Friday, November 9, 2012

అహల్య3


                                       

                   రుచిర: కల కల రవముల కదిలే ప్రకృతి,
                               కిల కిల పలుకుల కులికే చిలుకలు,
                   పూర్ణిమ: ఏది వసంతము, ఎక్కడ కోయిల?
                                     నీ ఊహలులే నిజము కావులే,
                                     ఆకులు రాల అడవులు సోలె,
                                     చూత వృక్షముల సొగదులు పోయె.
                   సుందరి: రవి కాననిచో కవి కాంచును లే,
                                  శిశిరము వెనుక వసంతము రాదా?
                                  మరు మల్లెల గాలులు ముక్కులు సోక,
                                  తెలియగ లేదా వసంతు పిలుపు.
                                     చక్కని ప్రకృతి సొగసుల చూచి,
                                     చిక్కి పోయెనోయ్‌ వెన్నెల రేడు,
                                     చైత్ర పున్నమికి వెన్నెల కళలను
                                    పుంజుక ప్రకృతినే మురిపింప.

                  రుచిర: ఈ కాలి బాటను చూచితివా? చెలి,
                              మరు మల్లెలు ఈశుని అలంకరింపగ,
                              చేయి తాకితే సోలి పోయేటి
                              శిరీష పుష్పములిల సోకినవి.
                              ఇవి పూచే కాలము హేమంతమని,
                              ఛాయా నాథుడి తీక్ష్ణత ఉండని,
                              మంచు సోకు కాలము లోనే
                              పెంచినాడు ఈశుడు వీటిని.
                 సుందరి:అంతేనా వాటికి ఈశుని
                               అనుగ్రహమ్ము లేనే లేదా?
                               భుజగ భూషణుడి సిగ పాయలలో
                               ఆది మాత కను సన్నలలో
                               అలరు సుఖమ్ము లేని అలరులా,                            
                               నవ సుకుమాలు శిరీష సుమాలు?
                    పూర్ణిమ: దరికి చేరని సుమ రాణులను
                                     తలచి కుములు శిరీష సుమాలను
                                     తననే తలచి, పూజించే,
                                     గడ్డి పూవును అనుగ్రహించాడు.
                   సుందరి: ఎవరు?
                   పూర్ణిమ:ఆర్తుల పలుకుల వినే స్వామి,
                                    పశునాథుడు, ఈశుడు, సర్వేశ్వరుడు.
                       రుచిర: చెలి, చూచావా,అటు చూచావా?
                                  ప్రతి చెట్టూ,ఎదిగి, ఎదిగి,
                                 ప్రతి పుష్పము వికసించి,
                                 ఈ ప్రకృతి సొగసులకు
                                  శ్రీ కారము చుట్టే నే.
                                 ఈ సుమ వసంత వీధిలో,
                                 ఈ వని వెల వెల పోయెను.
                                 ప్రతి పుష్పము పరిమళాల
                                 పఱచే గాలుల వడిలో
                                 పఱవశించు నీ వేళల
                                 కన రావే కోయిలలు.
                                 ఏదీ వసంత మిచట?
               సుందరి  ఇదిగో నొక పర్ణ శాల
                             లేదే సుమ వర్ణ మాల?
                            ఎవరో గృహస్థు ఇచట?
                             ఏమిటో ఈ వింత కథ?
            రుచిర: ప్రకృతి లాస్యము, వైపరీత్యములు,
                        నుదుటి వ్రాతలు తిరుగు లేనివి.
                        సుందర హర్మ్య నివాసము కోరిన
                        సతి కోరికనీశుడు తీర్చ గలిగెనా?
                        భూమండలమును ఏలిన నలుడు,
                        శని బారికి ఎదురుగ నిల్వ గలిగెనా?
                        విధాత ముద్దుల సూతి అహల్య
                        విధి విలాసముకు లొంగి పోయెను.
                 పూర్ణిమ:నే చెబుతా వినవే.
                                 సురపతి గౌతము రూపును దాల్చి,
                                 సుర లోకపు రీతుల భూమికి నడచి,
                                 గౌతము సతినే మోసగించెనే,
                                 భూలోకపు కట్టడినుటంకించెనే.
                                 అనుమానించిన పతిని కనుగొని,
                                 తన దోసము లేదని తెలుపుటం మాని,
                                 సతి దాల్చెను వెంటనె శిలా రూపము,
                                 సరి స్థితికై తాను ఎదురు చూచుచు.
                      ఎఱుపు దిరిగిన కన్నులతో తను
                      చూచిన గౌతము చూడ జాలక
                      దేహమంతట కన్నులు మొలిచే
                      సుర నాథుడి కంతట వణకు పుట్టెను.
                      శిలా సదృశత చెందిన సతి గని,
                      వగచెను యా ఋషి విధి గతికి,
                      తరలి వచ్చు శ్రీ రామ చంద్రుడి
                      పద స్పర్శతో క్షితి పులకింపగ
                      ఏల అహల్య వెలికి రాదు అని,
                       వేరొక చోట్కి వెళ్ళె ఋషి వరుడు.

Wednesday, October 10, 2012

వసంతాగమనము--అహల్య 2


                       
           
           
           
            సుందరి : ఎవరే,..... ఎవరే....
                        అట దాగినదెవరే....
                      విరిసిన పూవుల పొదల మాటున
                        పరిమళ లహరుల పొందు కోరుతూ..
                        ఎవరే ..........దాగినదెవరే......
              రుచిర: సూర్యుడు పైకి లేచిన వేళ
                     విరిసిన పూలు ఉండవా?
                     విరిసిన పూలను సోకిన గాలులు
                        పరిమళ లహరుల చిందవా?
              సుందరి: ఇది యే ఋతువే?......
              రుచిర:    ........వసంతమే.
             సుందరి:   నిజమేనా?
               రుచిర:    ఇది  సుమర్తువేనే .
             సుందరి: ఏది వసంతం? ఎక్కడ కోయిల?
                        ఆకుల రాలగ సోలే అడవి.
                       ఏది వసంతం? ఎక్కడ కోయీ?
               రుచిర : చూడవే అటు చూడవే..
                       పొదల మాటున దాగిన మన చెలి
                           పూర్ణిమ ముఖాన చూడు.
                      పుప్పొడి ఎల్లెడ సోకి పాకెనట
                           పూచిన పున్నాగ మ్రోల.
                       ఇది వసంత మేనే...
                          ఇది  సుమర్తువేనే .
                సుందరి:  మరి కోయిల గొంతుక ఏదే?
                        మద కోయిల గొంతుక ఏదే?
            పూర్ణిమ :సూర్యుడు తూరుపు సోకక ముందే
                          సుందర ప్రకృతి పొంగును చూచి,
                          విరిసిన రంగుల విరి కన్నియల
                           సొగసుల కన్నుల కాంచి,
                           తన సహజ ప్రకృతిని మఱచి కోయల
                            చూత వృక్షపు చిగురుల చేరక.
                           అందుకే
                          దిక్కుల చూచెనదే మరి కోయల
                           ఎటు పోవాలో తెలియక.
            పూర్ణిమ: చెలియా! సుందరి ఇటు రావే,
                      నను తరిమే భ్రమరుడి చూదవే.
            సుందరి: నీ ముద్దుల మోము చంద్రుడి పోల,
                       చంద్రుడి మోమున పుప్పొడి పొడల
                       ఆస్వాదించగ వచ్చిన భ్రమరుడి
                       కంతగ భయ పడనేల?
                       ఓ చెలి! విరి బాలా!
               సుచిర: సరదాగా ఉన్నదే....
                      విరులను చూచి పొంగిన కోయిల
                       ఇలనే మఱచేనే.
                      విరులనుకొని మన చెలి వెంట బడె
                       భ్రమరుడు ఇట నేడే......
            పూర్ణిమ: అటు చూడవే...........
            సుందరి:    ఏమిటే?
          పూర్ణిమ: కుహూ! కుహూ! కోయల వచ్చేనే
                      సుమ మల్లియలే విరిసేనే
                        నవ వసంతమే వచ్చేనే
                       నవ్యత ఎల్లెడ విరిసేనే.
            పూర్ణిమ: వలపులతో వికసించి,
                        పరిమళాల పంపించి,
                        భ్రమరుడి ధాటికి సోలి,
                         పరిపూర్ణత పొందె విరి.
            సుందరి: ప్రతి హృదయము పొంగగా
                           చెలి యెడద పులకించ,
                           నవ వసంతు జంట గాడి
                           చంద్రుడి చూపెను వరుడు.
            ముగ్గురు: ననలు వేసి, పూత పూసె,
                         నిలువెల్లా చూతము.
                            పూతను తిన్న కోయిలకు
                       భూతలమే  సుమవంతము.
                        ఇది వసంత మేనే,
                              ఇది  సుమర్తువేనే.
                 సుచిర: గరిక పూలు, శిరీషాలు,
                           గాలికి వలవల లాడెను,
                           చంద్ర మౌళి శిరసునందు
                            సుందరముగ దాగుటకా? 
              పూర్ణిమ: పొదల లోన పూసిన యా
                          మల్లికలు పిలువ సాగె.
                             అభిసారిక సిగలో నిలువ
                            అభిసారిక వోలె లేచి.
                  ముగ్గురు: ఇది వసంత మేనే
                              ఇది  సుమర్తువేనే .
                     
                    సుందరి: చూచితివా? ఓ చెలి చూచితివా?
                           తియ తీయని పరిమళాల
                           వెదజల్లే సుమ దళాల
                          సొగసుల సుందర హొయలను
                                                                           |చూచితివా|
            రుచిర: అడుగడుగున విరుల వాన
                       అణువణువున సిరుల సోన
                       తియ తీయని పరిమళాల
                       వెదజల్లే సుమ దళాల                           | చూచితివా
            పూర్ణిమ: విరివిరి పై వాలి వాలి
                      పొడి పుప్పొడి పైన సోలి,
                        రంగుల రెక్కల హొయల
                           పొంగులతో భ్రమరుడిని                 |చూచితివా|
                       తియ తీయని పరిమళాల
                         వెదజల్లే సుమ దళాల                  | చూచితివా|

              సుందరి: చిరు రసాల చిగురులను
                           చిరు బొజ్జకు పట్టించి
                           పొంగు హొరంగుల ప్రకృతి
                          పిలిచే కోయిల రాజును.            |చూచితివా|
                                                                          |తియ తీయని పరిమళాల|
                        నారాయణ నామమునే
                          పారాయణ చేయు ఋషులు
                          నవ వసంతు సొగసులలో
                          నవ లోకము చూచితిరే
                                 
                          మదనుడి విరి తూపుల
                         పదనుకు ఎద వేగ లేక
                         వరుడి కొఱకు వేచి చూచు
                           వధూమణుల వేదుకలో
                            మల్లికల వాసనలా
                            కలల కన్ను గీటేనా?
                           కొత్త కొత్త కోరికల
                          ఎడద వేచి చూచేనా?
                           చూడవే, అటు చూడవే......
                      తరాల ప్రకృతిలో
                         తరలి వచ్చు మార్పులతో
                        వాడి, వడలి, పర్ణ హీన
                        అయినది, ఈ పర్ణ శాల.
                        చూచితివా? ఓ చెలి చూచితివా?
                         (ఒక్కొక్కరు లోపలికి వస్తారు.)
            సుందరి: ముని కుటుంబ మిట నాడు
                        పచనము చేసిన పాత్రల
                         అవశేషములా ఇవి,
                        హా! విధి, ఎవరిది గృహము.

                          గాలులు ఈ నాటికైన
                          చొరబడ లేదేమొ గాని
                          ముని యొక్క దర్భ శయన
                          మిదె మరి చూడవె ఓ చెలి.
                          పూజా సుమముల నిచ్చెడి
                         మరుమల్లెల పొదలు
                         మాలి లేక వాడి పోయె
                         మధుర గతము గుర్తు చేయ.

                      ఎవరే ఈ ధీ శాలి,
                      ఎవరే ఈ మహా ఋషి,
                        ఏల గృహము వదిలెనో
                      ఎపుడు తిరిగి వచ్చునో?
            సుచిర: నాదు తండ్రి చెప్పినాడు
                         ఘనుడట ఈ ముని వరుడు
                         కరువులోన ఇల జనంబు
                         ఆకలితో అలమటించ
                       గోదావరినిలకు తెచ్చి
                        కరువును మాపిన ఘనుడట,
                        ఘన నామము గౌతముడట,
                        ఎటకేగెను ఏమో మరి,
                        ఎపుడు తిరిగి వచ్చేనో?                                                           
            

Friday, October 5, 2012

అహల్య 1


                                     అహల్య
            ఓం నమో నారాయణాయ!
            ఓం నమో నారాయణాయ!

            నవ రస భరితం సుమథుర చరితం,
            రఘు కుల సోముడి జీవితం.
                                                                     ......నవరస భరితం
            అందములొలికే సుందర రాముడు,
            చంద్రుడి తెమ్మని వేడిన, తల్లి
            అద్దము నందున చంద్రుడి చూపగ
            సద్దు మణిగెనట బాల రాముడు.
                                                                        ..నవ రస...
            తారా చంద్రుల సుందర లాస్యము
            ఎదను సోకగా రాముడు పొంగె
            రాముడి లాస్యము ఎదను సోకగా
            చంద్రుడి మరి మరి పొంగె.
                                                              ..నవ రస....
            కౌసల్యా సతి కూరిమి పంట
            తండ్రి మాటను జవ దాటడట
            గురు వశిష్టుడి శిక్షణ లోన
            రాజ నీతి నిష్ణాతుడాయె నట.
                                                                ...నవ రస....
            యజ్ఞ రక్షణ నెపమ్ము తోడ
            అపర బ్రహ్మ గాధేయుడి వెంట
            కానల కరిగిన బాల రాముడి
            గాథల వినుటే మరి మరి మథురము.
                                                                 ..నవ రస...

Sunday, May 20, 2012

శిల్పి 11


                                             
            హేమ ఊళ్ళో దోపిడీల వార్త విన్నది, చాలా భయ పడినది. నాన్న గారు, మామయ్య
ఊళ్ళొ లేరు.  గురుకులానికి వెళితే ఆచార్యులు కూడా లేరు. ఊళ్ళో ప్రతి గుడిలో మొక్కుకున్నాది.
ఊరి పెద్దల దగ్గిరకు వెళ్ళీ శ్రీ నాథుడికి రక్షణ ఇమ్మని కోరినది, తండ్రి లాగా కాపాడమన్నది, అన్నలాగా
మన్నించ మన్నది. కానీ, అందరూ భయపడుతున్నారు. ఒక్కరూ ముందుకు రావటము లేదు.
            ఊరి చావడి దగ్గిరకు చేరి అక్కడ నిలబడినది. అసహాయతతో కూడిన ఆవేశముతో,
ముక్కుపుటాలు అదురుతున్నవి. ఒక్క క్షణం శుంభ, నిశుంభులను ఎదుర్కొనటానికి సిద్ధ
 పడుతున్న దేవి వలె కనిపించినది. ఏమి చేయాలో తోచ లేదు. పెద్ద గా అరచినది. "చెల్లెలుగా
వేడుకున్నాను, తండ్రిగా కాపాడమన్నాను, ఈ ఊరి ఆడ పడుచుగా నా బావను కాపాడమని
వేడుకున్నాను. భార్యను కాపాడ లేని భర్తలు, బిడ్డలను కాపాడ లేని తండ్రులు, ...మీరా మగాళ్ళు?
నేనే ... నేనే ... వెళ్ళుతున్నాను. మీరు చేయ లేని పనిని నేనే చేస్తాను. ఈ ఊరి ఆడ పడుచును
కాపాడుకోలేని మీ మగతనానికి సిగ్గు పడండి. ఆ తరువాత జరిగే దానికి కుళ్ళి కుళ్ళి ఏడవండి." 
            ఆమె కళ్ళలో నీళ్ళూ లేవు. పళ్ళు అదిరి పోతున్నవి. ఇంతలో ఎక్కడో దూరాన గుఱ్ఱపు
డెక్కల చప్పుడు వినిపిస్తున్నది.
            "ఒరే, చూస్తూ ఉన్నారేంట్రా? ఆ పిల్ల అలా పోతుంటే.", ఒకరన్నాడు.
            "ఛీ! ఛీ! ఆ పిల్ల కున్న ధైర్యము ఒక్క మగాడికి లేదు." ఓ ముసలాయన్‌ అన్నాడు.
            "మీ కంటే ఆడోళ్ళే నయం.", ఓ ముసలమ్మ అన్నది.
            "గాజులు తొడుక్కొని ఇంట్లో కూర్చోండి, మీరంతా మగాళ్ళేనా?". అక్కడ చేరిన ఆడోళ్ళంతా అన్నారు.
            అంతే చావడి దగ్గిర కుర్రాళ్ళ కు రోషము పొంగినది. చేతుల్లో కఱ్ఱలు పైకి లేచినవి."
అందరూ ఊరి బయట గుట్ట దగ్గిరకు బయలు దేరినారు.
            సుమారుగా పది మంది, గుబురు మీసాలతో క్రౌర్యమంతా కళ్ళలో కనిపిస్తుంటే
గుఱ్ఱాల మీద వస్తున్నారు. సాయంత్రము కావచ్చినది. వారి వళ్ళంతా చమటలు కారి పోతున్నవి.
            "అరే, ఆ చెరువును చూడవొయ్‌"
            "అఛ్ఛా! స్నానము చాలా జరూరు."
            "దిగండి."
            "అరే, వాడిని చూడరా, బొమ్మను చెక్కుతున్నాడు."
            "మనము వచ్చామన్న భయము కూడా లేదు, ఖతం చేయాలి వాడిని."
                  "ఆ తర్వాతే నహానా"
            శ్రీ నాథుడి దగ్గిరకు వెళ్ళినారు.
            "అరే, ఏం చేస్తున్నావా?", ఇద్దరూ చెరి ఒక వైపు నిల బడినారు.
            ", బొమ్మను చెక్కుతున్నావా? వీడి ముందే దీన్ని ముక్కలు చేయాలి."
            "ఆ తరువాత వీడ్ని ఖతం చేయాలి."
            "ఆ తర్వాతే నహానా."
            శ్రీ నాథుడు తలెత్తి పైకి చూచినాడు, పరిస్థితిని గమనించినాడు.
            "ఆగండి", పెద్దగా అరచినాడు.
            "కూత ఘనమే", ఒకడన్నాడు.
                  "నన్ను చంపి గానీ, ఈ విగ్రహాన్ని ఏమీ చేయ లేరు.", అడ్డముగా నిలబడినాడు.
            బయట కలకలము, ముందు హేమ వచ్చినది. వెంటనే పెద్ద గుంపు లోపలికి చొర బడినది.
            దుండగుల్లో ఒకడు శ్రీ నాథుడి మీదికి కత్తి దూసినాడు, వెంటనే ఒక కఱ్ఱ దెబ్బకు వాడి పుచ్చె పగిలినది. కానీ శ్రీ నాథుడి కుడి చేయికి గాయమయినది.
            దుండగులు నివ్వెర పడినారు, ఈ మాత్రపు ప్రతిఘటన కూడ వారికి ఎక్కడా రా లేదు.
వెనక్కు తిరిగే లోపల అందరికి దెబ్బలు పడి అక్కడే పడి పోయినారు.
            "బావా!" అంటూ, శ్రీ నాథుడి దెబ్బ తగిలిన చేతిని పట్టుకున్నది, హేమ.కన్నీళ్ళతో ఆ చేతికి అభిషేకము చేసినది.
            అప్పుడే అచార్యులుగారు వచ్చినారు.
            "శ్రీ నాథా! హేమను చూచావా? ఈ ఊరి ప్రజలను తట్టి లేపినది."
            మళ్ళీ అన్నాడు.
            "హేమా! శ్రీ నాథుడిని చూచావా?ఎంత ఎదిగి పోయినాడో?"
            హేమ సిగ్గుతో శ్రీ నాథుడి చేయి వదిలి వేయ పోయినది.
ఆచార్యులు అన్నారు," వద్దు హేమా! ఇది అద్భుతమైన ముహూర్తము, ఆ చేయినలాగే పట్టుకో, ఇదే
మీ పాణి గ్రహణము. శ్రీ నాథుడు చెక్కే ప్రతి శిల్పానికి నీ చేయి ఇలాగే ఆసరాగా నిలబడాలి."
            ఈ దృశ్యాన్ని చూచుటకు పూర్ణిమ చంద్రుడు నెమ్మదిగా పైకి వచ్చాడు.

ramayanam

బాల కాండము

            శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం,
            సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం,
            ఆజానుబాహు మరవింద దళాయతాక్షం,
            రామం నిశాచర వినాశకరం నమామి.

            రఘు కుల విలసిత దశరథ సుత శ్రీ
            సతి నీ చరణము లొత్తేనా?
            అకలంకిత భక్తిని కొలిచే పావని
            ఆజ్ఞలకై నిను చూచేనా?
            అనుగు సోదరులు దరిన నిలబడి
            అన్న ఆజ్ఞకై నిలిచేరా?
            గుణ గణుడు విభీషణు డాశతొ నిలిచి
            దరిశనమునకై వేచేనా?
           
            రామ దాసులు, తులసీ దాసులు,
            రామ నామా గానామృత దివ్యులు,
            వాకిలి కడ నీ ఆజ్ఞల నిలిచి,
            అనుక్షణమెదురు చూచేరా?

Sunday, April 15, 2012

శిల్పి 10





          హేమ సంగతి అందరూ మరచి పోయినారు.
                 హేమ కు బావ అంటే ఎప్పుడూ అభిమానమే. కానీ తను ఎప్పుడూ బయట బడ లేదు. అంతకు మించి మరే ఆలోచన లేదు. ఉద్యోగములో ఉండే హోదా అంటే అభిమానమే, ఆకర్షణ కూడా ఉన్నది.  అందుకే శ్రీనాథుడితో వివాహ ప్రస్తావన రాగానే చాలా సంతోష పడినది. ఎన్నో బంగారు కలలను కన్నది.తన హృదయములో బావ రూపాన్ని పెట్టుకొని ఆరాధించినది.
          బావ వచ్చిన నాడు స్వతస్సిద్ధమైన లజ్జతో తనేమీ మాట్లాడ లేక పోయినది.  కానీ బావ ఉద్యోగము పోయినదనగానే తన కలల సౌధము కూలి పోయినట్లు బాధ పడినది.
           ఆ సమయములో తను ఓదార్పు మాటలు చెప్ప వలసి యున్నది. కానీ, తను నోరు మెదప లేదు. నీకు నేను తోడుంటానన్న  మాట రాలేదు. ఇంతలో బావ వెళ్ళీ పోయినాడు
            ఆవేదనతో అలసి పోయినది. మరునాడుదయము ఇల్లు  శుభ్ర పరుస్తుంటే పాల రాతి విగ్రహము దొరికినది. నాన్న దీన్ని ఎప్పుడు చెక్కినాడు? తనకు తెలియదేవిగ్రహము తీసి చూచినది. విగ్రహము మీద తన పేరు, శ్రీ నాథుడి పేరు ఉన్నది. అంటే ఆ రోజు బావ ఈ విగ్రహాన్ని ఇక్కడే వదిలి పెట్టి వెళ్ళినాడు అని తెలిసినది.
            ఎప్పుడొ ఎవరో ఒక మహా కవి పలికినాడు. "ప్రియుడి దగ్గిఱకు తీసుకొని పోవుటకు పల్లకి వచ్చిందని కాదు, సంతోషము. ఆ పల్లకిని ప్రియుడే స్వయముగా పంపించినాడుట." ఉద్యోగాలు, హోదాలు ఎన్నో వస్తాయి, పోతాయి, కానీ, మనసులో నిలిచిన మమతానుబంధాలు ఎక్కడికి పోతాయి?
            నాన్నగారు రాగానే జరిగినదంతా చెప్పినది. అప్పుడే నాన్నగారు మరో విషాద వార్త చెప్పినారు, బావ ఊరు వదిలి వెళ్ళినాడుట.
            కొన్నాళ్ళూ పైకి చెప్పుకోలేక రాత్రింబవళ్ళూ ఏడిచినది.  ఒక రోజు రామాచార్యులు వచ్చినారు. తనను దగ్గిఱకు పిలిచినాడు.
            "అమ్మా! హేమా! నీ బావ తప్పక తిరిగి వస్తాడు. నీ మనసును గుర్తిస్తాడు. " అని హామీ ఇచ్చినాడు. ధైర్యము చెప్పినాడు.  కొన్ని నెలలు గడిచినవి.
            శ్రీనాథుడు తిరిగి వచ్చినాడు. చూడాలని ఉన్నది,చూచి పలకరించాలని, తన భాధను దించుకోవాలని అనిపించినది. కొన్ని రోజులు సంశయించినది. వెళ్ళాలంటే ఏదో అభిమానము, లజ్జ. ఒక రోజు ధైర్యము చేసుకొని బయలు దేరినది. వాకిట్లోనే రామాచార్యులు ఎదురయినారు. తన మనస్సులో భావనను ఆయన వెంటనే పసిగట్టినారు.
            "అమ్మా! బాగున్నావా?", ఆయన పలకరించినారు.
            "నీ బావ చాలా నేర్చుకొని వచ్చాడమ్మా.", అంటూ శుభ వార్త చెప్పినాడు.
            "నీ బావ నిన్ను మరిచి పోలేదమ్మా", అని అన్నపుడు తన కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి.
            "నీ దగ్గిఱ ఒక భిక్ష కావాలమ్మా!"అని అన్నపుడు మాత్రము ఆశ్ఛర్య పోయినది.
            తన దగ్గిరేమున్నదని వచ్చినాడు. కలలు క్రుంగిన నిర్భాగ్యురాలు తనేమి భిక్ష ఈయ కలదు?
            ఆయన గురుకులానికి అధిపతి, అందరికి మాననీయులు, త్యాగ శీలి. ఆయన ఉద్దేశ్యము ఏమిటో అర్థము కాలేదు.
            ఆయన పాదాలకు నమస్కరించినది. "మీరు నన్నాజ్ఞాపించ వలసిన వారు. మీ మాటను నేనెపుడూ జవ దాటను, చెప్పండి", అన్నది.
            "కొద్ది నెలలు శ్రీ నాథుడికి కనుపించ వద్దమ్మా! ఆతడి వలన ఊరికి, నీకు ఎంతో మేలు జరుగుతుంది."
            కళ్ళల్లో నీళ్ళూ తిరిగినాయి,ఆ నీళ్ళలోనే ఇంకో ప్రశ్న ఉన్నది."ఎందుకిలా నన్ను శాసిస్తున్నారు?"అని.
            ఆయన అర్థము చేసుకున్నారు తన ప్రశ్నను. తన చేయి తీసి ఆయన చెతిలో పెట్టినది."మీ పాదముల మీద ఆన" అన్నది. ఏడుపు పైకి పొంగుతుంటే పమిట కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ లోపలికి పో బోయినది.
            "అమ్మా!హేమా!",పిలుపు విని ఆగినది. ఆమె కళ్ళలో ఒకే ప్రశ్న,ఇంకా నా నుండి ఏమి కావాలి అని.
            "నిన్ను నేను చాలా భాధ పెడుతున్నాను, నాకు తెలుసు. మీ ఇద్దరి పెళ్ళి నేనే చేయిస్తాను, ఇదే నీకు నేనిచ్చే మాట. శ్రీ నాథుడు ఈ నాడు ఏ పనిని అయినా చేయ గలనన్న ఆత్మ వీశ్వాసముతో యున్నాడు. కృంగి పోయిన సామాజిక పరిస్తితిని చూచి ఆవేశములో నున్నాడు.  నీవిపుడు కనిపిస్తే అతడి దీక్ష సడలుతుందేమోనని సంశయిస్తున్నాను తల్లీ! ఇంక నేను వస్తాను.", అని వెళ్ళి పోయినాడు.
                                       ----------------------------
            భారత  మాత  ఆలయ నిర్మాణము జరుగుతున్నది. అతి ప్రాచీన కాలమునుండి ఈ భూమిని స్త్రీ రూపములో కొలిచినారు. ఆమెను తల్లిగా భావించినారు. మనిషి ఎన్ని రకాల భాధ పెట్టినా సైరించి వారిని మన్నించేది మొదట తల్లి అయితే, రెండవది భూ మాత. అందుకే ఆమె మాతృ రూపములో కొలువ బడుతున్నది.  ఆమె స్వరూపాన్ని దుర్గా మాతగా కూడా కొలిచినారు. ఆ స్వరూపమునే భారత మాత గా కొందరు స్వీకరించినారు.
            ఆలయ నిర్మాణము మొదలు పెట్టినది శ్రీ నాథుడే అయినా, ఇప్పుడది సమిష్టి కార్యముగా జరుగుతున్నది. ఊళ్ళో అందరి తోడ్పాటు ఉన్నది.
            ఊళ్ళో చాలా మంది చూచి వస్తుంటే తనూ చూచినది. బావకు కనిపించకుండా వెనుకకు వచ్చేసినది. బావే కళ్ళ ముందు మెదులుతున్నాడు. గుబురుగా పెరిగిన గడ్డముతో, సున్నితమైన చూపులతో తల ఎత్తకుండా పని చేస్తున్నాడు. ఎంత అదృష్టవంతుడోఆపేక్షతలు, బంధాల అవధులను ఎప్పుడో దాటి వేసాడని అనిపిస్తుంది. ఇలా కొన్ని నెలలు గడిచినవి.
            రాజు బలహీనుడయినాడు. దొంగలు, దోపిడి దార్లుపెరిగి పోయినారు.ప్రజలకు రక్షణ పోయినది. రాజ్యములో ప్రశాంతత పూర్తిగా పోయినది. జాతి అంతటికి ఉప్పెన వచ్చేసినదా అనిపించినది.
            వర్గ, కుల భేదాలు ప్రతి పల్లె లొనూ పెరిగి పోయినవి. ఊళ్ళో పది మంది ఉంటే ఇరువది మంది నాయకులు తయారు అయినారు. దానితో సమగ్ర రక్షణ అనే దానికి అర్థము లేకుండా పోయినది.
            దీనితో కొన్ని దోపిడి మూకలు విజృంభించినవి. స్త్రీ మాన, ధన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయినది. మత ద్వేషము పేరుతో దేవాలయాలు ధ్వంసము చెయ బడుతున్నవి.
            భాగవతములో ఋషభోపాఖ్యానములో ఒక వివరణ ఉన్నది. ఒకప్పుడు ప్రతి మనిషి లో దైవమును గమనించి నమస్కారము చేసే వారుట. తరువాత పతన స్థితి ఏర్పడిన తరువాత ఉత్తమ స్థితిలో నున్న వారిని మాత్రమే దైవ రూపముగా బావించే వారుట. అటు తరువాత తమ తోటి వారిలో దైవత్వము గుర్తించ లేక ఉత్తములయిన పూర్వీకులకు ప్రతీక గా వారి రూపమును ఏర్పరిచి ఉపాసన చేయడము మొదలు పెట్టినారు. ఇదే తరువాత విగ్రహారాధనగా మారినది. దీని వలన మంచి పరిణామము వచ్చినదే కాని నష్టము జరుగ లేదు. 
            మత ద్వేషముతోడు వచ్చిన వారు దేవాలయాల విధ్వంసముతో బాటు, ఒక్కొక్క పల్లెను దోచుకుంటున్నారు. ఎదురు తిరిగే వారు లేరు. ఒకరిద్దరు ఎదురు తిరిగినా వారికి బలి అవుతున్నారు. పల్లెటూర్లు ధ్వంసము అవుతున్నాయి.
            ఉదయాన్నే ఎవరో ఒక వార్తను మోసుకొని వచ్చినారు. పాతిక మైళ్ళ దూరములో ఒక ఊరు పూర్తిగా దోపిడి చేయ బడినదట. ఎందరినో పిల్లలు, వృద్ధులు అని లేకుండా  పొదిచి వేసినారుట. స్త్రీలను అవమానించినారుట. ప్రేత భూమిలా మారిన ఆ పల్లె లోనే విందులు చేసుకుంటున్నారుట.
             ఊరిలో అంతా భయము పెరిగినది. కొంత మంది ఊరు వదిలి వెళ్ళి పోతామంటున్నారు. కొంత మంది ఎదిరిద్దామంటున్నారు.  మఱి కొంత మంది వచ్చిన తరువాత చూద్దామంటున్నారు.అందరి గుండెలలో ఆ ఆశ్వికుల గుఱ్ఱాల గిట్టల చప్పుడే వినిపిస్తున్నది. ఎవరూ ఒక నిర్ణయానికి రాలేక పోతున్నారు.
            కొంత మంది శ్రీ నాథుడిని ఊళ్ళోకి వచ్చేయమన్నారు. కానీ శ్రీ నాథుడిది ఒకటే మాట. రక్షించుకోవాలంటే అందరూ ఒకటయి వారితో పోరాడాండి, అంతే కానీ, పిరికి పందల్లా ఇళ్ళల్లో దాక్కొని జాతిని అవమానాల పాలు చేయకండి. తను మాత్రము ఈ స్థలాన్ని వదిలి రానన్నాడు. ఎవ్వరికీ భయ పడి తన పనిని మాననన్నాడు.