మా ఊరు పేరు పైనాంపురం. ఈ సంఘటన సుమారుగా యాభయి సంవత్సరాల నాటిది. మా అక్కయ్య గూడూరులో యున్నది. నెల్లూరు వెళ్లి అక్కడనుండి
గూడూరు వెళ్ళాలి. మాకు నెల్లూరు వెళ్ళడము
కూడా కష్టమే.
ఎందుకంటే బస్సు సౌకర్యాలు సరిగా లేవు. మా ఊరికి నేరుగా బస్సు లేదు. మా అమ్మ, నేను, మా రెండవ అక్కయ్య ఎడ్ల బండి మీద
బయలు దేరినాము. మా మొదటి మజిలీ వరకవిపూడి. గంట సేపు ఎదురు చూసినా బస్సు రాలేదు. ఇంక బస్సు రాదన్నారు. తిరిగి బండి
ఎక్కి ఈదూరు వెళ్లినాము. అక్కడ ఒక గంట ఎదురు చూచినా బస్సు రాలేదు. అక్కడ కూడా ఇంక
బస్సు రాదేమో యన్నారు.
మళ్ళీ మామూలే. బండి ఎక్కి
తరువాత మజిలీ తోటపల్లి గూడూరు చేరినాము.
అక్కడ నుండి వరిగొండ మీదుగా నెల్లూరుకు బస్సుయున్నది. సరిగ్గా అప్పుడు
మిట్ట మధ్యాహ్నము అయినది. అది భోజనము సమయము.
ఎదురుగా ఒక ఇల్లు యున్నది.
వాళ్ళు సుమారుగా గంట నుండి మమ్ములను గమనిన్చినట్లున్నారు. వచ్చి, మమ్ములను
భోజనానికి రమ్మన్నారు. మాకేమో కాస్త మొహమాటము గా యున్నది. అసలు వాళ్ళెవరో తెలియదు.
అందుకే మేము అందుకు సిద్ధముగా లేము.
కాని వాళ్ళు,”మీరు గంట నుండి ఇక్కడ
యున్నారు. భోజనము చేసినట్లు లేదు. ఎదురుగా భోజనము లేకుండా మిమ్ములను పెట్టుకొని
మేమెలా భోజనము చేయ గలము?” అన్నారు.
ఇవీ ఒకప్పటి పల్లెటూర్లు. ఆ
విలువలు, ఆప్యాయతలు ఇంకాఉన్నాయంటారా? ఏమో? మాకు అక్కడ భోజనము చేయక తప్ప లేదు.
ఇవీ ఒకప్పటి పల్లెటూర్లు.
wow!!!
ReplyDelete