Sunday, April 5, 2015

నిప్పు రవ్వలు



మనటీవి లో పెద్ద అక్షరాలలో ప్రత్యేక ప్రకటన.
ప్రముఖ నిర్మాణ సంస్థ ద్వారా మీకు ఉత్సుకత రేపే సీరియల్
నిప్పు రవ్వలు.
అనుక్షణము మిమ్ములను ఉద్వేగములో ముంచెత్తుతుంది. మీరు చాలా కాలమునుండి ఎదురు చూస్తున్న రచయిత నుండి, మీ కోసం, మీ కుటుంబము కోసము, మీ ఆనందము కోసము ........
ఒక రోజు,
హృదయానికి హత్తుకొనే సంభాషణలతో, మీ కోసం, మీ కోసం, మీ ఆనందము కోసం.......
మరో రోజు,
ఒక నిజమయిన హీరో తనకు జరిగిన అన్యాయాన్ని ఎంత నిబ్బరముగా ఎదుర్కొన్నాడో  చూడాలంటే..
ఇలా రోజుకు ఒక ప్రకటన.
ఈ ప్రకటనలను చూచే ప్రేక్షకులకు ముందే పిచ్చి ఎక్కుతున్నాది. నెల రోజుల ప్రకటనల తరువాత సీరియల్ మొదలయింది.
          ఈ సీరియల్ లో అయిదు మంది నాయకులు, రాజ్యాంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయిదు మంది నాయికలు.
అందులో కథా నాయకుడికి కాస్త ఆవేశము పాలు ఎక్కువ. ఒక ఊత పదము కూడా పెట్టినారు, అతడి మాటలకు. నది రోడ్డు లో అతడిని ఒకరు అవమానిస్తారు. అప్పుడు అతడు మాట్లాడిన ఆవేశ పూరిత డైలాగులను చూచి, అంటే అతడి వాచికమును చూచి ఒకతడు ఆశ్చర్య పోతాడు. తను తీయ బోయే సినీమా లో నాయకుడి పాత్రకు సరిపోతాడని అనిపించి, అక్కడే అతడిని నాయకుడిగా బుక్ చేస్తాడు. ఆ సినీమా సూపర్ హిట్ అవుతుంది. దానితో అతడు తిరుగు లేని నాయకుడు అవుతాడు. అతడి ఊత పదము జనం నోట్లో నాని పోతుంది. ఆడికి అవకాసము ఇచ్చిన దర్శకుడి రేంజ్ కూడా బాగా పెరిగి పోతుంది.
రాజకీయాలలో  ఎదగాలని అనుకున్న ఒక యువకుడు ఈ సినీమా ను చూచి స్ఫూర్తి పొందుతాడు. ఆ కథా నాయకుడితో పరిచయము, స్నేహము, అనుబంధము పెంచుకుంటాడు.
ఈ దర్శకుడు, నాయకుడు, రాజకీయ నాయకుడు, ముగ్గురు కలిసి భారీ పరిశ్రమలతో ఒక ప్రాంతాన్ని అభి వృద్ధి చేయాలని అనుకుంటారు. అంటే కాక ఆ పరిశ్రమల ద్వారా ఏంటో మందికి ఉపాధి కల్పించాలని అనుకుంటారు. ఆ ప్రాంతములో ఒక యువకుడు వీరి పరిశ్రమల వలన వాళ్ళ పంట పొలాలన్నీ పోతాయని గొడవ చేస్తాడు. అయితే ఏమీ లేని వాళ్లకు అక్కడ వాళ్లకు లభించే కూలీకి అయిదు రెట్లు ఆదాయాన్ని కళ్ళ చూపిస్తామని వీరు హామీ ఇస్తారు. వీరు నిస్వార్తముగా ( ఈ కథలో ) చేయాలనుకున్న సేవను ఎక్కువ మంది నమ్మరు. ఆ నమ్మని వారికి నాయకుడే మన నాల్గవ కథా నాయకుడు. అతడు రైతులకు ఈ ముగ్గురికి వారధి.
ఒక రైతుకు కూతురు పెళ్లి నిర్ణయము అవుతుంది. మరో వారము రోజుల్లో పెళ్లి అనగా అతడి పొలాన్ని వీళ్ళు తీసేసుకుంటారు.  గుండె ఆగి పోయి ఆ రైతు మరణిస్తాడు. ఆ పెళ్లి ఆగి పోతుంది. చివరకు పెళ్లి కూతురు అన్న ఆక్రోశము తో బయటకు వస్తాడు. అతడు అయిదవ కథా నాయకుడు. ఆ పెళ్లి కూతురు ఒకానొక నాయిక అవుతుంది.
వీరు అయిదు మందే మన నిప్పు రవ్వలు.
ఈ సీరియల్ లో డైలాగులు ఎంత తీవ్రముగా ఉంటాయంటే  ప్రతి యొక్కరు నాయకుల వలె కనిపిస్తారు. ఒక్కొక్క సారి వీళ్ళు నాయకులా, ప్రతి నాయకులా అనే  అనుమానము రాక పోదు. అయినా రోజు రోజుకూ చూచే వారి సంఖ్య పెరుగుతున్నది. ఇంకా తమకు వచ్చే అనుమానాలు తీర్చుకోవడానికి నిప్పు రవ్వలు అభిమాన కమిటీలు ఏర్పడినాయి. ఇంకా వాళ్లకు రోజంతా ఇందులోని మలుపుల మీదే చర్చ.
కంప్యూటర్ గేమ్స్  ఆడే వాళ్ళ మత్తు కంటే  ఈ మత్తు మరీ ఎక్కువగా ఉందని  సామాజిక వేత్తలు గమనించి,దీని మీద పితూరీలు(కంప్లైంట్స్ )పెట్టినారు. ఇది అన్యాయమనీ వ్యక్తిగత స్వాతంత్రానికి భంగకరమని మానవ హక్కుల సంఘాలు ఆ పితూరీలను ఎదుర్కొన్నాయి.  ఇంకా ఈ కేసు జరుగుతున్నంత కాలము ఈ సీరియల్ కు ఎలాటి భయము లేదు.
ఇంకా ఈ విషయములో వస్తున్న కంప్లైంట్స్ మీద ప్రభుత్వానికి ఎలా స్పందించాలో తెలియటము లేదు. కుల ద్వేషము పేరు చెప్పి దీనిని ఆపేయాలంటే, ఇందులో కులాంతర వివాహాలున్నాయి. మత ద్వేషము పేరు చెప్పాలంటే  ఇందులో మతాంతర వివాహాలు కూడా ఉన్నాయి. ఏ ఇతర కారణము చూపించినా అంతర్జాతీయ మానవ హక్కుల సంఘము నుండి నోటీసులు వస్తున్నాయి.
ఈ విధముగా ఈ సీరియల్ కొన్ని సంవత్సరాలు నడిచింది. ప్రతి సంవత్సరానికి ఒకరు విలన్ అవుతాడు. ఆరు నెలలకొకసారి ఒకరు హాస్పిటల్ కు వెళ్లుతారు. ఎప్పుడెప్పుడు కోమాలోకి వెళ్ళాలి అనేది రచయిత నిర్ణయిస్తాడు. అప్పుడప్పుడు జైలుకు కూడా వెళ్ళుతూ ఉంటారు. ఇంకా అనుమానాలు, అవమానాలు, పగలు, ద్వేషాలు ఒక సీరియల్ కు తప్పనిసరే కదా. ఇన్నాళ్ళు గడిచిన తరువాత ఎవరు కథానాయకుడు అనే విషయాన్ని అందరూ మరిచి పోయినారు. ఆ సంభాషణల తీవ్రతలో సీరియల్ నడుస్తున్నంత సేపు ఆ విషయము గుర్తుకు రాదు.
కళ్ళల్లో నీరుబికిస్తూ  హృదయాన్ని తాకుతున్న ఆ సంభాషణల వలన స్త్రీ ప్రేక్షకులు ఆ సీరియల్ ను వదల లేక పోతున్నారు.
అందరూ విలువలను గూర్చి మాట్లాడే వారే కానీ విలువలను ఆచరణలో ఎత్తే వారు కనిపించుట లేదు. ప్రేక్షకులు ఒక విధమయిన  కంఫ్యూజన్  లో ఉన్నారు.
దీనికి ముగింపుగా ఒక కథ చెప్ప వలసి ఉన్నది. ఒక గురువు సత్యాన్నే పలకాలని తన ముగ్గురు శిష్యులకు పాఠము ద్వారా బోధించినాడు. మరు నాడు  ఆ ఆతము గూర్చి అడిగినాడు.
మొదటి శిష్యుడు, “మీరు చెప్పినది మొత్తము వచ్చేసింది” అని మొత్తము ఒప్ప చెప్పినాదుట. (ఆధునిక విద్యార్థి)
రెండవ శిష్యుడు,” దీని అంతరార్థము తెలిసింది.” అని చెప్పినాడుట.( మధ్యే మార్గము)
మూడవ శిష్యుడు,”గురువు గారు!నేను అన్నిటి లోను ఆలస్యమే. అసత్యము చెప్పకుండా బ్రడుకదానికి చాలా సాధన చేస్తున్నాను. అందుకే  నాకు పరిపూర్ణత ఇంకా రాలేదు.” అని, కన్నీలు పెట్టుకున్నాడు.
“ నా పాఠాలను అప్ప చెప్పే వాళ్ళ కంటే  ఆచరించే వాళ్ళే  నాకు సరి అయిన శిష్యులు. నీవే అందుకు తగిన వాడివి.”,అని ముద వాడిని ఆసీర్వదిన్చినాడుట.
గమనించండి ఈ తేడాను.



Sunday, March 8, 2015

పాపాయి



అతడు నెమ్మదిగా నడుస్తున్నాడు. చుట్టూ ఎడారిలా ఉంది. నైరాశ్యము అతడిని కమ్మేసింది. ఇక్కడ నాతొ మాట్లాడే వారు ఎవరూ లేరా? అటూ ఇటూ చూచాడు.
“ఖచ్చితముగా ఎవరో ఒకరు కనిపిస్తారు, నాకు ఏమి చేయాలో చెబుతారు.”, అనుకున్నాడు.
దగ్గర లో ఒక గొంతు వినిపించినది. “నాయనా! ఏమిటి, ఒక్కడి వే ఎక్కడికి వెళ్ళుతున్నావు?”
తల తిప్పి చూచినాడు. ఆ పక్కనే కొండ కింద ఒక గుహ లా ఉంది. గుహ ముందు ఒక సన్యాసి చేతిలో రుద్రాక్ష  మాలతో నిలబడి వున్నాడు.
తను ఆశ్చర్య పడినాడు. ఇంత వరకు తను చూడని కొండ గుహ ఎక్కడ నుండి వచ్చింది. అక్కడ ఒక సన్యాసి. అది ఒక మాయా లోకము లా ఉన్నది.
నెమ్మది గా ఆయన వైపు నడిచినాడు.
“ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నా వాళ్ళు ఎవరూ నన్ను పలకరించుట లేదు. ఒకటే ఏడుపులు.  ఇంకేమీ వినిపించుట లేదు.”
“మార్పు కలిగినపుడు  ఇలాగే ఉంటుంది, నాయనా! ఇంతకూ నీకు ఏమి కావాలి?”
“అదే తెలియదు. ఇదేమి లోకము?  ఇక్కడ ఎవరూ ఉండరా?”
“ఎందుకు ఉండరు? నీవు గట్టిగా కోరుకుంటే అందరూ నీ ముందే ఉంటారు. ఇలా రా నాయనా! ఇక్కడికి వచ్చి కూర్చో.”
ఇద్దరు చెరొక బండ రాయి మీద  కూర్చున్నారు.
“మీరడిగినారు చూడండి, అదే నాకు తెలియటము లేదు. ఇంతకూ నేను ఎవరిని?”
“ఒక్క సారి అటు చూడు నాయనా! నీకే తెలుస్తుంది.”
హఠాత్తుగా ఎదురుగా ఉన్న ఎడారి మాయమయింది. అపరిమితమయిన కాంతి.  అందులో నుండి ఒక కాంతి కణము బయటికి వచ్చింది.
ఆ కాంతి కణము కొండలో ఉన్నంత సేపు సొంత వ్యక్తిత్వము కలిగి లేదు. బయటికి రాగానే కొత్త కొత్త ప్రశ్నలు ఎన్నో వచ్చినాయి.
“రాక్షసులు, మనుషులు, దేవతలు,... ఇంకా నాగులు, గంధర్వులు, కిన్నరులు, యక్షులు ... ఇన్ని రకాల విభిన్న జీవులు. వీళ్ళంతా ఎవరు? ఋషులు అంటే ఎవరు? కష్టాలు అంటారు. సుఖాలు అంటారు. ఇవన్నీ ఎవరికీ? ఎందుకు?”, అన్నీ ప్రశ్నలే.
గట్టిగా మళ్ళీ అనుకున్నది.
“ఇవి చెబితే తెలిసేవి కావు. ఇవి చర్చకు అందనివి.”, ఎక్కడినుండో జవాబు వచ్చింది.
“ మరి చెప్పక పొతే ఎలా తెలుస్తాయి?”, తనలో ప్రశ్న రేగింది.
“ అనుభవము. అనుభవమే జ్ఞానాన్ని నిలుపుతుంది.”
“ప్రశ్నిస్తే తప్పేమిటి? జవాబు రాదా?”
“ఒక ప్రశ్న వంద ప్రశ్నలకు దారి తీస్తుంది. ఇది ఒక వలయములా కమ్మేస్తుంది. అదే అనుభవమయితే మరో ప్రశ్న ఉండదు.”
“అదే, అనుభవము ఎలా వస్తుంది?”
“కావాలనుకుంటున్నావా?”
 “కావాలి.”
“అయితే నీవొక కొత్త లోకములో ప్రవేశించాలి.  నిన్ను మాయ కమ్మి వేస్తుంది. నీవన్న కష్టాలు, సుఖాలు అన్నీ నిన్ను మరిపిస్తాయి. అందుకు సిద్ధమేనా?”
“సిద్ధమే.”
ఒక్క సారి ఆ దృశ్యమంతా మాయమయింది.
“ స్వామీ ఇదంతా ఏమిటి?”
“ఆ కాంతి కణానివే నీవు. ఆ అనుభవము కోసమే కాంతి రూపము వదలి క్రిందికి దిగినావు.”
“ఆ తరువాత.”
“కష్టాలు, కడగళ్ళు, సుఖాలు వీటితో వచ్చే అనుభవము నీలో సరి కొత్త మార్పును తీసుకొని వస్తుంది. ఒక్కొక్క జన్మలో అనుభవాలు నీలో చేరే కొద్దీ ఈ మార్పు పూర్ణత్వాన్ని సంతరించుకుంటుంది.  ఒక కాంతి జీవి అబద్ధము చెప్ప వలసిన అవసరము లేదు. కాని ఒక దేహములో ఉన్న జీవికి ఆ అవసరము రా వచ్చును. దానిని ఎలా ఎదురు కోవాలో తన అనుభవమే నేర్పుతుంది.”
“ మరి దేవతలు అంటే ఎవరు?”
“దేవతలు అందరికీ అనుభవాలు ఉండవు. అనుభవము తోనే వారు ఎదుగుతారు. అందుకే  దేవతలు అయినా పై స్థాయిని అందుకోవాలంటే భౌతిక దేహములో జన్మ తీసుకోవలసి ఉన్నది.”
“ మరి ఋషులు.”
“నిరంతర పరిణామముకు తపిస్తూ ముందుకు సాగుతున్న వారే ఋషులు. దేవతలకు కూడా వారు మార్గాన్ని చూపించ గలరు.”
“అయితే వాళ్ళు ఋషులు ఎలా అయినారు?”
“అటు చూడుము..”
అక్కడొక్క దృశ్యము కనిపించింది.
ఎదురుగా ఒక దారి ఉంది. ఆ దారి లో నలుగురు వెళ్ళుతున్నారు. వారి ముందు ముళ్ళ చెట్లు పది దారి మూసుకొని పోయినది.
మొదటి వ్యక్తీ విసుగ్గా ముఖము పెట్టి మరో దారిలో వెళదామని వెనక్కు తిరిగినాడు.
రెండవ వ్యక్తీ పరిస్థితి మారు తుందేమో చూద్దామని అక్కడే కూర్చున్నాడు.
మూడవ వ్యక్తీ తన వరకు కాస్త ముళ్ళ కొమ్మలు తొలగించి, ముందుకు వెళ్ళాలని ప్రయత్నము చేస్తున్నాడు.
నాల్గవ వ్యక్తి మాత్రము చుట్టూ చూచి, పెద్ద కర్ర తీసుకొని, చాలా శ్రమ పడుతూ, ఆ ముళ్ళ కొమ్మలను పక్కకు తొలగించుటకు తంటాలు పడుతున్నాడు. మూడవ వ్యక్తిని సహాయము అడిగినాడు. కానీ ఆ మూడవ వ్యక్తికీ తన దారి కనిపించ గానే వెళ్లి పోవడమే లక్ష్యముగా ఉంది.
“ఇదంతా ఏమిటి స్వామీ జీ!”, అని అడిగినాడు.
“మొదటి వాడు ఈ ఇబ్బందిని ఎదుర్కొనుటకు ఇష్టము లేని వాడు. మార్పు మీద ఆశ కూడా లేని వాడు. రెండవ వాడికి ఆశ ఉంది. శ్రమ పడుట ఇష్టము లేదు. మూడవ వాడికి శ్రమ పడినా తన వరకు చూసుకోవాలి అనుకున్న వాడు. ఇంక నాలుగవ వాడు ఇప్పుడు తను పడుతున్న శ్రమ , ఇబ్బంది మరెవరు పడకూడదని అనుకున్న వాడు. ఈ విధముగా పరుల హితములో తన హితమును  చూచుకొన గలిగిన వాడే ఋషి కా గలడు.”, స్వామీ జీ ముగించినాడు.
తిరిగి మరో దృశ్యాన్ని చూపించినాడు.
“అక్కడ ఒక కాలువ ప్రవహిస్తున్నది. అందులో ఒక తేలు కొట్టుకొని పోతున్నది.  ఒకతడు ఆ తేలు మీద జాలి పడి, దానిని వేగముగా చేతి లోనికి తీసుకొని  గట్టు మీది కి విసిరి వేద్దామని అనుకున్నాడు. అది గట్టిగా కుట్టినా భరిస్తూనే  దానిని గట్టుకు చేర్చినాడు.”
“అంటే ఆయనకు తేలు కుడుతుందని తెలియదా?”
“ అదే మాట ఆయనను అడిగితే, “ఆ తేలు ఎవరి నయినా కుట్టే తన లక్షణము మానుకో లేదు కదా! మరి దేని నయినా రక్షించాలన్న నా లక్షణాన్ని ఎలా మానుకో గలను?” అన్నాడు.”
“ఈ విధముగా ఉండలేని వాడు, పరిస్థితులను బట్టి తన లక్ష్యాలను మార్చుకొనే వాడు ముందుకు వెళ్ళ లేడు. అంటే తేలు చేత కుట్టించుకోవాలని కాదు. పర హితాయచ జీవితమూ అనే భావన ఉన్న  ప్రతి యొక్కరు ఎదుగుతున్న వారే.”
“అయితే స్వామీజీ! అటువంటి పరిస్థితులలో  నాకు రక్షణను లేదా సలహాను ఇచ్చే వారు ఎవరు?”
“ఎలా నడచుకోవాలి అనే విషయములో నీవు చదివిన మంచి  పుస్తకాలు సహాయ పడతాయి. నీవు అలా నడచుకొంటె దైవిక శక్తులతో నీకు సంబంధము ఏర్పడుతుంది. నీవు దారి తప్పుతుంటే నీ అంతస్సాక్షి  గుర్తు చేస్తూనే ఉంటుంది. అన్నిటి కంటే నీకు కావలసింది శ్రద్ధ, సబూరి(విశ్వాసము).”
“అవి నిలబడాలంటే ఎలా? నాకు భగవంతుడితో సంబంధము ఎలా నిలబడుతుంది?”
“భగవంతుడితో నీకున్న సంబంధాన్ని నీవే మరచి పోతున్నావు. సామాన్య పరిభాషలో చెప్పాలంటే నీకు కావలసిన వసతులన్నే భగవంతుడే ఏర్పాటు చేస్తున్నాడు. పుట్టిన నాటినుండి నిరంతరమూ ప్రాణ ప్రవాహము నీలో ప్రవహిస్తూనే ఉంది. ఆ శక్తి ధార తెగి పోయినపుడే మరణము.ఇది కూడా భగవంతుడు నీకు ఇచ్చిన ఉపకరణము. పసి పిల్లాడుగా బయటికి వచ్చినప్పటి నుండి, పంచ భూతాల నుండి  విడి పోయే వరకు,నీకు శ్వాసను ఏర్పాటు చేసినదీ భగవంతుడే. అదీ మరచి పోయినావు.
ఆ శ్వాస లో కూడా ప్రాచ్య దేశాలు  యింగ్ మరియు యాంగ్ అనే పేర్లతో కొన్ని విభాగాలను గుర్తించినాయి. అందులో యింగ్  అంటే భౌతిక శరీరానికి సంబంధించినది. యాంగ్ శక్తి తత్వానికి సంబంధించినది. మొదటిది మనస్సుకు, రెండవది బుద్ధికి, మొదటిది రాత్రికి, రెండవది పగలుకు, మొదటిది చంద్రుడికి రెండవ ది సూర్యుడికి సంబంధించినవి. కానీ ఈ రెండిటి యొక్క సంధిని పట్టుకుంటే దైవీ తత్త్వము దగ్గరకు వస్తుంది. దీనినే భారతీయులు అగ్ని తత్త్వము లేదా కుండలినీ తత్త్వము అని అన్నారు. ఈ శ్వాసను నియంత్రించుట ద్వారా ఆలోచనల మీద నియంత్రణ  ఏర్పడుతుంది.  ఈ విధముగా ఆయనను గుర్తించే తాళాలను ఆయన ఏర్పాటు చేసినారు. ఈ సాధనల ద్వారా అపరిత మయిన అనుభవాలు, జ్ఞానము మనకు లభిస్తాయి. మనము బలహీనులము, అసహాయులము అనే భావనలు మనల నుండి తొలగి పోతాయి.
“ మరి మానవుడు ఎందుకు నిరంతరము బాధలు పడుతూ బల హీనుడుగా తయారవుతున్నాడు?”
“ ఆవు దూడ తల్లి గర్భము నుండి బయటకు రాగానే తనకు తల్లి నుండి పాలు లభిస్తాయి. ఒక పిల్లాడు కుడా తనకు ఇష్టమయిన వాటి వైపు ఆకర్షితుడవుతాడు. పూర్ణ మయిన ఆత్మ కూడా భౌతిక ప్రవేశించినపుడు మొదట అన్నే లభించినా కొంత కాలానికి తన మూల తత్వాన్ని మరచి పోతాడు. దీనిని మాయ అంటారు. ఇది కూడా ఒక రకమయిన మతి మరుపు. తను అనుభవము ద్వారా సాధించిన జ్ఞానము సంస్కారముగా తనలో కారణ శరీరము లో నిక్షిప్తమై తనకు సంస్కారముగా తన తోనే ఉండి పోతుంది. తను నేర్చుకొని (అనుభవము లోనికి రాని సమాచారము )జ్ఞానము కాదు. అందుకే అది మాయ చేత కప్పి వేయ బడుతుంది. పూర్తి జ్ఞానాన్ని అనుభూతి లోనికి తెచ్చుకున్న వ్యక్తి మానవుడు గా కాక దైవీ మానవుడుగా మారతాడు. ఇది పరిణామములో అయిదవ స్థితి.”
“ అయితే మిగిలిన నాలుగు స్థితులు ఏమిటి?”
“పరిణామములో ఖనిజ స్థితిని అనుభవిస్తాడు. అక్కడ కొద్దిగా సూక్ష్మ దేహము ఉంటుంది. అక్కడ అనుభవాలు చాలా తక్కువగా ఉంటాయి. తరువాత వృక్ష స్థాయికి వస్తాడు. వీటికి ప్రకృతి నుండి శక్తిని స్వీకరించుకుంటుంది. ఇక్కడ భావావేశములు ఏవీ ఉండవు? తరువాత జీవి జంతు స్థాయికి వస్తుంది. ఇక్కడ సూక్ష్మ దేహము వృద్ధి పొంది , భావావేశములకు నిలయము అయిన కామ దేహము లేదా ఆస్ట్రల్ బాడి ఏర్పడుతుంది. కామ దేహములో శక్తులను విపరీతముగా ప్రేరేపించ వచ్చును. వీటిని సద్వినియోగము లేదా దుర్వినియోగము చేయ వచ్చును. ఈ కామ దేహ స్థితిలో ఉన్నపుడే జంతు స్థాయినుండి, మానవుడుగా జన్మ లభించును. అట్లాంటిస్ లోని మానవ జాతి కామ దేహమును ఉపయోగించి మొత్తము మానవ జాతిని నియంత్రించడానికి ప్రయత్నించినారు. మనస్సు అనే ఉపకరణము మానవ జాతికి ఏర్పడటము తో మానవ అనే శబ్దముకు అర్థము ఏర్పడినది.   
  మనస్సు మనలను నియంత్రించినపుడు అది అగ్ని లాగ మనలను దహిస్తుంది.  దానిని మనము నియంత్రించినపుడు దాని ద్వారా మనకు అపరిమితమయిన శక్తులు లభిస్తాయి. ఇవి లోక కల్యాణానికి ఉపయోగ పడుతాయి. ఈ స్థితినే దైవీ మానవ స్థితి అన్నారు. ఇప్పటి మానవుల లక్ష్యమదే.”
 “మరి ఉన్నత తలాలని అన్నారు. అవి ఎమిటో చెబుతారా?”
“వీటినే మితి లేదా డైమెన్షన్ అని అంటారు. ఇప్పుడు మనము పృధ్వీ తత్త్వము లోనే ఉన్నాము. అది మూడు మితులకు (అంటే 3 డైమెన్షన్) సరిపోతుంది. కాలాన్ని గుర్తించాము. కాని దాని లోనికి ప్రవేశించడం మానవుడికి చేత కాలేదు అది చేతనయితే మనము నాల్గవ మితి లోకి ప్రవేశిస్తాము. దీని వలన మనిషికి భూత , భవిష్య వర్తమానాలలో సమముగా బ్రదుకుట తెలుస్తుంది. విపరీతముగా మానవుడి శక్తి యుక్తులు పెరుగుతాయి. వీటి గురించి సూచనలు ఉన్నాయి, కానీ వీటిని అందుకొనే స్థితికి మానవుడు చేర లేదు.”
“స్వామీజీ! ఇపుడు మీరు చెప్పిన జ్ఞానమంతా నాతోనే ఉంటుందా?”
“ఉంటుంది. కానీ నీకు అందదు. కారణము ముందే చెప్పాను. అది నీ అనుభవము కాదు. నీవు సంపాదించుకున్నదే నీ కారణ దేహములో ఉంటుంది. మిగిలినది మాయతో కప్ప బడి ఉంటుంది. కారణము ఒకటే. దానిని అందుకునే స్థితిలో మీరు ఉండరు.”
“ఇది అన్యాయము కాదా స్వామీజీ!”
“ ఎ మాత్రము కాదు. ఒక ఉదాహరణ  చెబుతాను. కంప్యుటర్ ఉపకరణాలతో కూడిన కారును నడిపే వ్యక్తీ యొక్క సామర్థ్యము మామూలు అంబాసిడర్ కారు నడపుటలో ఉపయోగ పడదు. యోగస్థితి అందుకున్న వ్యక్తీ మామూలు మానవుడి దేహములో ప్రవేశిస్తే తన పూర్తి స్థితి అందుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతాడు. అంటే దేహము కూడా సామర్ధ్యానికి తగినట్లుగా ఉండాలి. అందుకే యోగ పురుషులు పుట్ట వలసి వచ్చినపుడు యోగుల గృహాలనే ఎన్నుకుంటారు.”
“తన కున్న జ్ఞానముతో తన దేహాన్ని మార్చుకోలేరా?”
“దేహము తట్టుకో గలిగిన  శక్తి కన్నా ఎక్కువ శక్తిని దేహానికి అందిస్తే దేహ కణాలు ఆ శక్తిని తట్టుకో లేక విఘటనము చెందుతాయి. దీని వలన భయంకరమయిన వ్యాధులు రావచ్చును.”
“మరి ఒక జన్మలో ఈ మార్పు తీసుకొని రాలేమంటారా?”
“ చేయ వచ్చును. కానీ దానికి చాలా కఠిన మయిన నియమాలను పాటించ వలసి వస్తుంది. ముందు మనస్సును నియంత్రించాలి. మనస్సును ఆహారము చాలా ప్రభావితము చేస్తుంది కాబట్టి,, శవాహారము (అంటే మాంసము లాటివి )ను పూర్తిగా వదలి వేయాలి. తరువాత తామసిక ఆహారము (నిలవ ఉన్నవి మరియు ఉల్లి, వెల్లుల్లి తో కూడినవి) ను వదిలించుకోవాలి. అటు తరువాత కోపాన్ని పెంచే మసాలాలు కూడిన రాజసిక ఆహారము ను వదిలించుకోవాలి. ఇంతకూ ముందు చేరిన మురికిని ఆసనాలు, ప్రాణాయామములు, ధ్యానము ద్వారా శుద్ధి చేసుకోవాలి. తరువాత వండిన ఆహార పదార్థాలను కూడా వదిలి వేయ వలసి యుంటుంది.. ఇదంతా సమర్థుడయిన గురువు పర్యవేక్షణలో చేస్తే మంచిది.”
“మరి, మనిషి శవాహారాన్నే ఎందుకు ఇష్ట పడుతున్నాడు?”
 “” అది అతడి పరిణామ స్థితి మీద ఆధార పడుతుంది. తన సంస్కార ప్రభావము ఎంత తీవ్రముగా ఉంటుందంటే  ఇంకొకరు చెప్పినా నమ్మడు.”
“ఇప్పుడు మీరు చెప్పిన జ్ఞానము మాకు అందుబాటు లో ఉంటుందా?”
“ఇప్పుడు చెప్పిన వన్నీ ఆకాశములో నిక్షిప్తమై ధ్యానములో ఉన్న వారికి అందుబాటులోనే ఉంటాయి.”
“మరి స్వర్గము, నరకము లాంటివి....”
“ఈ లోకము అద్దము లాటిది. దుష్ట సంస్కారములు కల వారికి ఈ లోకము చెడు అనుభవాలనే ఇస్తుంది. అప్పుడు మన కర్మకు అధినేత  యమ ధర్మ రాజు పేరుతొ చాలా క్రూరుడు గా కనిపిస్తాడు. మంచి సంస్కారములు కలిగిన వారికి ఆయనే ఉపదేశకుడుగా అందగాడుగా, మృదు స్వభావిగా కనిపిస్తాడు.”  
“ఇంకా నాకు తెలుసుకోవాలని ఉంది. మీరు నాకు అందుబాటులో ఉంటారా?”
“చిత్త శుద్ధితో నేర్చుకోవాలని అనుకున్న ప్రతి వారికి భగవంతుడు జ్ఞానాన్ని అందుబాటులో ఉంచుతాడు.”
స్వామీజీ మళ్ళీ చెప్పినాడు.
“మనిషి మరణించినపుడు అతడి పై ఏ గ్రహము ప్రభావముతో ఉంటుందో, ఆ గ్రహము తిరిగి ప్రభావిత మయినపుడు మళ్ళీ జన్మించే అవకాశము వస్తుంది. ప్రస్తుతము నీకు ఆస్థితి వచ్చింది. సిద్ధమేనా?”
“ఖచ్చితముగా వెంటనే జన్మించాలా?”
“పుట్ట వలనా లేదా అనేది నీ నిర్ణయము పై ఆధార పడి యుంటుంది. ఇప్పుడు తప్పితే తిరిగి ఈ స్థితి రావటానికి చాలా కాలము పడుతుంది. నీ నిర్ణయమేమిటి?” 
 “అయితే నేను సిద్ధమే.”
“మరొక విషయము నీవు జన్మించిన తరువాత మూడు నెలల వరకు ఈ జ్ఞానము నీతోనే ఉంటుంది.అందుకే మూడు నెలల వరకు పుట్టిన పిల్లలు దైవీ ప్రజ్ఞతో ఆనందముగా ఉంటారు. ఆ తరువాత నీ సంస్కారాలు నీలో జొరబడి ఆ జ్ఞానాన్ని కప్పి వేస్తుంది.. ఇంక బయలు దేర వచ్చును.”
తిరిగి యాత్ర మొదలయింది. తను తల్లి గర్భమునుండి బయటకు వచ్చినాడు.  ప్రతి యొక్కరు తనను ఎత్తుకొని ముద్దాడుతుంటే చాలా ఆనందముగా ఉంది.
అందరికి తను ప్రత్యేకముగా కనిపిస్తున్నాడు. తల్లి పాలు అమృతము లాగున్నవి. ఆ సమయములో స్వామీజీ చెప్పిన ప్రతి విషయము గుర్తు ఉంది. వాటిని మరచి పోగూడదని గట్టిగా నిర్ణయము చేసుకున్నాడు.
కొన్నాళ్ళ తరువాత తల్లి పాలలో ఏదో తేడా కనిపించినది. బాగా కడుపు నొప్పి వచ్చి, ఏడుపు వచ్చింది. అందరూ హడావుడి చేస్తున్నారు. అప్పుడు ఒకావిడ “పచ్చి బాలింటావు. అంట ఘాటు పచ్చడి ఎందుకు తిన్నావు?”అని అడిగింది.
“ఇన్నాళ్ళు పథ్యము  తిని నోరు చవి చెడింది,”అన్నది.
అప్పుడు అమ్మ మీద కోపము వచ్చింది.
ఇంకో రోజు అమ్మ ఇంకో పిల్ల వాడిని ఆడిస్తుంటే నన్ను వదిలి వేరే వాడిని ఆడిస్తున్నావా? అని బాగా అసూయ వచ్చింది.
ఈ విధముగా రోజుకు ఒక అవతారము ఎత్తినాను. మూడు నెలలు అయేసరికి ఎంత ప్రయత్నించినా స్వామీజీ మాటలు గుర్తుకు రావటము లేదు.

************************************

Tuesday, March 3, 2015

ఉడత 5




ఒక్క సారి గతమంతా కళ్ల ముందు మెదిలింది. తను ధర్మ మార్గములో నడిచే కొడుకు కావాలని కోరుకుంది. అంతా మహా దేవుడి అనుగ్రహము.
ఈ సంఘటనలన్నీ ఆకాంక్ష కు సూచనా మాత్రముగా చెప్పింది. విషయాన్ని తనే కదల్చాలని స్వామీ జీ చెప్పినారు. తను మొదటి ప్రయత్నమూ చేసింది. అంతకంటే ముందుకు వెల్ల లేక పోయింది.
ఆకాంక్షకు కూడా తనకు వచ్చిన కల నిజమవుతుందేమో అని అనిపించింది.
ఆ రోజు సీతమ్మ ఆదిత్య దగ్గర ప్రస్తావన తీసుకొని వచ్చింది.
“ఆ అమ్మాయిని చూచినావా? ఎలాగుంది?”, అని ప్రశ్నలు వేసింది.
“అప్పుడే తొందరేమిటమ్మా!”, అన్నాడు ఆదిత్య.
ఇంకా ఆనంద్ వచ్చిన తరువాత మళ్ళీ ప్రస్తావించాలనుకుంది. ఆకాంక్ష గురించి రామ తీర్థములో తన అమ్మా నాన్నలకు కూడా తెలియ చేసింది. తమ ఆరాధ్య దైవము మహా దేవుడికి నమస్కారము పెట్టుకుంది.
ఒక వారము గడిచినది. ప్రక్క ఇంట్లో ఒక అమ్మాయి భాగవత పద్యాలు పెద్దగా చదువుచున్నది. అందులోను అది రుక్మిణీ కళ్యాణ ఘట్టము.
“ఎవరమ్మా! అంత శ్రావ్యముగా చదువుతున్నది?”, అడిగినాడు ఆదిత్య.
“ఇంకెవరు? అక్కడ ఉండేది, ఆకాంక్షే కదా! వాళ్ళ తాతయ్య , నానమ్మ వచ్చినారుట. వాళ్లకు చదివి వినిపిస్తున్నది.”, అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నది సీతమ్మ.
“చాలా బాగా చదువుతున్నది కదమ్మా!”, అన్నాడు ఆదిత్య. సీతమ్మ మరేమీ మాట్లాడ లేదు.
మర్నాడు ఉదయము ఆకాంక్ష యొక్క నానమ్మ  తాతయ్య వచ్చి సీతమ్మను, ఆదిత్యను  పరిచయము చేసుకున్నారు. కాసేపు తమను గూర్చి చెప్పుకున్నారు. క్షేమ సమాచారాలు మాట్లాడినారు.
తరువాత పెద్దాయన  ఆదిత్యను అడిగినాడు.
“ పెళ్లి అంటే నీ ఉద్దేశ్యమేమిటి బాబూ!”
ఆదిత్య ముందు ఇటువంటి ప్రస్తావన వస్తుందని ఊహించ లేదు. ఎందుకు అడుగుతున్నా డో అర్థము కాలేదు. అయినా పెద్ద వాళ్ళు కాబట్టి నెమ్మదిగానే జవాబు చెప్పినాడు.
“” మనిషి తన పరిమితులను పెంచుకోవడములో ఒక భాగము పెళ్లి. ఇందులో రెండు కుటుంబాలు పరస్పరము సహకరించుకోవడానికి అంగీకరించి , ఒకే కుటుంబముగా మారుతుంది.”
ఆకాంక్ష తాతయ్య గారు ఇటువంటి జవాబు విని ఆశ్చర్య పడినాడు. తను ఆశించే జవాబు కంటే వచ్చిన జవాబు స్థాయి చాల ఎక్కువగా ఉన్నది.
“అంతేనా? ఇంకేమయినా చెబుతావా?” తాతయ్య గారు అడిగినారు. ఎందుకంటే ఆదిత్య యొక్క మాటలు ఆయన్ను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి.
“ఆకర్షణ తో మొదలు అయినా పెళ్లి అనేది ఒక యజ్ఞము. దీనిని ప్రాజాపత్య యజ్ఞమని అంటారు. దీనిని ఒక పరంపరను నిలపడానికి ఒక ఉపాధి లాగా ఋషులు భావించినారు.  ఈ నాడు అర్థాలు మారి పోయి ఉండ వచ్చును. పెళ్లి అయిన తరువాత రెండు కుటుంబాల మధ్య వారధి గా వధువు భాద్యత తీసుకుంటుంది.”
“ఇంతకూ ముందు పరిమితత్వము, అపరిమితత్వము అని అన్నావు. పెళ్లి వలన ఇటువంటి మార్పు ఎల్లా జరుగుతుంది?”
“తన కుటుంబము , తన వాళ్ళు అని ఆలోచించే వ్యక్తీ వివాహము వలన ఆ కుటుంబము కూడా తనదే ఆ భావన లోనికి వస్తాడు. అంటే తనకున్న పరిమితులు దాటి పరిధిని పెంచుకున్నట్లే కదా!”
“ఇవి మన ఆచారాల్లో ఎక్కడ వస్తాయి?  అసలు మేమెప్పుడు ఈ పరిధిలో ఆలోచించ లేదు. కాస్త వివరముగా చెప్పు బాబూ!”
ఈ లోపల సీతమ్మ ప్లేట్లో జీడి పప్పు తెచ్చి పెట్టింది. ఆమెకు జరుగుతున్నదంతా సంతోషాన్నే కలిగిస్తున్న ది.
“ మనకు అన్నీ ఉన్నాయి. భావము పట్టించుకోకుండా చేస్తున్నందున మనకు ఫలితాలు వస్తున్నా నమ్మకాలు సడలి పోతున్నాయి.  అర్థము చేసుకోకుండా చేసినా ఫలితాలు రావచ్చు . కానీ అర్థము తో చేసినపుడు మన మానసిక స్థితి ఒక మెట్టు ఎక్కుతుంది. ఉదాహరణకు మనము చేసే ఆచమనం అనే ప్రక్రియను తీసుకుందాము. ఈ దైవిక ప్రక్రియకైనా ముందు తనను పవిత్రము చేసుకొనుటకు  ఆచమనము చేస్తారు. దీనిని కొన్ని జిల్లాలలో కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహ అను మంత్రాలతో మొదలు పెట్టి ఇరువది నాలుగు కేశవ నామాల స్మరణతో ముగిస్తారు. మరి కొన్ని జిల్లాలలో  అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః లతో మొదలు పెట్టి ద్వాదశ నామాలను స్మరణ చేస్తారు. ఇంకా శివ నామాలతో కూడా ఆచమనము చేయడము కొన్ని శాఖలలో ఉన్నది. నిజానికి నలభై రకాల ఆచమనాలు ఉన్నాయని బోదాయనుడు  తన ఆగమ శాస్త్ర గ్రంథములో వ్రాసినాడు.  వారి వారి ఆరాధ్య దైవము ననుసరించి ఇన్ని రకాలు ఏర్పడినాయి. ఇందులో రెండవ ఆచమనాన్ని గురించి ఒక సారి చూద్దాము. అచ్యుతాయ అనుకున్నపుడు నాశనము లేని స్థితిని, అనంతాయ అనుకున్నపుడు అపరిమితుడననే భావాన్ని గోవిందాయ అనుకున్నపుడు  నేను కాంతి స్వరూపుడనని అనుకుంటే మనము పరిమితత్వము నుండి అపరిమితత్వము లోనికి ప్రయాణము మొదలు పెడతాము. ఇన్ని పేర్లున్నాయి కదా! మరి భగవంతుడు ఎవరని అడిగితే ఉపనిషత్తులు చెప్పాయి కదా, “ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ”. అని. ఇంకా నారాయణ సూక్తములో ఆయనను గూర్చి “స బ్రహ్మ, స శివ , స హరి “ అని అంతా లేదా అన్నీ ఆయనే అని చెప్పినాడు కదా! ఇవన్నీ పరిమితత్వాన్నుండి, అపరిమితత్వానికి ప్రయాణమును సూచించడము కాదంటారా?”
“నాయనా! నీవు చిన్న వాడవు. నీకు అంతకంటే పెద్ద సన్మానము చేయ లేను.”  అంటూ ఆదిత్యను దగ్గరకు పిలిచి కౌగిలించుకున్నాడు.
“ఇవన్నీ ఎక్కడ నేర్చి నావయ్యా?”, అని అడిగినాడు.
“నాకు ఏమీ తెలియదు. కానీ మా అమ్మ యొక్క గురువు స్వామీ శివానంద నాతొ ఎన్నో విషయాలు మాట్లాడే వారు. అందులో పట్టుకున్న చిలక పలుకులే, ఇవన్నీ”, అని ఆదిత్య  తన అణకువను ప్రదర్శించుకున్నాడు.
“నాయనా! నిన్ను చూస్తే చాలా ముచ్చట వేస్తున్నది. నిన్ను గురించి మా మనుమరాలు చెబుతుంటే  ఏమో అనుకున్నాను. నా కొక ఆకాంక్ష కలిగింది. నిన్ను మాలో కలిపేసుకొని దాని ద్వారా మా అపరిమితత్వాన్ని దాటుదామని.”
వాళ్ళ ఉద్దేశ్యము సీతమ్మకు అర్థమయింది.
“మీరన్నది మంచిదే బాబాయిగారూ! ఒక సారి మా ఆయనకు కూడా చెప్పి ముందుకు వెళ్దాము. ఒక సారి మీ మనుమరాలికి కూడా చెప్పాలి కదా!”, సీతమ్మ గారు అన్నారు.
“నిజమేనమ్మా!”, అంటూ  ఆకాంక్ష కోసము భార్యను పంపించినారు.
వాలు మాటల్లో ఉంటే రెండు ఉడుతలు తగవు పెట్టుకుంటూ వచ్చి చేరి ఒక జీడి పప్పును కరుచుకొని వాకిటి వైపు పరిగెత్తాయి. ఈ లోపల ఎదురు వచ్చిన ఆకాంక్ష ను చూచి కంగారు పడి ఆకాంక్ష నెత్తి మీద  వదిలివేసి  బయటకు వెళ్లి పోయినాయి.
అందరికి సమ్మతమై వివాహము జరిగింది. ఆ తరువాత ఉడతల మీద ఆకాంక్ష అభిప్రాయాలను విన్న ఆదిత్య “ఐ  థాంక్ యూ ఉడుతా! “, అంటూ ఆకాంక్ష వైపు చూచినాడు.


నోటు: ౧. నాకు రామ తీర్థములో శివుడి పేరు ఏమిటో తెలియదు కథ కోసము నీల కంఠ  మహా దేవుడిగా తీసుకున్నాను.
౨.ఇందులో సాధనాలు శివోపాసన ఆధారముగా ఇచ్చినా అన్ని రూపాలలో ఉన్న భగవంతుడు ఒక్కడే అన్న విషయాన్ని మనము మరచి పోకూడదు.


Monday, February 23, 2015

ఉడత 4

ఒక రోజు వీలు చూచుకొని సీతమ్మ రామ తీర్థానికి వెళ్ళినది. అదే సమయానికి అన్ని  ఊళ్లు తిరుగుతూ స్వామీ శివానంద నీల కంఠ మహాదేవుడు గుడి లో విడిది చేసి వున్నాడు.  వెంటనే ఆయన దర్శనానికి వెళ్ళినది. పాదాలను తాకి నమస్కారము చేసుకున్న ది.
“ మీ భర్త, కుమారుడు బాగున్నారా? అమ్మా!”, ఆయన అడిగినాడు.
“మీ అనుగ్రహము వలన  అంతా కులాసాగానే ఉన్నారండి.  మా ఆయన ఆరోగ్యము కూడా కాస్త కుదుట పడినది. వ్యాపార విషయమై తిరుగుతూ డిల్లీ వెళ్లి యున్నారు. ఇంక మా అబ్బాయి ఎప్పుడు ఏ అవసరము వస్తుందో యన్న భయముతో లాబ్స్  లో ఉద్యోగమూ వదులుకొని, కావలి కాలేజి లో లెక్చరర్ గా స్థిర పడినాడు.”
“ఇంతకూ  మీ అబ్బాయి కి పెళ్లి ప్రయత్నాలు చేయటము లేదా?”
“నాకు బయట తిరిగి ప్రయత్నాలు చేసే వారు ఎవరూ లేరండి. మా ఆయనకూ అంత సామర్థ్యము లేదు. మీరే కాస్త సలహా ఇవ్వండి.” దీనముగా అడిగింది.
ఆయన కళ్ళు మూసుకొని కొద్ది సేపు ధ్యానము లోనికి వెళ్ళినాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచి, “ఏమీ ఫరవాలేదమ్మా! మీ కా బోయే కోడలు ను మీరు చూస్తూనే వున్నారు. వాళ్ళు అడగరు. మీరే ప్రయత్నమూ చెయ్యాలి.” 
  సీతమ్మ ఆశ్చర్య పడింది. అంటే తన కాబోయే కోడలు తనకు దగ్గర లోనే యున్నదా? తన దగ్గరకు వచ్చే ఆడ పిల్లలను అందరిని గుర్తు తెచ్చు కోవడానికి ప్రయత్నమూ చేసింది.
“అమ్మాయి పద్ధతి లోనే ఉంటుంది కదా. ఒక్కడే కొడుకు కదా. వాడితో సహనము తో ఉండ గలదా?”
“నీవు చాలా అదృష్ట వంతురాల వమ్మా!  ఆ అమ్మాయి కోడలు కావడమే మీ అదృష్టము. నీకే తెలుస్తుంది, ముందు ముందు.”
సీతమ్మ చాలా సంతోష పడింది. ఇప్పుడు సమస్య ఏమిటంటే , ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. అదే సంతోషముతో ఆయన దగ్గర సెలవు తీసుకొని పుట్టింటి నుండి తిరిగి కావలి వచ్చినది.
బాగా ఎండలు ముదిరినాయి.  దానితో జీవ రాశులకు ఆహారము సరి పోవటము లేదు. ఆదిత్యకు ఉడుతలకు ఏదో యొక ఆహారము పెడుతున్నాడు. ఆ రోజు ఆకాంక్ష ప్రక్క గదిలో ఏదో వ్రాసుకుంటూ మంచి నీళ్ళ కొరకు వంట ఇంటి లోకి  వచ్చినది. అప్పుడు అక్కడ ఒక ఉడుత టమాటో ల మీద నాజూకు గా నిలబడి నెమ్మదిగా వాటిని ఆరగిస్తున్న ది. అన్నీ కొరికి వేస్తుందన్న భయము తో దానిని నెమ్మదిగా అదిలించింది. అది ఒక్క సారి కంగారు పడి సందు వైపు వెళ్ళకుండా వాకిటి వైపు పరిగెత్తి ఆదిత్య ఇంట్లో దూరింది. దానిని తరుముతూ ఆకాంక్ష తలుపు వరకూ వెళ్ళింది. ఇంకా వెనుకకు వచ్చేద్దాము అనుకుంటే , “ఎవరూ?” , అంటూ  సీతమ్మ వా కిట్లో కి వచ్చింది.
వెనుకకు వెళుతున్న ఆకాంక్షను చూచి, “ ఇంటి వరకు వచ్చి వెళుతున్నా వు. లోపలి కి రావమ్మా.”, అంటూ పిలిచింది.  
ఇంక తనకు తప్పించు కొనే మార్గము లేదు. తప్పనట్లుగా లోపలి కి  వెళ్ళింది.
ఇటీవల సీతమ్మకు ఎవరిని చూచినా తన కోడలే గుర్తుకు వస్తున్నది.  స్వామి జి ని కలియక ముందు ఇటువంటి ఆలోచన వచ్చేది కాదు.
“నీవు ఇదే మొదటి సారి మా ఇంట్లో కి రావడము. ఇల్లంతా చూపిస్తాను పద. “,అంటూ గదులన్నీ చూపించింది. ఇంకా హాలు లో కూర్చో పెట్టింది.
ఇంతలో రామ తీర్థము నుండి ఫోను వచ్చింది.  అదీ వాళ్లమ్మ నుండి వచ్చింది. ఆమె చెప్పిన సమాచారము విన్న సీతమ్మకు చాలా ఆనందము వేసింది.
సీతమ్మ వాళ్ళ అమ్మ ఆ రోజు ఉదయమే స్వామి శివానంద ను కలిసిందట. గుడినుండి తిరిగి వెళ్లి బోతూ, ఆయనతో, “స్వామి జి! మా అమ్మాయి చాలా కష్టాలు పడింది. చివరకు మీ ఆశీస్సుల వలన కుటుంబము నిల బడింది. ఇంకా మాకున్న ఒకే కోరిక మా మనవడి పెళ్ళి గురించి” అన్నదట.  స్వామిజి ఒక్క క్షణము ఆలోచించి, ఎందుకమ్మా! కంగారు పడతావు? ఇప్పుడు మీ అమ్మాయి తన కా బోయే కోడలు తో కబుర్లు చెప్పు కుంటున్నది. అన్నీ శుభంగా నే జరుగు తాయి, పొమ్మన్నాడు . ఇంక ఆత్రము తట్టుకోలేక వెంటనే ఫోను చేసినదట.
ఈ ఫోను తరువాత ఆమెకు ఆకాంక్ష మీద ప్రేమ ఎన్నో రెట్లు పెరిగినది. కానీ, దానిని ఎలా ప్రకటించాలో తెలియ లేదు. తను తిరిగి వెళతా ను అన్నా బలవంతముగా కూర్చో పెట్టింది. ఇంట్లో  యున్న తీపి పదార్థాలను , పండ్ల ముక్కలను పళ్ళెము లో పెట్టి ముందు పెట్టినది. తినమని బలవంతము చేసినది.
తమ కుటుంబ సభ్యుల ఆల్బం లో ఫొటోలు అన్నీ చూపించింది. ఆకాంక్షకు ఇదంతా ఏమిటో, ఎందుకో అర్థము కాలేదు. తను ఏమని మాట్లాడితే తప్పుగా అనుకుంటుందే మో అని భయ పడింది.
“మొన్న మీరు ఊరు వెళ్లి వచ్చినారు కదా. ఏ ఊరు?”, అని అడిగింది.
“రామతీర్ధ మమ్మా! నేను పుట్టిన ఊరు. మా అమ్మా, నాన్న అక్కడే వున్నారు.”, అని చెప్పినది. అప్పుడు తనకు పుట్టి, పెరిగిన రోజులు గుర్తుకు వచ్చినా యి.  తను పడిన కష్టాలు అన్నీ ఆ క్షణమన పంచుకోవాలని అనిపించింది.
పినాకిని నది ఒడ్డున యున్న ఒక చిన్న పల్లెటూరి రామ తీర్థము. రాముడు ప్రతిష్ట చేసిన ఈ లింగమున్న ఊరు కు రామ తీర్థము  అని పేరు వచ్చినది. అందు శివుడి పేరు నీల కంఠ మహా దేవుడు. శివుడి ధనుస్సు పేరు పినాకిని. ఆ పేరు తో ఉన్న ఆ నదిని  పెన్నా అని కూడా అంటారు. అందులో సంవత్సరము పొడుగునా నీరు ఉండదు. నదిలో ఇసుక బంగారు వన్నె లో మెరుస్తూ ఉంటుంది.  ఆ ఇసుక లోనే సీతా మహా లక్ష్మి తన చిన్న తనాన ఆడుతూ పాడుతూ గడిపింది.
ఉదయాన్నే  స్నానము  చేసి పూలు కోసుకొని వచ్చి గుడిలో  ఇచ్చి వచ్చేది. ఏ కార్య క్రమము లేనపుడు  తన ఆట  పాటలు అన్నీ గుడిలోనే. అక్కడే  ప్రైమరీ మరి హై స్కూల్  చదువులు పూర్తి చేసినది. హై స్కూల్ పరీక్షలు పూర్తి  అయి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో అంతా హడావుడిగా ఉన్నది. తనకు ఏమీ అర్థము  కాలేదు.
నాన్న గారి స్నేహితుడి కొడుకట, ఇంజనీరింగ్  పాసయి నాడుట. స్నేహితుడి  భార్య సీతా మహా లక్ష్మిని గుడి లో  చూచి  కోడలు గా చేసుకోవాలని ముచ్చట పడిందట. నేరు గా ఇంటికి వచ్చి అడిగింది.
ఆ రోజుల్లో ఇంజినీరింగ్ అంటే చాలా పెద్ద చదువు.  అందు లోనూ ఇంటి దగ్గరకు వచ్చిన  సంబంధము. సీతా మహా లక్ష్మి తల్లి దండ్రులకు అందులో అనుమానించుటకు ఏమీ కనిపించ లేదు. ఇంక జాతకాలు కూడా చూచు కోలేదు. కట్న  కానుకలు  ఏమీ వద్దని అన్నారు.
ముహూర్తము  కూడా నిశ్చయించినారు.  ఇంకా వారము రోజుల్లో పెళ్లి అనగా వియ్యంకుడు వచ్చినాడు.  వాళ్ళ అబ్బాయికి అమెరికా లో ఉద్యోగ అవకాశము వచ్చిందట.  పెళ్లి అయిన వారము రోజుల్లో బయలుదేరాలి. 
“మరి అమ్మాయి సంగతి ఏమిటి?”.  అని అడిగితే, “ఏముందీ, కాస్త డబ్బు చేరగానే తనే వచ్చి  తీసుకొని వెళ్ళతాడు”, అని  అన్నాడు.
“ఎప్పటి లోపల?” , ఇటువంటి మాటలు రాలేదు.
నిశ్చయము చేసుకొనటంకు ముందు ఈ విషయము ప్రస్తావన  వస్తే, నిశ్చయాన్ని గురించి పది సార్లు ఆలోచించే వారు. ఇప్పుడు పెళ్లి పిలుపులు కూడా అన్ని పోయినా యి.
దీనితో బాటు చాటు మాటు గా ఇంకో బాంబ్ షెల్ పేలింది. వాడి అమెరికా ప్రయాణానికి ఖర్చులకు సాయము కావాలి. అదీ అర్జెంటు గా.
ఇంకా తండ్రి లక్ష్మీ నారాయణకు ఏమి చేయాలో తెలియ లేదు. ఒక ఎకరము పొలము బేరము పెట్టి ఆ డబ్బులు వియ్యంకుడి చేతిలో పోసినాడు. తను ఇవ్వాలనుకున్న కట్నము కంటే ఎక్కువే అయింది.
ఆయన దిగులంతా కూతురి పరిస్థితి గురించే. పరువు ప్రతిష్టల  మీద బ్రదికే వారికి తరువాత ఏమి చేయాలో అర్థము కాలేదు.
పెళ్లి అయిన వారము రోజుల్లోనే అమెరికా ప్రయాణము పెట్టుకున్న భర్తను చూచి  సీతకు ఏమి చేయాలో తెలియక కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. “ఏముంది? కాస్త వసతి ఏర్పడగానే నిన్ను విమానములో తీసుకొని వెళ్తాను. “, అని తాయిలం పెట్టినాడు.
కొన్నాళ్ళు అత్త గారింట్లో ఉంది. ఎప్పుడూ ఏదో నిరుత్సాహము గా ఉండేది. ఎప్పుడో ఒక సారి ఫోన్ వచ్చేది. అత్తా మామల తో మాట్లాడి తనతో రెండు నిముషాలు మాట్లాడి పెట్టేసే వాడు. దానితో రేపటి గురించి భయము ఏర్పడినది.
క్రమ క్రమముగా ఇంట్లో  పనులు అన్నీ తనకు అప్ప చెప్పడము మొదలు పెట్టినారు.  తన ఆడ పడుచు పనులతో బాటు ఇంట్లో ని అన్నీ పనులు తనే చూడ వలసి వచ్చేది. క్రమ క్రమము గా అత్త గారు సోఫా మీద కూర్చొని యజమాయిషి చేయడానికి పరిమితమయినారు.
ఈ సమయములో నాన్న గారు వచ్చి తనను ఇంటికి తీసుకొని వెళ్తానని అంటే అత్త గారు సులభము గా అంగీకరించ లేదు. అతి కష్టము మీద పంపించినారు.
అమ్మకు నాన్నకు పరిస్థితి అర్థము అయింది. అంటే గాక కొత్త విషయాలు తెలిసినాయి. తమ అల్లుడు కాలేజి లో జులాయిగా తిరిగే వాడని ప్రేమ వ్యవహారాల్లో దిగి తన్నులు కూడా తిన్నాడని తెలిసింది.
ఇప్పుడు కూడా అల్లుడు ఒక ఉత్తరము వ్రాస్తున్నాడనో , ఫోన్ చేసున్నాడనో సంతోషము కూడా లేదు. కూతురు కాపురము చక్కబడాలని వాళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేసినారు.
రెండు మూడు సార్లు వియ్యంకుడు ఉత్తరాలు వ్రాసినా తను అమ్మాయిని పంపించ లేదు. ఇంతలో సీత ఆడ బడుచు కు పెళ్లి సంబంధము కుదిరింది. ఇంకా పెళ్లి పనులు చూచుకోడానికి సీతను పంపించక తప్ప లేదు.
ఈ సమయములో కూడా పెళ్లి ఖర్చులకు డబ్బులు లాగాలని వియ్యంకుడు ప్రయత్నించినాడు. లక్ష్మి నారాయణ ఏమాత్రము లొంగ లేదు.
పెళ్ళికి వచ్చిన అల్లుడు , పెళ్లి అయిన తరువాత సీత తో నాలుగు ఊళ్ళు తిరిగినాడు. అమెరికా ఎప్పుడు తీసుకొని వెళ్తారంటే ఇంకా కొద్ది రోజుల్లో ఇల్లు కొంటున్నానని, ఆ తరువాత తీసుకొని వెళ్తానని చెప్పినాడు. తియ్యని కబుర్లు చెప్పి మళ్ళీ విమానము ఎక్కేసినాడు.
ఇంక సీతకు అక్కడ ఉండాలని అనిపించ లేదు. తనే ధైర్యము చేసి పుట్టింటికి వచ్చేసింది. తరువాత మరి కొన్ని విషయాలు తెలిసినాయి.  ఆనంద్ (అల్లుడు) ఎవరో అమ్మాయి తో తిరుగుతున్నాడని, పెళ్లి కూడా చేసుకోవచ్చని  సమాచారము తెలిసింది. ఇటువంటి విషయాల్లో న్యాయ పరముగా వెళ్ళాలన్న ఏమి చేయాలో లక్ష్మి నారాయణ కు తెలియ లేదు. మరో విషయము ఏమిటంటే సీత నెల తప్పింది. ఆయన కోపముతో వియ్యంకుడి దగ్గరకు వెళ్ళినాడు.
వియ్యంకుడు మర్యాదలు అన్నీ చేసి, అటువంటిది ఏమీ లేదని, అన్నీ చక్క బడతాయని చెప్పినాడు. వియ్యంకురాలు కోడలు ఇల్లు వదిలి పోయిందని నిష్టూరాలు ఆడింది.
ఇద్దరి దగ్గిర తన సమస్యకు సరి అయిన సమాధానము రా లేదు. నైరాశ్యము గా తిరిగి వచ్చినాడు. ఇంటికి వెళ్లాలని అనిపించా లేదు. వెళితే ఏమి చెప్పాలో తెలియ లేదు. మహా దేవ మందిరము లో శివుడికి ఎదురుగా పద్మాసనము వేసుకొని కూర్చున్నాడు. ఎంత సేపు కూర్చున్నాడో తెలియదు. ఏ మాత్రము కదల లేదు.
“నారాయణా! నారాయణా!”, గొంతు వినిపించింది. ముందు ఎవరో జపము చేసుకుంటున్నారో అని అనిపించింది. మళ్ళీ “నారాయణా!”, అని విన్పించడమే కాకుండా భుజము మీద చేయి పడింది. కళ్ళు తెరిచి చూసినాడు. ఎదురుగా ఒక సన్యాసి, లేదా స్వామిజి.
“నేనే నారాయణా! రా  అలా వెళ్లి కూర్చుండాము రా.”
తను ఏమీ జవాబు చెప్పా లేదు. ఇంకా ఎవర? అని చూస్తున్నాడు.
జాగ్రత్తగా చూచినాడు. తన చిన్నప్పటి స్నేహితుడు శివయ్య. విచిత్రమేమిటంటే, తను శివుడి ముందు కూర్చుంటే, తన స్నేహితుడు శివయ్య వచ్చినాడు. ఆయనే ఈయనను పంపించినాడేమో అనిపించింది.
లేచి నిలబడినాడు. ఇంతకూ ముందు లాగా “ఒరే, శివా!” అని పిలవ లేక పోయినాడు. కారణము ఒకటే. ఆయన ఇప్పుడు ఒక సన్యాసి.
శివయ్య వెంట నడిచినాడు. ఇద్దరూ గుడి మధ్యలో యున్న మంటపము లో కూర్చున్నారు.  
“ఎన్నాళ్ళయింది, నిన్ను చూచి?”, శివయ్య తో అన్నాడు.
“అయినా నారాయణా! నీలో ఏదో క్షోభ కొట్టొచ్చినట్టు కనబడుతున్నది. ఏమయింది?”, స్వామిజి అడిగినారు.
నారాయణ తన కూతురు పెళ్లి, తరువాత జరిగిన సంఘటనలు అన్నీ చెప్పుకున్నాడు. చెబు తుంటే ఆయన కళ్ళల్లో నీళ్ళు కనిపిస్తున్నాయి.
“నారాయణా! ఇంత పెద్ద మహా దేవుడిని ఎదురుగా పెట్టుకొని ఎందుకు ఏడుస్తావు? చెప్పు. ఆయనకు చెప్పా వలసిన దంతా పద్ధతిలో చెప్పు. ఇంక ఆయనే చూచుకుంటాడు. నీ కష్టాలన్నీ దూది పింజల వలె ఎగిరి పోతాయి.”, ధైర్యము చెప్పినాడు.
“నా కూతురు జీవితము బాగు పడుతుందని అంటావా?”
“లోకాలనే ఏలే రాజు తలచుకుంటే ఏది వీలు కాదు. ఇంకా దిగులును వదిలేసెయ్. ఈ రోజు సాయంత్రము నీవు, మీ అమ్మాయి సాయంత్రము ఏడు గంటలకు దేవుడి దర్శనానికి రండి.”, ధైర్యముగా చెప్పినాడు.
శివయ్య  సన్యాస దీక్ష తరువాత స్వామీ శివానంద గా మారినాడు. ఆయన అక్కడికి వచ్చినపుడు  గుడి లో ఒక గదిని ఆయనకు ఇచ్చినారు.
సాయంత్రము నారాయణ తో బాటు సీత వాళ్ళమ్మ వచ్చినారు. దర్శనము అయిన తరువాత అందరూ ఆ గదిలో కూర్చున్నారు.
“సీతా! కాస్త ముందుకు కూర్చో అమ్మా! మీ నాయన నాకు చిన్నప్పుడు చాలా ఆప్తుడు. అందు వలన నీవు ఆ దగ్గర భయ పద వలసిన అవసరము లేదు.”
“రోజూ సాయంత్రము పూట సంధ్యా కాలములో ముందు శివుడిని పూజ చేసుకో. అదీ నూనె దీపాన్ని వెలిగించి. ఆ తరువాత నీ భర్తతో నీ జీవితమూ ఎలా ఉండాలని కోరుకుంటున్నావో అలాగే ఉన్నట్లు ఉహించుకో. ఆ తరువాత అందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకో. అంతే కాదు, నీవు తల్లి వి కాబోతున్నావు. ఈ రోజుల్లో తన బిడ్డ సిరి సంపదలతో, పిల్లా పాపలతో వర్ధిల్లాలని, అందరూ కోరుకుంటారు. అందులో తప్పేమీ లేదు. కానీ, దానికి తోడు గా  వాడు నిరంతరము ధర్మ  మార్గములో నడవాలని ఆర్తులకు  బాసటగా నిలబడాలని , లోకానికి సేవకుడు కావాలన్న  తల్లులు కనిపించుట లేదు. నీవు నీ కొడుకు నిరంతరమూ ధర్మ మార్గములో నిలబడాలని కోరుకుంటే  మిగిలినవన్నీ ఆ మహా దేవుడే ఇస్తాడు.  ఈ విషయాన్ని చాలా మంది గమనించరు. అంతగా సన్యాసి అయి పోతాడన్న భయమేర్పడితే పిల్లాపాపలతో, సిరి సంపదలతో ఉండాలని కలుపుకో. అంటే గానీ ప్రధానమయిన కోరిక వాడు నిరంతరమూ ధర్మ మార్గములో నడుచుటే.  ఇవన్నీ అయిన తరువాత హారతి ఇచ్చేసేయ్. నీవు చేయ వలసినది ఇంతే. “
“ఇలా ఎన్నాళ్ళు చేయాలి స్వామీజీ!”, సీత అడిగింది.
“ఖచ్చితముగా నలభై రోజులు, లేదా మూడు నెలలు. ముందు  నీకు తెలిసేటట్లు మార్పులు మొదలవుతాయి. నీకు ఏమవుతుందో అన్న భయము వేస్తుంది. ఇదంతా ఆపి వేయాలని కూడా అనిపిస్తుంది. కానీ ఆపకూడదు.  షిరిడీ సాయి నాథుడు చెప్పినట్లు శ్రద్ధ, విశ్వాసము(సబూరి) రెండూ చాలా ముఖ్యమై నవే.”
“మరి ఏ సమయములో చేయాలి?”, సీత అడిగింది.
“వీలు కానప్పుడు ఏ సమయములో అయినా చేయ వచ్చును. కానీ , సూర్య అస్తమయ సమయము అంటే సంధ్యా కాలము చాలా మంచిది. ఆ సమయములో సాధన చేసినందు వలననే యశోదా నందులకు కృష్ణుడు కుమారుడు అయే అదృష్టము కలిగింది.”
“దీని వలన ఎటువంటి కోరికలు అయినా తీరుతాయా?”
“ధర్మ బద్ధమయిన జీవితాన్ని నడుపుతూ, ధర్మ బద్ధమయిన కోరిక ఏది కోరుకున్నా మహా దేవుడు అనుగ్రహిస్తాడు. నేను ఎవరినో ప్రేమించాను, ఆయనతో నే నా పెళ్లి కావాలి అని కోరుకుంటే, అందులో ఇంకా ఎన్ని కర్మ సంబంధమైన ముడులు ఉన్నాయో, ఎవరికీ తెలియదు. కానీ చిన్నప్పటి నుండి ధర్మ విహితమయిన  జీవితాన్ని నడుపుతున్నావు. నీకు సరి కాని వాడితో నీకు పెళ్లి అయింది. అది నీ కర్మ వలన జరిగింది. ఆ కర్మను క్షయము చేయడానికి చేసే ప్రయత్నమే ఈ సాధన. ఈ సాధన ఖచ్చితముగా ధర్మ విహితమే.”, స్వామీజీ చెప్పినాడు.
“ఇంకా దీపాన్ని ఎందుకు వెలిగించాలి?”
“నీవు ఒక కోరిక కోరుకున్నప్పుడు, పరిస్థితులు అందుకు అనుకూలముగా లేనప్పుడు సాధనలో అందుకు వ్యతిరేకమయిన దృశ్యాలు  ఏర్పడుతాయి. వాటిని కరిగించే శక్తి దీపానికే ఉంది. అందుకే రాత్రి దైవిక సాధనలో దీపానికి ప్రాధాన్యత ఎక్కువ. అందుకు వాడిన నూనెలలో అన్నిటి కంటే నువ్వుల నూనె ఎక్కువ తేజస్సు, లేదా శక్తి లేదా ఆరా ఇస్తుంది. దాని కంటే ఆవు నేయి ఎన్నో రెట్లు తేజస్సును ఇస్తుంది.  ఆ తేజస్సులో మీ సాధనలో ఏర్పడిన వ్యతిరేకమయిన ఛాయలను దహించి వేస్తాయి. ఇదంతా ఒక్క రోజులో జరగదు. అందుకే మన పెద్ద వారు దీపం జ్యోతి పర బ్రహ్మం అని అన్నారు.”
“నేను ప్రశ్నలను వేస్తున్నానని అనుకోకుండా ఉంటే, నాకో సందేహము.  ఇదంతా సంధ్యా కాలము లోనే ఎందుకు చేయాలి? చెబు తారా?”
“దీనికి కూడా కారణముంది. ఇది తెలుసు కోవాలంటే, తంత్ర శాస్త్రములో మరింత లోతుకు వెళ్ళాలి. మన శ్వాస ఎప్పుడూ ఒకే రకముగా ఉండదు. కొద్ది సేపు కుడి ముక్కు రంధ్రములో, మరి కొద్ది సేపు ఎడమ ముక్కు రంధ్రములో నడుస్తూ ఉంటుంది.  కుడి ముక్కు రంధ్రములో శ్వాస నడుస్తున్నప్పుడు తెలివి తేటలు, సంకల్ప శక్తి మున్నగునవి పని చేస్తాయి. అదే ఎడమ ముక్కులో శ్వాస నడుస్తున్నపుడు మీలో బావ పుష్టి, కళానివేశనము ఉంటుంది. కుడి నుండి ఎడమకు లేదా ఎడమ నుండి కుడికి మారేటప్పుడు కొద్ది సెకనులు రెండు ముక్కుల్లో శ్వాస నడుస్తుంది. ఆ సమయాన్ని సంధి లేదా గ్రహణ కాలమని అంటారు.  ఉదయ ము లేదా సాయంకాలము సంధ్యలో మన శ్వాస ఆ స్థితిలో ఉంటుంది.  ఈ సమయములో చేసే సాధన మనకు దైవీ శక్తులతో సంపర్కాన్ని పెంచుతుంది.  అంటే కాదు, ఈ సమయములో నిద్ర పోయే వారిని శాప గ్రస్తులుగా మనము భావించ వచ్చును. ఇందుకు సంబంధించి మన పురాణాల్లో ఎన్నో కథలున్నాయి. ఈ సమయములో చేసే సాధనకు ఎన్నో రెట్లు ఫలితము కనిపిస్తుంది.”
“ఈ విషయాలన్నీ ఎక్కడ దొరుకుతాయి, స్వామీజీ!”
“కొన్ని విషయాలు అనుభవమున్న యోగుల ద్వారా స్పష్టముగా తెలుస్తుంది. ఈ విషయాలన్నీ శివ స్వరోదయ మరియు స్వర చింతామణి లాంటి గ్రంథాలలో ఇచ్చినారు. దీనిని స్వర యోగము అని అంటారు.”
“మరొక ప్రశ్న స్వామీజీ! మీ సమయాన్ని ఎక్కువ తీసుకున్నందుకు నన్ను క్షమించండి. ఇటువంటి నియమాలు పాటించ నందు వలన నష్ట పోయిన వాళ్ళ గురించి చెబుతారా?”
“చేబుతానమ్మా! దేవతల తల్లి అదితి.  అదితి సంతానమును చూచిన చెల్లెలు దితికి తనకు పిల్లలు కావాలని అనిపించినది. భర్త కశ్యపుడి దగ్గరకు వెళ్లి తనకు శక్తిమంతుడు అయిన కొడుకు కావాలని అడిగింది. కశ్యపుడు చెప్పినాడు,” ఇది సంధ్యా సమయము. మహా దేవుడు సంచారము చేసే సమయము.  అందుకే కాస్త ఆగు.” దితి అందుకు అంగీకరించ లేదు. కశ్యపుడు మహా దేవుడికి క్షమాపణ చెప్పుకొని ఆమెకు సంతానమును అనుగ్రహించినాడు. ఆ సమయ దోషము వలన పుట్టిన వారే హిరణ్యాక్ష , హిరణ్య కశ్యపులు, లోక కంటకులు. ఇటువంటి కథలు పురాణాలలో కోకొల్లలు గా ఉన్నాయి.”
“మిమ్మల్ని మళ్ళీ కలియవచ్చునా స్వామీ జీ!”
“తప్పకుండా అమ్మా! అందులోనూ నీవు మా నారాయణ బిడ్డవు.  నీకు అంతా మంచే జరుగుతుంది. ఏ రోజు సాధనను మాన వద్దు. నీ బ్రతుకు ఏమవుతుందో అని భయము కలిగించేటట్లు కొన్ని సంఘటనలు జరగ వచ్చును. కానీ నీవు భయ పడ వలసిన అవసరము లేదు. అంతా మహా దేవుడే చూచు కుంటాడు. శుభం భూయాత్” 
ఆ రోజునుండి సీతా మహా లక్ష్మి క్రమము తప్పకుండా సాధనను కోన సాగించింది. అంటే గాక స్వామీ జీ చెప్పిన పురాణ గ్రంథాలను విమర్శనాత్మకముగా చదవడము మొదలు పెట్టింది. తండ్రి అడిగి నవన్నీ సమ కూర్చినాడు.
ముప్పయి రోజులు అయేసరికి వియ్యంకుడు వచ్చి హడావిడి చేసినాడు. అల్లుడు ఆనంద్ ఏదో క్రిమినల్ కేసు లో ఇరుక్కున్నాడుట. తను అమెరికా వెళ్ళాలిట. అందుకు డబ్బు కావాలని అన్నాడు.  నారాయణ ఏమాత్రము చలించ లేదు. ఒక్క క్షణం సీత కంగారు పడింది. కానీ స్వామీ జీ మాటల మీద నమ్మకము తో ధైర్యము నిల దొక్కుకుంది. అయినా స్వామీ జీ ని కలిసింది.
ఆయన, ఇవన్నీ మహా దేవుడి లీలలే, అన్నీ మంచికే, కంగారు పడ వద్దు.”, అని అన్నారు.
మళ్ళీ సాధనలో ఉండి పోయింది. ముప్పది తొమ్మిదవ రోజు అమెరికా నుండి ఫోన్ వచ్చింది.
“సీతా! నీకు చేసిన ద్రోహానికి అనుభవిస్తున్నాను. మా అమ్మ నాన్న వచ్చి, ఏమడిగినా ఈయ వద్దు.”, అని చెప్పి బాధ పడినాడు.” తన మీద హత్యారోపణ వచ్చిందని అందులో తన తప్పు ఏమీ లేదని చెప్పినాడు.”
“అంతా శివుడే చూచుకుంటాడు, ధైర్యముగా ఉండండి.”, అని చెప్పింది.
రెండు నెలల పైన పదిహేను రోజులు గడిచినాయి. మళ్ళీ ఫోన్ వచ్చింది.
“సీతా! నేను కేసు నుండి బయట పడినాను. ఈ పరిస్థితులలో నేను ఇక్కడ ఇమడ లేక పోతున్నాను. వచ్చేస్తునాను.” అని చెప్పినాడు.
మూడు నెలలకు పది రోజుల ముందే ఆనంద్ వచ్చేసినాడు. నారాయణ, తన తల్లి అల్లుడిని తీసుకొని రావడానికి మద్రాస్ వెళ్దామని అన్నారు. దీక్ష పూర్తి అయ్యే వరకు తను బయటకు రానన్నది.
ఆనంద్ నేరుగా అత్త గారింటికి వచ్చినాడు. సీత తన దీక్ష ఏ విధముగా సడలకుండా భర్తకు సేవలు చేసింది.
తనకు కలిగిన అఘాతము(షాక్) తో ఆనంద్ చాలా కాలము మానసికముగా బాధ పడినాడు. తరువాత శారీరక అనారోగ్యము వచ్చింది. చివరకు రక్తపు పోటు కూడా వచ్చింది.
మామ గారి సహకారము తో తనకున్న పరిజ్ఞానముతో ఒక చిన్న పరిశ్రమ , వ్యాపారము మొదలు పెట్టినాడు. దానికి కావలి కేంద్రముగా చేసుకున్నాడు. స్వామి శివానంద ఆశీస్సులతో కావలి చేరినారు. పుట్టిన కొడుకుకు ఆదిత్య అని పేరు పెట్టినారు. వాడి మీద తల్లి యొక్క సాధనల ప్రభావము, మరియు స్వామీ జీ ప్రభావము చాలా ఉంది.  ఇంకా తల్లి ఎంత చెబితే అంతే. బాధ్యత కలిగిన కొడుకు గా ఎదిగినాడు.