విషయము తెలిసిన విశ్వ కర్మ గారు విస్తు పోయినారు. రాజులు మారినపుడు ఉద్యోగులు మార వలసిందేనన్నాడు. ప్రజల బాధ్యత రాజుదవుతుంది, కానీ, ఉద్యోగిది ఎలా అవుతుందని అన్నాడు.
శ్రీ నాథుడు తన బాధను చెప్పుకున్నాడు. తన శాఖకు చెందిన సొమ్మును సరి అయిన పద్దు లేకుండా ఖర్చు పెట్టుట సహించ లేకపోయినానని అన్నాడు. అది భరించ గలిగినా, తనకు వ్యతిరేకముగా జరిగే కుట్రలను వ్వరించినాడు.
విశ్వకర్మకు అనిపించినది ఒకటే. ప్రభూత్వోద్యోగ హోదాను సులభముగా వదులుకొని వచ్చినాడు. అభిమానము, అవమానము అనేవి మనము తగిలించుకున్న తొడుగులు మాత్రమే.
ఇక ఎదురయిన ప్రతి వ్యక్తీ శ్రీనాథుడిని వెఱ్ఱి వాడిగా జమ కట్టేస్తున్నాడు.
శ్రీ నాథుడు ఇంకా తన భవిష్యత్తును నిర్ణయించుకొన లేదు. తనకు ఎదురయిన ప్రతి వ్యక్తీ ఒక సమస్యగా కనిపిస్తున్నాడు.రాజు గారికి వ్యతిరేకముగా తను ఎక్కువగా మాట్లాడకూడడు. మాట్లాడితే ఏమవుతుందో తనకు తెలుసు. ఏదో ఒక రోజు తను ఒక రాజ ద్రోహిగా గుర్తింప బడుతాడు. తనకు తెలిసిన వారిలోనే ఎందరో చారులుండ వచ్చును. తను రాజుకు వ్యతిరేకముగా చెప్పినట్లు వారు భావించ వచ్చును.
అలా అని తను పిరికి వాడేమీ కాదు. కానీ, కొంత కాలము తను శాంతియుత వాతావరణమును కోరుకుంటున్నాడు. కొంత మార్పును కోరుకుంటున్నాడు.
నేరుగా వీరభద్రము మామయ్య ఇంటికి వెళ్ళినాడు. మామయ్యంటే తనకు ఎంతో గౌరవము. అంతే కాదు, తనను అర్థము చేసుకొన గలిగేది అతడే. చేతిలో పాల రాతి విగ్రహము ఉన్నది. ఈ ప్రిస్థితులలో అయినా తనకు కాబోయే సహచరుడుగా మన్నించి, హేమ మాట్లాడుతుందని, పరిస్థితులకు తట్టుకోలేని తన మనసుకు ఊరట కలుగుతుందని భావించినాడు.
నేరుగా లోపలికి వెళ్ళినాడు. మామ్మయ ఆచూకి లేదు, ఇంట్లో యున్నట్లు లేడు.
"హేమా!" అని పిలిచినాడు.
"బావా! ఎప్పుడు వచ్చావు?", చాలా సంతోషముగా పలకరించినది. హేమ ముఖములో సంతోషముతో బాటు ఒక విధమైన సిగ్గు కూడా కనిపించినది.
"నాన్న ఊరికి వెళ్ళినాడు బావా! రాత్రికి వచ్చేస్తానని అన్నాడు"
"ఎలా ఉన్నావు, హేమా!"
నాకేమి బావా! ఇంట్లో వంట, నాన్నకు సాయ పడడము, ఇంకేమి పని యుంటుంది? ఉద్యోగము ఎల ఉన్నది బావా! ఊళ్ళో అందరూ అంటున్నారు, మీ హోదాయే, హోదా అని."
"అలాగా హేమా!", శ్రీ నాథుడు ఎక్కువ మాట్లాడ లేక పోతున్నాడు. తన దగ్గిరకు వచ్చే వారికి తన హోదాయే గుర్తుకు వస్తుంది, కానీ, ఆ హోదా వెనుక ఉన్న భాధ్యతలు, క్లిష్టతలూ కనిపించవు. ఇక హేమ తను ఇంకా ఔద్యోగములో ఉన్నట్లు కలవరిస్తున్నది. నిజమే, ప్రతి యొక్కరికి ఆశ సహజమే.....
"ఏమిటి బావా! ఆలోచిస్తున్నావు? ఎన్నాళ్ళుంటావు? ఇల్లు నగరుకు దగ్గిరేనట కదా!"
"హేమ! నా కోసం, లేదా మన కోసము ఒక మాట చెబుతాను. నీకు నేనంటే ఇష్టమా? లేదా, నా హోదా అంటే ఇష్టమా?"
"అదేమిటి బావా! అలా అంటావు?నిన్నెవరు ఇష్ట పడరు?"
తనకు జవాబు లేదు.
" హేమా! నన్ను కాసేపు మాట్లాడనీ, నేను ప్రభుత్వోద్యోగి శ్రీ నాథుడిగా నేను మాట్లాడుట లేదు. విశ్వ కర్మ కొడుకులా, లేదా నీ బావ గా మాట్లాడుతున్నాను."
"నేనిప్పుడు ప్రభుత్వోద్యోగిని కాను. నీకు నిరాశ కల్పించినాను కదా! రాజ ధానిలో ఇంతకు ముందున్న పరిస్థితులు లేవు. రాజులు మారితే రాజ్యాలే మారి పోతాయి. కానీ, నాలాంటి వారు కొద్ది మంది యుంటారు, ఎప్పటికి మార లేని మనుష్యులు. మారిన పరిస్థితులకు ఇమడ లేక, భాధ్యతలను సరిగా నిర్వహించ గలనన్న నమ్మకము లేక దూరముగా పారి పోయి వచ్చినాను.నీ జీవితము సుఖ ప్రదము చేస్తాననే నమ్మకము ఉండేది, ఇన్నాళ్ళు. కానీ, నా జీవితమే ఎగతాళిగా మారినట్లుంది. నీవు గానీ, మామయ్య గానీ, నన్నర్థము చేసుకొని ధైర్యము చెబుతారని ఆశగా వచ్చినాను."
"ఎందుకిలా చేశావు బావా! కాస్త సర్దుకోలేక పోయినావా?" అనాలనుకుంది.. కానీ, నోట మాట రాలేదు. తను కోరుకున్న హోదా పరపతి దూరమయినవి. అక్కడ అలాగే కూర్చుండి పోయినది.
"హేమ కూడా తనను అర్థము చేసుకోలేదు." అనుకున్నాడు, శ్రీ నాథుడు. చేతి సంచిలో హేమ బొమ్మ యున్నది. ఎంతో సంతోషముగా చెక్కినాడు. ఎంతో మెప్పును ఆశించినాడు. తన హోదాను తప్ప తనను కోరని వారి కోసము చేసుకొని కష్ట పడినాడు. లోకమంటే ఇంతేనేమో? ఆ సంచిని అక్కడె వదిలి వేసినాడు.
"వస్తాను హేమా!", అంటూ వెనుకకు వచ్చినాడు.
బావ వెళ్ళి పోతున్నాడు.తననుంచి సాంత్వన వాక్యాల కోసము వస్తే తనేమీ మాట్లాడ లేక పోయింది.
"బావా!", అని పిలువ పోయినది,కానీ, గొంతు పైకి రాలేదు.మోకాళ్ళ మీద తల పెట్టుకొని కూర్చుంది, హేమ. కళ్ళ నుండి నీరు కారి పోతుంది,బావ కోసము.
No comments:
Post a Comment