్కొక్క  విషయాన్ని ఒక్కొక్కరు ఎలా అర్థము చేసుకుంటారో, ఎలా చేస్తే ఎటువంటి ప్రయోజనాలు వస్తాయో  అటువంటి విశ్లేషణ తనకు బాగా నచ్చింది. తమ పెద్ద తండ్రి  పిల్లల వలన  రక్షణ లోపించినపుడు  పాండవులు అయిదు మంది తల్లి కుంతీ తో బాటు ఎటువంటి ఆధారము  లేకుండా అడవులలో తిరుగుట చూస్తే వారు ఏ  నమ్మకముతో పని చేసినారో తెలుస్తుంది. దుర్యోధనుడి  బలగాన్ని అర్జునుడు మొదటి సారి ద్రౌపదీ స్వయంవరములో  ఎదుర్కొని నిలువరిస్తాడు. భీష్ముడి లాటి పెద్దల ప్రయత్నము వలన  తొండలు కూడా తిరుగ లేనటువంటి  ధృత రాష్ట్రుడు  తమ కిస్తే, అక్కడ యమునా నది ఒడ్డున ఇంద్ర ప్రస్థ నగరాన్ని  నిర్మించ్కుంటారు. (ఇంద్ర ప్రస్థానికి  ద్వారము లాటి  ప్రదేశమునే దేహళి అంటే  కడప యన్నారు. ఈ నాడు ఇంద్ర ప్రస్థము అనే పేరు పోయి దేహళి మాత్రము ధిల్లీ అనే పేరుతొ ఒక రాజదాని గా మిగిలి పోయింది.)పరమ వైభవముగా రాజ సూయ యాగము చేసినారు. ఆ యాగము యొక్క వైభవమే దుర్యోధనుడికి కన్ను కుట్టేతట్లు చేసి మాయ ద్యూతానికి ప్రేరేపించ చేసినది. ఆ మయ సభలో ద్రౌపది నవ్వింది అనే విషయము వ్యాసుడు వ్రాయ లేదు. అది తరువాత కల్పించ బడినది. కొద్ది ఏళ్ళలో కలి ప్రవేశాన్ని సూచిస్తూ నిండు సభలో కుల స్త్రీ ని అవమానిస్తే  అశ్వత్థామ, యుయుత్సుడు, వికర్ణుడు లాంటి వారు తప్ప భీష్మ ద్రోణాదులు నోరెత్తి మాట్లాడ లేదు. విదురుడు మనసు లోనే క్రుంగి పోయినాడు. చివరకు వన వాసము , అజ్ఞాత వాసము పాండవులకు తప్ప లేదు.
ఎన్ని కష్టాలు పడినా పాండవులు మానసికముగా కృష్ణుడి  ఆశ్రయము లోనే జీవించినారు. అదే వారికి కష్ట  కాలములో రక్షణగా నిలిచింది. అడవులలో పాండవులను అవమానించుటకు  ఘోష యాత్ర పేరుతొ  అడవికి వెళ్ళిన దుర్యోధనాదులను గంధర్వులు బంధిస్తే  అర్జునుడే తిరిగి వారిని రక్షిస్తాడు.
అజ్ఞాత వాస సమయములో విరాట రాజు గోవులను అపహరించిన దుర్యోధనాదులను తిరిగి అర్జునుడే ఓడిస్తాడు. ఈ మూడు సమయాల్లోనూ ఒడి పోయిన దుర్యోధనుడి పరివారములో కర్ణుడున్నాడు. కానీ తను ఖచ్చితముగా అర్జునిడి  ఓడించ గలనన్నధీమాయే మహా భారత యుద్ధానికి దారి తీసింది.
యుద్ధము ముగిసిన తరువాత  ధర్మ రాజు ఎన్నో విషయాలను అంప శయ్య మీద ఉన్న  భీష్ముడి ద్వారా తెలుసుకుంటాడు. ఈ విధముగా పాండవుల జీవిత యాత్రను పూర్తగా తెలుసుకోవాలంటే  మహాభారతమును చదవక  తప్పదు.
శ్రీ కృష్ణుడి జీవితమే ప్రధాన అంశము గా హరివంశము. శ్రీ మద్భాగవతము, సాధనా సామర్త్యమును పెంచే ఉపనిషత్తులు, మరెన్నో ఉపాఖ్యానాలు ఖాళీ ఉన్నపుడల్లా చదివినాడు. ఈ జ్ఞానము తన మేనేజ్మెంట్  స్టడీస్  లో ప్రాజెక్ట్  పనికి ఏంటో ఉపయోగ పడింది.
ఒక రోజు తమ ప్రొఫెస్సర్ అన్నాడు,” ఏ గ్రంథాన్ని అయినా వీలయినంత వరకు  అది మొదట వ్రాయ బడిన భాషలో  చదువుటే మంచిది. ఎందుకంటే అనువాదము చేసే వారు తమ వ్రాతలలో తమ అభిప్రాయాలను కూడా జోడించే అవకాశము ఉంది.” ఈ మాటను విన్నప్పటి నుండి, గోపీకి సంస్కృతము నేర్చుకొని మూల గ్రంథాలను చదవాలనే కోరిక పెరిగింది.
ఈ విధముగా తన జీవితములో అవగాహనలో  వస్తున్న మార్పులను  వివరముగా వ్రాసి, మెయిల్ లో తల్లికి తండ్రికి పంపే వాడు. వారినుండి వచ్చిన జవాబులు తనలో ఉత్తేజాన్ని  నింపేవి. తండ్రి శ్రీనివాసమూర్తి  సంప్ర దాయకమయిన జీవితములో యున్నా ప్రాచీన గ్రంథాలను ఎక్కువ చదువ లేదు. తల్లి శారద  మాత్రము ఇటువంటి అవగాహన ఉన్న కుటుంబము నుండి వచ్చినందు వలన  ఆమె జవాబులు తనకు ఇంకా చదవాలని కోర్కెను పెంచేవి. తల్లి సహకారముతో క్రమముగా సంస్కృతములో ప్రవేశమును సాధించినాడు.
(To be continued)