(ఈ కథ సుమారు వేయి సంవత్సరాల క్రింద భారత దేశ పరిస్థితుల దృష్టిలో పెట్టుకొని వ్రాయ బడినది. ఆ నాటి కళాకారులలో మారుతున్న పరిస్థితులను అనుసరించి జరిగే సంఘర్షణ దీనికి మూలము. )
లౌకిక జీవితము పారమాత్మిక జీవితము ఒకటి కాదు.కర్తృత్వము, కర్మ భగవంతుడిని తెలుసుకొనుటకు అడ్డము రావు. నిజానికి, కర్మ ఫలాపేక్ష లేకుండా చేసే చేతలే భగవంతుడి దగ్గరికి చేర్చే మార్గాలవుతాయి. సన్యాసమంటే లౌకిక మైన జీవితాన్ని వదలి వేయుట కాదు. అధికత్వ భావాన్ని, స్వార్థాన్ని వదలి వేయుటే నిజమయిన సన్యాసము. కర్మాచరణ, కర్మ సన్యాసముల రెంటి యొక్క పరమావధి, మనలోనున్న మనలను గుర్తించుటకు, బ్రాహ్మణమును గుర్తించుటకు, వాటి ఏకత్వాన్ని అవగాహన చేసుకొనుటకు. -ఈశోపనిషత్.
ఆచార్యులుగారు ఆపినారు.
శిష్యులందరూ ఆచార్యుల వారినే చూస్తున్నారు.
"సాన్దీపా! శ్రీనాథుడేడీ?"
"ఉదయాన్నే వచ్చినాడు ఆచార్యా! ఏదో ఆలోచిస్తూ ఉండినాడు. ఎప్పుడు వెళ్ళి పోయినాడో, గమనించ లేదు."
"ఆసక్తి లేనపుడు ఏదియు బలవంతముగా రాదు. అలాగని శ్రీనాథుడు మూర్ఖుడు కాదు, జడుడూ కాదు. చాలా తెలివి గల వాడు. కానీ విలక్షణమైన వ్యక్తి. ఈ తర్క అర్థ శాస్త్రాదుల మీద ఆసక్తి లేదు.
కానీ తన తండ్రికి కుమారుడు ఇవన్నీ అభ్యసించాలని ఆశ."
"ఆచార్య దేవా! మరి సంఘములో ఉన్నతమైన స్థాయికి రావాలంటే, ఈ విజ్ఞానమవసరమే కదా! మరి శ్రీనాథుడికి ఇవేమి ఇష్టము లేదేమిటి?"
"ఉన్నతమయిన స్థానమును ఎలా నిర్వచిస్తావు? జయ చంద్రా!"
"రాజానుగ్రహాన్ని పొందుట, ఆర్థికముగా, సాంఘికముగా రక్షణ పొందుట, ప్రజల చేత మన్నన పొందుట."
" మరి మీ నాన్నగారిది ఉన్నత స్థాయి కాదంటావ?"
"అదేమిటి ఆచార్యా! మా నాన్న గారు తలచుకొంటే ఈ దేశాన్ని గడ గడ లాడించ గలరు. ఆయన సర్వ సేనాధిపతి, అంతే గాక మహా రాజుకు అత్యంత ఆప్తుడు."
"మరి మీ నాన్నగారు ఈ శాస్త్రాలన్నిటిని చదవ లేదు కదా!"
"అయినా ఉన్నత స్థాయిని స్వీయ శక్తితో సంపాదించుకున్నాడు."
"నీవు సరిగా అర్థము చేసుకోలేదు జయచంద్రా! శాస్త్రాలు మనము చేసే పనిని మరింత సమర్థవంతముగా చేయుటకుపయోగ పడుతాయి. మనము చేసే పనులను మరింత సమర్థవంతముగా నిర్వహించుటకు, వివరించుటకు ఉపయోగ పడుతుంది. అంతే కానీ, చేసే పనులను ఎప్పుడూ నిర్దేసించవు. మనిషి ఎదుగదలకు ఎక్కువగా స్వీయ ప్రకృతే కారారణము."
"అలా అయితే,శాస్త్రాలకొక ప్రత్యేక ప్రయోజనమేమిటి ఆచార్యా!"
"ఒక ప్రయోజనాన్ని సాధించినపుడే వీటి ప్రత్యేకత మీకర్థమవుతుంది." అంటూ వాకిట్లో కనిపించిన ఆగంతకుడిని చూచినాడు.
"రండి విశ్వకర్మగారు! ఇలా వచ్చి ఆశీనులు కండి.", అంటూ ఆహ్వానము పలికినాడు.
"ఆచార్యా! మా శ్రీ నాథుడేడీ? కన్పించడేమి?",విశ్వ కర్మ అడిగినాడు.
"పాథము మధ్యలోనే ఎటో వెళ్ళినాడు...." , ఒక నిముషము ఆగి మళ్ళీ అన్నాడు,"విశ్వ కర్మ గారూ! మీతో నేనొక విషయము ప్రత్యేకముగా మాట్లాడాలి, అలా లోపలికి వస్తారా?"
ఇద్దరూ లోపలికి వెళ్ళినారు. ఆచార్యుల వారు ఊయల బల్ల మీద , విశ్వకర్మ గారు సముచితమైన ఆసనము మీద కూర్చున్నారు.
"మా శ్రీ నాథుడి గూర్చి మీరేదో చెప్పాలన్నారు."
" ఔను, ఇంత వరకు అతడి గురించే ఆలోచిస్తున్నాను. శ్రీనాథుడికి శాస్త్రాదుల మీద అంతగా ఆసక్తి యున్నట్లు కనిపించదు. అన్నీ అర్థము చేసుకుంటాడు, అడిగిన ప్రశ్నకు జవాబు చెబుతాడు, జడుడు కాదు, తార్కిక దృక్పథము కంటే, తాత్విక పథము మీదే అతడికి ఆసక్తి ఎక్కువని అనిపిస్తుంది. కళ్ళలో సౌందర్యారాధన, నుదుటిలో భావావేశము కనిపిస్తుంది. గొప్ప కళాకారుడవుతాడని అనిపిస్తుంది."
"ఆచార్యా! కళా కారుల జీవితాలను ఎన్నో చూచినారు కదా? నన్నే తీసుకోండి, శిల్ప కళే నా జీవితమనుకున్నాను. దానితోనే నా మనుగడ యనుకున్నాను, కానీ, రాజ్యాలు మారినవి, రాజులు మారినారు, వారిలో ఆ స్థాయి కళా పిపాసులేరీ?"
" విశ్వకర్మ గారూ! మీ కున్న కళా పిపాస నాకు తెలుసును. కానీ, మల్లె పూవులను ఎడారులలో పడేసినా ఆ వాసనను మానుకోగలవా? కోయిల ఆకలితో దాహముతో అరిచినా, దాని గొంతులో మాధుర్యము పోతుందా? అనుభవాల సుడులలో అసలు ప్రకృతి మారిపోయేట్లయితే ఈ విశ్వాన్ని ఎప్పుడో కారు చీకట్లు కమ్మి యుండేవి."
"మరి మా శ్రీనాథుడు శాస్త్రాధ్యయనానికి అనర్హుడంటారా?"
"విశ్వకర్మ గారూ! నేను అలా యన లేదు.అతడి ప్రకృతిని భాధ్యత గల ఉపాధ్యాయుడిగా మరో భాధ్యత గల తండ్రికి వివరించినాను. కానీ, నా శక్తి మేరకు కృషి చేస్తాను. శ్రీనాథుడికి నాకు తెలిసిన విద్యలన్నీ నేర్పిస్తాను.""కృతజ్ఞుడిని . ఆచార్యులుగారూ! మళ్ళీ కలుస్తాను."
(మిగిలిన కథ మరో సారి )
No comments:
Post a Comment