Tuesday, February 28, 2012

శిల్పి 8




                  ఉన్న ఆస్థి రెండు ఉంగరాలు, కొద్ది సొమ్ము మాత్రమే. దక్షణానికి ప్రయాణము మొదలు  పెట్టినాడు.  కొంత దూరము బండ్ల మీద, కొంత దూరము నడక, ధర్మ సత్రాలేమయినా కనిపిస్తే భోజనము, లేదా పండ్లు కొని తినే వాడు. సింహపురి లో శ్రీ రంగ నాయకుని దర్శనము చేసుకున్నాడు. "శ్రీ వాణీ గిరిజాశ్చిరాయ " అంటూ సంస్కృత మహా భారతమును తెలుగులో పలికించిన నన్నయ భట్టారకుడి కార్యాన్ని కొన సాగిస్తూ తెలుగునే సంస్కృతముగా పలికించిన నన్నయ,తిక్కన సోమయాజికి సంబంధించిన స్థలాలను చూచినాడు.పినాకిని
 ఒడ్డున గణపతి దేవాలయములో భారత రచన జరిగిన ప్రదేశాన్ని చూచి అక్కడే కొన్ని రోజులు గడిపినాడు. పాటూరు వెళ్ళి తిక్కన పుట్టి పెరిగిన ఊరికి గౌరవముతో నమస్కారము చేసినాడు. శ్రీ కాళహస్తీశ్వర వాయు లింగాన్ని దర్శనము చేసుకున్నాడు. తిరుమలలో ఆంధ్రుల ఆరాధ్య దైవము వెంకటాచల పతిని దర్శించుకున్నాడు. విజయనగర రాజుల రెండవ రాజధానిగా పేరుగన్న  చంద్రగిరి శిధిలాలను చూచి కన్నీరు గార్చినాడు. అటునుండి కాంచీ పురము వెళ్ళి పల్లవుల కళారాధనకు అబ్బుర పడినాడు.  దక్షిణాపథాన తమిళ, తెలుగు మరియు మరాథీ సంస్కృతులకు కూడలి, రాజ రాజ చోళుని రాజధాని అయిన తంజావూరును చూచి మైమరచి పోయినాడు. తంజావురు , కుంభ కోణము, చిదంబరము నగరాలలోని దేవాలయముల శిల్ప కళా సంపదకు అచ్చెరువందినాడు. పాండ్యుల ఆరాధ్య దైవమైన మీనాక్షీ సుందరేశులను దర్శించినాడు. సముద్ర స్నానము చేసి, శ్రీ రామ లింగేశ్వరుని దర్శించుకున్నాడు.
       నల్ల రాతి మీద వరుసగా చెక్క బడిన దేవ కన్యలు, పరివారముతో తరలి వచ్చే పాలకులు, వెంట కదలి వచ్చే చతురంగ బలాలు, వాటి ముందు సాగే వాద్య కారులు, ఆస్థాన నర్తకీమణులు, దేవాలయములో నాట్యము చేసే వారి ముఖములో కనిపించే తన్మయత్వము... ఇవి సజీవ శిల్పాలు. కళా కారులకు జీవము  పోసిన కావేరీ జలాలలో మునిగినాడు. శ్రీ రంగ పట్ణములో రంగ నాయకుని, బేలూరు, హళిబేడులలోని, జక్కనార్యుని చెక్కడాలను, గోమథేశ్వరుడి ఏక శిలా విగ్రహాన్ని చూచి  నివ్వెర పోయినాడు. 
                 అంతే గాక వేర్వేరు స్థపతుల దగ్గిర పని చేసినాడు. శిల్పానికి తగిన ఱాయిని నిర్ణయించుకొనుట, ఱాతిలోని దోషాలను నిర్ధారించుట,చెక్కడములో మెళుకువలను ఎన్నో నేర్చుకున్నాడు.
                 అంతే గాక వేర్వేరు స్థపతుల దగ్గిర పని చేసినాడు. శిల్పానికి తగిన ఱాయిని నిర్ణయించుకొనుట, ఱాతిలోని దోషాలను నిర్ధారించుట,చెక్కడములో మెళుకువలను ఎన్నో నేర్చుకున్నాడు.
                 ఒక అందమైన రూపాన్ని శాశ్వతము చేసే విశ్వకర్మలు శిల్పులు. సంసార వ్యామోహాలను, క్షణిక వైభవాలను, మఱచి పోయి, జీవితాన్ని త్యాగము చేసే సృష్టికర్తలు శిల్పులు. హృదయ స్పందనతో ఊహలకు అనుగుణముగా చెక్కే శిల్పులకు, అద్భుతమైన శిల్పాలను చెక్కాలని, నిర్మించే వారికి తేడా యున్నది. మొదతీ వారిది అంతు లేని తపన, దీక్షతో కూడిన ఆరాటము. రెండవ వారిది కీర్తి కాంక్ష. రెండూ శిల్ప కళలే, కాని మొదటిది మాత్రమే జీవ కళ.
               ఎంతో మందితో చర్చలు, వాదనలు జరిగినవి. కొందరు శిల్పులు రాజుల ఆదరణకు లోబడిధనానికి ఆశ పడి, ఇవన్నీ నిర్మించినారని, లేదా బానిసలుగా పని చేసినారని తీర్మానములు చేసినారు. వారి సిద్ధాంతాలకు అనుగుణముగా లేవు కాబట్టి, ఇవి, వారికి  బానిసత్వ చిహ్నాలుగా కనిపించినవి. ఉన్నదొకే ప్రశ్న. బానిస మనస్తత్వముతో నున్న వారు, ఇటువంటి  జీవ కళను నిర్మించ గలరా? కాదు, కానే కాదు.
                శిల్పుల లోని కళా తృష్ణకు  తగిన స్ఫూర్తినిప్రోత్సాహాన్ని ఇచ్చినారు, ఆ నాటి పాలకులు. వికృతులు ఏ రంగములోనన్నా యుండ వచ్చును. అందుకని మొత్తానికి ఒకే న్యాయ నిర్ణయము చేయ గలమా? ఒక శిల్పి రాజు దగ్గిఱ పని చేస్తే మరొకరు రాజాదరణకు నొచుకోక, కొండల మీద, గుహల లోను, శిల్పాలు చెక్కి, తన ఆర్తిని చల్లార్చుకుంటాడు.
             మనసులోని సంచలనానికి వెలి రూపమే ఈ కళా సృష్టి.  సృష్టి, స్థితి, లయాలను తన లోనే చూపించే శివ తాండవ నృత్యముశివుడిని పతిగా కోరిన ఉమా దేవి దీక్ష, గజేంద్రుడి మొరాలించి పరుగిడే విష్ణు విలాసము,              
భగవంతుడి  సర్వాంతర్యామిత్వము విషయములో ప్రహ్లాదుని మాటను నిజమని నిరూపించిన నరసింహుడు, తండ్రి మాటకై అడవికి సాగిన రామ చంద్రుడు, జీవిత రహస్యాన్ని ఛేదించాలన్న తపనతో ఇల్లు వెడలిన సిధ్ధార్థుడుకర్తవ్య దీక్ష, జాలి, ఆవేదన, అనుభూతి, స్పందన ఇవన్నీ చూపించిన వారు శిల్పులు. నాగినుల, నవ రాగిణుల నృత్యోల్లాసములను తమ ఉలుల చేత పల్కింపించ చేసినారు శిల్పులు. 
                       ఒక రోజు సాయంకాలము చల్ల గాలి వీస్తుంటే, ప్రకృతి పరవశింపును సూచిస్తూ పైర్లు తలలూపుతున్నవి. అంతు లేని తన ప్రయాణములో నొక భాగముగా దూరాన నున్న ఒక కొండ వైపు నడుస్తున్నాడు, శ్రీ నాథుడు. ఎక్కడో ఉలి శబ్దము వినిపిస్తున్నది. అక్కడ ఏ శిల్పీ యున్నట్లు ఎవరూ చెప్ప లేదు.
      ఆ ఉలి శబ్దము వైపే నడుస్తున్నాడు. ఆకాశాన మేఘాలు క్రమ్ముకుంటున్నాయి. ప్రకృతిలో లాలిత్యము క్రమముగా తగ్గి పోయినది. తెలియని గంభీరత్వము వెలికి వస్తున్నది. చినుకులతో మొదలయి, క్రమ క్రమముగా వర్షపు జల్లు పెద్దదయినది.
       ఊరినుండి సుమారుగా క్రోసు దూరము వచ్చేసినాడు. దగ్గిరలో ఎక్కడ ఇళ్ళు లేవు. శబ్దము వస్తున్న కొండ వైపే పరుగు తీసినాడు.
      కొండ పైన ఒక గుహ, అందులో నుండి వెలుతురు వస్తున్నది. నెమ్మదిగా లోపలికి అడుగు పెట్టినాడు. అక్కడి దృశ్యాన్ని  చూచి ఆశ్ఛర్య పడినాడు.
            ఎదురుగా నొక వృధ్ధుడు, వయస్సు అరువది ఏండ్లకు పైనే యుండ వచ్చును, నడుము వంగి పోయి యున్నది, గడ్డము గుండెలను తాకుతున్నది, కాగడా వెలుగులో ఏదో చెక్కుతున్నాడు. మరి కాస్త లోపలికి పోయినాడు. ఆ చిత్రమును కాస్త దగ్గిఱగా చూచినాడు.
          సిధ్ధార్థుడు యశోధర ముఖాన్ని చూస్తున్నాడు. యశోధర నిద్ర అనే మాయలో యున్నది. ఆ మాయ నుండి తప్పుకోవాలని అనుకుంటున్నాడు సిధ్ధార్థుడు. అంతు లేని ప్రేమ ఒక వైపు, తెలియ రాని ఆవేదన ఒక వైపు అతడి ముఖములో కనిపిస్తున్నవి.
         శ్రీ నాథుడు అలాగే నిలుచుని చూస్తున్నాడు. మరొకరు లోపలికి వచ్చినట్లు ఆ వృధ్ధుడు గమనించ లేదు.  కొద్ది సేపు అయిన తరువాత  వేరే పనిముట్టు కోసము వెనుకకు తిరిగిన  వృధ్ధుడు శ్రీ నాథుడిని గమనించినాడు.
                 "ఎవరు బాబూ!"
                "నేనొక పాంథుడిని తాతా! ఈ నిర్జన ప్రదేశములో ఉలి శబ్దము నన్నిటకు తీసుకొని వచ్చినది. "
                " కూర్చో, బాబూ!", ఎదురుగా ఒక జనప నార వస్త్రాన్ని చూపించినాడు."
               "ఎక్కడి నుండి వస్తున్నావు బాబూ!"
               "విజయ వాటిక దగ్గిఱ ఒక పల్లెటూరు తాతా! ఇలా ఊళ్ళు తిరుగుతున్నాను."
                "చాలా దూరమునుండి వస్తున్నావు, ఆకలి తీర్చుకో బాబూ!" అంటూ, ప్రక్కన ఒక మూల నుండి కొన్ని కాల్చిన సజ్జ కండెలను పట్టుకొని వచ్చినాడు. కొన్ని శ్రీ నాథుడి ముందు పెట్టి తను కూడా తిన సాగినాడు.
               రాజసపు వరి ధాన్యాన్ని తప్ప వేరు తినని తను ఈ యాత్రలో అన్ని రకాల ఆహారానికి అలవాటు పడినాడు, సత్రాలలో తిన్నాడు, కుటుంబాలలో తిన్నాడు, ఏమీ వసతి దొఱకని రోజు మంచి నీళ్ళతో తృప్తి చెందినాడు. మంచి బట్టలు వేసుకొనే తను బట్టలు చిరిగినాయని కూడా అనుకోవటము లేడు. అందుకే అందిన సజ్జ కండెలను సులభముగానే తిన గల్గినాడు. 
               "తాతా! నీ వయసెంత యుంటుంది?"
               "డెబ్బయి దాటింది బాబూ!"
               "నీ వాళ్ళెక్కడ యున్నారు తాతా!"
               "చూచావుగా బాబూ! వీళ్ళంతా నా వాళ్ళే", తను చెక్కిన శిల్పాల వైపు చేయి చూపించినాడు. "ఇక్కడున్నంత వఱకు నీవూ నా వాడవే బాబూ!"
          "అది కాదు తాతా! కొడుకులుమనవళ్ళూ........"
         "ఉండీ లేని వాళ్ళ కోసము, ఉన్న వాళ్ళము  లేని వాళ్ళము ఎందుకవాలి, బాబూ!"
           శ్రీ నాథుడికి అర్థము కాలేదు. కానీ, తిరిగి ప్రశ్నించ లేదు.   వర్షము తగ్గిందేమో అని  మళ్ళీ  వాకిట్లోకి వచ్చినాడు. చిమ్మ చీకట్లో నొక మనిషిని చూచినాడు, పలకరించినదు పలకరించినాడు, జవాబు రాలేదు. దగ్గిఱకు పోయి పరిశీలించినాడు. చిరు చీకట్లో విగ్రహము మనిషి మాదిరే కనబడినది. 
        "వర్షము తగ్గినట్లు లేదు, లోపలికి వచ్చి విశ్రాంతి తీసుకో బాబూ!" 
       " అలాగే తాతా! వాకిలి దగ్గిఱ విగ్రహము ఎవరిది?"
        "రంగ రాయ నర పాలుడిది బాబూ! కర్ణాటకమంతా ఒకే పాలనకు తెచ్చిన ధర్మాత్ముడు. "                                  "కానీ, ఈ నాడు ప్రజల లో ప్రశాంతత యున్నట్లు కన బడదే? ధన మాన ప్రాణాలను రక్షించుకొనుటకు కష్ట పడుతున్నట్లు కన బడుతున్నారే? ఇదేమి విపరీతము తాతా!"
          "విధి విలాసమంటే అదే బాబూ! న్యాయ రక్షకుడయిన పాలకుడు మరణించినాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు, బుధ్ధిమంతులే, నిస్వార్థ పరులే, ప్రజా హిత కాంక్షులే, కానీ, నైపుణి యున్న వారు కాదు. ఇంటల్లుడు బల హీనుడు, వ్యసన లోలుడు. వీరికి సహకరించడు. తమ్ముడిని తన దారి లోనికి తెచ్చుకొన్నాడు. అన్న దమ్ములకు విభేదాలు కల్పించాలని ప్రయత్నిస్తున్నాడు.  గుండెల మీద పుండులా మారిన తమ్ముడిని ఏమన లేక, బావ గారిని అదుపులో పెట్ట లేక రాజు బల హీనుడయినాడు."
            " ఆ పరిస్థితులలో ఎవరు మాత్రమేమి చేస్తారు తాతా!"                   
           "రాజ ధర్మము  స్వీకరించిన తరువాత స్వ పర భేదముండ కూడదు.  రాజ్యములో ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయో తెలుసు కోలేని రాజు యున్నా ఒకటే, లేక పోయినా ఒకటే.  అక్కడ ఉన్నత స్థాయిలో యున్న బల హీనత  ప్రతి రాజ సేవకుడికి సరి కొత్త అధికారాలను తెచ్చి పెడుతుంది. ఇక కంచెను చేను మేస్తే అడ్డుకొనేదెవరు?"
          " మరి మీరేమి చేస్తుండే వారు?"
         " భవనాలు కట్టినాను, స్వీయ పర్యవేక్షణలో కట్టించినాను. శిల్ప ఆగమ శాస్త్రానుసారముగా  ఆలయాలు నిర్మించినాను. వయస్సు ఉడిగింది. రాజాశ్రయము తగ్గింది. ఒక వైపు అరాచకము పెరిగింది. ఉద్యోగము పోయింది.  కానీ, శ్రమకు అలవాటు పడిన వాడిని. అయిన వారనిపించుకోలేని నా వారిని వదిలి, ఈ శిల్పాలను చెక్కుతూ కాలాన్ని గడుపుతున్నాను."
                  "మరి రాజాశ్రయము లేనపుడు ఇలా వళ్ళు ముక్కలు చేసుకోవడము ఎందుకు తాతా!"
                 " పొర పాటు పడుతున్నావు బాబూ! వ్యక్తి తన ప్రతిభను మరొక దిశకు మళ్ళించుకో గలిగితే తప్పు  లేదు. కానీ, నాకు తెలిసిన వృత్తి ఇదొకటే.  మరి జీవితాధారమంటావా? ఉన్న దానితో గడపగలను.నేనొకరి మీద ఆధార పడను.  కానీ, ఏ పనీ చేయకుండా సోమరిగా యుండ లేను బాబూ!"
              క్షణము తీరిక దొరికితే చాలు, విశ్రాంతి తీసుకుందామనే రోజుల్లో, కాస్త పని ఎక్కువయితే తప్పుకోవాలని చూచే ఈ రోజుల్లో, పని లేక పోతే బ్రదుక లేనంటున్నాడు, డెబ్బదో వడిలో నున్న ఈ తాత. శ్రీ నాథుడికి ఆశ్ఛర్యము వేసినది.
           " మరి మీ పనికి గుర్తింపేమిటి, తాతా!"        
             " సరిగా ఈ తరపు మాటడిగినావు బాబూ! గుర్తింపు లేదంటే పని చేయని రోజులివి.  లోకుల కబుర్ల తోనే జీవితమంతా వృధా చేసుకొనే రోజులివి. కొబ్బరి చెట్టు అయిదేండ్లకు కానీ కాపుకు రాదని దానిని వేయడము మానేస్తామా? నేరుగా చెబుతాను. దేశానికి చరిత్ర లేకుంటే భవిష్యత్తు యుండదు. త్యాగ మూర్తుల కథలు లేక పోతే అటువంటి వ్యక్తులు  జన్మించే  అవకాశము కూడా ఉండదు.  అభిమన్యుడి  గురించి చదవకుంటే బాల చంద్రులు వచ్చే వారా? తర తరాలుగా మనలో జీర్ణించుకొని పోయిన త్యాగ, వీర, శూర, మాన ధనుల చరిత్రలను, నాకు తోచిన పధ్ధతులలో స్థిర పరుస్తున్నాను.  వారికి నేనందించ గలిగిన కృతజ్ఞతాంజలి ఇంత మాత్రమే.  నేను ఈ రోజు ఉండ వచ్చును. రేపు.... ఏమోకానీ, భవిష్యత్తులోని తరాలకు నేను చేయ గలిగిన, నాకు చేతనయిన పని ఇది మాత్రమే.  రేపటి రోజుల్లో ఎవరో చూస్తారని, ఏదో చేస్తారని, నేననుకోవడము లేదు. ఏ ఒక్కరయినా చూస్తే బాగుండునన్న ఆశ లేక పోలేదు. కానీ ఏదో గొప్ప పనిని చేశానని నేనాడూ అనుకోనుట లేదు. నాకు చేతనయిన చిన్న పనిని చేస్తున్నానంతే."
               ఎన్నో జీవితాల అనుభవాలు ఈ మాటలలో నాకు తోచినాయి. ఆయనను ఎంతో ప్రశ్నించినాడు. ఎంతో నేర్చుకున్నాడు. అంతే కాదు, ఏవో కొత్త నిర్ణయాలు కూడా తీసుకున్నాడు.          
       

No comments:

Post a Comment