ఒకనాడు:-
పాల సముద్రాన్ని సురలు, అసురులు మథియించు వేళ
వెలువడిన బడబాగ్నిని ఈశ్వరుడు నిగ్రహింప
వెలికి వచ్చె ఏ నాడో, ఏ మహ సంగ్రామపు
ఫలితముగా లోన మునిగి యుండు దివ్య సంపదలు.
మహా యజ్ఞమది నిజముగ సంకుల సాగరమునుండి
అచ్చరలు, అమృతము, అమరత్వము అవతరించె
ఆనందపు తెమ్మెరలు ఎల్లెడలా తొంగి చూచె.
కలక తేరినట్టి మహా సముద్రంపు లోతునుండి.
ఈనాడు:-
కలతలలో కలగినపుడు కరగుతుంది మనసు
అంతరంగ మథనమ్మె అమృతాన్ని ఇస్తుంది
మనలో మన ఎదలో నొక మాథుర్యము నొలకించి
మన మాతృక మన నేస్తము మన ప్రకృతి నొక కృతిగా
అందిం చి తెలుగు వారికొక మాలిక నిచ్చాడు,
ఊర్వశిలో ప్రణయము, ప్రేయసికై విరహము,
కృష్ణ పక్ష నిశీధిలో, నిలిచిన నైరాశ్యమును,
పంపినారు పల్లకిలో మన కొఱకై శాస్త్రి గారు.
ఉత్తరంపు గవని నుండి వెలికి ఉరుకు హేమంతపు
ఛాయలలో శర్మిష్ఠను, చేరునట్టి యయాతిని,
కార్తిక రాత్రులలోన కృష్ణుడి కొఱకై వెదికే
గోపికలను గానమాల చేసి ఇలకు పంపినారు.
ప్రకృతిలో మాధుర్యము పదపదమున చిలికించి,
ప్రకృతిని మురిపింప, ప్రతి హృదయము స్పందింప,
కవితామృత ధారలలో, క్రొత్త లోకమందించె,
మహా కవీ! మీకు నేడు ఏ సత్కృతి సరిపోవు?
(కళా ప్రపూర్ణ శ్రీ దేవులపల్లి వెంకట కృష్ణ శాస్ర్తి గారు కేంద్ర సాహిత్య
అకాడమి ఆవార్డు పొందిన సందర్భముగా తెలుగు సాంస్కృతిక సమితి, ఐ. ఐ. టి., మద్రాసు,
30-1-79 న ఏర్పాటు చేసిన అభివందన సభలో సమర్పించ బడినది.)
No comments:
Post a Comment