జ్ఞానము రెండు రకాలుగా
వస్తుంది. మొదటిది పరంపరాను గతముగా లేదా శిక్షణ ద్వారా వస్తే రెండవది పరిశీలన ద్వారా వస్తుంది.
ఒక కథ ఉంది. ఒక ఏరు చాలా వేగముగా
ప్రవహిస్తున్నాది. నీటిలో అర్ఘ్యము వదులుతున్న ఒక యోగి నీటిలో కొట్టుకొని పోతున్న
ఒక తేలును చూచి, దాన్ని ఎత్తి గట్టున పడేద్దామని అనుకున్నాడు. చేతితో ఎత్తి దాన్ని గట్టు మీద పడ వేయ పోతూ అది తనను
కుట్టగానే వదిలి వేసినాడు. మళ్ళీ దానిని తీసి అది తిరిగి కుట్టినా జాగ్రత్తగా
గట్టు మీదికి విసిరి వేసినాడు.
ప్రక్కనే యున్న ఒక
కుర్రాడు,”స్వామీ! అది మిమ్ములను కుట్టుతున్నా కూడా దానిని రక్షించాలని
ఎందుకు అనుకున్నారు?”,అని అడిగినాడు. అందుకు ఆ యోగి ,”ఎరా! అంత భయముతో కూడా
అది తన కుట్టే స్వభావాన్ని మానుకోలేక పోయింది. మరి నా స్వభావాన్ని ఎలా
మానుకొనేది?” అని జవాబిచ్చినారు.
ఈ కథ చాలా మందికి
తెల్సిందే.
ఇటీవల శ్రాద్ధ కర్మము
అయిన తరువాత అన్నపు పిండాలను చెరువులో కలుపుటకు ఒక స్మార్త విద్యార్థిని తోడు
తీసుకొని చెరువు దగ్గిరకు వెళ్ళినాను. వదిలిన పిండాలతో బాటు దర్భలు కుడా నీళ్ళలో
వేసినాను. ఆ విద్యార్థి వెంటనే దర్భలను తీసుకొని గట్టు మీద పడి వేసినాడు.అడిగితె
చెప్పాడు,”నీటిలో చేపలు, ఇతర జీవులు ఆహారముతో బాటు, అది మామూలు గడ్డి యని కొరికితే
వాటి నాలుకకు గాయమవుతుంది.”
మన మురికినంతా ప్రక్క
వారి స్థలాలలో వేసే ఈ రోజులలో, మన పరిశ్రమల మురికినంతా కాలువల్లో, నదుల్లో వేస్తూ
త్రాగు నీటిన్ కలుషితము చేస్తున్న ఈ రోజుల్లో
ఆ కుర్రాడి సంస్కారము ఎటువంటిది? మన సంస్కారము నేల కు దగ్గిరగా యుంటే, అతడి
సంస్కారము ఆకాశముకు దగ్గిరగా ఉంది. అందుకే ప్రతి యెక్కడి నుండీ మనము పాఠాలను
నేర్చుకొన వలసి యుంది.
ఒక సారి పండరి నుండి
తిరిగి వస్తూ షోలాపూర్ బస్ నిలయములో యున్నాము. బయట అరటి పండ్లు కొని బస్ నిలయంలో
ఉన్నాను. సన్నగా, పొడుగ్గా యున్న యొక పేద కుర్రాడు బిచ్చ మెత్తుకుంటూ నా దగ్గిరకు
వస్తే డబ్బుకు బదులుగా రెండు అరటి పండ్లు అతడి చేతిలో పెట్టాను. వెంటనే ఆ కుర్రాడు
సాష్టాంగ నమస్కారము చేసినాడు. పాపము ఎంత ఆకలిగా ఉన్నాడో? నాకు చాలా ఆశ్చర్యము
వేసింది. అక్కడే నిలబడి యున్న ఒక ఆవుకు అరటి పండు పెట్ట బోతే అది తల
తిప్పెసుకుంది. అంటే ఆ ఆవుకు అరటి పండ్లు అఖ్ఖర లేదుట. మరి ఏ తిండి కావాలో? చాలా
ఆశ్చర్యము వేసింది.
No comments:
Post a Comment